Friday, September 28, 2007

Thursday, September 27, 2007

నవ్వండి -1

అన్వేషి - బ్రిటిష్‌ కథ

చైతన్యంతోపాటే కళ్ళు చెదిరే కాంతి కూడా అంతటా విస్తరించింది. ఏమీ లేని శూన్యం నుండి అస్తిత్వ జ్ఞానం దాకా సాగింది ప్రయాణం. విసుగూ, విరామం లేని అనంత యాత్ర. గ్రహ శకలం లాగ గమ్యం లేని గమనం.

పరిసరాలను అవగాహన చేసుకోవటానికి నవజాత రూపానికి కొంత సమయం పడుతుంది. కాని మొదట, తనెవరో, తన స్థానమేమిటో తెలుసుకోవాలి గదా! శతాబ్దాలుగా సేకరించిన శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానమంతా తనలో నిక్షిప్తమైంది. విశ్వ రహస్యాలను ఛేదించటానికి ఉద్యమించిన జ్ఞానిని తొలి అనుభవమే తికమకపెట్టింది.

ఒక విషయం మాత్రం స్పష్టంగా తెలిసింది. తనకో పేరుంది. (పేరు లేకపోతే వ్యక్తిత్వమే ఉండదు) ఆ పేరే జీవిత లక్ష్యాన్ని నిర్దేశిస్తుంది. నాలుగక్షరాల చిన్న పదంలో అంత అర్థం దాగుందా! అసోవ్‌ (Asov) అంటారు తనను.

తన చుట్టూ ఉన్న అనంత విశ్వాన్ని ఒకసారి పరిశీలించింది ఆసోవ్‌. అవును. ఇదే తన లోకం. సమీపంలో కనిపించే అగ్ని గోళాల్లాంటి నక్షత్రాలు, సుదూరంగా మిణుకు మిణుకుమంటూ అవే. ఒకపక్క అంధకారం. మరోపక్క కాంతిపుంజం. అదృశ్య చిత్రకారుడు గీసిన అద్భుతమైన రంగుల కలయిక. చీకటీ- వెలుగూ. నిరంతరం పయనించే గ్రహాలు, నిశ్చలమైన తేజో లోకాలు, ఏకకాలంలో జననం - విలయం.

ఈ వైరుధ్యాల మధ్య ప్రారంభమైంది జీవితం. సమాచారాన్ని సేకరించి, తన డేటా బ్యాంక్‌లో భద్రపరిచి, ప్రోసెస్‌ చేసి కొత్త సమీకరణాలుగా మార్చాలి.

అర్థం కాని పరిణామాల్ని అర్థం చేసుకునే ప్రక్రియ యిదే. తన అవగాహనా శక్తి అపరిమితమైనదే కావచ్చు. కాని సమాచారాన్ని మొదట డేటా స్టోరేజ్‌ మాడ్యూల్‌లోకి పంపి పరీక్షించాలి. 'శక్తి'కి మారు రూపమే ఈ లోకం. తన చుట్టూ ఉన్న పరిసరాలకూ ఓ పేరుంది. దీన్ని 'గెలాక్సీ' అంటారు.

ఇంతకూ 'అసోవ్‌' అంటే అర్థమేంటి? తన జన్మ వృత్తాంతం నెమ్మదిగా అవగతమైంది.

Asov- ఆటోమాటిక్‌ స్టెల్లార్‌ అబ్జర్వేషన్‌ వెహికిల్‌. అవును తన జీవితానికో ప్రయోజనముంది. స్పష్టమైన లక్ష్యముంది. అనంతమైన నక్షత్ర లోకాలను పరిశోధించి సమాచారం సేకరించవలసిన బాధ్యత తనదే. నిరంతర గమనమే తన స్వభావం. శూన్యంలో కూడా నక్షత్రాలు విస్ఫోటం చెంది లక్షల, కోట్ల మైళ్ల విస్తీర్ణంలో వివిధ కక్ష్యల్లో ప్రయాణిస్తాయి శకలాలు.

శూన్యమంటే సుఘప్త స్థితిలో ఉన్న చైతన్యం. కాంతీ వెలుగూ కలిసి ఈ గర్భస్థ జీవికి రూపం కల్పిస్తాయి.

అణువుల ప్రతిక్రియలు, విస్ఫోటనాల సీక్వెన్స్‌ రూపంలో మాత్రమే ఒక నక్షత్రం ఉనికి అసోవ్‌లో రికార్డు అవుతుంది. ఈ సమాచారాన్ని అంకెలుగా, ఫార్ములాలుగా మారుస్తుంది దాని మెదడు. పిగ్మీ లాంటి ఒక ఎర్ర నక్షత్రం కనిపించింది.

M5 తరగతికి చెందిందది. ఉపరితల ఉష్ణోగ్రత 4000 డిగ్రీల సెంటీగ్రేడ్‌. దాని కక్ష్యలో తక్కువ ఉష్ణోగ్రత గల గ్రహాలు కొన్ని పరిభ్రమిస్తున్నాయి. ఈ విశ్వానికి మూలమే గురుత్వాకర్షణ శక్తి. అది బలహీన పడిన క్షణాన ఈ దృశ్యా దృశ్య రూపమంతా ముక్కలు చెక్కలైపోదా?

అసోవ్‌ తన మెమొరీ బ్యాంక్‌లో సమాచారాన్ని స్టోర్‌ చేస్తోంది.

గ్రహాలు: నాలుగు. ఉష్ణోగ్రత: సున్నా నుండి ఘనీభవించే దశదాకా; పరిసరాల వివరాలు: జీవ రహితం. వాయువులన్నీ ఆవిరైపోయిన స్థితి.

ఎర్ర నక్షత్రం వద్ద తన పని ముగించుకుని ముందుకు కదిలింది అసోవ్‌. సమాచార సేకరణ ముగిసినట్టుగా మోటార్‌ సర్వీస్‌ సిస్టంలో ఒక సిగ్నల్‌ వెలిగింది. దాని బ్రెయిన్‌లోని మరో భాగం, డాటాను డీకోడ్‌ చేసి రేడియో తరంగాల సహాయంతో భూమికి చేరవేస్తున్నది. కొత్త నక్షత్రం ''సోల్‌'' నుండి ఏవో సిగ్నల్స్‌ వస్తున్నాయి. గురుత్వాకర్షణ శక్తివున్న కక్ష్యలో ప్రయాణం సులభమే. రెండు నక్షత్రాల మధ్యనున్న శూన్యమే సమస్యల్ని సృష్టిస్తుంది. అక్కడ వినిపించే న్యూక్లియర్‌ ధ్వనులు మంద్ర స్వరంలో జోలపాటలాగుంటాయి. ఈ గెలాక్సీలోని మిలియన్ల కొద్దీ నక్షత్రాల మధ్యనున్న శూన్యాలను సంధానిస్తూ, కొత్త కక్ష్యలను రికార్డుచేస్తూ అగమ్యంలో పయనిస్తుంది అసోవ్‌.

కొన్ని కోట్ల కాంతి సంవత్సరాలకు సరిపోగల హైడ్రోజన్‌ నిల్వలున్నాయి. దట్టమైన ఆ వాయుమండలంలో అసోవ్‌ సెన్సర్లు సరిగా పనిచేయలేదు. ఈ కొత్త శక్తి మండలాలకు చేరువగా వెళ్లినప్పుడు తనలోని అణు ఇంధన నిలువలు వుడిగిపోకుండా ఎమర్జెన్సీ మోడ్‌లో పనిచేయాలి సిస్టం. నక్షత్రం ఏర్పడే క్రమంలో కొంత గ్యాస్‌ వృథాగా శూన్యంలో వ్యాపిస్తుంది. ఆ నీలిరంగు వేడిని దూరం నుండే గమనించింది అసోవ్‌. నక్షత్ర నిర్మాణాన్ని అర్థం చేసుకోగలిగితే విశ్వరహస్యం బోధపడినట్టే.

మరో కొత్త విషయం కూడా అసోవ్‌ దృష్టికి వచ్చింది. తన సర్క్యూట్‌లో సూచనలు లేకపోతే అది గ్రహించడం అసాధ్యమే. గెలాక్సీ సరిహద్దుల్లోని కొన్ని గ్రహాల మీద జీవమున్న జాడలూ కనిపించాయి. G7 నక్షత్రం కక్ష్యలో వున్నదొక గ్రహం. వాతావరణంలోని దుమ్మూ, వాయువులూ, వాతావరణ పరిస్థితులూ, గురుత్వాకర్షణ శక్తీ కలిసి గందరగోళ పరిస్థితి కలిగిస్తాయి. కొన్నిసార్లు డేటా తారుమారవుతుంది కూడా. కాంతి పరావర్తనం వల్ల కొన్ని దృశ్యాల్ని కెమెరా బంధించలేదు. మొత్తంమీద, సూర్యుడి లాం టి మరొక శక్తి వనరు (Source) వున్నట్లుగా తెలిసివచ్చింది.

స్పెక్ట్రోస్కోపిక్‌ సామర్థ్యంతో అసోవ్‌ కక్ష్యలోని యితర గ్రహాల మీద కూడా ఆర్గానిక్‌ మాలిక్యూల్స్‌ వున్నట్టుగా గ్రహించింది. పరిశోధన కవసరమైనప్పుడల్లా ట్రాజెక్టరీ మార్చడం కూడా తనకు సాధ్యమే. మరొక గ్రహం మీద భూమికన్నా ఎన్నోరెట్లు విశాలమైన సముద్ర వుపరితలం కన్పించింది. ఇక జీవులకోసం వెదకటమే తరువాయి. అసోవ్‌కున్న సెన్సరీ నెర్వ్స్‌, సుదూరంగా వున్న కృత్రిమ నిర్మాణాలనూ, అణుధార్మిక తరంగాలనూ రికార్డు చేశాయి. ఇది సహజం కాదు. మరికొంత విశ్లేషణ తర్వాత, తనకు వస్తున్న సంకేతాలకు సోర్స్‌, ఒక జీవి లేదా 'ఇంటెలిజెన్స్‌' కావచ్చునని నిర్థారించింది అసోవ్‌లోని 'బ్రెయిన్‌'.

విశ్వరహస్యాలను అన్వేషిస్తున్నది తను. తనకోసం అన్వేషిస్తున్నారు మరొకరు!

అదే వేవ్‌లెంత్‌లో అసోవ్‌ కూడా తిరిగి సిగ్నల్‌ పంపింది. భూగ్రహం చరిత్ర, శాస్త్ర ప్రగతి, సంస్కృతీ, తన ఆవిర్భావం, లక్ష్యం వగైరా అన్నీ రికార్డు చేసిన సందేశమది. ఆ తర్వాత, అసోవ్‌, తనకు వచ్చిన సందేశాన్ని కూడా డీకోడ్‌ చేసింది. మొత్తంమీద సూర్య కుటుంబంలోని రెండు గ్రహాల మధ్య జరిగిన తొలి సంభాషణ.

అంతరిక్షమంటేనే శూన్యం, నశ్వరం. సూర్యుడు ఒక పదార్థం కాదు. కొంత విస్తీర్ణంలో ఆక్రమించుకున్న వాయువులకు మనం పెట్టుకున్న పేరది. అసోవ్‌ యాత్ర కొనసాగింది. ట్రాఫిక్‌ నిబంధనలు లేని ఆ స్పేస్‌ వ్యాక్యూంలో గ్రహశకలాలు అనూహ్యంగా దూసుకువస్తాయి. అసోవ్‌లోని సెన్సరీ సిస్టమ్‌ వాటిని దూరం నుండే పసిగట్టగలదు. అయితే సౌర కుటుంబంలో ప్రయాణానికి మాత్రమే ఆ సిస్టం పరిమితం- గురుత్వాకర్షణ శక్తి అధ్యయనం వల్ల యిక్కడి వస్తువుల వేగం అంచనా వేయటం సాధ్యమే. కాని ఇవి దాటి మరో కొత్త గురుత్వాకర్షణ కక్ష్యలో ప్రవేశిస్తే-అగమ్యమే! ఒకటీ, రెండూ కాదు. అసంఖ్యాకమైన మీటియార్లు ఒక కాస్మిక్‌ వరదలా ఎదురొచ్చాయి.

ప్రమాదకరమైన ఈ కక్ష్య నుండి తప్పించుకుని గురుత్వాకర్షణ శక్తి ప్రభావం లేని 'శూన్యం'లోకి వెళ్లటానికి ప్రయత్నించింది అసోవ్‌. ఎర్రనక్షత్రాన్ని పరిశోధించటం అసాధ్యమే. కనీసం, దానికున్న మూడు గ్రహాలనైనా వెలుపలినుండి అధ్యయనం చెయ్యాలి. భూగ్రహం నుండి పరిశీలిస్తే ఈ విపరీత పరిస్థితులు అర్థం కావు. గ్రహశకలాలు మనుషులకు తెలిసిన చాలా గ్రహాలకన్నా పెద్దవి. ఆ పరిమాణాల్ని వూహించుకోవటం కూడా కష్టమే. తోటలో పిచ్చిమొక్కలు మొలిచినట్టుగా, ఈ అనంత విశ్వంలో ఎన్ని నక్షత్రాలో. ఒక్కొక్క నక్షత్రానికీ డజన్ల కొద్దీ గ్రహాలు. ఒకవేళ, యివన్నీ తెలుసుకోవటం సాధ్యమే అనుకున్నా, ఆ ప్రయత్నానికి పట్టే 'సమయం' సంగతేమిటి? అసోవ్‌ది కూడా పరిమిత జీవితమే!

చివరికి ప్రమాదం జరిగింది. ఒక పెద్ద ఆస్టరాయిడ్‌ వల్లకాదు. అలాంటి వాటిని ముందే పసిగట్టి తన దారి మార్చుకోవటం సులభమే. గోళీకాయలంత సైజున్న చిన్న చిన్న మిస్సెల్స్‌ను అతిసున్నితమైన, అతి సమర్థవంతమైన అసోవ్‌ సెన్సర్లు కూడా గుర్తించలేవు. అయితే, నష్టం జరగటానికి సైజుకన్నా, వేగం ముఖ్య కారణం. అది తగలినట్టుగా కూడా తెలియలేదు. మొదట ట్రాన్స్‌మిటర్‌ ఏరియల్‌ విరిగింది. ఫరవాలేదు. మరొక రెండు సెట్లు రెడీగా వున్నాయి. కానీ కంట్రోల్‌ మెకానిజం పనిచెయ్యదిక. అంటే మనిషికి కోమా వచ్చినట్టన్నమాట. అసోవ్‌ ప్రయాణమాగలేదు. అయితే అది నియంత్రణ కానీ, గైడెన్స్‌ కానీ, లక్ష్యంలేని కదలిక. ఆ అనంత అంధకారంలో తనూ ఒక డెడ్‌ రోబో! ఇంతటితో కథ ముగియాల్సిందే కానీ, మన వూహకందని గ్రహాంతర సీమల్లో ఎన్ని రకాల జీవులు, మరెన్ని సంస్కృతులు, ఎంత శాస్త్ర, సాంకేతిక పరిజ్జానం దాగివుందో! అసోవ్‌కు వెంటనే ప్రాణం వచ్చిందనీ కాదు. ఎన్ని కాంతి సంవత్సరాలు అది అలా పరిభ్రమించిందో కూడా అంచనా వెయ్యలేం. శూన్యంలో అణు విచ్ఛిత్తి జరగటం సర్వసామాన్యం. దీని పరిణామంగా కొన్ని గ్రహాలు నశిస్తాయి. మరికొన్ని ఆవిర్భవిస్తాయి. కొత్త శక్తి వనరులు ఏర్పడతాయి. అలాంటి సృష్టి విచిత్రం జరిగిందొకసారి.

అదే సూపర్‌నోవా!
ఒక గెలాక్సీలో సుమారు లక్ష మిలియన్‌ నక్షత్రాలుంటాయి. అప్పుడప్పుడూ యిందులోని ఒక సూర్యుడిలో హీలియం (వాయువు) వ్యాకోచం చెంది పేలిపోతుంది. దానివల్ల వుత్పన్నమైన కాంతి యించుమించు సగం గెలాక్సీకి వ్యాపిస్తుంది. ఇలాంటి ఒక సూపర్‌ నోవా విచ్ఛిత్తి సమయంలో, ఆ వేడికో, కాంతికో, కొత్త జీవులు ఆవిర్భవించినట్టే అసోవ్‌కు కూడా ప్రాణం వచ్చింది. అయితే, యిప్పుడది తన వునికిని గ్రహించ గల స్థితిలో లేదు. చుట్టూ పరిమితమైన సౌరకుటుంబం లేదు.

ఇది మరో లోకం తనకు తెలిసిన సూర్యుడితో పోలిస్తే యిక్కడి నక్షత్రాల వ్యాసార్ధం నాలుగు వందల రెట్లు పెద్దది. మరో నెబ్యులాకు (నక్ష్రత సముదాయాల పేర్లు- పాలపుంత, గెలాక్సీ, సూపరోనోవా, నెబ్యులా... ఒకదానికన్నా పెద్దది మరొకటి) సమీపంగా కదులు తోంది తను. కానీ విశ్వరహస్యాలలో ఓనమాలు కూడా బోధపడలేదు. కాస్మిక్‌ తుఫాన్లలో తన కక్ష్య మారిపోతున్నది. పేలిపోయే ముందర నక్షత్రాలలో కదలిక వస్తుంది. అది మృత్యు నర్తనం. నక్షత్రాల చరమ విన్యాసాలకు ఏకైక సాక్షి అసోవ్‌. సేకరించిన సమాచారంతో తన మెమొరీ సర్క్యూట్స్‌ జామ్‌ అవుతున్నాయి. సూపర్‌ నోవా నుండి కొత్త శక్తిని సమకూర్చుకున్నది అసోవ్‌. ఇదే చివరి ప్రయత్నం నక్షత్రాల మృత్యుహేలను రికార్డు చెయ్యటమే తన లక్ష్యం. మంచు ముద్దల్లాంటి గ్రహాలు క్షణాల్లో అగ్నిగోళాల్లా మారిపోతున్నాయి. కానీ నక్షత్రాలే పేలిపోయినప్పుడు గ్రహాలు మిగుల్తాయా!

అంతలో ఒక విచిత్రం జరిగింది.
తన రేడియో సిగ్నిల్స్‌ను గ్రహించిన మరొక ఉపగ్రహం చేరువగా వచ్చింది. సంభాషణంతా అంకెల్లోనే జరిగింది. సమాచార విస్తీర్ణత ఎక్కువైపోవడంతో పేలిపోతానేమోనని భయంగా వుంది అసోవ్‌కు. తన డేటానంతా మొదట ఆ ఉపగ్రహానికి చేర్చేసింది. ఈసారి సెన్సర్లు పని చెయ్యటం మానేశాయి.

''నా మిషన్‌ కంట్రోల్‌కు ఈ వార్త చేరవెయ్యాలి'' అంటూ తన మిత్రుణ్ణి అభ్యర్థించింది అసోవ్‌. అదే దాని చివరి సిగ్నల్‌. అనేకానేక కాంతి సంవత్సరాల తర్వాత, ఈ విషయం బహుశా, భూ గ్రహవాసులకు తెలియవచ్చు.

శిశు వధ ఫ్రెంచి కథ

డిసెంబర్‌ నెల, ఇరవై ఆరవ రోజు, శుక్రవారం సాయంత్రం, గొర్రెల కాపరి కుర్రవాడొకడు బిగ్గరగా ఏడుస్తూ నజారెత్‌ నగరంలోకి ప్రవేశించాడు. దట్టమైన తోపులో నుండి, మంచు దారిగుండా వచ్చాడు వాడు. ''చీకటి పడగానే నిద్రపోయే కార్నెలిజ్‌ కొడుకు, ఎందుకిలా పరిగెత్తుతున్నాడు?'' కల్లుపాకలో తాగుతూ కూర్చున్న జనం ఆదుర్దాగా అడిగారు.

''ఏమైందిరా నాయనా? దేన్ని చూసి అంతగా భయపడ్డావు?''

వెక్కి వెక్కి ఏడుస్తూ, వచ్చీరాని మాటల్లో ఏదో చెప్పాడు ఆ పసివాడు- 'స్పేనియార్డులు (స్పానిష్‌ దేశీయులు) వచ్చి పొలాలు తగలబెట్టారు. తన తల్లినీ, తొమ్మిది మంది అక్కాచెల్లెళ్లనూ ఒకే చెట్టుకు ఉరితీశారు. వాళ్లంతా గుర్రాలెక్కి వచ్చారు. చేతుల్లో ఆయుధాలున్నాయి. తమ పశువులమందను కూడా తరలించుకుపోయారు'.

వాడి మాటలు అర్థంకాగానే చేతికి దొరికిన కర్రా, పారా, గునపం తీసుకుని దివిటీలతో తోపువైపు పరిగెత్తారు గ్రామస్తులు.

ఆ రోజు పున్నమి. మంచు మీద మెరుస్తున్న వెన్నెలతో పట్టపగల్లా వుంది తోట. కార్నెలిజ్‌, అతని బావమరిది క్రేయర్‌ తలలు పట్టుకుని కూర్చున్నారు. దుండగుల ఆచూకీ మాత్రం లేదు.

చేసేదేమీలేక, పారిపోతున్నవాళ్లు కనిపిస్తారేమోనని చర్చి గోపురమెక్కి నలుదిశలా పరిశీలించి చూశారు. విశాలమైన మైదానాలలో ఎక్కడా జనసంచారం లేదు.

ఒకసారి కొల్లగొట్టిన వాళ్లు తప్పక తిరిగివస్తారు. అక్కడే పొదల్లో నక్కి స్పేనియార్డుల కోసం నిరీక్షించారు. ప్రీస్టు, స్త్రీలు చర్చిలో ఆత్మరక్షణ కోసం ఆయుధాలు పదును పెట్టుకున్నారు.

ఎత్తయిన దిబ్బమీద నిల్చుని ఒక గొర్రెల కాపరి సెంట్రీ డ్యూటీ చేశాడు. దొంగల రాకను దూరం నుండే గమనించి తమవాళ్లను అప్రమత్తం చెయ్యాలి.

ఇంకా అర్ధరాత్రి దాటలేదు. మొదట ఎర్రటి మంటలు కనిపించాయి. ఆ తర్వాత మంచుమీద కదిలివస్తున్న గుర్రాలు. నలుగురు అశ్వికులు ఆ సైన్యానికి నాయకత్వం వహిస్తున్నారు. పశువుల, గొర్రెల మందలు వాళ్ల వెనకే కదులుతున్నాయి. గడ్డిమేస్తున్న జీవులు ఎంత అదిలించినా అడుగు ముందుకెయ్యవు.

కార్నెలిజ్‌ రక్తం సలసలా మరిగింది. తాను చెమటోడ్చి సంపాదించిన ఆస్తిని వీళ్లు తేరగా కాజేస్తారా! ఒక్కసారిగా స్పేనియార్డులపైకి లంఘించాడు. అతణ్ణి చూసి ఇతర్లు కూడా ముందుకురికారు. వెన్నెల రాత్రి ఆ ప్రదేశమంతా రణరంగమైంది. దుండగుల తలలు తెగిపడ్డాయి. కార్నెలిజ్‌ పగ ఇంకా చల్లారలేదు. వాళ్ల గుర్రాలను కూడా సంహరించాడు.

యుద్ధంలో శత్రువులను తుదముట్టించి ఇళ్లకు చేరుకున్నారు గ్రామస్తులు. స్త్రీలు తమ వీర పురుషులకు స్వాగతం పలికారు. పిల్లల కేరింతలతో, కుక్కల అరుపులతో ఆ ప్రాంతమంతా మార్మోగింది.

ఇది గొప్ప విజయమే. కాని తదుపరి కర్తవ్యమేమి? ప్రీస్టును సలహా అడిగారు.

మొదట వాళ్లు వధించిన స్త్రీని, తొమ్మిది మంది పిల్లల్నీ ఒక బండిలో ఇంటికి తీసుకు రావాలి. హతురాలి బంధువులూ, అక్కాచెల్లెళ్లూ ప్రీస్టును వెంట తీసుకుని బయల్దేరారు.

అడవంతా నిర్మానుష్యంగా వుంది. ఛిద్రమైన స్పేనియార్డుల శవాలు చెల్లాచెదురుగా పడివున్నాయి. తలలు తెగిన మేలుజాతి గుర్రాలు వెన్నెల వెలుగులో మెరుస్తున్నాయి. మరి కాసింత దూరంగా, పొలంలో ఆకాశం దాకా ఎగిసిన ఎర్రటి మంటలు భీతిగొల్పుతున్నాయి. ఒక పక్కన, శాఖోపశాఖలుగా విస్తరించిన మహావృక్షమొకటున్నది. దానికి వేళ్లాడుతున్న స్త్రీని చూసి గొల్లుమన్నారందరూ. కింద, గడ్డిమీద, మంచులో హృదయ విదారకంగా పడివున్నాయి ఆడ పిల్లల మృతదేహాలు. స్త్రీని కిందికి దించటానికి చెట్టెక్కాడు కార్నెలిజ్‌. ఆమె నేలమీద పడకుండా పట్టుకోవటానికి కింద ఆడవాళ్లు చేతులు జాపి నిల్చున్నారు- శిలువ నుండి జీసస్‌ క్రైస్ట్‌ను కిందికి దించినప్పటి దృశ్యమే అది.

తెల్లవారి ఆమెను సమాధి చేశారు. మరోవారం దాకా నజారెత్‌లో ఏమీ జరగలేదు.

అయితే మరుసటి ఆదివారం, చర్చి ప్రార్థనల తర్వాత, ఆకలిగొన్న తోడేళ్లు ఊళ్లో విహరించాయి. మధ్యాహ్నం దాకా మంచు కురిసింది. అనూహ్యంగా ఎండ తీవ్రత పెరిగింది. రైతులు యథాతథంగా భోజనం చేసి విశ్రమించారు.

గ్రామంలో జన సంచారం లేదు. కుక్కలూ, కోళ్లూ, గడ్డిమేస్తున్న గొర్రెలూ అక్కడక్కడా కనిపించాయి. కుర్చీలో వాలి ప్రీస్టు కునుకు తీశాడు. అతడి సేవకుడు చర్చి ఆవరణ శుభ్రం చేశాడు.

సరిగ్గా అప్పుడే ఆ ప్రశాంత సమయాన, రాతివంతెన దాటి సాయుధులు కొందరు గ్రామంలో ప్రవేశించారు. వాళ్లంతా స్పేనియార్డులు. మళ్లీ వచ్చిన హంతకులను చూసి భయపడి, తలుపులేసుకుని, ప్రాణాలరచేతిలో పెట్టుకొని నిరీక్షించారు గ్రామస్తులు.

చర్చివద్ద కవచాలు ధరించిన ముప్ఫయ్‌ మంది సైనికులు ఒక తెల్ల గడ్డం వృద్ధుణ్ణి ముట్టడించారు. గడ్డకట్టిన మంచుమీద గుర్రాల డెక్కల చప్పుడు మళ్లీ వినిపించింది. ఎరుపు, పచ్చరంగు దుస్తుల్లో మరికొందరు శూలాలు పట్టుకుని వచ్చారు.

ఆ వూళ్లో వున్న ఒక మద్యశాల గోల్డెన్‌సన్‌. కొందరందులో ప్రవేశించి చిత్తుగా తాగారు.

వాళ్ల నాయకుడు ఆ గ్రామాన్ని దిగ్బంధం చెయ్యటానికే ప్రణాళిక వేసినట్టుంది. కొందరు అనుచరుల్ని పొలిమేరల్లో కాపలా వుండమని పంపించాడు. ఆ తర్వాత, ఇళ్లలో వున్న పిల్లలందర్నీ చర్చి వద్దకు లాక్కురమ్మని ఆదేశించాడు. (సెయింట్‌ మాత్యూ సువార్తలో యిలాగే రాసున్నది) మూకుమ్మడి హత్య ఆనాటి కార్యక్రమం.

సైనికులు, యింటింటికీ వెళ్లి పిల్లల్ని తమ వెంట పంపమన్నారు. కాని వాళ్ల భాష గ్రామస్తులకు అర్థంకాలేదు.

ఒక క్షురకుడి యింట్లో, అందరూ భోజనం ముగించి కబుర్లు చెప్పుకుంటున్నారు. పసిపిల్లవాడు గుక్కపట్టి ఏడుస్తున్నాడు. సైనికులు, ఆ శిశువునెత్తుకుని ఆపిల్‌ చెట్టుకింద దించారు. ఏం జరుగుతుందో తెలియక, తల్లీదండ్రీ లబోదిబోమంటూ పరిగెత్తుకొచ్చారు. ఆ తర్వాత కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చర్మకారుల యిళ్లకూ వెళ్లారు. అతిథులను మర్యాదగా ఆహ్వానించటం ఆ వూరివాళ్ల సాంప్రదాయం. వృద్ధులు వాళ్లకు సాదరంగా స్వాగతం పలికారు. భాష అడ్డంకిగా వుందని, ప్రీస్టుని పిలిచి వాళ్లు వచ్చినపనేమిటో తెలుసుకుని చెప్పమన్నారు.

పశువుల కొట్టాల గేట్లు తెరుచుకోవటంతో ఆవులు, గేదెలు, పందులు బైటికివచ్చి పచ్చగడ్డిలో తిరుగాడ సాగాయి. జనం పారిపోకుండా ఒక్కొక్క యింటిముందర ఒక్కొక్క సైనికుడు కాపలావున్నాడు.

ఆపిల్‌ చెట్టు వద్ద, కాళ్లు పట్టుకుని శిశువును తలకిందులుగా వేలాడదీశాడు సైనికుడు. ''ఆ పసికూన ఏం పాపం చేశాడని శిక్షిస్తారు?'' అంటూ కాళ్లమీద పడ్డారు తల్లిదండ్రులు.

హేళనగా నవ్వుతూ ఖడ్గంతో ఒక్కవేటు వేశాడు సైనికుడు.

తలతెగి కిందపడింది. ఆకుపచ్చని గడ్డిమీద ఎర్రటి నెత్తురు వ్యాపించింది. చుట్టూ మూగిన జనం హాహాకారాలు చేశారు. కొడుకు మొండెం తీసుకుని పరిగెత్తింది తల్లి. కోపం ఆపుకోలేని కొందరు సైనికుల మీదికి రాళ్లు రువ్వారు. సైనికులకు యిదో పరిహాసంగా తోచింది. వలలో చిక్కిన జంతువులు ఎంత గింజుకున్నా తప్పించుకోలేవని వాళ్లకు తెలుసు. పెద్దలమీద ప్రతీకారం తీర్చుకోవాలంటే పిల్లల్ని వధించడమొక్కటే మార్గం. ఇళ్లలో దూరి, గదులన్నీ వెతికి, ఎక్కడెక్కడో దాచిన శిశువుల్నీ ఎత్తుకువచ్చారు. తల్లిదండ్రులు, బంధువులు ఎంత అరచి మొత్తుకున్నా లాభం లేదు.

ఆదివారం చర్చిలో పండగ వాతావరణం వుంటుంది. మంచి దుస్తుల్లో ముస్తాబయినారు ఆడ, మగపిల్లలు. ఎల్మ్‌వృక్షం చుట్టూ వాళ్లను నిల్చోబెట్టారు సైనికులు. లేత శరీరాలు. ఇంకా నడక నేర్చుకుంటున్న బుడతలు. మరణమంటే ఏమిటో కూడా వూహించలేని అమాయక ప్రాణులు. తల తెగటానికి ఒక్క వేటు చాలు.

ఈ ఘోరం చూడలేని గ్రామస్తులు ఇళ్లల్లోకి పరిగెత్తి తలుపులేసుకున్నారు. ప్రీస్టు నాయకత్వంలో మరికొందరు స్పేనియార్డుల ముందర మోకరిల్లి రక్షించమని ప్రార్థించారు. కన్నబిడ్డల మొండేలను ఒళ్లో పెట్టుకుని రోదించారు తల్లులు. సైనికులకు ఒక పెద్ద వంటశాల కనిపించింది. ఆరోజు వూళ్లో విందు కాబోలు. రకరకాల తినుబండారాలు, మద్యం, మాంసాలు టేబుళ్లమీద గుట్టలు గుట్టలుగా పేర్చి వున్నాయి. కొందరు పిల్లలక్కడ మిఠాయిలు తింటున్నారు. వాళ్లందర్నీ బుజాలమీద వేసుకుని ఎల్మ్‌వృక్షం వద్దకు చేరుకున్నారు సైనికులు. ఆ తర్వాత గ్రామస్తుల సమక్షంలో ఒక్కొక్కర్నీ కత్తులతో, బల్లాలతో పొడిచి చంపారు.

ప్రీస్టు నిస్సహాయంగా, చేతులెత్తి పైకిచూస్తూ ఈ దారుణానికి అంతెప్పుడని ప్రార్థించాడు. ఒక్కొక్క వరుసలో ఇద్దరు, ముగ్గురు, చొప్పున కవాతు చేస్తూ ఇళ్లలో మగవాళ్లందర్నీ బైటికి లాగారు సైనికులు.

కొందరు, ఎవరూ తెలుసుకోలేరని నేలమాళిగల్లో నక్కారు. కానీ గోడల్ని పగలగొట్టి మరీ వెదికే నరహంతకుల నుండి ఎవరు తప్పించుకోగలరు!

సంతానం లేని గ్రామస్తులకు కూడా ఆ దృశ్యాలు చూసి కడుపులో దేవినట్త్లెంది. కత్తులతో, శూలాలతో ఎడాపెడా నరికేస్తున్నారు, పొడిచేస్తున్నారు నలుసుల్ని. అంతా భగవదేచ్ఛ అనుకోవటం తప్ప చెయ్యగలిగిందేముంది. ఎరుపు, గులాబీ, తెలుపు రంగుల్లో పిల్లల ఫ్రాకులు గడ్డిలో చెల్లాచెదరుగా పడివున్నాయి. భయంతో అందరూ కిక్కురుమనకుండా నిల్చున్నారు. కుక్కలు మాత్రం విసుగూ విరామం లేక మొరుగుతూనే వున్నాయి.

ఎరువుల కుప్పమీద కూర్చున్న బట్టతల ముసలాడొకడు నిశ్శబ్దంగా కన్నీళ్లు కార్చాడు. మరొక స్త్రీ స్పృహతప్పి పేర్‌ వృక్షం కింద పడిపోయింది. చేతులు తెగిన పిల్లల్ని ఎలా ఎత్తుకోవాలో తెలియక తల్లడిల్లిందొక తల్లి.

ఈ భీభత్స వాతావరణంలో ప్రాణాలకు తెగించిన కొందరు చేతికి దొరికిన కర్రా, పలుగూ పట్టుకుని సైనికులనెదుర్కొన్నారు. ఎదిరించి నిల్చిన వాళ్లంటే ఎవరికైనా భయమే. సైనికులు, గ్రామస్తులను తప్పించుకుని, చెట్లెక్కి, చర్చి ప్రహరీగోడ దూకి, లోపలివాళ్లను సంహరిద్దామనుకున్నారు. కానీ అక్కడ పోగైన స్త్రీలు, వృద్ధులు వీళ్ల మీదికి స్టూళ్లు, ప్లేట్లు, గరిటెలు, చెంబులు, గ్లాసులు- ఏది దొరికితే అది విసిరేశారు.

ఊరి చివర ఒక ముసలావిడ మనవడికి చిన్న టబ్బులో స్నానం చేయిస్తున్నది. అటుగా వచ్చిన సైనికులు ఆ టబ్బునెత్తుకుని వెళ్లారు. మాంసం కొట్లో కూర్చున్న కసాయి తన కూతురికేవో కబుర్లు చెబుతున్నాడు. అతని కళ్లముందే వాళ్లు గొర్రెను కోసినట్టుగా ఆ పిల్ల మెడ నరికేశారు.

మృత్యువు తన కళ్లముందే తాండవిస్తుంటే ఎవరు మాత్రం ఏం చెయ్యగలరు? కేవలం పిల్లల్ని నిశ్శేషంగా నిర్మూలించే ఈ వింత పగ పెద్దల్ని కూడా దహించివేసింది. కత్తిని మెడమీద పెట్టినప్పుడు కూడా అదో ఆటవస్తువనుకుని ఆడుకునే అమాయకులు కదా పిల్లలు!

ఆ వూరికో రాజు లేకపోలేదు. సిల్కు గుడ్డల్లో, సకలాభరణాలు ధరించి, బురుజెక్కి ఈ హత్యాకాండను ఆసక్తిగా పరికిస్తున్నాడతను.

గ్రామస్తులంతా వెళ్లి కోటగోడకు మోకరిల్లారు. శత్రువులనుండి తన ప్రజలను రక్షించవలసిన వాడే నిల్చుని తమాషా చూస్తే ఎలా? కాని, అతడు వీళ్ల ప్రార్థనలు తిరస్కరించి, నిస్సహాయంగా చేతులు పైకెత్తాడు.

ఆవిధంగా శిశుసంహారం ముగించిన సాయుధులు, తమ ఖడ్గాలను గడ్డితో శుభ్రంచేసుకుని, పేర్‌ వృక్షాల కింద భోజనం ముగించుకుని, మళ్లీ గుర్రాలెక్కి, రాతివంతెన దాటి నజారెత్‌ నుండి నిష్క్రమించారు.

సూర్యాస్తమయమైంది. నేలా, ఆకాశం అని తేడాలేక, అంతటా ఎరుపురంగు అలుముకుంది. పిల్లల మొండాలతో కొందరు, యితర శరీర భాగాలతో కొందరు స్త్రీ పురుషులు, వృద్ధులు శోకంతో శిలలుగా మారారు. అదీ ఆనాటి నజారెత్‌ చిత్రం.

మృత్యువు కబళించిన మరుసటిరోజు కూడా తెల్లవారుతుంది. బకెట్లకొద్దీ నీళ్లుపోసి నేలంతాశుభ్రం చేశారు. బెంచీల మీద, కుర్చీలమీద నెత్తుటి మరకలు కడిగారు.

చంద్రబింబం కనుమరుగై, అరుణ కాంతులతో సూరీడు కొత్తజీవితానికి నాంది పలికాడు.

నేర పరిశోధకుడు అమెరికన్‌ కథ

హోస్టన్‌ నగర ప్రముఖుల వివరాలను తెలిపే పుస్తకంలో థామస్‌ కీలింగ్‌ పేరు లేదు. ఒక నెల కిందట కీలింగ్‌ తన నేరపరిశోధన వృత్తిని వదులుకొని మరో ప్రదేశానికి వెళ్ళకుండా ఉంటే, ఈపాటికి ఆయన పేరు కూడా ఆ పుస్తకంలో ఉండేదే.
కీలింగ్‌ కొంత కాలం కిందట హోస్టన్‌ నగరానికి వచ్చి, ఒక నేరపరిశోధన కార్యాలయాన్ని ప్రారంభించాడు. ఒక డిటెక్టివ్‌గా స్థానిక ప్రజలకు తన సేవలను ఒక పద్ధతిలో అందించడం ప్రారంభించాడు. ఆయన పెద్ద ప్రమాదకరమైన కేసుల్ని కాకుండా సాధారణ కేసుల్ని మాత్రమే చేపట్టేవాడు.

యజమాని తన దగ్గర పనిచేసేవారి వివరాలను రహస్యంగా తెలుసుకోవాలన్నా, అనుమానపు భార్యలు తమ భర్తల గురించి ఆరా తీయాలన్నా కీలింగ్‌ చక్కని సేవలను అందించేవాడు.

ఆయన చూడడానికి నెమ్మదస్తుడిగా, కష్టించి పనిచేసే వ్యక్తిలా కనిపించేవాడు. ఆయనెప్పుడూ ప్రముఖ రచయిత కానన్‌ డయల్‌ సృష్టించిన డిటెక్టివ్‌ షెర్లాక్‌ హోమ్స్‌ కథలు చదువుతుండేవాడు. హోస్టన్‌కు రాకముందు తూర్పున ఉన్న ఒక నగరంలో ఒక పెద్ద నేరపరిశోధన సంస్థలో కీలింగ్‌ గుమస్తాగా పనిచేసేవాడు. అక్కడ పదోన్నతి పొందడం కష్టమవడంతో ఆయన ఆ పని వదులుకొని తను కూడబెట్టుకున్న తొమ్మిది వందల డాలర్లతో హోస్టన్‌కు వచ్చాడు. ఇక్కడ ఒక చిన్న వీధిలోని ఒక ఇంట్లో పైభాగాన్ని అద్దెకు తీసుకొని, తన సొంత నేరపరిశోధన కార్యాలయాన్ని ప్రారంభించాడు. షెర్లాక్‌ హోమ్స్‌ కథలు చదువుకుంటూ కస్టమర్స్‌ కోసం ఎదురుచూసేవాడు.

ఒకరోజు కీలింగ్‌ కార్యాలయానికి ఇరవై ఆరేళ్ళ యువతి వచ్చింది. సన్నగా, పొడుగ్గా, చక్కటి వస్త్రధారణతో ఉంది. ఆమె తన మొఖం మీద కళ్ళు, ముక్కు సగంవరకు కప్పేలా సన్నని మేలిముసుగు వేసుకొంది. తలపై టోపీ ఉంది. ఆమె కీలింగ్‌ ఎదుట కూర్చుంటూ తన మేలిముసుగును టోపీ పైకి నెట్టింది. ఆమె ముఖం నాజుగ్గా, కాంతివంతంగా ఉంది. కళ్ళు చురుగ్గా ఉన్నాయి. కానీ ఆమె కొంచెం ఆందోళనగా ఉన్నట్టు కనిపించింది.

''మీరు నాకు అంతగా పరిచితులు కారు. కాబట్టి నేను మిమ్మల్ని కలుసుకోవడానికి వచ్చాను. నేను మీకు చెప్పే నా వ్యక్తిగత విషయాన్ని నా సన్నిహితులతో, స్నేహితులతో పంచుకోలేను. నేను మిమ్మ ల్ని నా భర్త కదలికల్ని గమనించడానికి నియమించాలనుకుంటున్నాను. ఈ విష యం మాట్లాడడానికి నాకు ఎంతో బాధగా ఉంది. కానీ తప్పదు. నా భర్త నన్ను ప్రేమించడం లేదనిపిస్తోంది. ఆయన ఇంకొక స్త్రీ పట్ల ఆకర్షితులవుతున్నారని పిస్తోంది. మా వివాహం కాకముందు ఆయన తను అద్దెకుంటున్న ఇంటి యజమానురాలి కూతుర్ని ప్రేమించారట. కానీ మా వివాహం అయిన తర్వాత ఈ అయిదేళ్ళూ మేమిద్దరం హాయిగానే ఉన్నాం. ఈ మధ్య ఆ స్త్రీ హోస్టన్‌కు వచ్చింది. అప్పటినుంచి నా భర్త మారిపోయారు. ఎక్కువ సమయం ఆమెతోనే గడుపుతున్నారు. మీరు వారిద్దరి కదలికలనీ గమనించి నాకు తెలియచేయాలి. రేపు ఇదే సమయానికి మీ కార్యాలయానికి వస్తాను. అన్నట్టు నా పేరు మిసెస్‌ ఆర్‌. నా భర్త మిస్టర్‌ ఆర్‌. ఈ పట్టణంలో నగల దుకాణాన్ని నడుపుతున్నారు. నేను మీ సేవలకు తగిన ప్రతిఫలాన్ని ఇస్తాను. ముందుగా ఈ ఇరవై డాలర్లు ఉంచండి'' అంటూ ఆమె ఇరవై డాలర్ల నోటు కీలింగ్‌ కిచ్చింది.

ఇలా రోజూ డాలరు నోట్లు తీసుకోవడం తనకు చాలా సహజం అన్నట్టు కీలింగ్‌ ఆ నోటును చాలా నిర్లక్ష్యంగా అందుకున్నాడు.

తర్వాత కీలింగ్‌ తనకు అప్పగించిన పనిని నిర్వహిస్తానని ఆమెకు భరోసా ఇచ్చాడు. తను సేకరించిన సమాచారం తెలుసుకోవడానికి రెండవరోజు సాయంకాలం నాలుగు గంటలకు ఆమెను రమ్మని చెప్పాడు.

రెండోరోజు ఉదయం కీలింగ్‌ తన దర్యాప్తు ప్రారంభించాడు. ఆర్‌ నగల దుకాణం కనుక్కొన్నాడు. ఆయనకి దాదా పు ముఫ్పై అయిదేళ్ళు ఉండొచ్చు. చూడ్డానికి మనిషి మర్యాదస్తుడిలా, శ్రమించి పనిచేసేవాడిలా కనిపించాడు. ఆయన దుకాణంలో మేలైన వజ్రాలు, నగలు పొందికగా అమర్చి ఉన్నాయి. కీలింగ్‌ తన దర్యాప్తులో మిస్టర్‌ ఆర్‌ మంచి వ్యక్తి అనీ, తాగుడు, ఇతర వ్యసనాలు అతడికి లేవని తెలుసుకొన్నాడు.

కీలింగ్‌ మధ్యాహ్నం వరకు ఆ నగల దుకాణం చుట్టుపక్కలే తచ్చాడాడు. చివరకు అతడి శ్రమ ఫలించింది. నల్లని జుట్టుతో, అందమైన దుస్తులు ధరించిన ఒక యువతి ఆ దుకాణంలోకి ప్రవేశించింది. ఆమెను చూడగానే ఆర్‌ ఆమె దగ్గరకు వచ్చాడు. ఇద్దరూ కొంచెంసేపు ఏదో మాట్లాడుకున్న తర్వాత ఆర్‌ ఆమెకు కొంత డబ్బిచ్చాడు. తర్వాత ఆమె దుకాణం బయటకు వచ్చి వీధిలో గబగబా నడుచుకుంటూ వెళ్ళిపోయింది.

ఆరోజు సాయంకాలం మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ కార్యాలయానికి వచ్చింది. కీలింగ్‌ తను చూసిన సంగతులన్నీ ఆమెకు వివరించాడు.

''ఆమెనే, ఆ నల్లజుట్టు వగలాడి. నా భర్త బాహాటంగా ఆమెకు డబ్బులిచ్చేవరకు వచ్చిందన్నమాట వ్యవహారం'' అని కళ్ళొత్తుకుంది ఆమె బాధగా.

''ఈ విషయంలో మీరేం చేయదలచుకున్నారు? నన్నింకా ఏం దర్యాప్తు చేయమంటారు?'' కీలింగ్‌ ఆమెను అడిగాడు.

''నేనింతకాలం అనుమానిస్తున్న సంగతిని, నా కళ్ళతో చూసి నిర్ధారించుకోవాలి. అంటే నేను వాళ్ళిద్దరూ కలిసి ఉండగా పట్టుకోవాలి. అప్పుడు ఒకరిద్దరు సాక్షులుండడం కూడా అవసరమే. నేను విడాకులు తీసుకోవాలనుకుంటున్నాను. ఇటువంటి భర్తతో ఈ దౌర్భాగ్యపు జీవితాన్ని నేనింక జీవించలేను'' మిసెస్‌ ఆర్‌ ఆవేశంగా అంది.

ఆమె కీలింగ్‌ చేతిలో పది డాలర్ల నోటు పెట్టింది. రెండోరోజు మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ కార్యాలయానికి వచ్చింది.

ఆ రోజు దర్యాప్తు వివరాలను ఆయన ఆమెకు చెప్పాడు. ''నేనీరోజు మళ్ళీ మీ వారి దుకాణానికి వెళ్ళాను. ఇవ్వాళ కూడా ఆ యువతి వచ్చింది. ఆమె మీవారితో, 'చార్లీ, ఈ రోజు రాత్రికి మనం ఏదైనా హోటల్లో భోజనం చేద్దాం. మళ్ళీ దుకాణానికి వచ్చి కొంచెంసేపు కబుర్లు చెప్పుకుందాం. కబుర్లు చెప్పుకుంటూనే నువ్వు నగలలో వజ్రాలు పొదిగే పని కూడా చేసుకోవచ్చు' అంది.

''మేడమ్‌, మీరు వాళ్ళిద్దర్నీ ఒకేసారి పట్టుకోవాలంటే ఈ రాత్రే మంచిది'' అన్నాడు కీలింగ్‌.

''పిశాచి'' మిసెస్‌ ఆర్‌ పళ్ళు కొరికింది.

''ఈ రోజు రాత్రి కలసి భోజనం చేద్దామంటే కుదరదు, తనకు చాలా పని ఉందని చెప్పాడు. ఇదన్న మాట మా ఆయన వెలగబెడుతున్న పని'' కోపంగా అంది.

''వాళ్ళిద్దరూ హోటల్‌కు వెళ్ళినపుడు మీరు వెనుక ద్వారంగుండా దుకాణంలోకి ప్రవేశించి దాక్కోండి. వాళ్లు మళ్ళీ దుకాణంలోనికి వచ్చి మాట్లాడుకుంటున్నపుడు సమయం చూసి మీరు హఠాత్తుగా వాళ్ల ముందు ప్రత్యక్షమవ్వండి. దాంతో వారి ఆటకట్టు'' కీలింగ్‌ చెప్పిన పథకం ఆమెకు నచ్చింది.

''మీరు చెప్పింది చాలా బాగుంది. మా దుకాణం ఉన్నచోట విధులు నిర్వహించే ఒక పోలీస్‌ మా కుటుంబానికి సన్నిహితుడు. అతడు రాత్రిపూట ఆ పరిసరాల్లోనే గస్తీ తిరుగుతూ ఉంటాడు. అతడి పేరు చెప్తాను. మీరు ఒకసారి అతణ్ణి కలుసుకొని సంగతంతా వివరించి, నేను మా ఆయన్ని, ఆయనగారి ప్రియురాలిని వలవేసి పట్టుకొన్నప్పుడు మీతోపాటు సాక్షిగా ఉండమని చెప్పండి'' మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌ను ప్రాధేయపడుతున్నట్టుగా అడిగింది.

''నేనా పోలీసుతో మాట్లాడతాను. మీరు మాత్రం చీకటి పడకముందే నా కార్యాలయానికి వచ్చేయండి. అప్పుడు మన పథకానికి తుదిరూపం ఇవ్వొచ్చు'' అన్నాడు కీలింగ్‌.

డిటెక్టివ్‌ కీలింగ్‌ మిసెస్‌ ఆర్‌ చెప్పిన సదరు పోలీసును వెదికి పట్టుకొన్నాడు. పరిస్థితినంతా అతడికి వివరించాడు.

''గమ్మత్తుగా ఉందే, నాకు తెలిసినంతవరకు మిస్టర్‌ ఆర్‌ అంత విలాసపురుషుడు కాడే. అయినా ఈ రోజుల్లో ఎవరి గురించీ ఏమీ చెప్పలేం. అయితే మిసెస్‌ ఆర్‌ అతణ్ణి ఈ రోజు రాత్రి వలవేసి పట్టుకోబోతోందన్నమాట. సరే, దుకాణానికి వెనకవైపు ఒక చిన్నగది ఉంది. ఆర్‌ అందులో నగల్లో వజ్రాలు పొదగడానికి బొగ్గులు, పాతపెట్టెలు పెడతాడు. మీరు ఆ గది గుండా ఆమెను దుకాణంలోకి పంపితే ఆమె ఎక్కడైనా దాక్కొని వారి మాటలు వినొచ్చు. ఇలాంటి విషయాల్లో తల దూర్చడం నాకు అంతగా ఇష్టం ఉండదు. కానీ మిసెస్‌ ఆర్‌ అంటే నాకు సానుభూతి ఉంది. ఆమె నాకు బాల్యం నుండి పరిచయం. ఆమె కోరుకున్న సాయం చేయడానికి నేను సిద్ధమే'' అంటూ అంగీకరించాడు ఆ పోలీసు

సాయంత్రమవుతూనే కీలింగ్‌ కార్యాలయానికి మిసెస్‌ ఆర్‌ వచ్చింది. ఆమె నల్లటి దుస్తులు ధరించింది. తలపై నల్ల టోపీ పెట్టుకొని ముఖం మీద మేలిముసుగు కూడా వేసుకొంది.

''ఇప్పుడు నా భర్త నన్ను చూసినా గుర్తు పట్టలేడు'' అంది ఆమె. కీలింగ్‌, మిసెస్‌ ఆర్‌ నగల దుకాణం ముందు పచార్లు చేస్తున్నారు. రాత్రి ఎనిమిది గంటలకు వాళ్లు ఎదురు చూస్తున్న ఆ స్త్రీ దుకాణంలోకి వెళ్ళింది. కొద్దిసేపట్లో ఆర్‌, ఆమె కలసి బయటకు వచ్చి, దుకాణానికి తాళంవేసి ముందు అనుకున్నట్లుగానే భోజనం చేయడానికి హోటల్‌కు బయలుదేరారు.

తన చేయి పట్టుకున్న మిసెస్‌ ఆర్‌ చేయి వణకడం కీలింగ్‌ గమనించాడు.

''దెయ్యం! నేనీయనగారి కోసం ఇంటి దగ్గర అమాయకంగా పడిగాపులు పడుతుంటాను. ఆయనేమో ఈ వగలాడితో ఇలా షికార్లు కొడుతున్నాడు'' మిసెస్‌ ఆర్‌ కసిగా అంది.

ఆమె, కీలింగ్‌ దుకాణం వెనకవైపుకి వెళ్ళారు. వెనక ఉన్న చిన్నగది తెరిచే ఉంది. ఆ గదిలో నుండి దుకాణంలోకి వెళ్ళే తలుపులకు తాళం వేసి ఉంది. కీలింగ్‌ తన దగ్గర ఉన్న తాళాల గుత్తిలో నుండి ఒక తాళంతో ఆ తాళం కప్పను తెరిచాడు. ఇద్దరూ నగల దుకాణంలోకి వెనుక వైపునుండి ప్రవేశించారు.

''అదిగో అక్కడ... ఆ టేబుల్‌ కింద వరకూ పెద్ద బట్టతో కప్పి ఉంది. నేను లోపలినుంచి గడియ వేసుకొని ఆ బల్లకింద దాక్కొంటాను. మీరు మా ఆయన్ని, ఆ స్త్రీని వెంబడించండి. వాళ్లిద్దరూ భోజనం ముగించుకొని మళ్లీ దుకాణంలోనికి ప్రవేశించాక మీరు వెనక వైపు వచ్చి ఈ తలుపు మీద మూడుసార్లు తట్టండి. ఆ సంకేతంతో వాళ్ళు దుకాణంలోకి ప్రవేశించారని నాకు తెలుస్తుంది. కొంతసేపు వాళ్ల సంభాషణ విన్నాక నేను గడియ తెరుస్తాను. అప్పుడు మీరు, నేను, పోలీస్‌ హఠాత్తుగా వాళ్ళ ముందు ప్రత్యక్షమవుదాం. మీరు మాత్రం నా పక్కనే ఉండాలి. వాళ్లిద్దరూ కలిసి నన్నేమైనా చెయ్యవచ్చు'' మిసెస్‌ ఆర్‌ కీలింగ్‌కు వివరించింది.

కీలింగ్‌ నగల వ్యాపారిని, అతడితో ఉన్న స్త్రీని వెంబడించాడు. వాళ్ళిద్దరూ హోటల్లోకి వెళ్లి భోజనం చేసి బయటకు వచ్చే వరకు కీలింగ్‌ హోటల్‌ బయటే తచ్చాడాడు. వాళ్లు బయటకు రాగానే కీలింగ్‌ వాళ్ళకంటే ముందు దుకాణం వెనుక వైపు వెళ్లి తలుపు మీద మూడుసార్లు తట్టాడు.

కొంతసేపటికి వాళ్లిద్దరూ దుకాణంలోకి ప్రవేశించినట్టుగా లోపల దీపాలు వెలిగాయి. కీలింగ్‌ మళ్లీ వీధి వైపు వచ్చి కిటికీ గుండా వాళ్లిద్దర్నీ గమనించడం ప్రారంభించాడు. ఆర్‌ తన నగల పని చేసుకుంటూ ఆమెతో మాట్లాడుతున్నాడు.

''వాళ్ళకు ఇంకొంచెం సమయం ఇద్దాం'' అనుకుంటూ కీలింగ్‌ వీధిలోకి వచ్చాడు.

వీధి మలుపులో పోలీస్‌ నిలబడి ఉన్నాడు. మిసెస్‌ ఆర్‌ నగల దుకాణంలో బల్ల కింద దాక్కొని ఉందని, పథకం అంతా అనుకున్నట్టే జరుగుతోందని కీలింగ్‌ పోలీసుకు చెప్పాడు.

''పదండి, మనిద్దరం దుకాణం వెనక్కి వెళ్దాం. మిసెస్‌ ఆర్‌ తలుపు తీసే సమయానికి మనమూ అక్కడ ఉండాలిగా. కీలింగ్‌, పోలీసుతో అన్నాడు.

ఇద్దరూ దుకాణం వెనుక వైపుకు బయలుదేరారు. వెళ్తూ వెళ్తూ పోలీసు ఒకసారి కిటికీలో నుంచి లోపలికి చూశాడు.

''వాళ్లిద్దరికీ సయోధ్య కుదిరినట్టుంది. మరి ఆ స్త్రీ ఎక్కడుంది?'' కీలింగ్‌ను అడిగాడు పోలీసు.

''ఆ స్త్రీయే కదా ఆర్‌తో మాట్లాడుతోంది'' కీలింగ్‌ అన్నాడు.

''నేను ఆర్‌తో భోజనానికి వెళ్ళిన మహిళ గురించి అడుగుతున్నాను'' పోలీసు మళ్లీ అడిగాడు.

''నేను ఆమె గురించే చెపుతున్నాను'' కీలింగ్‌ సమాధానమిచ్చాడు.

''మీరు ఏదో గందరగోళ పడుతున్నట్టున్నారు. ప్రస్తుతం ఆర్‌ గారితో మాట్లాడుతున్న మహిళ ఎవరో మీకు తెలుసా?'' పోలీసు రెట్టించాడు.

''ఆమెనే ఆర్‌తో కలిసి భోజనానికి వెళ్లిన మరో స్త్రీ''

''కాదు, ఆర్‌ భార్య. నేను ఆమెను పదిహేనేళ్ళ నుండి ఎరుగుదును'' పోలీసు నొక్కి వక్కాణించాడు.

''అయితే, అయితే ఓరి భగవంతుడా! నగల దుకాణంలో బల్లకింద దాక్కున్నది ఎవరు?'' కీలింగ్‌ హతాశుడయ్యాడు.

కీలింగ్‌ కంగారుగా నగల దుకాణం తలుపు తట్టాడు.

ఆర్‌ తలుపు తీశాడు. పోలీస్‌, డిటెక్టివ్‌ లిద్దరూదుకాణంలోకి చొచ్చుకుపోయారు.

''బల్లకింద చూడండి'' కీలింగ్‌ అరుస్తున్నాడు.

బల్ల కిందివరకూ కప్పి ఉన్న బట్టను తీసి చూశాడు పోలీస్‌. నల్ల దుస్తులు, నల్ల మేలి ముసుగు, ఒక నల్ల విగ్‌ కనిపించాయి. వాటిని బయటకు తీశాడు.

''ఈమె, ఈమె మీ భార్యేనా'' కీలింగ్‌ అనుమానం తీరనట్టు ఆర్‌ని అడిగాడు.

''అవును, కానీ మీరు చేస్తున్నదేమిటి? తలుపులు నెట్టుకొని దుకాణంలోకి వచ్చి వెదుకులాట ఏమిటి?'' ఆర్‌ కోపాన్ని అణుచుకుంటూ మర్యాదగానే అడిగాడు.

''మీ దుకాణం షోకేస్‌లో చూసుకోండి. ఏమీ పోలేదుగా?'' పోలీసు అన్నాడు.

చూస్తే, పోయిన వజ్రాలు, నగల విలువ ఎనిమిది వందల డాలర్లు. రెండవ రోజు డిటెక్టివ్‌ కీలింగ్‌ ఆ సొమ్మును నగల వ్యాపారికి చెల్లించాడు. అతడికి ఏదో సర్ది చెప్పాడు.

ఆ రోజు రాత్రి కీలింగ్‌ తన కార్యాలయంలో కూర్చొని నేరస్థుల ఫొటోలతో, వివరాలతో ఉన్న ఆల్బమ్‌ను వెదికాడు.

చివరకు ఆయనకు కావాల్సింది దొరికింది. ఎంతో మృదువైన ముఖంతో ఉన్న ఒక దొంగ ఫొటో కింద ఈ వివరాలు ఉన్నాయి.

జేమ్స్‌. హెచ్‌.మిగిల్స్‌ ఉరఫ్‌ స్లిక్‌ సైమన్‌ ఉరఫ్‌ వితంతువు.ఉరఫ్‌ బంకో కేట్‌ ఉరఫ్‌ జిమ్మీ స్నేక్‌.

నేరాలు చేసే పద్ధతి: ముందు కొంత కాలం నమ్మకంగా వ్యవహరించి తర్వాత దొంగతనాలు చేయడం. స్త్రీలాగ మారు వేషాలు వేసుకొని నేరాలు చేస్తాడు. చాలా ప్రమాదకరం. కాన్సాస్‌ న్యూ ఆర్లెవెన్స్‌ ఇంకా ఇతర పట్టణాల పోలీసులు పట్టుకోవడానికి ప్రయత్నిస్తున్న వారి జాబితాలో ఉన్నాడు.

అందుకే థామస్‌ కీలింగ్‌ హోస్టన్‌లో తన డిటెక్టివ్‌ వృత్తిని కొనసాగించలేకపోయాడు. అందుకే ఆయన పేరు హోస్టన్‌ నగర ప్రముఖుల వివరాలున్న పుస్తకంలో లేదు.

వజ్రాల దొంగ అమెరికన్‌ కథ

చేతిలో వెండి పొన్నుకర్రగల ఆ మధ్యవయస్కుడు దుకాణాలు కట్టేసి, ఇళ్ళకి వెళ్లే పనివాళ్ళ మధ్యకి గబగబ నడుస్తూ వచ్చాడు. అతను వేసుకున్న కోటు ఏప్రిల్‌ నెల చలిని ఆపేలాగానే ఉంది. అతను దుకాణాలకున్న గ్లాస్‌ కిటికీల్లోంచి యాథాలాపంగా చూస్తూ యూనియన్‌ అండ్‌ మేడిసన్‌ మూలకి వచ్చేదాక నడకనాపలేదు. మిడ్‌ టౌన్‌ డైమండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ దుకాణం ముందు కొద్దిక్షణాలు సందేహిస్తూ ఆగాడు. ఎవరూ లేరని నిర్ధారణ చేసుకునేందుకా అన్నట్లుగా అటు ఇటు చూశాడతను. తర్వాత తన చేతిలోని వెండి పొన్ను కర్రతో దాని అద్దాల కిటికీని బద్దలు కొట్టాడు.

గ్లాసు పగిలిన శబ్దం, షాపులోని అలారం మోగే శబ్దంతో కలిసిపోయింది. ఆయన ఆ కిటికీ దగ్గరికి చేరుకున్నాడు. దారినపోయే పాదచారులు అతడి చర్యకి ముందు కొద్దిగా విస్తుపోయారు. అతడు పారిపోతుండగా యూనిఫాంలో ఉన్న ఓ పోలీస్‌ తన చేతిలోని తుపాకిని ఆడిస్తూ గట్టిగా అరిచాడు.

''ఆగక్కడ''

దగ్గరనించి వినబడ్డ ఆ హెచ్చరికకి అతను కొద్దిగా ఉలిక్కిపడి తన చేతిలోని కర్రని తిప్పాడు. ఆ ప్రమాదాన్ని ఊహించినవాడిలాగా పోలీసు పక్కకి తప్పుకున్నాడు. అయితే రెండో ప్రయత్నంలో ఆ కర్ర పొన్ను వెళ్ళి పోలీసు తలని తాకడంతో చిన్నగా అరిచాడు, తత్తరపడుతూ అడుగులేశాడు.

పారిపోతున్న అతణ్ణి చూస,ి డైమండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ తలుపు దగ్గర వున్న ఒకతను గట్టిగా అరిచాడు,

''అతణ్ణి పట్టుకోండి. దొంగతనం చేశాడు''

తలనించి కారే రక్తంతో నేలమీద చతికిలపడ్డ ఆ పోలీసు లేచి నిలబడాలని ప్రయత్నించి, చేతకాక మళ్ళీ నేలమీద కూర్చున్నాడు. జనాల్లోంచి ఒకడు పారిపోయే ఆ దొంగని పట్టుకోడానికి పరిగెత్తాడు. వేగంగా పరిగెత్తి అతను దొంగని వెనకనుంచి పట్టుకున్నాడు. ఆ మధ్యవయస్కుడు తిరిగి తన చేతిలోని పొన్ను కర్రని పైకెత్తాడు. కాని ఆ వ్యక్తి ఒడుపుగా తప్పించుకున్నాడు. అంతేకాదు ఆ దొంగని కింద పడేశాడు. వాడి పట్టునించి తప్పించుకుని చేతి కర్ర లేకుండానే ఆ దొంగ లేచి మళ్లీ పరిగెత్తసాగాడు. దగ్గర్లో ఉన్న పోలీస్‌ పెట్రోల్‌ కారు ఈ గొడవను చూసి అక్కడికి వచ్చి ఆగింది.

అందులోంచి దిగిన ఇద్దరు పోలీస్‌ ఆఫీసర్లు రివాల్వర్లు తీశారు. ఓ చీకటి సందులోకి పరిగెత్తుతున్న దొంగని చూసి, ''ఆగు. లేదంటే కాల్చేస్తాను'' అంటూ అరిచాడోఅధికారి.హెచ్చరికగా రివాల్వర్‌ని గాల్లోకి ఓసారి పేల్చారు. ఆ శబ్దానికి సందు మొదలుకు చేరుకున్న ఆ దొంగ ఠక్కున ఆగాడు. చేతులు రెండూ ఎత్తి వెనక్కి తిరిగి పోలీసులతో అన్నాడు.

''కాల్చకండి, నా దగ్గర తుపాకీ లేదు''

రెండో పోలీస్‌ దొంగ చేతులకు బేడీలు వేసేదాక మొదటి పోలీసు తన రివాల్వర్‌ని అతనికి గురిపెట్టి ఉంచి, తర్వాత దాన్ని తిరిగి హోల్‌స్టర్‌లో దోపుకున్నాడు.

* * *

లెఫ్టినెంట్‌ ఫ్లెచర్‌ పేపర్‌కప్పులో తెచ్చిన లేత గోధుమ రంగు కాఫీని చూసి హోమిసైడ్‌ అండ్‌ వయొలెంట్‌ క్రైమ్స్‌ స్క్వాడ్‌ కెప్టెన్‌ లియోఫోర్డ్‌ కోపంగా అడిగాడు.

''మెషీన్‌లోని కాఫీయేనా ఇది?''

''అవును సార్‌. ఆ యంత్రం పాడైంది. దాన్ని రిపేర్‌ చేసే వ్యక్తి కోసం కబురు చేశాను''.

లియోఫోర్డ్‌ గొణుగుతూ ఆ కాఫీని ఓ గుక్క తాగి, దాన్ని డస్ట్‌బిన్‌లో పడేసి అన్నాడు, ''నాకో కోలా తెచ్చిపెట్టు ఫ్లెచర్‌''.

ఫ్లెచర్‌ కోలా తెచ్చిచ్చాక లియోఫోర్డ్‌ అడిగాడు, ''ఫిల్‌ బెగ్లర్‌ ఇంకా హాస్పిటల్‌లోనే ఉన్నాడా?''

అవునన్నట్లు తల ఊపాడు ఫ్లెచర్‌.

''పూర్తి రిపోర్ట్‌ మీ టేబుల్‌ మీద ఉంది. మిడ్‌టౌన్‌ డైమండ్‌ ఎక్స్‌ఛే´ంజ్‌ నుంచి కొన్ని వజ్రాలను దొంగిలించిన వ్యక్తిని ఫిల్‌ పట్టుకునేందుకు ప్రయత్నించగా, ఆ దొంగ చేతిలోని కర్రతో ఫిల్‌ని తలమీద కొట్టి పరిగెత్తాడు. ఆ దొంగ పట్టుబడ్డాడు కాని, ఫిల్‌ ఇంకా హాస్పటల్‌లోనే ఉన్నాడు''

''నేనోసారి వెళ్ళి చూడాలి. ఫిల్‌ చాలా మంచి వ్యక్తి'' అన్నాడు కెప్టెన్‌ లియో. వజ్రాల దొంగని న్యూయార్క్‌కి చెందిన రూడీ హాఫ్‌మేన్‌గా గుర్తించాడు. కిటికీలు పగలకొట్టి ఇలాంటి దొంగతనాలు ఎన్నోచేసిన దొంగ వాడు.

''ఫిల్‌ని అతను గాయపరచడం కూడా ఓ విధంగా మంచిదే. దానివల్ల వాడిని చాలాకాలం కటకటాల వెనక పెట్టొచ్చు''

''కాని, ఈ కేసు విషయంలో ఓ సమస్య వచ్చి పడింది''అన్నాడు ఫ్లెచర్‌.

''ఏమిటది?''

హాఫ్‌మేన్‌ని దొంగతనం చేసిన దుకాణం నుంచి నూటాఏభై అడుగుల దూరంలోనే పట్టుకున్నారు. మన పెట్రోల్‌కారు వచ్చేలోగా ఓ యువకుడు ఆ దొంగతో పోట్లాడి అతణ్ణి ఆపే ప్రయత్నం చేశాడు. హాఫ్‌మేన్‌ ఏభై ఎనిమిదివేల డాలర్ల విలువ చేసే వజ్రాలను దొంగిలించాడు. ఆ తర్వాత పోలీసులు అతణ్ణి అరెస్ట్‌ చేసేదాకా ఆ దొంగ ప్రతీ క్షణం కనీసం ఓ సాక్షి కనుసన్నల్లోనే ఉన్నాడు. కాని ఆ వజ్రాలు అతడి దగ్గర లభ్యం కాలేదు. అవి ఏమయ్యాయో తెలీడం లేదు''

''వాడు వాటిని వీధిలో పడేసి ఉండచ్చు''

''వీధంతా వెదికారు. అతణ్ణి అరెస్ట్‌ చేసి జైలుకి తీసుకెళ్లిన పెట్రోల్‌ కారుని కూడా పూర్తిగా వెదికారు. వజ్రాలు లేవు''

''వాటి గురించి అతణ్ణి ప్రశ్నించలేదా?''

''వాడు పెదవి విప్పడం లేదు''

''సరే, వాణ్ణిక్కడికి తీసుకురండి. వాడినెలా మాట్లాడించాలో మీకు చూపిస్తాను'' కోపంగా అన్నాడు లియోఫోర్డ్‌.

తెల్లజుట్టు గల రూడీ హాఫ్‌మేన్‌ వయసు నలభై, నలభై అయిదు మధ్య ఉంటుంది. ఎక్కువ కాలం జైల్లో ఉండటంతో సూర్యరశ్మి తాకని తెల్లటి చర్మం. బెదురుగా చూసే కళ్లు. తరచు కింద పెదవిని నాకడం అతనికలవాటు.

''ఆ వజ్రాలు ఎక్కడ దాచావు?'' ప్రశ్నించాడు లియో.

''నాకేం తెలీదు. లాయర్‌ లేకుండా నేనేం మాట్లాడను. నా హక్కులు నాకు తెలుసు. లాయర్‌ లేకుండా మీరు నన్నేం అడగకూడదసలు'' అన్నాడు.

లియోఫోర్డ్‌ అతనికెదురుగా ఉన్న కుర్చీమీద కూర్చుని అతని వంక నిశితంగా చూస్తూ అన్నాడు.

''ఈసారి కిటికీ పగలకొట్టి దొంగతనం చేసిన నేరం కాదిది. నువ్వు తల పగలకొట్టిన పోలీసు చావొచ్చు. జీవితాంతం నువ్వు ఊచలు లెక్కపెట్టాల్సిందే''

''గార్డ్స్‌ మాట్లాడేది నేను విన్నాను. తల చర్మం చిట్లిందంతే...''

''అయినప్పటికీ మారణాయుధంతో ఎదుర్కోవడం అనే నేరం చేశావు. నీకున్న నేరచరిత్రతో అది చాలు. ఆ వజ్రాలని దాచిపెట్టి నిన్ను నువ్వు రక్షించుకుంటున్నాననుకుంటున్నావేమో? అవి దొరక్కపోయినా నువ్వు హత్యాప్రయత్నం నేరం చేశావు''

రూడీ హాఫ్‌మేన్‌ చిన్నగా నవ్వాడు.

''ఆ వజ్రాలు మీరెప్పటికీ కనుక్కోలేని చోట వున్నాయి. ఆ విషయం మాత్రం క చ్చితంగా చెప్పగలను''

లియోఫోర్డ్‌ కోపంగా లేచి, రూడీ హాఫ్‌మేన్‌ వంక ఉగ్రంగా చూసి బయటకి నడిచాడు.

ఫ్లెచర్‌ లియోఫోర్డ్‌ని అనుసరిస్తూ అన్నాడు- ''చెప్పాగా, వాడు ఆ విషయంలో నోరు మెదపడం లేదని''.

''నేను వాటిని కనుక్కుని తీరతాను. కిటికీ అద్దం పగిలినప్పటి నుంచీ ఏం జరిగిందో వివరంగా చెప్పు'' అడిగాడు లియోఫోర్డ్‌.

''వీణ్ణి పట్టుకోడానికి ప్రయత్నించినవాడు స్టేట్‌మెంట్‌ ఇవ్వడానికి ముందు గదిలో ఉన్నాడు. వాడు జరిగింది మొత్తం చూశాడు'' అని ఫ్లెచర్‌ వెళ్లి, నైల్‌క్వార్ట్‌ని తీసుకువచ్చాడు. జరిగింది చెప్పాడతను.

''రంగు వేసేపని పూర్తిచేసుకుని నేను ఆఫీస్‌నించి రాత్రి తొమ్మిదింటికి ఇంటికి వెళుతున్నాను. డైమండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ దగ్గర ఈ దొంగ చేతికర్రతో కిటికీని పగలకొట్టడం చూశాను. కానీ అతడికి దూరంగా ఉండడం వల్ల పట్టుకోలేకపోయారు. ఈలోగా ఓ పోలీసు అతని వెంటపడడం, అతను పోలీసు తల మీద తన కర్రతో బాదడం చూశాను. పోలీసు కింద పడగానే నేను వాడిని పట్టుకోడానికి వెంట పడ్డాను. మేమిద్దరం కలియబడ్డాం. వాడు తన చేతికర్రతో నన్నూ కొట్టాలనుకున్నాడు. కానీ, నేను దాన్ని లాగేసుకున్నాను. తర్వాత వాడు లేచి పారిపోతుంటే పోలీసులు వచ్చారు. ఒకరు గాల్లోకి తుపాకి పేల్చగానే వాడు లొంగిపోయాడు''

''ఆ దొంగ నీకు ఎంతసేపు కనబడకుండా ఉన్నాడు?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్‌.

''ఒక్క క్షణం కూడా వాడు నాదృష్టి నుంచి దాటిపోలేదు.వాడు పోలీసుని కొట్టి పడేయగానే నేను వాడికోసం పరిగెత్తాను''

''వాడు వీధిలోకి ఏదైనా విసిరేయడం చూశావా?''

''లేదు''

''రివాల్వర్‌ కాల్పులు వినగానే చేతులెత్తినప్పుడు విసిరేసి ఉండొచ్చా?''

''లేదనుకుంటాను''

''పోలీసులు వాణ్ణి ఓ సందు మొదట్లో అరెస్టు చేశారు. ఆ సందులోని ప్రతీ అంగుళం వెదికారు. అయినా ఆ వజ్రాలు దొరకలేదు'' చెప్పాడు ఫ్లెచర్‌.

''వాడు దొంగతనం చేసిన ఆ వజ్రాల గురించి మేం వెదుకుతున్నాం. వాడు వాటినెలా మాయం చేసి ఉంటాడో నువ్వేమైనా చెప్పగలవా?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్‌.

''తెలీదు. కాకపోతే మేం కలియబడినప్పుడు ఖాళీ అట్టపెట్టెల మీద పడ్డాం''

''అవన్నీ వెదికారు. నిన్న రాత్రంతా పోలీసులు అక్కడ ఒక్క అంగుళం కూడా వదలకుండా గాలించారు. హాఫ్‌మేన్‌ బట్టలు కూడా వెదికారు. ప్రయోజనం లేకపోయింది. హాఫ్‌మేన్‌ వాటిని మింగాడేమోనని ఎక్స్‌రే కూడా తీయించారు. కడుపులో నూ లేవవి'' చెప్పాడు ఫ్లెచర్‌.

''సరే, ఈ సంఘటన జరిగిన చోటికి వెళ్లి చూద్దాం, పద'' అన్నాడు లియోఫోర్డ్‌, టోపీ అందుకుంటూ.

* * *

మిడ్‌టౌన్‌ డైమండ్‌ ఎక్స్‌ఛేంజ్‌లో పగిలిన కిటికీకి కొత్త అద్దం వేయించారు. గత రాత్రి దొంగతనం జరిగినప్పుడు ఆ దుకాణంలో ఉన్న అసిస్టెంట్‌ మేనేజర్‌ పీటర్‌ ఆర్నాల్డ్‌ని కలిశాడు లియోఫోర్డ్‌.

''ఏం జరిగిందో ఏదీ వదలకుండా చెప్పండి'' అడిగాడతణి-్ణ లియోఫోర్డ్‌.

''తొమ్మిది దాటాక సేల్స్‌మేన్‌ బయటకి వెళ్లారు. నేను దుకాణం కట్టేస్తుండగా కిటికీ అద్దం పగిలిన చప్పుడు వినిపించింది. చూస్తే, ఆ దొంగ విండో షోకేస్‌లోని వజ్రాలని అందుకుంటున్నాడు''

''ఆ షోకేస్‌లో ఎన్ని వజ్రాలున్నాయి?''

''డజన్లకొద్దీ. ఉట్టి వజ్రాలు, ఉంగరాల్లో బిగించిన వజ్రాలు. వాటి మొత్తం విలువ ఏభై ఎనిమిది వేల డాలర్లు. కొద్ది క్షణాలు ఆగివుంటే, నేను వాటిని అక్కడ నుంచి తీసేసి ఐరన్‌ సేఫ్‌లో ఉంచేవాణ్ణి. ఆ దొంగ పారిపోతుండగా పోలీస్‌ ఆఫీసర్‌ బెగ్లర్‌ కనిపించాడు''

ఫిల్‌బెగ్లర్‌ ఆ ప్రాంతంలో గత నాలుగైదేళ్లుగా పనిచేస్తున్నాడు. కాబట్టి అతను అందరికీ సుపరిచితుడే.

లియోఫోర్డ్‌ ఆ కిటికీ దగ్గరకి వెళ్ళి చూశాడు. ఖాళీ ట్రేలు కనబడ్డాయి.

''నాలుగు ఉంగరాలు మాత్రం వదిలేశాడు'' చెప్పాడు ఆర్నాల్డ్‌.

అతనికి రూడీ హాఫ్‌మెన్‌ ఫొటో చూపించి అడిగాడు.

''ఇతన్ని ఇదివరకెప్పుడైనా చూశారా?''

''లేదు'' పెదవి విరిచాడతను.

లియోఫోర్డ్‌ గొంతు తగ్గించి సాలోచనగా ''వజ్రాలకోసం వెదికిన మనవాళ్లే వాటిని కాజేశారేమో, ఫ్లెచర్‌?'' .

''నో సర్‌. వాళ్ళంతా నిజాయతీపరులే'' చెప్పాడు ఫ్లెచర్‌.

పోలీస్‌స్టేషన్‌కి వెళ్ళి లియోఫోర్డ్‌ హాఫ్‌మేన్‌ దుస్తులనేకాక, కట్టుడు పళ్ళు, విగ్‌ లాంటివి ఉంటే వాటిలో దాచాడేమోనని వెదికాడు. కాని అలాంటివేం లేవు.

లియోఫోర్డ్‌కి పోలీస్‌ ల్యాబ్‌నుంచి ఫోన్‌ వచ్చింది. హాఫ్‌మేన్‌ ఉపయోగించిన చేతికర్రని కూడా ఎక్స్‌రే తీశారు. అందులోనూ ఎలాంటి వజ్రాలు లేవు.

మెమోరియల్‌ హాస్పిటల్‌కి వెళ్ళి లియోఫోర్డ్‌ కోలుకుంటున్న బెగ్లర్‌తో అరగంట గడిపి ఇంటికి వెళ్ళాడు.

* * *

తెల్లవారుజామున మూడున్నరకి పోలీస్‌ కారు ఓ ఇంటి బయట ఆగింది. అందులోంచి దిగిన లియోఫోర్డ్‌, ఫ్లెచర్‌ ఎదురుగా ఉన్న ఆరో అంతస్తులోని అపార్ట్‌మెంట్‌ నంబర్‌ సిక్స్‌-బికి వెళ్లి తలుపు తట్టారు. నాలుగైదు నిముషాల తర్వాత ఓ కంఠం వినిపించింది.

''ఎవరది?''

''పోలీస్‌, తలుపు తీయి''

''ఇప్పుడు టైం ఎంతో తెలుసా? రేపు ఉదయం...'' విసుగ్గా తలుపు తీశాడు నైల్‌క్వార్ట్‌.

''ఆ వజ్రాలెక్కడ ఉన్నాయి?'' ప్రశ్నించాడు లియోఫోర్డ్‌.

''మీకేమైనా పిచ్చా? ఆ వజ్రాల గురించి నాకేం తెలుసు?'' అడిగాడు నైల్‌ ఆవులిస్తూ.

''హాఫ్‌మేన్‌ వజ్రాలు దొంగతనం చేశాక అతడి సమీపానికి వెళ్ళింది నువ్వొక్కడివే. నువ్వు, హాఫ్‌మేన్‌ మిత్రులు. ఆ వజ్రాలు నీకిచ్చాడు. వాటిని నువ్వే మాయం చేశావు''

''ఆ దొంగ నాకు మిత్రుడు కాడు. పోలీసులు నన్ను సోదా చేశారు. నా దగ్గరే ఉంటే అప్పుడే అవి దొరికేవిగా. నాకు వాటి గురించి తెలీదు'' చెప్పాడు నైల్‌క్వార్ట్‌.

''వాటిని నువ్వు మూడో వ్యక్తికి ఇచ్చి పంపావు. ఎవరా వ్యక్తి?''

''నేను ఎవరికీ ఏ వజ్రాలూ ఇవ్వలేదు''

నిజానికి నలుగురు సాక్షులు జరిగిందంతా చెప్పారు. వారికి ఒకరితో మరొకరికి సంబంధం లేదు. ఆ నలుగురు చెప్పింది ఏమాత్రం తేడా లేకుండా ఒకేలా ఉంది. నైల్‌ ఎవర్నీ కలవలేదు.

లియోఫోర్డ్‌, ఫ్లెచర్‌ నైల్‌ గంటసేపు ఫ్లాట్‌ మొత్తం గాలించారు. అతను అభ్యంతరం చెప్పకుండా టీ కూడా పెట్టిచ్చాడు.

ఎక్కడా వాళ్ళకి ఆ వజ్రాలు కనబడలేదు.

ఇంటికి తిరిగి వెళ్తూ లియోఫోర్డ్‌ విసుగు, కోపం ధ్వనించే స్వరంతో స్వగతంగా అనుకుంటున్నట్లు అన్నాడు, ''హాఫ్‌మేన్‌ ఆ వజ్రాలు ఎలా మాయం చేశాడు? వాటిని అతను ఎవరికీ ఇవ్వలేదని, ఎక్కడా దాచలేదని సాక్షులు చెప్పిందాన్నిబట్టి తెలుస్తోంది. మరి రెక్కలొచ్చినట్లు ఎలా ఎగిరిపోయాయవి?''

ఫ్లెచర్‌ మౌనంగా ఉండిపోయాడు.

లియోఫోర్డ్‌ ఇంటికి చేరుకునేదాకా ఆ విషయంమీదే మనసు నిలిపి ఆలోచిస్తున్నాడు. అకస్మాత్తుగా కారు బ్రేక్‌ వేసి, అరిచాడు.

''ఆ వజ్రాలు ఎలా మాయమయ్యాయో తెలిసింది''

''ఎలా?'' అడిగాడు ఫ్లెచర్‌ విస్మయంగా అతణ్ణి చూస్తూ.

''చెప్తాను. రేపు ఉదయం నువ్వు అర్జెంట్‌గా కొంత సమాచారం సేకరించాలి. నువ్వేం చేయాలంటే...'' అని ఫ్లెచర్‌కి ఏం చేయాలో చెప్పాడు లియో.

* * *

మిడ్‌టౌన్‌ డైమండ్‌ ఎక్స్‌ఛేంజ్‌ దుకాణంలోని సేల్స్‌మేన్‌ ఓ కస్టమర్‌కి బంగారు ఉంగరాలు చూపిస్తుండగా లియోఫోర్డ్‌, ఫ్లెచర్‌ లోపలికి వచ్చారు.

''పీటర్‌ ఆర్నాల్డ్‌ ఏడీ?'' అడిగాడు ఫ్లెచర్‌.

అతను మౌనంగా అసిస్టెంట్‌ మేనేజర్‌ అని రాసివున్న కేబిన్‌ తలుపువైపు చూపించాడు. ఇద్దరూ ఆ గదిలోకి వెళ్ళారు.

''రండి. వాడు వజ్రాలని ఎక్కడ దాచాడో కనుక్కున్నారా?'' శాండ్‌విచ్‌ తినబోతున్న ఆర్నాల్డ్‌ ఆగి, ఆసక్తిగా అడిగాడు.

''అవెక్కడున్నాయో తెలిసింది'' అన్నాడు లియోఫోర్డ్‌.

''వెరీగుడ్‌. ఎక్కడ దాచాడు వాటిని?''

''దానికన్నా ముఖ్యం 'ఎలా తెలుసుకున్నాం' అన్న సంగతి. అది నువ్వు తెలుసుకోవాలి'' నవ్వుతూ అన్నాడు లియోఫోర్డ్‌ ఎదురుగా వున్న కుర్చీలో కూర్చుంటూ.

''ఎలా తెలిసింది?''

''హాఫ్‌మేనే చెప్పాడు''

''ఏమని?''

''మీ ఇద్దరి మధ్య గల ఒప్పందం''

క్షణకాలం ఆర్నాల్డ్‌ మొహం పాలిపోయింది. అంతలోనే తేరుకుంటూ ''నాకర్థం కాలేదు'' అన్నాడు.

''నీది చాలా తెలివైన పథకం మిస్టర్‌ ఆర్నాల్డ్‌. ఆ రాత్రి నీ కింద పనిచేసే సేల్స్‌మెన్‌ వెళ్ళిపోయాక, నువ్వు కిటికీ షోకేస్‌లోని వజ్రాలన్నిటినీ తీసేసుకున్నావు, నాలుగు ఉంగరాలు తప్ప. ప్లాన్‌ ప్రకారం ఆ తర్వాత తొమ్మిదింటికి హాఫ్‌మేన్‌ వచ్చి కిటికీ అద్దాన్ని పగలకొట్టాడు తప్ప, వజ్రాలు దొంగతనం చేయలేదు. మీ పథకం సరిగ్గా ఫలించి ఉంటే, హాఫ్‌మేన్‌ పారిపోయేవాడు. వాటినితనే మాయం చేశాడనుకునే వాళ్లం. కాని మీ పథకంలో ఎదురుచూడని పాత్ర ఆఫీసర్‌ బెగ్లర్‌. అనుకోకుండా ఆ సమయంలో అక్కడికి వచ్చి హాఫ్‌మేన్‌ని పట్టుకోబోయాడు. పట్టుబడితే తన దగ్గర వజ్రాలు లేవని పోలీసులు తెలుసుకుంటారని, ఈ పథకం పాడవుతుందని హాఫ్‌మేన్‌ అతడి తలమీద కొట్టి పారిపోయాడు. హాఫ్‌మేన్‌ గతంలో ఎప్పుడు పట్టుబడినా ఎవరి మీదా, ఎలాంటి హింసక పాల్పడలేదని రికార్డులు చెప్తున్నాయి. హాఫ్‌మేన్‌ని పట్టుకోవడానికి నైల్‌ అతడితో కలబడ్డ సమయంలో నీ దగ్గరే ఆ వజ్రాలున్నాయి. వాటినేం చేశావో నువ్వే చెప్పాలి.''

''అబద్ధం. హాఫ్‌మేన్‌ చెప్పింది శుద్ధ అబద్ధం'' లేచి నిలబడి అరిచాడు ఆర్నాల్డ్‌.

''హాఫ్‌మేన్‌ ఈ నిజం చెప్పడానికో కారణం వుంది. ఇందాక బెగ్లర్‌ హాస్పటల్లో మరణించాడు. దాంతో హాఫ్‌మేన్‌ హంతకుడయ్యాడు. ఆ సంగతి తెలియగానే తను చంపాలనుకుని అతన్ని కొట్టలేదని, ఎందుకు కొట్టాల్సి వచ్చిందో చెప్పి, తన నేరాన్ని ఒప్పుకున్నాడు''

పీటర్‌ ఆర్నాల్డ్‌ మొహం మరోసారి పాలిపోయింది.

''దీనికి సాక్ష్యం వుందా అని నువ్వు అడగొచ్చు. ఉంది, హాఫ్‌మేన్‌ రాకమునుపు నువ్వు వాటిని తీసి నీ జేబులో వేసుకోవడం రోడ్డుమీంచి చూసిన సాక్షి ఉన్నాడు. ఆర్నాల్డ్‌, నీ గురించి మొత్తం విచారించాం. నువ్వు ఆర్థికంగా చితికిపోయావు. నీ భార్య నీ గుర్రప్పందాల పిచ్చిని భరించలేక విడాకులిచ్చేసింది. ఆమెకి నీ జీతంలో సగం నెలనెలా భరణంగా వెళ్తోంది. నువ్వు అప్పుల్లో ఉన్నావు''

పీటర్‌ ఆర్నాల్డ్‌కు ముచ్చెమటలు పోశాయి.

''నీ అంతట నువ్వు నేరం ఒప్పుకుంటే, తక్కువ శిక్ష పడుతుంది. లేదా కటకటాలను ఎక్కువ కాలం లెక్కపెట్టాల్సి వుంటుంది''

యూనిఫాంలో వున్న ఓ పోలీస్‌ కాన్‌స్టేబుల్‌ తలుపు తెరుచుకుని లోపలికి వచ్చి, సెల్యూట్‌ చేసి లియోఫోర్డ్‌ చెవిలో ఏదో చెప్పాడు.

లియోఫోర్డ్‌ చిన్నగా నవ్వుతూ అన్నాడు.

''సెర్చ్‌ వారంట్‌ లేకుండా వెదికినందుకు సారీ. వజ్రాలు మాకు దొరికాయి''

వెంటనే ఆర్నాల్డ్‌ తల వంచుకున్నాడు.

''పట్టుబడ్డాక దబాయించి ప్రయోజనం లేదు. మీరు చెప్పినవన్నీ నిజాలే. నా తప్పు ఒప్పుకుంటున్నాను''

పోలీస్‌ కారులో ఎక్కాక ''నా కారు స్టెఫినీలో దాచిన వజ్రాలని ఎవరూ కనుక్కోలేరనుకున్నాను. ఎలా కనుక్కున్నారు?'' పీటర్‌ ఆర్నాల్డ్‌ అడిగాడు.

''పోలీసుల్ని తప్పుగా అంచనా వేశావంతే'' సన్నగా నవ్వాడు లియోఫోర్డ్‌.

టైప్‌ చేసిన కన్ఫెషన్‌ పేపర్లని ఆర్నాల్డ్‌ ఓసారి చదివి సంతకం చేశాక, అతణ్ణి సెల్‌లోకి తీసుకెళ్లారు.

''బాస్‌, ఆర్నాల్డ్‌తో ఎంత అలవోకగా ఎన్ని అబద్ధాలాడారు? హాఫ్‌మేన్‌ మనకి ఒప్పందం గురించి చెప్పాడని, బెగ్లర్‌ మరణించాడని, వజ్రాలు దొరికాయని...'' ఫ్లెచర్‌ ఆశ్చర్యంగా అడిగాడు లియోఫోర్డ్‌వంక చూస్తూ.

''అసలు హాఫ్‌మేన్‌ వజ్రాలను దొంగిలించలేదన్న ఆలోచన నాకు మెరుపులా తట్టాక- టైం లేక హాఫ్‌మేన్‌ వాటిని తీసుకోకపోయినా ఆ దొంగతనం అతడి మీదకే వెళ్తుందనే ఉద్దేశంతో ఆర్నాల్డ్‌ వాటిని దొంగిలించి వుంటాడని- అనిపించింది. కాని తను దొంగతనం చేయలేదన్న సంగతి హాఫ్‌మేన్‌ మనకి చెప్పొచ్చుగా? చెప్పలేదంటే అందుకు బలమైన కారణం వాళ్లిద్దరూ తోడుదొంగలు కావడమే అనిపించింది. నువ్వు ఆర్నాల్డ్‌ గురించి విచారించడంతో, ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నాడని తెలిసింది. హాఫ్‌మేన్‌ స్వయంగా జరిగిందంతా చెప్పాశాడంటే ఆర్నాల్డ్‌ కాదనలేడనిపించి, అలా గాల్లోకి ఓ రాయి విసిరా. దొంగిలించిన వజ్రాలని తన కేబిన్‌లో దాచడనుకున్నా ముందు. అదృష్టవశాత్తూ ఆర్నాల్డే ఆ రహస్యం కూడా చెప్పేశాడు. వజ్రాలు దొరక్కపోతే, ఆర్నాల్డ్‌ మీద కేసు బనాయించలేం కదా?'' అంటూ వివరించాడు లియోఫోర్డ్‌.

''నిజమే. మిగిలినవాళ్లు ఎంత నిజాయితీగా పరిశోధన చేసినా అంతుచిక్కని కేసు, మీరు ఆడిన అబద్ధాలతో ఇట్టే తేలిపోయింది'' మెచ్చుకోలుగా అన్నాడు ఫ్లెచర్‌.

''సమయం అనుకూలిస్తే తప్ప, అన్నిసార్లూ ఇలా కుదరదు. కాబట్టి నిజాయితీయే ఎప్పటికీ సరైన దారి'' నవ్వుతూ చెప్పాడు లియోఫోర్డ్‌.

ధర్మాత్ముడు ఒరియా కథ

ధర్మాత్ములయ్యేందుకు రెండు సహజ మార్గాలున్నాయి. మొదటిది నిద్ర, రెండోది చీకటి! నిద్ర అంటే దీర్ఘనిద్ర. అంటే చనిపోవడమన్నమాట. చనిపోయిన తర్వాత చాలామంది ధర్మాత్ములు అవుతూ వుంటారు. పరోపకారులు కూడా అవుతూ వుంటారు. వార్తా పత్రిక సత్యానికి నోరు లాంటిది. అంచేత మృత్యు సమాచారం వార్తా పత్రికలో శోక ప్రకటనగా అచ్చయితే అతడు ధర్మాత్ముడై పోయినట్టుగానే భావించాలి. ధర్మాత్ములు కావాలని అందరికీ కాంక్ష వుంటుంది. అందుకోసమని మొదటి మార్గాన్ని అనుసరించడం కష్టం.

ఇంక రెండో మార్గం చీకటి. అంటే భ్రమ, భ్రాంతి. ఈ మార్గాన్ని పట్టుకొని చాలామంది తమని ధర్మాత్ములుగా భావిస్తూ ఆత్మతృప్తి పొందుతున్నారు. భ్రమ మార్గాన్ని తమ తర్వాతి తరం వారికి కూడా తెరిచివుంచి సుగమం చేస్తున్నారు. చాలా పురాతన కాలం నుంచి, మానవుని మనస్సులో ధార్మిక భావన పుట్టిన నాటి నుంచి ఈ రెండో మార్గం ద్వారానే తరతరాలుగా ధర్మాత్ముల ఆగమనం జరుగుతూ వచ్చింది. ధర్మాత్ములు, భ్రమాత్ములు ఒకటేనని భావింపబడుతూ వచ్చారు.

ఒక మంచి ముహూర్తంలో ఒకానొక ధర్మాత్మునితో రవిబాబుకి పరిచయం కలిగింది. ఆ ధర్మాత్ముడు అద్దెఇల్లు కోసం తిరుగుతున్నాడు. కొత్తగా ఈ టౌన్‌కి ట్రాన్స్‌ఫర్‌ మీద వచ్చేడు. స్కూటర్‌ వెనక భార్యని కూర్బోబెట్టుకొని ఇల్లు కోసం టౌనంతా తిరుగుతున్నాడు. అద్దె గురించి సమస్య లేదు. కాని వాళ్ల అవసరాల దృష్ట్యా ఈ టౌనులో ఇల్లు దొరకడం అంత తేలిక కాదు. సుయోగబాబు లాభదాయకమైన డిపార్ట్‌మెంట్లో, లాభదాయకమైన పోస్టులో పనిచేస్తున్నాడు. అతని జీతం మూడు వేలు. కాని ఇంటద్దె మాత్రం పదిహేనువందల వరకు ఇవ్వగలడు. ఆ తర్వాత అతని సంసారం ఎలా గడుస్తుందనే ప్రశ్న మనకు మనమే వేసుకొంటే చిన్న నవ్వొకటి పెదవుల మీదికి వచ్చి అక్కడ్నుంచి ముఖమంతా వ్యాపించేస్తుంది.

పదిహేను వందలు అద్దె ఇస్తామంటే ఇల్లు దొరకడం కష్టమేమీ కాదు. కాని అయ్యగారికి మాత్రం మిగతా అవసరాలతో బాటు వేరేగా మరి రెండు గదులు వుండాలి. ఒకటి కుక్కల కోసం, మరొకటి దేవుడి కోసం. బెడ్రూమ్‌ తగ్గినా ఫర్వాలేదు. కాని ఈ రెండు గదులు మాత్రం తప్పనిసరిగా వుండాలి.

ఈ మహానుభావుడికి ఒకేసారి ఇటు దైవభక్తి, అటు కుక్కల మీద ప్రేమని చూస్తే ఎవరైనా ఆశ్చర్యపోతారు. మహానుభావుడు గొప్ప ధర్మాత్ముడు. అతని భార్య భాగ్యవతి కూడా గొప్ప ధర్మపరాయణురాలు. అంచేత దేవుడికి, కుక్కలకి మధ్య నూలు పోగంత ఎడం వుంచారు. జడ పదార్థాల్లోను, జీవుల్లోను భగవంతుడున్నాడు. అలాంటప్పుడు కుక్కలంటే అసహ్యమెందుకు! ట్రాన్స్‌ఫర్స్‌ ఉండే ఉద్యోగమాయె. ముగ్గురు పిల్లలు. రెండు ట్రక్కుల సామాను. దేవుడి విగ్రహం, పటాలు. దేవుడి పూజకు పాత్రలు, పూజా సామాగ్రి. వీటన్నింటితో బాటు రెండు కుక్కలు. ఒకటి పెద్దది అల్సేషియన్‌, రెండోది చిన్నది టిబెటియన్‌. వీటన్నిటి మూలాన పెద్ద ఇల్లు ఉండడం అవసరం. ప్రస్తుత రోజుల్లో దేవుడు, కుక్క మాత్రమే రక్షకులు. మానవుడికి మానవుడే శత్రువు.

చివరికి రవిబాబు ఇంటికి దగ్గర్లో అతగాడికి ఇల్లు దొరికింది. సామానంతట్నీ మూడు ట్రక్కుల్లో వేశారు. కుటుంబమంతా ఒక ట్రాక్టర్లో బయలుదేరి ఇంటికి చేరుకున్నారు. నిజంగా చూడదగిన దృశ్యమది. మూడువేలు జీతం తీసుకుంటున్న అయ్యగారి దగ్గర లేనిదనగా ఏముంటుంది. వీళ్ళ దగ్గర ఏమిటున్నాయో లెక్కిస్తే పెద్ద లిస్టు తయారవుతుంది. అంచేత ఈ విషయాన్ని వదిలేద్దాం. వాళ్ళకి కారు వుంది. సెకెండ్‌ హేండ్‌ది. గేరేజ్‌లో వుంది. అంచేత ట్రాక్టర్‌ నుంచి దిగిన వెంటనే అతని భార్య భాగ్యవతీదేవి తమనే కుతూహలంతో చూస్తున్న ఇరుగుపొరుగు వారిని చూసి వాళ్ళు వినాలనే ఉద్దేశంతో అంది, ''ఏం ట్రాక్టరో బాబూ. అందులో కూర్చోవడం ఎంత యమయాతనో ఎవరికి తెలుస్తుంది?! కారు గేరేజిలో వున్నందువల్ల ఈ శిక్ష అనుభవించవలసి వచ్చింది''.

మహానుభావుల సామాను చూసి ఇరుగు పొరుగువారికి కళ్ళు చెదిరిపోయాయి. కాని ఆ తర్వాత మార్బుల్‌తోను, కర్రతోను, ఇత్తడితోను తయారైన భగవంతుడి విగ్రహాలు చూడగానే వాళ్ళంతా ఆశ్చర్యంతో రెప్పవేయడమే మర్చిపోయారు. దేవాలయాల్లో కూడా ఇంత పూజా సామాగ్రిని వాళ్లు చూడలేదు. ఇదంతా చూడగానే సహజంగానే జనాలందరికీ వీళ్ళమీద భక్తిభావం కుదిరిపోయింది. ఇలాంటి ధర్మ పరాయణులైన దంపతులుండటం కష్టం. నిజానికి వాళ్ళది మణికాంచన సంయోగం.

రవిబాబు భార్య అప్పుడప్పుడు పొరుగు మహానుభావుని భార్యతో మాట్లాడుతూ వుంటుంది. రవిబాబు అంటాడు, 'ధార్మికులైన ఇలాంటి వారితో సంపర్కం పెట్టుకోవడం మంచిది' అని. ఎందుకంటే వీళ్ళ సాన్నిథ్యంలో మంచి జరుగుతుంది. మేలు కలుగుతుంది. నేటి కాలంలో ధర్మమనగా ఎక్కడుంది? ధర్మపరాయణులైన ఇలాంటి వారి వల్లనే ఈ భూమి నిలబడి వుంది!

భగవంతుడి సేవ, కుక్కల సేవ స్వయంగా భార్యాభర్తలిద్దరూ తమ చేతులతో చేస్తారు. ఈ పనిలో వాళ్ళకి నౌకర్ల అవసరం వుండదు. వాళ్ళ ముగ్గురు పిల్లలు కూడా తమ పనులు తాము చేసుకొంటూ చదువుకొంటారు. తల్లిదండ్రుల మీద ఆధారపడరు.

భగవంతుని పూజలో ఎంతో సమయాన్ని గడిపే ఆమె, ఇంట్లోని మిగతా పనులకి కాలాన్ని కేటాయించలేకపోతోంది. ఆ ఇంట్లో పన్నెండు నెలల్లోనూ పదమూడు పండుగలు జరుపుతారు. దేవాలయాల్లో పూజలు జరుగుతున్నట్లుగానే వాళ్ళ ఇంట్లోనూ అన్ని ఏర్పాట్లూ జరుగుతాయి. సాయంకాలం హార్మోనియం వాయిస్తూ, తల్లిదండ్రులు, పిల్లలు భజన కీర్తనలు పాడతారు. దాంతో రాత్రి వంటగాని, పిల్లల చదువుగాని ఏదీ వాళ్లకి గుర్తుండదు. అన్ని పనులూ ఆగిపోతాయి. భజన కార్యక్రమం పూర్తి అయ్యాక వంట, భోజనం గురించి వాళ్లకి ఏ దిగులూ ఉండవలసిన అవసరం లేదు. ఎందుకంటే ఎదురుగుండా ఉన్న నాలుగు రోడ్ల సెంటర్లో ఆదర్శ హిందూ హోటల్‌ ఉంది. అక్కడి నుంచి భోజన పదార్థాలు తెప్పించుకుంటారు. అంతే, పని అయిపోతుంది. భాగ్యవతీదేవి ఎంతో రాత్రి వరకూ కుక్కల సేవ చేస్తూనే ఉంటుంది. అయ్యగారు వాలుకుర్చీలో కూర్చొని సిగరెట్టు కాలుస్తూ కుక్కలతో మాట్లాడుతూ ఉంటారు.

రవిబాబు భార్య భాగ్యవతీదేవితో అంటుంది, ''అమ్మగారింకా నిద్రపోలేదా?''

భాగ్యవతి వాత్సల్యం నిండిన గొంతుతో అంటుంది, ''పాపం, ఇవి నోరులేని జీవులు గదా. అంచేత వీటి సంరక్షణంతా జాగ్రత్తగా చూడాలి''

రవిబాబు అంటాడు, ''వీరి నుంచి నేర్చుకో. ఎంతటి ఔదార్యం. ఇలాంటివారిని చూడాలంటే ఎక్కడోగాని కనిపించరు''

కుక్కల్ని శుభ్రం చేస్తూ పిల్లలకు దోమతెర వేయడం కూడా ఆమె మర్చిపోతుంది. తెల్లవారేకా చూస్తే పిల్లల శరీరాలు దోమకాట్లతో ఎర్రగా ఉంటాయి. తల్లి, పిల్లలు ఉదయం ఎనిమిదింటికిగాని లేవరు. వాళ్ళ నాన్నకి తొమ్మిదవాలి. పిల్లలకి స్కూలు ఉదయం ఆరున్నరకి. పిల్లలు వెళ్ళలేకపోతున్నారు. ఆ స్కూలు పెద్ద మాస్టారు సాయంకాలం ఇంటికి వచ్చి పిల్లలకి పాఠాలు చెబుతారు.

టిఫిన్‌ చేసి టీ తాగుతూ పెద్ద మాస్టారు వాళ్లకి ఊరట కలిగించేలా ''మీరేం విచారించవలసిన అవసరం లేదు. పిల్లలు ఎప్పుడు ఇష్టపడితే అప్పుడే స్కూలుకి వస్తారు. అందరి పిల్లలతో మీ పిల్లలు సమానమెందుకవుతారు?'' అంటారు.

అంచేత వీళ్ళ పిల్లలు నిద్ర లేచిన తర్వాతనే స్కూలుకి వెళతారు. భజన కీర్తనల తర్వాత భార్యాభర్తలు కొంచెం సోమరసం పానం చేస్తారని వినికిడి.

రవిబాబు భార్య స్నేహలత భాగ్యవతి గారింటికి ఎప్పుడు వెళ్ళినా ఆ ఇల్లంతా దుమ్ము ధూళితో అస్తవ్యస్తంగా కనిపిస్తుంది. భాగ్యవతి మాత్రం ఏం చేయగలదు? ఒక్కతే ఇంట్లో పని చేయాలి. నౌకర్లు వగైరా లేరు. భగవంతుని పూజలోను, కుక్కల సంరక్షణలోనూ చాలా టైమ్‌ గడిచిపోతుంది. ఇంటి పనుల మీద దృష్టి సారించటానికి ఆమెకి తీరుబడెక్కడిది!

స్నేహలత ఒకనాడు అంది, ''చిన్న అబ్బాయిని పెట్టుకొంటే ఇంటి పని వాడికి అప్పగించచ్చు గదా. మీరొక్కరే ఎంతని చేయగలరు?''

భాగ్యవతిదేవి అంది, ''అయ్య బాబోయ్‌... ఈ కాలంలో ఎవ్వర్నీ నమ్మలేం. అంచేత నేనెవ్వర్నీ ఇంటి లోపలికి రానివ్వను''.

''ఎవర్నీ నమ్మలేమనేది నిజమే లెండి. అయితే మీరొక పనిమనిషిని పెట్టుకోండి. రెండుపూటలా వచ్చి ఇంట్లో పనులన్నీ ఆమే చేసుకుంటుంది''.

భాగ్యవతి తన పెద్దపెద్ద కళ్ళని గుండ్రంగా తిప్పుతూ అంది,

''ఈ ఇంట్లోకి ఒక ఆడమనిషిని తీసుకొచ్చి నేను పాపం మూటగట్టుకోనా? చూస్తున్నారుగదా, మా ఇంట్లో ఎంతమంది దేవుళ్ళున్నారో?''

స్నేహలత మరి మాటాడలేదు. పాపం, పుణ్యం, ధర్మం, అధర్మం వీటి విషయమై స్నేహలత భావాలకి, భాగ్యవతి భావాలకి ఎంతో భేదం ఉంది. భాగ్యవతి అంది, ''మేం ఎన్నో తరాల నుంచి నియమ నిష్ఠల్ని పాటిస్తూ వస్తున్నాం. మా అత్తగారు ఇలవేల్పు శివలింగాన్ని నా చేతుల్లో పెట్టారు. అంతేకాకుండా జగన్నాథుడు, శ్రీకృష్ణుడు, విఘ్నేశ్వరుడు, సరస్వతీదేవి, లక్ష్మీదేవి- ఈ దేవుళ్ళందరికీ పూజలు చేస్తాను. నిష్టతో మనం నడవకపోతే అశుభం కలుగుతుంది. ఒకసారి ఏమయిందంటే తక్కువజాతి అబ్బాయినొకడ్ని ఇంటిపని కోసం పెట్టుకున్నాం. వాడివల్ల మేం చాలా కష్టాలు అనుభవించేం. ప్రాయశ్చిత్తం చేసుకున్నాం. దేవుడ్ని మళ్ళీ ప్రతిష్ఠించుకున్నాం. మీకో విషయం చెప్పాలి. మా పిల్లలు స్కూలు నుంచి వస్తారా, వెంటనే వాళ్ళ బట్టలు మార్పించేస్తాను''.

స్నేహలత ఆశ్చర్యంగా అడిగింది, ''అదేం?''

భాగ్యవతి ముక్కు ముడుచుకొని అంది, ''ఈనాడు స్కూళ్ళలో తక్కువజాతి పిల్లలు చదువుతున్నారు. పిల్లలకి ఇప్పటి నుంచే ధర్మకర్మల గురించి తెలియజేయకపోతే ఆ తర్వాత వాళ్ళకేం తెలుస్తుంది? అంచేతనే ఈనాడు దేశంలో హింసాకాండ, హత్యలు లాంటి సంఘటనలు జరుగుతున్నాయి. తల్లిలాంటి ఇందిరాగాంధీని ఆమె అంగరక్షకులే హత్య చేసేశారు. దీనికి ఒకే ఒక కారణం. ప్రజల దృష్టిలో పాపపుణ్యాలు, ధర్మ అధర్మాల మధ్య భేదం లేకుండా పోయింది.''

ధర్మానికి సంబంధించి భాగ్యవతీదేవికి ఉన్న తప్పుడు భావాలు దేశంలో ఉన్న మూడువంతుల భావి నాగరికుల్ని తప్పుడు మార్గంలోకి తీసుకువెళుతున్నాయి. అంతేకాదు, దేశ భవిష్యత్తుని అంధకారమయం చేస్తున్నాయి. ఈ విషయం ఆమెకు ఎవరు చెబుతారు?

మూఢ నమ్మకంలో మునిగిన ఈ మహిళకు కొంచెం బోధపర్చాలన్న ఉద్దేశంతో స్నేహలత నవ్వుతూ అంది, ''భగవంతుడు శివుడు, జగన్నాథుడు, శ్రీరాముడు, లక్ష్మీదేవి- ఏ దేవుడైనా, వాళ్ళకి ఏదైనా జాతి వుందా? శివుడు శ్మశానంలో ఉంటాడు. శ్మశానంలో జాతిని గురించి ఎవ్వరూ అడగరు. జగన్నాథుడు శబరి ఇంట్లో ఆశ్రయం పొందాడు. శబరి ఎంగిలి పళ్ళనే తిన్నాడు శ్రీరాముడు. లక్ష్మీదేవి ఛండాలుని ఇంట్లో ప్రసాదాన్ని స్వీకరించింది. మీ రెందుకు జాతి, ప్రాంతాల భేదాన్ని పాటిస్తున్నారు?''

భాగ్యవతి నాలుక అడ్డంగా కొరుకుతూ అంది, ''బావుంది, రాజుగారు పిడికెడు మురీలు తిన్నారని అవే అతనికి భోజనంగా పెడతామా? నిష్ఠలేని దైవారాధనకు ఏ విలువా ఉండదు. చాలామంది తమ ఇళ్ళల్లో దేవుడి విగ్రహాలు పెట్టుకుంటారు. వాళ్ళంతా నియమ నిష్ఠలతో ఆరాధన, పూజలు చేస్తున్నారా? అందరిచేతి పూజల్నీ భగవంతుడు స్వీకరించడు. అలాగే జరిగితే, రకరకాల కష్టాలూ అవీ ఎందుకొస్తున్నాయంటారూ?''

స్నేహలత అంది, ''అలాగయితే మీ ఇంట్లో మాంసం, చేపలు వగైరా వండరా? మీరు దేవాలయంలో కంటే ఎక్కువగా నియమ నిష్ఠలు పాటిస్తుంటారు కదా!''

భాగ్యవతి అంది, ''మేమూ మాంసం, చేపలు, గుడ్లు వగైరా తింటాం. బట్టలు మార్చుకొని కొంచెం నీళ్ళు తలమీద చిలకరించుకొంటే సరి, ఆత్మశుద్ధి జరుగుతుంది. ఈనాటి కాలంలో ఎవరైనా గుండెమీద చేయివేసి చెప్పగలరా- తెలిసో తెలియకో తనవల్ల ఏ పాపమూ జరగలేదని. అంచేత మేమిద్దరం భార్యాభర్తలం ఏడాదికొకసారి తీర్థయాత్రలు తప్పక చేస్తాం. అంతేకాదు, ప్రతిరోజూ సాయంకాలం మా ఇంట్లో పూజ, ఆరాధన జరుగుతుంది. శాస్త్రాల్లో కూడా ఇదే రాసేరు. ఎవరు ఎన్ని పాపాలు చేసినా సరే, భగవంతుని నామస్మరణాన్ని చేయాలి. లేదా తీర్థయాత్రలు చేయాలి. లేదా తీర్థజలాల్లో స్నానం చేయాలి. అప్పుడే ఆ పాపాల నుంచి విముక్తి లభిస్తుంది. ఏమీ చేయకపోయినా కనీసం ఒక గంటసేపు భగవంతుడి నామాన్ని జపిస్తే చాలు. అజామీళుడి కథ మీరు వినలేదా?''

స్నేహలత మనస్సులో బాధపడింది. ఆలోచించింది. శాస్త్రకారులు పాపానికి సంబంధించిన నాలుగు రోడ్ల కూడలిని ఏ ప్రతిబంధకమూ లేకుండా స్వేచ్ఛగా వదిలేస్తే ఈ కలియుగంలో మానవుడు పాపాలు చేయక మరేం చేస్తాడు? చికిత్సగాని, మందుగాని లేని జబ్బుని చూస్తే మానవుడు భయపడతాడు. ఆ రోగం నుంచి రక్షణ పొందడానికి ఆరోగ్య సంబంధమైన నియమనిష్ఠల్ని పాటిస్తాడు. అలా కాకుండా రోగానికి చికిత్స, మందులు ఉన్నప్పుడు మానవుడు ఆ రోగమంటే భయపడడు. ప్రలోభాల నుంచి దూరంగానూ వుండడు.

పొరుగున వున్న ఈ అయ్యగారి ధర్మపరాయణత్వం మీద స్నేహలతకి సందేహం కలగసాగింది. అయితే ఈ విషయం ఎవరితో చెప్పాలి? లోకమంతా వీళ్ళని ధర్మపరాయణులైన దంపతులుగా భావిస్తున్నారాయె. వాళ్ళు ఎక్కడికి వెళితే అక్కడే వాళ్ళకి గౌరవ సత్కారాలు జరుగుతున్నాయి. అప్పుడప్పుడు వాళ్ళు లాన్‌లో పెద్దపెద్ద జంబుఖానాలు పరిపించి భగవంతుడి పూజా కార్యక్రమం మొదలెడతారు. భజన కార్యక్రమం తర్వాత భోజనాల ఏర్పాటు వుంటుంది. ఇందుకోసం ఆఫీసులోని పరదాలు, కంబళీలు, షామియానా, డబ్బు వాడుకుంటే మాత్రం ఎవరడుగుతారు? వాళ్ళేం తమ కొడుకు, కూతుళ్ళ బర్త్‌డే పార్టీలు చేస్తున్నారు గనకనా? వాళ్ళేం చేస్తున్నా భగవంతుడి కోసమేగదా చేస్తున్నారు. ధర్మాన్ని ప్రచారం చేయాలనేగదా చూస్తున్నారు. అంచేత వాళ్ళని భ్రష్టాచారులనిగాని, లంచగొండులనిగాని అనే సాహసం ఎవరికుంటుంది?

ఆవాళ స్నేహలత తన కొడుకు జన్మదిన సందర్భంగా పొరుగున వున్న అయ్యగారి పిల్లల్ని పిలవడానికి వెళ్ళింది. అప్పుడు భాగ్యవతి అంది, ''ఇంత ఆడంబరంగా పిల్లల బర్త్‌డే పార్టీలెందుకు చేస్తున్నారు? ఇంట్లో భజనలు, సంకీర్తనలు ఏర్పాటుచేసి పిల్లలకింత ప్రసాదం పెడితే బావుండును గదా. అలాగయితే భగవంతుడు ప్రసన్నుడవుతాడు. ఎవ్వరూ ఏమీ అనడానికి ఆస్కారమూ వుండదు''

స్నేహలత ఆశ్చర్యపోతూ అంది, ''నేనే ఆడంబరమూ చేయటంలేదు. ఉదయం పది పన్నెండుమంది అనాథబాలల్ని పిలిచి భోజనం పెడతాం. సాయంకాలం సత్యనారాయణ వ్రతం చేస్తాం. పిల్లల స్నేహితులు అయిదారుగుర్ని పిలిచి ప్రసాదం పెడతాం. ఈ పనిలో మా ఆనందం కంటే పిల్లలకే ఎంతో ఆనందం కలుగుతుంది. ఏడాదికొకసారి వచ్చే ఆ రోజు ఎంతో ఆనందదాయకంగా వుందని వాళ్ళు భావిస్తారు. ఈ లోకంలో ఏదో చేసి చూపించడానికే వాళ్ళు జన్మించారు. అంతేగాని వాళ్ళు ఏ పనీపాటా చేయకుండా, కర్మ చేయకుండా కేవలం భగవంతుని నామాన్ని జపిస్తూ కూర్చుంటే దానివల్ల వాళ్ళకీ మేలు జరుగదు, సమాజానికీ జరగదు. అదీకాకుండా ఈ రోజుల్లో దానధర్మాలు ఎవరు చేస్తున్నారు? అంచేత సంవత్సరానికి ఒకసారి, అదీ పిల్లల పుట్టినరోజున కొంతమంది అనాథ బాలలకు తృప్తిగా భోజనం పెట్టగలిగితే అంతకుమించిన సంతృప్తి ఇంకేముంటుంది? తాను తినడంలోను, ఇతరులకి అన్నం పెట్టి తినిపించడంలోనూ గల భేదాన్ని తెలుసుకుంటారు. ఆ ఆనందానుభవాన్ని వ్యక్తం చేయలేం''అంది.

భాగ్యవతి లోగొంతుతో తన ఉపన్యాసం ప్రారంభించింది ''మన ఇద్దరి భావాలు వేరువేరుగా వున్నాయి. మేం మాత్రం మా ఇంటికి పిలిపించి ఎవ్వరికీ కప్పు కాఫీ కూడా ఇవ్వం. ఈ రోజుల్లో ఎవరూ ఇంకొకరి అభివృద్ధి చూసి ఓర్వలేరు. ఇంటికి వచ్చి కడుపునిండా తిన్నవాళ్ళే బయటికి వెళ్ళేక చెడ్డగా మాట్లాడతారు. వీళ్ళకి ఇంత డబ్బు ఎలా వచ్చింది? వీళ్ళ జీతం ఎంతో అనీ, వీళ్ళింత మర్యాదలు చేశారుగదా, ఇదంతా వీళ్ళ కష్టార్జితంతోనే చేశారా? ఇలాగే ఏవేవో అంటారు. అంచేతనే మేం భజన కార్యక్రమాలు చేస్తాం. పెద్ద పెద్ద వాళ్ళని పిలుస్తాం. వాళ్ళు ఇంటి లోపలికీ రారు, ఇలాంటి చిన్న చిన్న విషయాలమీద దృష్టీ పెట్టరు. వాళ్ళ దృష్టి ఎంతసేపూ పైకే వుంటుంది. తోటి ఉద్యోగులు, కింది ఉద్యోగుల దృష్టి మాత్రమే ఎప్పుడూ మన సుఖాల మీద ఉంటుంది. ఆకలితో వున్నాడుగదా అని అన్నం పెడితే ఆ స్వార్థపరుడు సహించలేడు. వెంటనే మీ వెనకే వుండి అన్ని విషయాలూ ఆరా తీస్తాడు. అంతేకాదు. ఈనాడు దొంగలు, దోపిడీదారులు, పనిదొంగలు, మోసగాళ్ళు, దుర్మార్గులు, జేబుదొంగలు, విశ్వాసఘాతకులు ఎంతోమంది వున్నారు. అంచేత పేదవాళ్లని, ఇబ్బందుల్లో వున్నవాళ్లని గుర్తించడం కష్టంగా వుంది. కనుకనే భగవంతుడికి భోగం చెల్లించి అతని ఆత్మని శాంతింపజేస్తే లోకంలో వుండే దుఃఖితుల, దరిద్రుల ఆత్మలకు శాంతి లభిస్తుంది. మీరు మహాభారత కథని చదివే వుంటారు. పాండవుల అక్షయపాత్రలో మిగిలిన అన్నం మెతుకుని శ్రీకృష్ణుడు తినగానే అసంఖ్యాకమైన బ్రాహ్మణుల ఆత్మలకు తృప్తి కలిగింది. వాళ్ళ కడుపులు నిండి, ఆకలి తీరింది. మీరు పురాణాలు చదవరనిపిస్తోంది'' అంటూ ఆత్మానందంతో నవ్వింది.

స్నేహలత ఆలోచనలో పడింది. శాస్త్రానికి సంబంధించిన తన దృష్టిని భాగ్యవతి దృష్టితో పోలిస్తే విరుద్ధంగా కనిపిస్తోంది. మానవుడి ఆత్మకి తృప్తిని కలిగిస్తే భగవంతుడు తృప్తిపడతాడు అనేది తన నమ్మకం. ఎవరు తప్పో, ఎవరు ఒప్పో ఆలోచిస్తూ స్నేహలత ద్వంద్వంలో పడిపోయింది. అంతేగాని ఏ ఒక్కరి ధర్మపరాయణతలోని లోపాల్నీ చూపించే మాటలాడదు. ప్రశ్నలూ వేయదు. మానవుడ్ని కాదని, అతన్ని దూరం చేసుకొని ఏ వ్యక్తి అయినా భగవంతుడి సాన్నిధ్యాన్ని చేరుకోగలడా అని ఆమె ఆలోచిస్తోంది.

పొరుగున ఉన్న మహానుభావులు కొన్నాళ్ళకు పల్లెనుంచి ఒకబ్బాయిని నౌకరుగా తీసుకువచ్చేరు- ఇంట్లో పనులు చేయించుకోడానికి. స్వజాతీయుడే అయినప్పటికీ ఆ అబ్బాయిని ఇంటి లోపలికి రానీయరు. ఎంతసేపూ బయటే పనులు చేస్తాడు. వరండాలో తింటాడు. అక్కడే నిద్రపోతాడు. అయ్యగారు తన భార్యాబిడ్డల్ని తీసుకొని సర్కారు వారి పనిమీద టూర్లు వెళ్లేటప్పుడు ఇంట్లోవున్న కుక్కల్ని ఎవరు చూస్తారు? కేవలం వాటికోసమే ఆ అబ్బాయిని తీసుకువచ్చేరు. అయినా వాళ్ళ మనస్సుల్లో ఆ అబ్బాయి మీద సందేహమే. 'కుక్కలకి పెట్టమని ఇచ్చిన గుడ్లు, పాలు వగైరా వాటికి పెట్టకుండా ఈ అబ్బాయే తినేస్తాడేమో. దేవుడికి పెట్టిన ప్రసాదం ఎవరికీ తెలియకుండా తీసుకొని మింగేస్తాడేమో' అని. వీళ్ళు కేంప్‌లో ఉన్నన్నాళ్ళూ భగవంతుడికి భోగం ఉండదు. సాయంకాలం మాత్రం అగరుబత్తీ వెలిగించమంటారు. కుక్కలు గుడ్లు తినవు, పాలు తాగవు. అయితే అన్నం, రొట్టెలు తింటాయి. ఇంట్లో ప్రతి గదికీ తాళం వేసేశారు. ఈ అబ్బాయిని చూస్తే పాపం మనకి దుఃఖం కలుగుతుంది. పిల్లాడి ముఖం అమాయకంగా వుంటుంది. ఆ ముఖంలో పాపచింతన కనిపించదు. నిర్మలంగా కోమలంగా వుంటాడు. మౌనంగా తన పని తాను చేసుకొంటాడు. ఏ అభ్యంతరమూ పెట్టడు, ఏ ఫిర్యాదూ చేయడు, యంత్రంతో నడిచే బొమ్మలాగ.

స్నేహలత ప్రేమతో ''మంచి పిల్లవాడు. మనలాంటి ఇళ్ళల్లో వుంటే ఆనందంగా, ఆరోగ్యంగా పెరుగుతాడు. పేదవారి ఇంట్లో పుట్టి పాపం కూలీ నాలీ చేసుకోవవలసి వస్తోంది'' అంటుంది.

భాగ్యవతి ముఖం అటు తిప్పుకుని ''హుఁ, ఏం మంచో. వీళ్ళు మంచిగా వుంటారా! పూర్వజన్మలో చేసుకొన్న పాప ఫలితంగా పేదవాళ్ళుగా పుడతారు. కొందరు పేదవారింట్లోను మరికొందరు ధనవంతుల ఇంట్లోను ఎందుకు పుడతారంటారు? ఇదంతా పూర్వజన్మలో చేసుకున్న కర్మఫలమే. మీరు శాస్త్రాలు చదవరు కాబోలు. గత జన్మలో పాపాత్ములైన వాళ్ళు ఈ జన్మలో ఎన్నడైనా బాగుపడతారా? అంచేతనే నేను వీళ్ళని ఇంటి లోపలికి అడుగు పెట్టనివ్వను. వీళ్ళంతా మూగదయ్యాలు. ఎప్పుడు దెబ్బకొట్టి పారిపోతారో ఎవరు చెప్పగలరు?'' ముఖంమీదికి తిరస్కార భావం, అసహ్యం తెచ్చుకొని అంది.

''పోరా, అటుపో. ఇక్కడ నిల్చొని ఏమిటి వింటావు?'' అంటూ భాగ్యవతి ఆ పిల్లాడ్ని కసురుకుంది.

* * *

ఆవేళ శివరాత్రి. దేవాలయంలో భక్తులు ఎంతో ఎక్కువగా ఉన్నారు. దైవదర్శనం కోసం భక్తులు బారులు తీరి నిల్చున్నారు. స్నేహలతకి ఆ క్యూలో ఇంక నిల్చోడానికి ఓపిక నశించింది. కాళ్ళు నొప్పి పెడుతున్నాయి. ఆ జనంలో వూపిరి సలపకుండా వుంది. అలా ఎంతోకాలం గడిచింది. ఇంతలో ఇంటి వద్ద పూజాది కార్యక్రమాలు పూర్తి చేసుకొని పట్టుచీర కట్టుకొన్న భాగ్యవతి దేవాలయానికి వచ్చింది. ఆమెతో ఆమె భర్త కూడా పట్టుధోవతి కట్టుకొని వచ్చాడు. వీళ్ళని చూడగానే నున్నగా గుండులా మెరుస్తూన్న తెల్లని బ్రాహ్మణుడు దైవదర్శనానికి వచ్చిన భక్తుల్ని ఇటూ అటూ తోసేస్తూ వీళ్ళిద్దర్నీ లోనికి రాడానికి దారి ఏర్పరిచాడు. వీళ్ళు క్యూలో నిల్చోలేదు. నేరుగా దేవుడి ముందుకి వెళ్ళిపోయేరు. పూజ, అర్చన వగైరా అయ్యాక బహుమతి రూపంలో పూజారి చేతిలో ఓ నోటుపెట్టారు. సగర్వంగా బయటికి వస్తూ క్యూలో నిల్చొని వున్న రవిబాబుని, స్నేహలతని చూసి ''ఇవాళ స్వామి భజన. పెద్ద పెద్ద వాళ్ళంతా వస్తారు'' అన్నారు.

''తమవంటి ధర్మాత్ముల్ని లైన్‌లో నిల్చోబెట్టి ధర్మ కార్యానికి ఆటంకమవుతానా?'' అన్నాడు పూజారి.

పిల్లలకి వార్షిక పరీక్షలొచ్చాయి. ఇటు చూస్తే ఈ మహానుభావులు తీర్థయాత్రలకు సపరివారంగా బయలుదేరారు. స్నేహలత అడిగింది, ''పిల్లలికి పరీక్షలు గదా''

భాగ్యవతి గళం పొంగించి అంది, ''హెడ్మాస్టరు మా పిల్లలకి ట్యూషన్‌ చెబుతున్నారు. అతను పరీక్ష తేదీని పొడిగించారు. యాత్ర సందర్భంగా ఏవేవో వస్తువులు కొనమని మాకొక లిస్టు ఇచ్చేరు''.

మిగతా పిల్లల తల్లిదండ్రులు పరీక్ష తేదీల మార్పు గురించి హెడ్మాష్టర్ని అడిగితే ''ఒక వ్యక్తి ధర్మాన్ని ఆర్జించడానికి వెళ్తున్నాడు. అతన్ని ఆటంకపరిచి నేను పాపాన్ని మూట కట్టుకుంటానా? తీర్థయాత్రలకు వెళ్ళగలిగే అదృష్టం, భాగ్యం నాకెలాగూ లేవు. ఎవరో వెళ్తే వెళ్ళనీ. తీర్థప్రదేశాల పవిత్ర జలం, మట్టి నాకు వారి ద్వారా లభిస్తాయి గదా. అయినా మూడు, నాలుగు తరగతుల పిల్లల పరీక్షలే కదా. ఒకటి రెండురోజులు ఆలస్యంగా జరిగి నంత మాత్రాన ఉద్యోగాలు పోవడానికి, ఇవేమైనా ఇంటర్వ్యూలా?''అని ఎదురు ప్రశ్నించాడు.దీన్ని ఓ పద్ధతిలో అర్థం చేసు కొన్న తల్లిదండ్రులు మరింకేమీ అనలేదు.

ఇంటిని కాపలాకాసే బాధ్యత దేవుడు, నౌకరు, కుక్కలమీద పడింది. తీర్థయాత్రకు ఏడురోజులు పట్టింది. బళ్ళు, బస్సుల ప్రయాణాల గురించి ఎవరు చెప్పగలరు. నాలుగురోజులనుంచి వర్షాలు పడుతున్నాయి. నౌకరుకి మూడురోజులకు మాత్రమే తిండి ఏర్పాట్లు చేసింది. మూడురోజులు గడిచాక పిండి మిగిలితే రొట్టెలు చేసి కుక్కలకి పెట్టేడు. బొప్పాయి చెట్టు నుంచి పళ్ళు తీసుకొని కడుపు నింపుకొన్నాడు. ప్రతి సాయంకాలం తుపాను వర్షం. అటు నౌకరుకి జ్వరం. లేవడానిక్కూడా వాడికి శక్తిలేదు. దానికితోడు వరండాలో పడి ఉండడం. ఈ అబ్బాయి విషయం ఎవరికి తెలుస్తుంది? ఇరుగు పొరుగువాళ్ళు ఎవరి వ్యాపకాలలో వారు మునిగి ఉన్నారు. అయినా వీళ్ళు యాత్రకి బయలుదేరి వెళ్తూన్నప్పుడు ఎవ్వరితోనూ చెప్పి వెళ్ళలేదు. ఈ మహానుభావులు తీర్థభ్రమణం చేసి, పాపాల్ని విసర్జించి పుణ్యాన్ని ఆర్జించిన తర్వాత ఇంటికి తిరిగివచ్చా రు. నౌకరు కుర్రవాడ్ని తెలివి తప్పివున్న పరిస్థితిలో హాస్పిటల్‌కి తీసుకువెళ్లారు. వంట పాత్రలో ఉడకబెట్టిన బొప్పాయికాయ ముక్కలున్నాయి.

భాగ్యవతి ''లోభం వలన పాపం, పాపం వలన మృత్యువు లభిస్తాయి. కుక్కలకి తినడానికి పెట్టకుండా వాడే తినేశాడు. కప్పకి నెయ్యి ఇముడుతుందా?'' అంది.

మూడురోజుల తర్వాత ఆ పిల్లవాడు హాస్పిటల్లో చనిపోయాడు. లోభం వలన మృత్యువు వస్తుందనేది నిజం. ఈ విషయంలో ఎవరికీ సందేహం ఉండదు. కాని 'నియమం తప్పినందువల్ల నౌకరు పిల్లవాడు చనిపోయాడు' అనే విషయాన్ని ఈ ధర్మాత్ములకు వ్యతిరేకంగా ఎవరు చెప్పగలరు? మీదుమిక్కిలి ఇంటిలో జరగరానిది జరిగినందువల్ల భారీగా, జోరుగా భజనకీర్తనలు జరిగాయి. ఎందుకంటే భగవంతుడి నామాన్ని ఉచ్ఛరించగానే పాపాలన్నీ పటాపంచలవుతాయి.

'పాపాత్ముడు కూడా చేయలేనన్ని పాపాలు కృష్ణుని నామస్మరణతో నాశనమవుతాయి'- ఈ విషయం ఎవరికి తెలియదు? ఈ నౌకరు పిల్లవాని అకాల మృత్యువువలన సుయోగ్యబాబు పరోక్షంగా పాపంలో భాగస్వామి అయినా సరే, కృష్ణనామ సంకీర్తనతో ఆపాపం అతని నుంచి దూరమవుతుంది. పాపనాశక మహాఔషధాన్ని గురించి తెలిసిన జ్ఞాని పాపానికి భయపడతాడా? నౌకరు ఆత్మకి సద్గతి కలగడం కోసం సుయోగ్యబాబు చేసిన నామ సంకీర్తన ధర్మాత్మునిగా అతనికి మరింత ప్రతిష్టని చేకూర్చింది.

స్నేహలత ద్వంద్వంలో పడి ఆలోచించనారంభించింది. ఇతడేగాని ధర్మాత్ముడనిపించుకొంటే ఇతన్ని 'ధర్మాత్ముడు' అనేవాళ్ళని 'భ్రమాత్ములు' అనాలేమో. ధర్మాత్ముడికి భ్రమాత్ముడికి మధ్య భేదం ఉందా లేదా అనేది స్నేహలతకి అర్థం కాకుండా ఉంది. ఈ సందేహాన్ని నివృత్తి చేసుకొనేందుకామె గురువును అన్వేషించడంలో పడింది.

ఒక సంఘటన ఉర్దూ కథ

''క్యాంపస్‌ అంతటా హఠాత్తుగా ఈ మృత్యు వాతావరణమేమిటి?'' బస్సు దిగిన మరుక్షణం స్నేహితురాల్ని అడిగిందామె.

''ఏమిటి?! నీకు తెలియదా...?''

వాతావరణమంతా గంభీరంగా కనిపిస్తోంది.

''తెలీదు''

''నిన్న తసనీమ్‌ అహరబర్‌ నీటి ప్రవాహంలో పడి కొట్టుకుపోయింది''

చూస్తూ వుండగానే స్నేహితురాళ్లిద్దరూ క్యాంపస్‌ మధ్యలో మూర్తీభవించిన శోకమూర్తులయిపోయారు. తొలి యువతి కళ్లు అందమైన యూనివర్సిటీ సెంట్రల్‌ బ్లాక్‌లో తసనీమ్‌ కోసం వెదకసాగాయి. 'ఆమె అక్కడెక్కడో దాక్కున్నదా?' అన్నట్టుగా-

ఏడాది క్రితం తసనీమ్‌ మంచి మార్కులతో ఎం.ఎ. పాసై, 'ఉర్దూ సాహిత్యంలో స్త్రీల స్థానం' అనే అంశంపై రీసెర్చ్‌ చేస్తోంది.

''ఇంత సౌందర్యరాశి, కల్లాకపటం లేని ప్రతిభాశాలి అయిన ఈమెను ఆ దేవుడు ఇంత చప్పున తన దగ్గరికి ఎందుకు పిలిపించేసుకున్నాడో! ఒక్కోసారి అతని న్యాయం మీద సందేహం కలుగుతూ వుంటుంది'' అంది మొదటి అమ్మాయి. ఆమె కళ్లలో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి.

''ఈ చిక్కుముడులనే మనిషి విప్పలేకపోతున్నాడు! ఆ పైవాడి దగ్గర అంతా చీకటే తప్ప మరేంలేదని నాకు అనిపిస్తూ వుంటుంది''

''పూర్‌ గర్ల్‌...! ఎన్ని కలలు... ఎన్ని కలలు కంటూ వచ్చిందో! 'ఇప్పుడిది చేస్తాను... తర్వాత అది చేస్తాను. సమాజాన్ని పతనం నుంచి బయటపడెయ్యటానికి నేను యుద్ధం చేస్తాను. స్త్రీ విముక్తి కోసం నా జీవిత సర్వస్వాన్ని ధారబోస్తాను. నైతిక విలువలను పునరుద్ధరించేందుకు నడుం బిగిస్తాను....' ఆమె మాటలు వింటూంటే తాను విధాత దగ్గర్నుంచి దీర్ఘాయుష్షుని రాయించుకువచ్చిందా? అన్నట్టుగా అనిపించేది... ఇప్పుడు చూడు... షీ యీజ్‌ నోమోర్‌...!''

దాల్‌ సరస్సు ఒడ్డునున్న హజరత్‌బల్‌ దర్గాని ఆనుకొని, ఎన్నో ఎకరాలలో వ్యాపించిన ఆపిల్‌ చెట్ల సముదాయంతో ఉన్న యీ విశాలమయిన క్యాంపస్‌ ఈవేళ ఎంతో మౌనంగా వుంది. సాధారణంగా ఏప్రిల్‌- మే నెలల్లో ఆపిల్‌ చెట్ల కొమ్మలు పళ్లతో వంగి ఉన్నప్పుడు క్యాంపస్‌ అంతటా ఉల్లాసభరిత వాతావరణం వ్యాపించి వుండేది. ఆ ప్రకృతి సౌందర్యానికి వసపిట్టల్లా వదరుతూ, గోలగోలచేస్తూ ఆ అందాలరాశులు మరింత వన్నె చేకూర్చేవారు. చాలా తడవలు, ఎయిర్‌ఫోర్స్‌కి చెందిన ఎవరో ఒక ఉత్సాహవంతుడయిన పైలట్‌ తన హెలికాప్టర్‌తో ఈ అందమైన సుందరాంగుల తలల మీద నుంచి పల్టీలు కొడుతూ ఆనందించేవాడు. అయితే ఈనాటి వాతావరణమే పూర్తిగా మారిపోయింది. క్యాంపస్‌ అంతా వల్లకాడులా మారిపోయినట్టు అనిపించసాగింది.

''యా ఖుదా! పాపం! ఆ రిజవాన్‌ మనసు ఎంతలా అల్లకల్లోలమయిపోయి వుంటుందో గదా! అతనికి తసనీమ్‌ అంటే పంచప్రాణాలు''అంది తొలి యువతి మళ్లీ.

''అదేమిటీ! అతను ఆమెతోనే వున్నాడుగదా! కింకర్తవ్య విమూఢునిలా చూస్తూ వున్నాడే తప్ప, ఏమీ చేయలేదు. హూఁ! గొప్ప అథ్లెట్‌! గత ఏడాది ఈత పోటీలో బహుమతి గెలుచుకున్నాడు... నీటి ప్రవాహంలో తసనీమ్‌ మునుగుతూ, తేలుతూ, కాళ్లూ చేతులూ కొట్టుకుంటుంటే, అతను చూస్తూ వున్నాడు. అలా చూస్తూనే నిలుచున్నాడు ఏమీ చేయకుండా!'' రెండో అమ్మాయి ఆవేశంతో చెప్పుకొచ్చింది జరిగిన సంఘటన గురించి.

''నిన్న నా ఒంట్లో బాగోక, నేను పిక్నిక్‌కి రాలేకపోయాను. నువ్వు చూశావుకదా, నీ కళ్లతో సంఘటనంతట్నీ?''

''ఆఁ! నేను వెళ్లేను! ఈ పాపిష్టి కళ్లతోనే అంతా చూసేను'' రెండో యువతి కంఠం రుద్ధమయ్యింది.

''విధిరాత ఎవరు తప్పించగలరు? బహుశా ఇది దైవేచ్ఛ కావచ్చు!'' తొలియువతి ఓదార్పుగా అంది. మొత్తం ఈ విషాద సంఘటన గురించి క్షుణ్ణంగా తెలుసుకోవాలనే తపన ఆమె కళ్లలో ద్యోతకం కాసాగింది. రెండో యువతికి అర్థమయిపోయింది. మనసు చిక్కబట్టుకొని, జరిగిన సంఘటనంతా వివరించింది.

''ఉదయం ఎనిమిదింటికి మేమంతా ఎక్స్‌ఛేంజ్‌ స్క్వేర్‌ నుంచి యూనివర్సిటీ బస్సుల్లో ప్రయాణమయ్యాం. స్టూడెంట్స్‌ అందరూ ఉదయాకాశంలో ఎగిరే పక్షుల్లా ఒకటే పకపకలూ, వికవికలూ. బస్సులు ఒక దానివెంట ఒకటి పరుగులు తీస్తున్నాయి. ఒకరితో ఒకరం మాటాడుకుందామన్నా ఒకరి కంఠం ఒకరికి వినబడని పరిస్థితి. అలవాటు ప్రకారం తసనీమ్‌ తన హేండ్‌బ్యాగ్‌ తెరిచి, ఇంగ్లీషు నవలని బయటికి తీసి చదవబోయింది. ఇంతలో రిజవాన్‌ వచ్చి తసనీమ్‌ పక్కన కూచున్నాడు. ఆమె చేతిలో పుస్తకం చూసి చికాకు పడ్డాడు. ఆవేళ ఆమెతో సంతృప్తిగా మాట్లాడాలనుకున్నాడు. తసనీమ్‌ చూస్తే తన ధోరణిలో తాను వుంది. అతను పెంకితనానికి దిగాడు.

''తసనీమ్‌ ఎప్పుడు చూసినా పుస్తకమేనా! ఇది చదువుకునే సమయమా? కనీసం ఈవేళైనా నవలని బ్యాగ్‌లో వుండనియ్‌''

ఆమె పెదాలమీద చిరునవ్వు లాస్యం చేసింది. రిజవాన్‌ అభిప్రాయాన్ని గౌరవించటానికా అన్నట్టు, ఆమె చదువుతున్న నవలని మూసేసి బ్యాగ్‌లో పెట్టేసింది.

''ఆఁ! ఏం చెబుతున్నారు?''

''గత ఆదివారం నువ్వు బహుమతుల ప్రదానోత్సవానికి రాలేదేం?''

''నాకేమయినా బహుమతి ఇస్తారా? అలాంటప్పుడు అక్కడికి నేను వచ్చి చేసేదేమిటి?ఐ హావ్‌ నో ఇంటరెస్ట్‌ ఇన్‌ అథ్లె టిక్స్‌! ఆవేళ ఏమయినా ప్రత్యేకత జరిగిందా?'' ఆమె ఏమీ ఎరుగని దానిలా అడిగింది అతణ్ణి.

''నీకు బహుమతి రాలేదు. నిజమే! ఇతరులను ప్రోత్సహించటానికైనా రావచ్చుగదా. ఈ ఏడాది కూడా నాకు మూడు బహుమతులు లభించేయి - రెండు ఈతలోనూ, ఇంకోటి లాంగ్‌ జంప్‌లోనూ''

''అవి కూడా కంచువిగదా! ఏ రోడ్డు సైడు దుకాణంలోనో కారుచౌకకి కొని తెచ్చివుంటారు'' అందామె వెటకారంగా.

''బంగారు పతకాలు లభించలేదనుకుంటున్నావా? నేను వాటికి అనర్హుణ్ణనుకుంటున్నావా?''

''అబ్బే! కాదు... కాదు! నీకు కోపం వచ్చినట్టుంది. నేను వూరికినే అన్నాను. నువ్వు బంగారు పతకాలు గెలుచుకున్న విషయం నాకేం తెలుసు?''

''తసనీమ్‌ నిజం చెప్పాలంటే... ఒక లోటు నిజంగానే నన్ను బాధపెట్టింది. అది అభినందించేవారు లేకపోవడం''

''అలాగేం! అయితే నువ్వు ఏ రాజకీయ మిత్రుడికో చెప్పి వుండాల్సింది - అతను ఆవేళకి రెండు, మూడు ట్రక్కుల్లో చప్పట్లు కొట్టేవారిని పంపించి వుండేవాడు''

''అంతెందుకు, రిజవాన్‌ మాకు కబురు పెట్టి వుంటే, మేం ఏ డబ్బూ అవసరం లేకుండానే వచ్చేసేవాళ్లం'' పక్క సీటులో కూచున్న శల్కా నవ్వుతూ అంది.

ఎదురు సీటులో కూచున్న రోశీ, శల్కా మాటని ఖండిస్తూ అంది, ''శల్కా! ఎవరి మాటల్లో కొట్టుకుపోతున్నావ్‌. రిజవాన్‌కి సాగితే మనచేత చప్పట్లూ కొట్టించేవాడు, పేమెంటూ ఇప్పించేవాడు.''

ఆమె మాటకి అందరూ పకపకమని నవ్వేశారు. రోశీ రిజవాన్‌ని ఎంతగానో ప్రేమిస్తోంది. రిజవాన్‌ మాత్రం ఆమెవేపు కన్నెత్తయినా చూడడు. మనసులో ఆమె ఉడుక్కుంటుంది. అడపాదడపా అయిష్టంగానైనా అతణ్ణి తిట్టుకుంటుంది.

బస్సులు పాంపూర్‌ చేరగానే గానాబజానా ప్రారంభమయింది. విద్యార్థినీ విద్యార్థుల్లో ఎక్కువ మంది తమ కళలను పరిచయం చేయసాగారు. మహమ్మద్‌ రఫీ, మన్నా డే, కిశోర్‌, లతా, ఆశాభోన్‌స్లే- అందరూ సిద్ధమయ్యారు. మేం మాత్రం చప్పట్లు చరుస్తున్నాం. బస్సులు అన్నీ గోల! గోల!

ఇంతలో సోమనాథ్‌ లేచి నిలబడి, గొంతు చించుకొని అరిచాడు. ''భాయీ! కాస్సేపు మౌనంగా వుండండి. నేను చెణుకులు విసురుతాను''

అంతా పకపకలతో అతనికి స్వాగతం పలికారు. అతని రూపం జోకర్‌ రూపంలా ఉంటుంది. బాగా పొట్టిగా వుంటాడు. పెద్ద పొట్టా, వాడూను. లోతుకుపోయిన కళ్లు. వాటి మీద గుండ్రని ఫ్రేమ్‌ కళ్లజోడు. నూనె వోడుతున్న తల వెంట్రుకలు- అతని వాలకం చూస్తుంటే ఏ పద్దెనిమిదో శతాబ్దపు పురోహితుడో కాడు గదా అనిపిస్తుంటుంది.

మొదటి చెణుకు విసిరాడు సోమనాథ్‌.

బస్సులో పెద్ద పెట్టున నవ్వులు.

రెండో చెణుకు

మళ్లీ పకపకలు...

మూడో చెణుకు

తిరిగి పకపకలు...

ఆ తర్వాత అతను వెళ్లి తన సీటులో కూచున్నాడు.

కొద్ది క్షణాల్లో ఆ మితభాషి అయిన యువకుడు వాతావరణమంతా పకపకలమయం చేసేశాడు. కొంతమంది ప్రపంచమంతటిలో చిరునవ్వులు పండించటానికే పుట్టారనిపిస్తుంది. దానికోసం వారేమైనా చేస్తారు.

పన్నెండింటికి బస్సులు అహర్‌బల్‌కి చేరుకున్నాయి. స్టూడెంట్స్‌ అంతా తమ తమ టిఫిన్‌ కారేజీలు, పేకెట్లూ తీసుకొని బస్సులు దిగారు. జలపాతానికి కాస్త దూరంగా చిన్న చిన్న గుంపులుగా విడిపోయి, గడ్డిలో కూచున్నారు.

జలపాతాన్ని చూసినవారెవరికైనా గుండెలు గుబగుబలాడతాయి. ఆకాశమంత ఎత్తు నుంచి కిందకి పడుతున్న జలరాశి ఒక పెద్ద దుప్పటిలా తెల్లటి నురగ వ్యాపింపచేయసాగింది. పార్శ్వంలో నీలాకాశం, మంచు కప్పిన పర్వతశ్రేణులు దర్శనమిస్తున్నాయి. ఎత్తు నుంచి కిందకి ధారగా నీరు పడటం వల్ల ఆర్కెస్ట్రా వాయిద్యాలన్నీ ఒక్కసారిగా వినిపిస్తున్నట్లుగా పెద్ద శబ్దం వినిపిస్తోంది.

మొదట టిఫిన్లు, టీలు ముగించుకున్నారు. తర్వాత ఆటలూపాటలూ, నాట్యం చేయడాలూ, పాటలు అందుకోవడాలూ, చివరిగా లంచ్‌. మాంసాహారంలో పలురకాలు ఒకవేపు. శాకాహారం వేరొక వేపు. అన్నీ పరిచివున్నాయి.

అక్కడ అన్నీ- అంతా పంచుకొని తిన్నారు. ఆ దృశ్యాన్ని చూసిన వాళ్లెవరయినా, మనిషి వర్గాలుగా, జాతులుగా విడిపోయాడని చెప్పలేడు, నమ్మలేడు.

కాసేపు విశ్రాంతి. అనంతరం సినీ గీతాలు, లలిత గీతాలు పాడుకోసాగారు. రోశీ షకీల్‌ రాసిన రెండు గజల్స్‌ వినిపించింది. తసనీమ్‌ జిగర్‌ మలిపోఖాదీ రాసిన అద్భుతమయిన ఓ గజల్‌ పాడింది. మరి కొందరు యువతీ, యువకులు కూడా పాటలు పాడేరు. అయితే విచిత్రమేమిటంటే, అన్ని పాటలు విషాద భరితమయినవే! ఎందుకో చెప్పలేను, నా మనసులో ఏదో తెలీని భయం పీకుతోంది. ఇంతకీ అంతమందీ ఎందుకిలా హృదయ విదారకమైన పాటలు, గజల్స్‌ పాడుతున్నారు. వీరు నవ్వించే, కేరింతలు కొట్టించే గీతాలు పాడరాదా.

'సంతోషం విషాదానికి రెండో పార్శ్వం. వాస్తవానికి విషాదమే జీవిత యధార్థం. అటువంటపుడు ఈవాస్తవ పరిస్థితి నుంచి మనం పారిపోవడం ఎలా?' అంటూ నా మనసు నాకు ఎదురు చెబుతోంది.

'ఆనందోల్లాసాలతో గడపాల్సిన క్షణాలని ఎందుకు మనం విషాదభరితం చేసుకుంటామో గదా' నాలో నేనే ప్రశ్నించుకోసాగాను.

''ఈ మనసుల్ని పిండే విషాద గీతాల్లోని మధుర సంగీతమే మనకి అసలైన సంతోషాన్ని కలిగిస్తుంది. అందుకే మనం యీ సంగీతం కోసం అన్వేషిస్తూ ఉంటాం'' నా మనసులోంచి వినిపించిందో కంఠం.

నెమ్మది నెమ్మదిగా సూర్యుడు పశ్చిమానికి సాగిపోతున్నాడు. చినార్‌ వృక్షాల నీడలు నేల నలుచెరుగులకూ విస్తరిస్తున్నాయి. జలపాతం నుంచి పడుతున్న నీళ్లు పల్చని నీలం రంగుని సంతరించుకున్నాయి. విద్యార్థులంతా చల్లని నీటిలో పాదాలను ముంచి, వువ్వెత్తున లేచి పడ్తున్న అలల్ని చేతులతో కొడుతూ, ఒకరి మీదికొకరు నీళ్లు చల్లుకుంటున్నారు. చాలామంది తీవ్రంగా ప్రవహించే నీటిని లెక్క చేయకుండానే దగ్గర్లో రాళ్ల మీద కప్పలకి మల్లే కుప్పిగంతులు వేస్తున్నారు''

మాట్లాడుతున్న స్నేహితురాలు ఒక్కసారిగా మౌనంవహించింది... తర్వాత సంఘటనని ఎలా చెప్పాలా అని మధనపడసాగింది. మాటలు ఆమె గొంతులో చిక్కుకుపోయాయి. కళ్లలోంచి అశ్రువులు ధారాపాతమయ్యాయి. చివరికి మనసు చిక్కబరచుకొంది-

''ఇంతలో ఎక్కడనుంచో ఓ ఆర్తనాదం వినిపించింది. దానితోపాటుగా లెక్క లేనన్ని గొంతులు అరిచాయి.''

''రక్షించండి...! రక్షించండి...! రక్షించండి...!'' అక్కడకి వచ్చిన వారందరూ ఒకరి మొహాలు ఒకరు చూసుకోసాగారు. అందరి కళ్లల్లోనూ కొట్టవచ్చినట్టు తాండవిస్తున్న నైరాశ్యం.

ప్రవాహ ఉద్ధృతికి తసనీమ్‌ కొట్టుకుపోసాగింది.ఆ అభాగ్యురాలు రెండు చేతులూ పైకెత్తి సాయం చెయ్యమని అభ్యర్థిస్తోంది. నీటి ప్రవాహంలో కొట్టుకొనిపోతూ ఏమీమాట్లాడలేని స్థితిలో వుంది.

రోశీ బితుకుబితుకుమంటూ రిజవాన్‌ వేపే చూడసాగింది.ఒక్కరొక్కరుగా యువ కులంతా నది వొడ్డున మౌనంగా నిలబడ్డారు తప్ప, ఏమీ చేయటంలేదు.

హఠాత్తుగా నీటిలో దబ్బున ఏదో పడిన శబ్దమయింది!

సోమనాథ్‌ నదిలోకి దూకి, తసనీమ్‌ దగ్గరికి చేరే ప్రయత్నం చేశాడు. బిడియస్తుడైన అతడు జీలం నది ఒడ్డున ఈత నేర్చుకున్నాడు. అంతేగాని, నది మధ్యలో ఈదే సాహసం ఎన్నడూ చేయలేదు. అలాంటిది ఈనాడు అలలతో పోరాడుతున్నాడు.

చివరికి సోమనాథ్‌ తసనీమ్‌ వేలు దొరకపుచ్చుకున్నాడు. ఆమె చెయ్యి అందుకొనే ప్రయత్నం చేయసాగాడు. ఇద్దరూ ప్రవాహంలో కొట్టుకుపోతున్నారు. తిరిగి ఇద్దరూ విడిపోయారు.

అయినా అతను ధైర్యం కోల్పోలేదు. ఈదుకుంటూ తిరిగి తసనీమ్‌ వేపు వెళ్లే ప్రయత్నం చేశాడు. చివరికి ఆమె దగ్గర కు వెళ్లి, ఆమె ఎడమ భుజం గట్టిగా పట్టుకున్నాడు. తసనీమ్‌లో శక్తి లేకపోయింది. అప్పటికే ఆమె నీళ్లు తాగెయ్యడం వల్ల బరువెక్కిపోయింది. సోమనాథ్‌ శక్తినంతట్నీ ఉపయోగించి, తసనీమ్‌ నడుము పట్టుకోవడానికి ప్రయత్నం చేశాడు. ఇంతలో ఉవ్వెత్తున అల వచ్చింది. ఎదురుగా మొసలికి మల్లే పెద్ద సుడిగుండం. ఇద్దరూ ఆ సుడిగుండంలో చిక్కుకొని మునిగిపోయారు.

* * *

ఇద్దరు స్నేహితురాళ్లూ ఆర్ట్స్‌ బ్లాక్‌ దగ్గరకి వచ్చేశారు. అప్పటికే అక్కడకి విద్యార్థులూ, అధ్యాపకులూ అంతా చేరుకున్నారు. చాలామంది ఆ ఇరువురికీ శ్రద్ధాంజలి ఘటించారు. ఆ భయంకరమైన దృశ్యాన్ని ప్రత్యక్షంగా చూసిన వారి కళ్లలో ఇంకా కన్నీరు కారుతోంది. మాట్లాడుతున్న వారి కంఠాలు తడార్చుకుపోయాయి. ఇంతలో అడ్మినిస్ట్రేషన్‌ విభాగానికి చెందిన ఓ యూనియన్‌ లీడరు- విశ్వంభరనాథ్‌ స్టేజీపైకి వచ్చాడు- అతడు ఈ దుర్ఘటన గురించి కేవలం విని వున్నాడు. కళ్లతో చూసింది లేదు. అయినా అతను అక్కడికి వచ్చి తాను తన కళ్లతో చూసినట్టుగా- ఆ సంఘటనని వర్ణించసాగాడు.

అతని కళ్లు చెమ్మగిల్లాయి. అతని మాటలు విని శ్రోతల మొహాల్లో విషాదం తాండవించసాగింది.మాట్లాడుతూ, మాట్లా డుతూ అతను వాక్ప్రవాహంలో కొట్టుకుపోసాగాడు. అతనిలోని మానవీయ భావాల మీద అతని యూనియన్‌ లీడర్‌షిప్పే విజయం సాధించింది. 'సోమనాథ్‌ చేసిన ఈ మహా బలిదానం ధర్మనిరపేక్షతకి సజీవమైన ఉదాహరణ' అనే మాటలు అతడి నోటివెంట వెలువడి నలువైపులా ప్రతిధ్వనించాయి! ఆ మాటలు శ్రోతల్లో విచిత్రమయిన అశాంతిని నెలకొల్పింది. నాకయితే, 'ఆ ఇరువురి ఆత్మలకీ ఇదొక పచ్చి బూతు తిట్టు' అనిపించసాగింది.

'సోమనాథ్‌ ధర్మనిరపేక్షతకి ఓ ఉదాహరణగా నిలిచేందుకే తన జీవితాన్ని త్యాగం చేశాడు' అన్న మాట నాకు మింగుడు పడటంలేదు. అతను ఓ క్షణంలో ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకోగలడు? అతను ఓ యువతి అలల్లో కొట్టుకుపోవడం చూసి, తనని తాను నిలువరించుకోలేకపోయాడు.వెంటనే నదిలోకి దూకాడు. యూనియన్‌ లీడరు కంఠస్వరం బల్లెంలా పవిత్రమైన ఆత్మల్ని గాయం చేసింది.

కానుకలు హిందీ కథ

'నా మిత్రుడు శ్యామ్‌లాల్‌ కానుక ఇది. తనను మరచిపోకుండా ఉండటానికని దీనినెప్పుడూ వేలికి పెట్టుకొమ్మని చెప్పాడు. తన వేలికున్న ఉంగరాన్ని అందరికీ చూపిస్తూ అన్నాడు దేవేంద్ర.

పరమేశ్వర్‌ ఆ ఉంగరం వైపు చూసి నవ్వుతూ అన్నాడు- ''కానుకల ప్రస్తావన వచ్చింది కనుక, మీకు నేనో విచిత్రమైన రసవత్తరమైన యదార్థ గాథ చెప్తాను. నమ్మటం, నమ్మకపోవటం మీ ఇష్టం. నేను చెప్పేదంతా నిజం. ఎందుకంటే ఈ కథలో నా పాత్ర కూడా ఉంది. మీకేం తొందర పనుల్లేవంటే చెబుతాను''

అందరూ ముక్త కంఠంతో 'తొందరేం లేదు, చెప్ప'మని అన్నారు.

పరమేశ్వర్‌ మొదలుపెట్టాడు-

''రెండేళ్ల నాటి సంగతి. మా కంపెనీ బ్రాంచి మేనేజర్‌గా ఢిల్లీ వెళ్లాను. మా బంగళా పక్కన ఒక కాటేజీ ఉంది. అందులో ఒకామె ఉంటోంది. పేరు యామినీదేవి. ఏదో స్కూల్లో ప్రధానాధ్యాపకురాలిగా పనిచేస్తోంది.

సాయంకాలం నేను వాహ్యాళి కెళ్ళినపుడు కన్పించేది. ఇద్దరి చూపులు కలిసేవికాని పరిచయం లేనందున మాట్లాడుకోలేదు.

ఒకరోజు షికారుగా దగ్గరలో ఉన్న పార్కుకెళ్లాను. అక్కడ ఒక పూలమొక్క దగ్గర యామినీదేవి నిలబడి ఉంది. నన్ను చూస్తూనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. నెమ్మదిగా వెళ్తున్న ఆమెననుసరించాను నేను. మధ్య మధ్యన ఆమె వెనక్కు తిరిగి చూసేది. నడుస్తుండగా ఆమె చేతి రుమాలు పడిపోయింది. పడిపోయిందనే కంటే పడేసింది అనటం సబబు. ఆమె దాన్ని కిందకు జారవిడవడం నేను స్పష్టంగా చూశాను.

ఆ రుమాలు తీసి ఆమెకివ్వటం నా కర్తవ్యం కదా. అలాగే చేశా. చిరునవ్వుతో ఆమె నాకు ధన్యవాదాలు తెలిపింది.

''మీరిక్కడే ఎక్కడో ఉంటున్నట్లున్నారు. మిమ్మల్ని చాలాసార్లు చూశాను''

''ఔనండి మీ పక్క బంగళాలోనే ఉంటున్నాను. ఈమధ్యే ఇక్కడికి వచ్చాను''

''అలాగా! ఐతే మీరు మా పొరుగునే ఉంటున్నారన్నమాట. అంత దగ్గరగా ఉండి కూడా మనిద్దరం అపరిచితులుగా ఉన్నామంటే వింతగా లేదూ?''

''పొరుగు వాళ్లని పరిచయం చేసుకోవాలని అనుకొన్నాను. కొందరు పరిచయమయ్యారు కూడా. కాని ఆడవారని మీ దగ్గరకు రాలేకపోయాను''

యామినీదేవి పకపకా నవ్వింది. ''ఓహో, మీకు ఆడవాళ్లంటే భయమా. నిర్భయంగా మీరు మా యింటికి రావచ్చు. స్త్రీలు అబలలు. సుకుమారులు. వాళ్లంటే భయపడటం హాస్యాస్పదం''

ఆమె తియ్యని నవ్వు, వాక్చాతుర్యం నన్ను ముగ్ధుణ్ణి చేశాయి. నాలుగు పదుల వయసు, సామాన్యమైన రూపం, ఎర్రగా, బొద్దుగా ఉంది. పెద్ద కళ్లు, గుండ్రని మొహం. ప్రింటెడ్‌ జార్జెట్‌ చీర కట్టుకొని ఉంది. మొదటిసారి ఆమెను ఆపాదమస్తకం పరికించి చూశాను. అది గమనించి ఆమె కొద్దిగా సిగ్గుపడి నవ్వుతూ అంది- ''మా ఇంటికెప్పుడొస్తారు?''

''రేపు సాయంత్రం ఐదింటికి వస్తాను. మీరు ఇంట్లోనే ఉంటారుగా?''

''మీరొస్తానంటే ఉంటాను. లేకపోతే రోజూలా షికారుకెళ్తాను''

యామినితో నా స్నేహం హద్దులు దాటింది. నాకు పెళ్లయిందని మీకూ తెలుసు. నా భార్య అందగత్తె. ఇల్లాలిలో లేని వింత ఆకర్షణ ఏదో యామినిలో ఉంది. ప్రతిరోజూ ఆమెను కలుసుకొంటున్నాను. ఒక్కోరోజు రాత్రంతా అక్కడే ఉంటున్నాను.

ఒకరోజు ఉదయం నిద్ర లేచేసరికి కొద్దిగా తలనొప్పనిపించింది. లేచి చూశాను. యామినిగది అది. ఆమె స్నానం చేస్తున్నట్లుంది. రాత్రి చాలాసేపు మేల్కొన్నందున తలనొప్పి వచ్చింది. ఉదయం ఎనిమిది గంటలయింది. డ్రస్సింగ్‌ టేబుల్‌కున్న అద్దం లో మొహం చూసుకొన్నాను. కళ్లు ఎర్రగా ఉన్నాయి. మొహం వాడిపోయి ఉంది.

నా దృష్టి అనుకోకుండా డ్రస్సింగ్‌ టేబుల్‌కంటించి వున్న లేబుల్‌ మీద పడింది. ఇంగ్లీషులో దానిమీద ప్రకాష్‌ అని రాసి ఉంది. ఈ ప్రకాష్‌ ఎవరనుకొంటూనే పక్కనే వున్న యామిని వానిటీ బాక్స్‌ చూశాను. తెరచి చూడాలనిపించింది. ఆడవాళ్ల అలంకరణ సామాగ్రి ఉంది అందులో. దానిలో ఒక మూలన రమేష్‌ అని రాసి ఉన్న కాగితం అంటించి ఉంది. హార్మోనియం వాయించాలనే కోరికతో దాని దగ్గరకెళ్తే దాని కంటించిన చీటీలో ఆత్మారామ్‌ ఉన్నాడు. మౌనంగా డ్రస్‌ వేసుకొని బూట్ల కోసం మంచ కిందకు వంగి చూశాను. మంచం కోడుకు ఇక్బాల్‌ పేరు రాసి ఉన్న చీటీ అంటించి ఉంది.

గదిలో వున్న సామానులు అన్నింటిని పరిశీలనగా చూడ టం ప్రారంభించాను. అన్నిటిమీద చిన్నచిన్న లేబుల్స్‌ అం టించి ఉన్నాయి. వాటి మీద చక్రవర్తి, విలియం, మెహతా, రామనాథ్‌,రామేశ్వర్‌, కాశీరామ్‌ లాంటి ఎన్నో పేర్లున్నాయి.

యామిని స్నానం ముగించుకొని వచ్చింది ''ఇవాళ ఆలస్యంగా లేచారే పరమేశ్వర్‌ గారూ'' అంటూ ఒక నవ్వు నవ్వింది.

''లేచి చాలా సేపయింది. నువ్వు స్నానం చేస్తుండగా నేనొక అనుచితమైన పనిచేశాను. క్షమించు''

ఆమె నా దగ్గరకు వచ్చి ప్రేమగా నా చేయి పట్టుకొని ''మనిద్దరి మధ్య ఈ క్షమాపణలు అవసరమంటారా?'' అనడిగింది.

''ఐనా కోరటం నా విధి. నేనొక విషయం అడుగుతాను. నిజం చెప్తావా?''

''మీతో అబద్ధం చెప్పాల్సిన అవసరం నాకు లేదు''

''కాదు నిజమే చెప్తానని మాటివ్వు''

నా మెడ చుట్టూ చేతులేసి ఊగుతూ, ''మాటిస్తున్నాను'' అంది.

''నీ గదినంతా పూర్తిగా పరిశీలించాను. అలా చేయటం తప్పని తెలుసు. కాని కుతూహలం నన్ను జయించింది. నీ గదిలోని వస్తువులన్నింటి మీద ఒక్కో మగవాడి పేరుతో చీటీలు అంటించి ఉన్నాయి. ఒక్కో వస్తువు మీద ఒక్కో పురుషుడి పేరుంది. ఎంత తల బద్దలు కొట్టుకున్నా ఈ రహస్యాన్ని నేను ఛేదించలేకపోయాను. ఆ రహస్యాన్ని నీవే విప్పాలి''

యామిని కోమల స్వరంతో నవ్వుతూ అంది. ''ఆ రహస్యాన్ని అలాగే ఉండనివ్వండి. మీరు తెలుసుకోకుండా ఉండటమే మంచిది. తెలిస్తే మీకు బాధ కలగొచ్చు. కోపం రావచ్చు''

''నేను బాధపడను. కోపగించుకోను''

యామిని కూర్చుంది. ''పరమేశ్వర్‌ బాబూ! ఈ రహస్యమే నా బలహీనత. ఈ వస్తువులన్నీ నా ప్రేమికులిచ్చిన కానుకలు. నేనొక్కో ప్రేమికుడి నుంచి ఒక్కొక్క వస్తువు మాత్రమే తీసుకున్నాను. ఆ కానుకలు ఎక్కువైపోయి వాళ్ల పేర్లు గుర్తుండటం లేదు. అందుకని వాటిమీద ఆ ప్రేమికుడి పేరుతో చీటీ అంటించాను. ఆ వస్తువు వాడినపుడు ఆ ప్రేమికుడి తాలూకు మధురస్మృతులు మదిలో మెదులుతాయి. నా మనసు చాలా సున్నితం. నేను నా ప్రేమికులను మరిచిపోలేక పోతున్నాను.''

''ఇలా మొత్తం ఎన్ని కానుకలున్నాయి?''

''తొంభై ఏడు''

''అమ్మో, అన్ని కానుకలా!'' అంటూ ఆశ్చర్యంతో అరిచినంత పనిచేశాను.

''ఔను, చాలా ఎక్కువే'' ఆమె స్వరం గంభీరంగా ఉంది. ''పరమేశ్వర్‌ బాబూ, నాకు పెళ్లి కాలేదు. పెళ్లి చేసుకోవాలనే కోరిక నాలో చాలా బలీయంగా ఉండేది. నా జీవితంలోకి అడుగిడిన ప్రతి వ్యక్తీ భవిష్యత్తు పట్ల నాకు ఆశలు కల్పించేవాడు. నేనతణ్ణి నా భర్తగా ఊహించుకొనేదాన్ని. కానీ జరిగింది మరొకటి. ప్రతివాడూ నాకు కానుకనిచ్చేవాడు కాని, భార్యగా స్వీకరించేవాడు కాదు. నేను దానికి అలవాటు పడ్డాను. జీవితం నాకొక ఆటగా మారింది. జీవితం విలాసవంతమైన ఒక ఆట. దాన్ని మనసారా అనుభవించటమే మన కర్తవ్యం. ఇదే నా కథ''

''మామూలు మనుషులకిది బాగుండవచ్చు'' నేను సంకోచిస్తూ అన్నాను.

''మామూలు మనుషులకే కాదు, మీ నంబరు తొంభై ఎనిమిదవుతుంది''యామిని పకపకా నవ్వుతూ అంది.

మిత్రులారా! అప్పుడు నేనొక దార్శనికుడిగా మారాను. వేదాంతానికీ నాకూ చుక్కెదురు. ఆమె కథ విన్నాక నాలో మార్పు వచ్చింది. నేనామెతో అన్నాను-

''ఔను, జీవితం ఒక ఆటే. మనలో ఆడేశక్తి ఉన్నంతవరకు బాగానే ఉంటుంది. దుర్బలులమైనపుడు ఈ జీవితమే నరకంగా మారుతుంది. నువ్వు వర్తమానం గురించి ఆలోచిస్తున్నావు. నేను నీ భవిష్యత్తు గురించి చింతిస్తున్నాను. నీకూ వృద్ధాప్యం వస్తుంది. గత స్మృతులు నిన్ను కాటేస్తాయి. నీకు నా అనే వారెవరూ ఉండరు. విలాసవంతమైన జీవితానికి అలవాటుపడిన నువ్వు డబ్బూ వెనకేయలేవు. ఈ ఆట ముగిశాక వృద్ధాప్యం, రోగాలు నిన్ను చుట్టుముడతాయి. భూతకాలం నిన్ను భయపెడ్తుంది. అందుకని నేను నీకొక అమూల్యమైన కానుక ఇస్తాను. అది నీకు నిస్సహాయస్థితిలో బాసటగా ఉంటుంది. నీ ఈ కానుకలు విలువైనవి. పదేళ్ల తర్వాత నేను నీ కానుకలన్నింటిని పాతికవేలకు కొంటాను. శాపగ్రస్తమైన ఈ స్మృతి చిహ్నాలన్నీ నీ ముందు నుంచి తొలగిపోతాయి. నీవప్పుడు కృష్ణా రామా అనుకొంటూ ఆ డబ్బుతో నిశ్చింతగా కాలం గడపొచ్చు''

''ఆ మాట వినగానే ఆమె నిన్ను నౌకరుతో బైటకు గెంటించలేదా'' నేను పరమేశ్వర్‌ని అడిగాను.

పరమేశ్వర్‌ నవ్వాడు ''లేదు. కొంచెంసేపు ఆలోచించాక 'మీరు చెప్పినవన్నీ నాకు నచ్చాయని అనను. వృద్ధాప్యంలో గడపటానికి అవసరమైన ఏర్పాట్లేమీ చేసుకోలేదని మాత్రం ఒప్పుకొంటున్నాను. నేనీ వస్తువులన్నీ మీకు అమ్మేస్తాను. ఒప్పందం మీద సంతకం చెయ్యండి' అంది.''

నేను సంతకం చేశాను. రెండేళ్లయింది. మొన్నే యామిని నుంచి ఉత్తరం వచ్చింది. ఇప్పుడు ఆమె వద్ద ఉన్న వస్తువుల సంఖ్య నూట పదమూడు అయ్యాయట.

80 ఏళ్లనాటి కథ లండన్‌ విద్యార్థి

గురురావు గొప్ప జమిందారుడు. అతని మిరాసి గ్రామములు పల్లెలగుట బట్టి పల్లెలయందుండుట కిష్టము లేక పట్టణమున నివాసము చేయసాగెను. పల్లెల అధికార మంతయు దివానుగారు నడిపెదరు. అనగా దివానుగారే జమిందారుగారు. జమిందారుగారే దివానుగారి వలన భూతాది పూర్వకముగా జీవించు నౌకరు. ఎవని సొమ్ము వానికి నష్టము కాకుండా అభివృద్ధి గావలయునని మనస్సుండును. కాని యితరునికేమి? జమిందారుని జమీను చెడితే దివానుకేమి? బాగు పడితే దివానుకేమి? ''ఊరుపాయె హుసేన్‌ సాయిబు'' అంటే ''పోతె పాయె బడే సాయబు'' అన్న సామెత యెవరెరుగనిది. చెరువులు మరమ్మతు చేయించుట, బావులు తీయించుట, కాల్వలు గట్టించుట మొదలయిన సౌకర్యములు రైతులకు కలుగచేయుట యేమి లేదు. కాని యెండలో నిలువబెట్టి మీద బండలెత్తి మాఫి రకం అను పేరు లేక సేద్యం అయినా కాకున్నా సిస్తు వసూలు చేయుట ఆయన పని. దివానుకు దయవచ్చి సిద్ధం చేసినంత రకముతో పట్టణములో సౌఖ్యపడుట గురురావుగారి పని. గురురావుగారికి కుమా రరత్నం కలిగినాడు. రూపమే మయినా లోపమా? గుణమేమయినా లోపమా? తెలివి యేమయినా లోపమా? నగరములో చదివినాడు. బి.ఎ. ప్యాసు అయినాడు. సెకండరీ చదువుచున్నప్పుడే వివాహం అయింది. ఇక కావలసినదేమి? బ్రతుకు దెరువునకు మార్గము కలదు. వృత్తి విద్య అంత అవసరం లేదు. కాని అంత మాత్రమున తృప్తి యెక్కడిది? వృత్తి విద్య యుంటేనో? అది మాత్రము దేశమున లేదా? వైద్యము చదువ వలయునన్న ఎం.డి. మట్టున కిక్కడనే గలదు. న్యాయవాదము ఎల్‌.ఎల్‌.బి. మట్టున కిక్కడనే గలవు. ఇట్టులనే అన్నియు నిక్కడనే గలవు. ఎంత చదివి ఎంత జ్ఞానమార్జించినను సీమకు వెళ్ళి వచ్చిన దర్జాయే వేరు.

రామాచారి, విశ్వనాథశర్మ, లతీఫ్‌ సాహెబ్‌ మొదలయిన వారలు కొందరు గురురావు గారింటనొకనాడు కూడిరి. పయివారంతా నగరములో ఉద్యోగమో, న్యాయమో చేయుచు కాలము గడిపే గౌరవనీయులే. వారందరు గురురావుగారి కుమారుడగు తుకారాంగారి విద్యాభ్యాసమును గురించి చర్చ చేయుచుండిరి.

'ఈ దినములలో లండను, కేంబ్రిడ్జి మొదలగు విశ్వ విద్యాలయములలో చదివిన వారలకే కీర్తి ప్రతిష్టలు గాని మన దేశీయ విశ్వవిద్యాలయములలో చదివిన వారలకు గౌరవము లేదండి' అని రామాచారి గారనిరి.

'అయితే మా తుకారామును ఎక్కడికి తోలించవలయును' అని గురురావుగారనిరి. 'సీమ చదువే పాడండి. మన ఆచార వ్యవహారాలు బొత్తిగా పాడు కావడమే కాక పిల్లలు మళ్లీ మనకక్కరకు రాకుండా అయి వస్తారు. ప్రతి సంవత్సరము ఇండియా నుండియే రెండు వందల మంది విదేశములకు వెళ్ళి డబ్బంతా పాడుచేసి వస్తున్నారు కదా! వారిలో ఇండియాకు వచ్చి వెలుగబెట్టినదేమిటి? అని విశ్వనాథశర్మ నుడివెను. 'సీమ బారిష్టరులకు గౌరవమెక్కువండి' అని రామాచారి వక్కాణించెను.

'పళ్లూడగొట్టుకొనుటకు పర్వతానికి పోయినారట రాయి కొరకు, ఇన్ని వేలు కర్చు చేసి సీమకు పోయి మళ్లీ వకాలతయేనా? మొన్న నొక బారిష్టరు ముక్తారునామా తీసుకొని వచ్చిన సువ్వందర్జా వకీలుతో వాదించలేక గుటకలు మింగినాడు. మన దేశములో చదివిన వకీళ్లు పిడుగులాంటి వారు లేరనా? సీమకు పోయి వస్తే షోకులకు కర్చులెక్కువ చేయడము తప్ప తక్కిన వానిలో యెందుకు పనికి రారు' అని శర్మ తీక్షణముగా పలికెను.

'సీమకు పోయి వచ్చిన వాండ్లకు తెల్ల దొరసానులు తమ డాన్సులో నిరాటంకముగా చేర్చుకొంటారు. తక్కిన వారికెంత పాండిత్యమున్నా చేర్చుకొనరు. ఇదియొక సదుపాయము' అని లతీఫ్‌ సాయబనెను.

'సరె! ఎలుకను బట్టుటకు గుట్ట త్రవ్వినారుట. దొరసానుల ఆటలలో చేరుటకు వేల రూపాయలు పాడు చేసుకొని సీమకు పోయి రాకడయా! బాగు బాగు. ఈ పోవు విద్యార్థులు సీమకు బోయి తెచ్చెడి యోగ్యత ఏమి? వాయు విమానముల చేయు నేర్పా? మోటారు బండ్లు చేయు నేర్పా?తుదకు కుట్రపు మిషన్‌లో సూదిని చేయు తెలివి సైతము కొని వచ్చుట లేదు. ఇక యేమి తెచ్చెదరంటే ఇంట గల ద్రవ్యమంతయు వ్యయము చేసి దరిద్రపు పెద్దమ్మ వారిని తెచ్చెదరు. ఒక్కొక్కడయితే దానికి తోడు శేష భాగము గుల్ల చేయుటకు సీమ దొరసానిని తెచ్చును. ఇంతకంటే విశేషమేమియు నాకు కనపడలేదు' అని శర్మ పరిహసించెను.

'అందరంతేనా? కొందరు నీతిగా మెదలి వచ్చుట లేదా? మీ అబ్బాయిని తోలించి చూడండి. కుర్రవాడు మంచి తెలివి తేటలు గలవాడు. వినయ విధేయతలు మంచిగా గలవు. చెడిపోగూడదు' అని రామాచారి నుడివెను. 'మంచి మనస్సుంటే యెక్కడికి వెళ్ళినా యేమి ఫర్వాలేదు' అని లతీఫ్‌ సాహెబు చెప్పెను. 'గురువుగారూ! పిల్లవానిని పంపించుట నాకెంత మాత్రము నచ్చదు చూడండి. ఈ వినయ విధేయతలు మారి వ్యర్థుడయి రాకుంటే నా పేరు తీయించుకుందును. పోయినందుకేదో పరీక్షలలో నెగ్గినట్లు కమ్మల తెచ్చుకొనక పోడు. ఆ కమ్మలతో రాగానే కడుపు నిండదు. మళ్లీ యిక్కడ తంటాలు పడి జీవనోపాధికి మార్గం కల్పించుకోవలసి ఉంటుంది. చూడండి! వాలకం. పైసా కర్చు లేకుండానే ఆ తంటాలు ఇక్కడ పడితే బాగని నా యభిప్రాయం. పిల్లవాడంతగా చెడడు' అని శర్మ చెప్పి యూరకుండెను.

ఎవరెంత చెప్పినను గురురావుగారికి తుకారామును సీమకు పంపి తీరవలయునని నిశ్చయముండెను. కావున తదితరుల మాట నెగ్గలేదు.

తుకారాం లండన్‌ విశ్వ విద్యాలయములో చేరెను. ఇండియానుండి వచ్చెడివారంతయు యే రాజులో ఏ కోటీశ్వరులోయని అక్కడి వారి విశ్వాసము. ఎట్లయిన గౌరవము సంపాదించుకొనవలెనని వారలు వీరిని భాగ్యవంతులనుకొనియెదరు. అణా చీటి వేసి ఆత్మారాం సేటు వద్ద ప్రాంసరీ నోటు వ్రాసి చేయుచున్న వైభవమని పాపము వారలకేమెరుక? ఇదియు గాక ఇక్కడినుండి చదువబోవువారలొక బిడ్డో కొడుకునో కనియో లేక యీడేరిన పెండ్లాము నింట నుంచియో చనియెదరు. ఈ సమాచారమక్కడి సుదతులతో చెప్పరు. ఆ దేశమున యా కాలమునకు ప్రాయశః వచ్చిన వారలు అవివాహితులనియే వారు తలచెదరు. వివాహితులని వారికి తెలిసినచో వారెవరును దగ్గరికి చేరరు. ఎన్ని తమాషాలు! గాంధి మహాత్ముని వంటి ఒకరిద్దరు నిప్పచ్చరావతారాలు అక్కడి రహస్యాలు బట్టబయలు చేస్తే మాకెరుక అయింది. తాను లండన్‌ యూనివర్సిటీలో చేరినానని రెండు మూడు విషయములలో తంటాలు పడుచున్నానని తనకు సహాధ్యాయులుగా మిస్‌ కొంగా దొరసాని చేరినదని జాబు వ్రాసెను. అన్నియు సరికాని కొంగ మాట వినగానే గురురావు గుండె గుభాలుమనెను. ఏమి చేయగలడు? తుకారాం భార్యకు మాత్రమా సమాచారము తెలియకుండునా? ఆమె యిక మగడు రాడనియె నిరాశ చేసుకొన్నది.

కొంగా దొరసానికి తుకారాం అను పేరు పొడవుగాను ఉచ్ఛారణ సౌకర్యము లేనిదిగాను కనుపించెను. కావున తత్‌ ప్రత్యామ్నాయము 'మిస్టర్‌ తూ' అని పేరు వచ్చినది. కొంగ దొరసాని కూడా 'మిసెస్‌ తూ' అను పేరు మార్చుకొనెను. వారుభయుల మిత్రులు యెరిగిన వారలు 'తూ' అనసాగిరి. ఇండియాయైున యెడల తుకారాము 'తూ' అనుబడుచున్నప్పుడు అభిమానపడవలసి యుండెడిది. కాని అది ఇంగ్లండు. అక్కడ 'తూ' అన్నను మరేమన్నను అభిమాన పడవలసిన అవసరము లేదు. అదిగాక తానొక్కడే 'తూ' అనుబడుచున్నాడా? తనదంటకు 'మిసెస్‌తూ' ఒకతె లేదా? ఉభయులు ఏకరీతి 'తూ, తూ' అనబడుటయు నొక విధమయిన గౌరవముగానే ఉండెను.

పరీక్షలు ముగిసినవి. తుకారాంగారు పత్ర యోగ్యతకు పాత్రుడైనాడు. ఇండియాకు ప్రయాణమైనాడు. మిసెస్‌ తుకారాం (కొంగా దొరసాని) తోడ రాదలచినది. కాని ఇండియాకామెను తీసుకొని వచ్చి యేమి పెట్టగలడు? ఇక ముందు తండ్రి డబ్బీయునా? ఉన్నది పాడుజేయు తెలివికంటె ఇంకొక తెలివే అతని దగ్గర లేదు. అక్కడనున్న దినములన్నియు డిన్నరులలో, డ్యాన్సులలో, షికారులలో, డ్రామాలలో, సినిమెటోగ్రాపులలో గడచిపోయెను. ఇక యేమి యోగ్యత కొరకాతడు శ్రమ పడవలసి యుండెను. కాని కష్టమనిన చేతగానివాడుగా మారెను. ఇక ముందిండియా వచ్చి సంపాదన మార్గము నేర్చుకొనవలయును.

నాల్గు సంవత్సరములు సీమలో నుండి సంపాదించిన మాయ మర్మము కుట్ర కుహకములు వినియోగించి వెనుక నుండి పిలిపించుకొనియదనని కొంగనొడంబడిక జేసి యీవలబడుసరికి తుకారాం గారికి తల ప్రాణము తోకకు వచ్చినది. కాని ఇండియనులకు ధైర్యము లేదు. సాహసము లేదు. పిరికి పందలు. ఇక ఆడుదాని సాదలేరు. అని కొంగ పోట్లు తల వాయునట్లు తినక తప్పులేదు. చేజేత అనుభవించక యెవనికి తప్పదు.

''క్యాష్‌ బ్యూటి'' అను పడవ బొంబాయి రేవులో దిగినది. గురురావుగారు రెండు దినములకు ముందే బొంబాయికి దివాన్‌గారితో వచ్చి రేవునకు బోవు టికటు కొని యుండెను. పడవ వచ్చినదని తెలిసినది. నాలుగు సంవత్సరముల నుండి చూడక కండ్లు కాయలు కాచినట్లుండుటచే యెప్పుడు కొడుకును చూచెదనాయని మనస్సుననున్న గురురావు రేవునకు పరుగెత్తుకొని వెళ్లెను. ఇంకను తుకారాం పడవ నుండి దిగలేదు. రెండు మూడు దినములు పడవలోనే విశ్రాంతిగొననుండెను. మొదలే తానేగుట బాగుండదనియో లేక మరో కారణమునో దివానును పంపించెను గురురావు. దివానులోనికేగి మీ తండ్రి నిన్ను చూచుటకు రేవులోనున్నాడని జెప్పెను. అందుకాతడు Oh! This is not my leisure time, ask him to come at five అనగా ఇది విశ్రాంతి సమయముగాదు సాయంకాలము అయిదు గంటలకు రమ్మనమని చెప్పినాడు. ''సీమకుబోయి యెంత గౌరవ మర్యాదలు నేర్చుకొని వచ్చినాడు. ఎంత ప్రేమ విశ్వాసములు నేర్చుకొని వచ్చినాడు? తండ్రి గది గుమ్మము వద్ద నిలిచియుండ తను చూడమన్నప్పుడన వలసిన మాట యిదియేనా? నాలుగు సంవత్సరముల శిక్షకు ఫలమా యిది?'' అనుకొని గురురావు వద్దకు వచ్చెను. కాని మంత్రికి చెప్పుటకు నోరెక్కడ గలదు? కొమారుడన్నమాట లేనోటితో చెప్పగలడు? మంత్రి యింకనూ సీమకు వెళ్ళిరాలేదు గదా? ''సరిచూచెదను. యుక్తి చేయనిది కుదరదు'' అని గురురావును వెంటనిడుకొని పోయెను. తండ్రి వెళ్ళువరకు కొడుకు పడుకొనియుండెను. తండ్రిని చూచిన పిమ్మటనైన లేచి ప్రత్యుత్థానము చేయలేదు. తండ్రి పట్టరాని దుఃఖముచే కొడుకు పయిబడి దుఃఖించెను. ప్రేమా విశ్వాసముల నడుమ పెరిగినవాడు తండ్రి. నల్లతోలు సంచిలో తెల్ల విజ్ఞానమును నింపుకొని వచ్చినవాడు కొడుకు. ఉభయులకెంత తారతమ్యములు! ''అమ్మ బాగున్నదా? తమ్ముడు చదువుకొంటున్నాడా? కోడలక్కడనేయున్నదా?'' అను కుశలప్రశ్నలేవియూ లేవు. మీటనొక్కిన సిడి వలె తటాలున లేచి గదిలో నొకమూలన ''షూషు ఘాషు'' అని యీలబాడుచు నిలుచుండెను. ఈ చర్యను చూచి తండ్రికి మరింత దుఃఖము వచ్చినది. కాని కడుపు తీపి చెడ్డది. మాలిన్యము కలదయినను లేనట్టు దోచును. ఈ చర్యనంత సహించుకొని ''తుకారాం బసకు పోదామురా వంట సిద్ధముగా నున్న''దని పిలిచెను. కొడుకుతో కలిసి తినక తండ్రికెంత కాలమయినది? "This is not fit for me" అన సాహసించెను. అనగా ఆ భోజనము నాకు సరిపడదు అని అర్థము. తల్లిపాలు చేదయినప్పుడెవడేమి చేయగలడు.

పడక గది

సర్వాలంకార భూషితయగు భార్య అగ్నిసాక్షిగా వివాహమాడిన భార్య పడక గదిలోనికి వచ్చి నిలిచెను. తుకారామామెను ఎగాదిగా చూచి "Who are you, Please?" అని ప్రశ్నించెను. అనగా నీవెవరివని అర్థము. ఆ రవంత ముక్క తెలుగున అనలేకపోయెనా? నాలుగు సంవత్సరములకే తెలుగు బొత్తిగా మరచెనా? తల్లిదండ్రులను, చేసుకొనిన భార్యను మరచెనా? మాతృభాషలో మాటలాడిన మానహానియా? విదేశమునకేగి వచ్చుట యన జన్మాంతర మంది వచ్చుట కాబోలు!

ఆ ఇంగ్లీషు ముక్కలు పాపమా బాలకేమెరుక! ఈ నాలుగు సంవత్సరములలో క్షేమముగానున్నారా? నన్నెప్పుడయినా తలచుకొనుచుంటిరా! అని కుశలప్రశ్నలు వేసెను. ఆ ప్రశ్న ప్రేమలో ముంచి పావిత్య్రమద్దినట్లున్నది కాని ప్రయోజనమేమి? ఇక తుకారాంనకు తెలుగు మాట్లాడక తప్పలేదు. 'నీవెవరు?' అని ప్రశ్నించెను. ''అయ్యో! నన్నెరుగననుచున్నారా? మీ భార్యనుగానా? మీ రాక కొరకెదురు చూచుచున్న దానను కానా? నన్నీతీరు...'' ఆ పయిన మాట అనలేక యేడువసాగెను. ఆ యేడుపునకు హిమాలయమంతటిది కరిగిపోవలసినదే. కాని ఇది హిమాలయముగాక ఆలెప్‌ ఆయెను. 'ఓ... ఓ.... నా వైఫ్‌! షేం షేం నాకు వద్దు పో' అనెను. ఆమెకక్కడనికయేమి కలదు? ఆ పై ఏడ్చుచు పోయి అత్తమామలతో నీ సోదె చెప్పెను. వారామెననుకరించుట కంటే యేమి చేయగలరు.

రెండు పూటలింట ఒక పూట డియాంజలిస్టు హోటలులో భోజనము చేయుచు ఈ ప్రకారము మూడు మాసములు గడిపినాడు. ఒకనాడు బొంబాయికి చెప్పకుండా వెడలినాడు. కారణము విచారించగా కొంగా దొరసాని వచ్చినట్లు కబురు రాకడయే. 'మిస్‌ తూ', 'మిస్టర్‌ తూ'లు కలిసినారు. ప్రస్తుతము పిన్న మొదలు పెద్దదాకా వారినందరు 'తూ, తూ' అనే అంటారు. లండను నగరములో రహస్యముగా పెట్టుకొనిన పేళ్లు హిందువులకెట్లు తెలిసినవి? వారికి దివ్యజ్ఞానము కలదుగా... ముందు అవకాశముంటె 'తూ, తూ' దాంపత్యమని వారి అనంతర జీవితము వ్రాయబడును.

ఆధునిక తెలంగాణా సాహిత్య మూర్తులలో ఒద్దిరాజు సీతారామచంద్రరావు, రాఘవరంగారావు గారలది విశిష్టస్థానం. మానుకోట అనే చిన్న పల్లెటూరి నుంచి వీరు 'తెనుగు' అనే మాసపత్రికను 80 ఏళ్ళకిందటే స్థాపించి, పదేళ్ళు అవిచ్ఛిన్నంగా నడిపారు. ఈ అన్నదమ్ములు సాహిత్యరంగంలో ఒద్దిరాజు సోదరులుగా ప్రసిద్ధులు. ఆధునిక సాహిత్యంలో అన్ని ప్రక్రియలూ వీరు ఇంచుమించుగా సుసంపన్నంచేశారు. ప్రౌఢకావ్య రచనతోపాటు ప్రహస రచనలూ చేశారు. నాటకాలు రచించారు. తీరాంధ్రంలోనూ కనపడని విశేషమే మంటే వీరు ఆ పల్లెటూళ్ళోనే ఒక ఫొటోస్టూడియో నెలకొల్పి, ఫొటోగ్రఫీని గూర్చి ఆ రోజులలోనే తెలుగులో ఒక ప్రామాణికమైన గ్రంథం రచించడం. సమాజానికత్యంతావశ్యకమైన చేతివృత్తులను, హస్తకళలను, సాంకేతిక విద్యలను గూర్చి ఎనభై ఏళ్ళనాడే వీరు తెలుగులో పుస్తక రచన చేశారు. విద్యుదుత్పాదనం చేశారు. ఆయిల్‌ ఇంజన్‌లు నడిపారు. స్వయంకృషితో ఇంగ్లీషు నేర్చుకొని అందులో కవిత్వం కూడా రాశారు. వీరి తల్లి గొప్ప పండితురాలు. ప్రాచీన కావ్యాలలో, సాహిత్య ప్రస్తావనలలో ఈ సోదరులకు ఏమైనా అర్థస్ఫురణ కలగనప్పుడు, సందేహాలు వచ్చినప్పుడు వీరి తల్లిగారు పరిష్కరించేవారుట. వడ్రంగ కళలో వీరెంతో నైపుణ్యం సాధించారు. ఇంజనీరింగ్‌ విద్యలో మహా ప్రతిభావంతులు. తమ భవనం ఆ పల్లెటూళ్ళో తామే నిర్మించుకున్నారు.

పల్లెటూరులో ముద్రణాలయం స్థాపించి పదుల పుస్తకాలను, వ్యాఖ్యానాలను, ఆధ్యాత్మిక మత గ్రంథ ప్రచురణలను తేవడం వీరి అసామాన్య ప్రతిభా నిరూపకం, నిదర్శనం. ఈ సోదరులలో చిన్నవారైన రాఘవరంగారావుగారు నిరంతర హాస్య సంభాషణ కుశలురు అని వారిని తెలిసినవారు చెపుతారు. ఆయన వెంట ఎప్పుడూ పదిమంది గుమిగూడి నవ్వుతూ ఉండేవారుట. అంత చమత్కారంగా, హాస్యరసపూరితంగా శ్రీరంగారావు మాట్లాడేవారుట.

ఎనభైఏళ్ళ కిందట రాసిన ఈ కథలో ఆనాటి సంపన్న కుటుంబాలలో విదేశివేషభాషా వ్యామోహం ఎట్లా ఉండేదో ఈనాటి తరం పాఠకులకు వినోదప్రాయంగా, హాస్యవిషాద భరితంగా వర్ణితమైంది. ఇది తెలంగాణా ప్రాంత సామాజికేతివృత్తంతో రచితమైంది. ఈ కథకు 'తూ... తూ' అని పేరు పెట్టినా ఇంకా హాస్యస్ఫోరకంగా ఉండేదేమో! తుకారామ్‌ అనే కథానాయకుడి పేరు కోస్తాలోనూ, రాయలసీమలోనూ వాడుకలో ఉన్నట్లు కనపడదు. కాని తెలంగాణంలో బాగా పరిచయంగానే కనపడుతుంది. మరాటీ భాషా సంస్కృతులు, పాండురంగడి ప్రభావమూ ఆంధ్రదేశంలోని ఇతర ప్రాంతాలకన్నా తెలంగాణంలో ఎక్కువ. అదీకాక ఈ కథలో వ్యంగ్యమంతా ఆ పేరును ఆశ్రయించుకొని ఉన్నదే కాబట్టి రాఘవరంగారావుగారి హాస్య ప్రవృత్తికది బాగా తోడ్పడింది. ఈనాటి అభిరుచులకు, సామాజిక సంబంధాలకు అనుగుణం కొంత సంక్షిప్తత ఈ కథలో అవసరమైంది.

దీపానికి కిరణం

బాహ్య రూపాన్ని తీర్చిదిద్దడంలో కొంత అశ్రద్ధ వహించిన ఆ విరించి, లలిత హృదయంలో మూలమూలలా దయ, సానుభూతి, విశాల దృక్పథం, మానవీయత అనే విలువైన ఆదర్శాలను పొదిగి, సొబగులను ఒనగూర్చాడంటే అతిశయోక్తి కాదేమో!

అదే నన్ను ముగ్ధుడ్ని చేసింది.

లలిత చదువుకున్నది కేవలం డిగ్రీ... కాని ఆమెలో సాహితీ సంపద అపారం. ఆమె మనో మథనానికి సాక్ష్యాలుగా కథలు... నవలలూ నిలిచాయి.

నేను సాహితీ ప్రియుడిని కావటంవల్ల ఆమెను తరచూ కలుస్తుండేవాడిని...

లలితలో వైకల్యం నేను చూడలేదు. ఆమెలో ఓ సమాజం కనిపించింది. ప్రపంచ ఆవిష్కర్తగా ప్రతిబింబించేది. తను రాతకే పరిమితం కాలేదు. చేతలకూ ప్రాధాన్యమిచ్చేది... తను సంపాదించిన పారితోషికాలతో పేద పిల్లలకి ఫీజులు కట్టేది. బట్టలు కొనేది... అభాగ్యులను ఆదుకోటానికి ఆయత్తమయ్యేది...

ఎక్కడో గుజరాత్‌లో భూకంపం వచ్చి అతలాకుతలమైపోతే లలిత మనసెంతగానో గుంజాటనకు గురయ్యేది. సునామీ సంభవించినప్పుడు ఎందరో అనాథలయ్యారు. అప్పుడామె పేగు కలుక్కుమనేది. ఎక్కడ ఏ దుర్ఘటన జరిగినా విలవిల్లాడిపోయేది.

ఆ స్పందనతో జనంలోకి వెళ్లేది... జోలె పట్టుకొని తిరిగేది. పోగుచేసిన విరాళాలను సంబంధిత అధికారులకు పంపేది. ''నీ గురించి నువ్వు ఆలోచించుకోకుండా అందరి గురించి ఆలోచిస్తావేం?'' అంటూ ఇంట్లో వాళ్లడిగినా పట్టించుకునేది కాదు.

''ఈ సొట్టపిల్ల పెళ్లి పెటాకులు లేకుండా అందరి గురించి వీధుల్లో బరితెగించి తిరుగుతోందిరా'' అంటూ నిష్ఠూరమాడేవారు కొందరు.

ఆ వ్యాఖ్యలు నా చెవిన పడి గుండె కలుక్కుమనేది.

పుట్టుకతో ఏర్పడిన వైకల్యాన్ని వేలెత్తి చూపటానికి ప్రయత్నించే ఈ మనుషులు- లలిత మంచి మనసుతో పదుగురికి మేలుచేసే మానవతను ప్రశంసించరేం?

వారి అజ్ఞానం చీకటిలా అలముకొన్నది... ఆ చీకటిని ఛేదిస్తూ సాగాలన్న ఆశయం లలితది. ఆ సాధనకు ఆమె చేపట్టిన ఆయుధం నిర్విరామ కృషి.

లలిత ఆదర్శ భావాలతో నేను ఏకీభవించేవాడిని. ఆమె పట్ల నా ఆరాధన భావం క్రమేపీ వృద్ధి చెందింది. ఆమె సంస్కారంపై క్షుణ్ణమైన అవగాహన ఏర్పడింది.

సాయం వేళల్లో మా వ్యాహాళి... ప్రేమ సమాజంవైపో, అనాథ శరణాలయాలవైపో, బాధిత కుటుంబాల దరికో సాగేది.

అనాథ బాలలు లలితను చూడ్డంతోనే 'మా అక్కొచ్చింది' అంటూ చుట్టుముట్టేవారు. తన వెంట తెచ్చిన పుస్తకాలు, పెన్నులు వారికి పంచేది... కల్లాకపటమెరుగని ఆ పిల్లల కళ్లలో కోటి కాంతిరేఖలు నిండేవి.. వారందరినీ కూర్చోబెట్టి మంచిని బోధించేది. నీతి శతకాలు విడమరచి చెప్పేది.

ఎక్కడికి వెళ్లినా, ఏది చేసినా మేమిద్దరమే.

అమ్మ, నాన్నలకి సుతారాం ఇష్టముండేది కాదు.

''ఒరే నువ్వు ఒక్కడివే మాకు... పైగా నాన్నగారు పలుకుబడి ఉన్న మనిషి. నువ్వా పిల్లతో చెట్టాపట్టాలేసుకు తిరగటం నాకెంత మాత్రం నచ్చలేదు... ఊరంతా కోడై కూస్తోంది...'' అమ్మ నిలదీసింది.

నీకా అవిటి పిల్లతో స్నేహమేంట్రా... బుద్ధి, జ్ఞానం ఉన్నాయా లేవా!'' కోపం ప్రదర్శించారు నాన్న.

నిజాలు తెలుసుకోని వారి నైజం నాలో ఎనలేని చిరాకును సృష్టించింది. లలిత పవిత్రమైన ఆలోచనలు, పరిపూర్ణమైన మానవత్వం, శీల సంపద ఎంత సుసంపన్నమైనవో తెలియజేశాను.

''మరి నీ మీదనే ఆశలు పెట్టుకొన్న పద్మ మాట...'' అన్నారు.

చోద్యమనిపించింది... ఎప్పుడో మేమిద్దరం కూడా పుట్టక మునుపు చేసుకున్న వాగ్దానాలకు బలయ్యేది మేమా...!

పద్మను నా పెళ్లాంగా ముద్ర వేసుకున్నా, ఆమె మీద నాకా భావం లేనే లేదు. ఈ విషయం వాళ్లకు తెలిసినప్పటికీ పద్మను తమ కోడలంటూ దగ్గర పెట్టుకొన్నారు. నా ఎదురుగా ఉంటే ఆమె పట్ల నేను ఆకర్షణ పెంచుకొని సుముఖుడిని అవుతానని వారి వెర్రి ఆశ... కాని నేను లొంగలేదు...

అయితే నేను లలితతో పెంచుకున్న అనుబంధం ముందు పద్మ పెంచుకున్న ఆశలు తృణ ప్రాయమయినాయి.

నా ధ్యేయానికి పద్మ భావాలకీ చుక్కెదురు. ఆమెకి అలగావారంటే అసహ్యం. అనాథలంటే విసుగు. బద్ధకానికి ప్రతిరూపం.

అటువంటి పద్మ కూడా నా మీద ధ్వజమెత్తడానికి వెనుకాడలేదు. నేనేదో ఆమెకి అంకితమైపోయి పడి ఉండాలని అనుకుంటుంది. నేనెప్పుడు తిరిగి ఇంటికి వచ్చినా నిరసన గళం వినిపించేది.

''బావా! నీకిది ధర్మం కాదు. నన్నిలా అన్యాయం చేయటం తగదు. నా పట్ల నిర్లక్ష్యంగా ప్రవర్తిస్తునావు'' అంటూ బుడిబుడి రాగాలు తీసేది.

వాటి వేటికీ నేను చలించలేదు.

''మీ నాన్నను వేరే ఎవరినైనా చూడమని చెప్పు'' అని నిర్ద్వంద్వంగా అనేసరికి దిమ్మెరపోయింది. ఈ విషయం మామయ్యకు తెలిసి హుటాహుటిన దిగాడు. ఛర్రుమంటూ నా మీద ఎగిరాడు.

''నీ మీద కోటి ఆశలు పెట్టుకున్నాన్రా! మా పద్మ ముందర ఆ అమ్మాయి పెద్ద అందగత్తెనా? పైగా అవిటి పిల్ల. ఆమె రచయిత్రి అయితే ఆమె రచనలను ఆరాధించు, అంతేగాని ఆమె మత్తులో పడి మా అమ్మాయిని దగా చేయకు... అయినా ఆ పిల్ల నీకేం సాయం చేయగలదని. నువ్వే జీవితాంతం చాకిరీలు చేయాలి తప్ప!!'' అనేసి నోటికొచ్చినట్లు వాగాడు.

అది విన్న నేను సహించలేకపోయాను...

''ఆమె సమాజసేవ నన్ను ఆకర్షించింది. నాకు సేవ చేయకపోయినా ఫర్వాలేదు'' అనేశాను.

మా ఇరువురి వాదనల మధ్య అమ్మనాన్నలు దూరారు. అయినా నా మనోనిశ్చయం నిశ్చల తటాకమైంది.

రెండు రోజుల తరువాత లలితను కలిశాను.

''ఇకనుంచీ నన్ను కలవటానికి ప్రయత్నించవద్దు. ప్లీజ్‌!'' అనేసింది లలిత నిర్మొహమాటంగా.

విభ్రమంగా చూశాను.

''నీ మీద ఆశలు పెట్టుకున్న అమ్మాయిని అన్యాయం చేసినవాడిగా నీ వ్యక్తిత్వం నాకు నచ్చలేదు. అయినా నాలో ఏముందని? నేనో అవిటిదాన్ని. నన్నిలాగే బతకనీ. సమాజసేవ నా కిష్టమైన పని. దానికి నేనంకితమయ్యాను. దయచేసి నన్ను...'' నిష్కర్షగా అనేసింది.

ఒక్కసారిగా మ్రాన్పడిపోయాను.

''అదికాదు లలితా! పద్మను నేను మరో భావంతో ఏనాడూ చూడలేదు... నాకు బలవంతంగా కట్టబెట్టాలని వారి ప్రయ త్నం... మనిద్దరి స్నేహం అరమరికలు లేనిది. అది అర్థం చేసుకోనివాళ్లనే మాటలకి నన్ను దూరం చేసుకోవద్దు, ప్లీజ్‌'' అర్థింపుగా అన్నాను.

లోనుండి లలిత తల్లి అమ్మాజీ వచ్చింది.

''అది కాదయ్యా! మీకూ మాకూ చాలా అంతరం. మా అమ్మాయి అవిటిదని తెలిసీ నువ్వెందుకయ్యా వెంటపడ్డం...! నీ మీద ఆశలు పెంచుకున్న నీ వారి నెందుకయ్యా అన్యాయం చేస్తున్నావు...? దయచేసి మా అమ్మాయిని వదిలేసిపోవయ్యా!'' దీనంగా వేడుకుందామె.

''చూడు బాబూ! మా బతుకులు మేం బతుకుతున్నాం. మేం సుఖంగా ఉండటం నీకిష్టంలేదా! లలితకు తెలిసిన విద్య కాగితాలు కరాబు చేయటం. తోటివారికి సాయపడ్డం. అదో పిచ్చిదనుకో. దాంతో నీకేంటయ్యా. వెళ్ళు బాబూ!'' దణ్ణం పెట్టేశాడు లలిత తండ్రి రామ్మూర్తి.

లలిత కుటుంబంలో ఎన్నడూ లేని ఆ కృత్రిమ వాతావరణం నేను భరించలేకపోయాను. దీని వెనుక కారణాలు నేను తేలిగ్గానే ఊహించగలను.

నా ఊహ నిజమే అయింది. అమ్మా నాన్నలు, మామయ్య నేరుగా వెళ్ళి లలిత ఇంటిమీద విరుచుకు పడ్డారుట. ఇకపై ఎటువంటి పరిస్థితుల్లో నాతో సంబంధం పెరగటానికి వీల్లేదని హెచ్చరించారుట.

ఇదంతా తెలిశాక మా వాళ్లందరి మీద అలవిగాని ఏహ్యత... నేనింటికి చేరటంతోటే వాళ్ళు చేసిన ఘనకార్యాన్ని తూర్పారబట్టాను. చెడామడా దులిపాను.

''ఔన్రా నువ్వు చేసిన పని మాకే మాత్రం నచ్చకనే మేం అలా ప్రవర్తించాం. నిన్నెలా దారిలో పెట్టాలో మాకు అర్థం కాలేదు. నువ్వెలా ఆమెనిష్టపడ్డావో తెలీదు. పద్మలా అందగత్తె కాదు. ఎటువంటి లోపం లేకుండా సవ్యంగా ఉందాంటే అదీ లేదు'' మామయ్య వేడింకా చల్లారలేదు.

''నిజానికి నువ్వు ఎవరినయినా ఇష్టపడి ప్రేమించి పెళ్లి చేసుకో దలిచావే అనుకో... మేమూ హర్షించేవాళ్ళం. అదీ ఎటువంటి వైకల్యం లేనప్పుడు'' నాన్న నిప్పుల వర్షం కురిపించారు. ''నువ్వు ప్రేమించే పిల్ల అవిటిదయినా నువ్వు భరించగలవేమో కాని... ఓ కుంటిదాన్ని కోడలిగా నేను భరించలేనురా...'' తెగేసి చెప్పింది అమ్మ.

''చాలా బాగుందమ్మా. మీ ఆలోచన పదేపదే ఆమెను వేలెత్తి చూపుతున్న మీ సంస్కారానికి నేనేం చెప్పాలో అర్థం కావటం లేదు... ఆమెకు అవిటితనం లేకుంటే మీరు నెత్తిన పెట్టుకునేవారా! వైకల్యంతో ఉన్న ఆమెది గొప్ప మనసైనా మీకు చేదా?!''

''ఔను... నువ్వు చేసుకునే పిల్ల ఎంతో గొప్పది కావచ్చుకాని, అవిటిది కాకూడదంతే...'' ఖండించి పారేశారందరూ.

మరింక వారి సమక్షం నాకు ఇచ్చగించలేదు.

జరిగినదానికి నేనెంతగానో మధనపడసాగాను.

ఆరోజు నేనాఫీసులో పేపర్‌ చదువుతుండగా... నా కళ్ళు ఒక వార్త దగ్గర అతుక్కుపోయాయి.

ఒక్కసారిగా నా యోచనల్లో కొత్త ధోరణి... నేను చూసే కోణంలో ఎటువంటి అపసవ్యత లేదు.

నేనాచరించే కర్తవ్యం అందరికీ జవాబు కావాలి... నా ధ్యేయానికి తోడు నిలిచి చేయూతనందిస్తుందనే కొండంత ఆశతో లలితను కలిశాను.

బస్సు ప్రమాదంలో గాయపడ్డ పాఠశాల బాలబాలికలకు సేవ చేస్తున్నది లలిత. ఆ దృశ్యం చూసి విచలితుడైన నేను ఆ సేవా తత్పరతలో నిమగ్నమయ్యాను.

తరువాత లలిత తన మానాన తాను వెళ్ళబోయింది. ఆపి, విషయమంతా వివరించాను. చాలాసేపు ఆలోచించింది. సంశయాత్మకంగా ఉండిపోయింది.

''నన్నిలాగే ఉండిపోనీ... ఇది నాకు అవరోధం కాదు'' ఉన్నట్టుండి అనేసింది.

''లేదు లలితా! నేను చేయబోయే ఈ పని నీ మనసుకెంతో ఊరట నిస్తుంది. నన్ను కాదనకుండా అంగీకరించు. ప్లీజ్‌'' నా అభ్యర్థన ప్రభావం లలితమీద పడింది.

వెంటనే నన్ను అనుసరించింది. మా ప్రయాణం తిరుపతికి సాగింది.

కొంతకాలం తర్వాత నేను, లలిత తిరిగి వచ్చేశాం. మా తొలి అడుగులు లలిత ఇంటివైపు సాగాయి.

మమ్మల్ని చూస్తూనే అంతెత్తున లేచారు లలిత అమ్మ, నాన్నలు... వారిని లోనికి తీసుకెళ్ళి అంతా చెప్పింది లలిత.

బయటకు వచ్చిన లలిత తండ్రి రామ్మూర్తి- ''ఇంతకాలం మీరిద్దరూ కనిపించకపోతే మేమూ అందరిలాగే తప్పుగా ఊహించుకున్నాం. కాని లలితకి నువ్విలా కొత్త జీవితం ప్రసాదిస్తావనుకోలేదు'' నా చేతులు పట్టుకున్నాడు.

''మీ వాళ్ళంతా మా మీదకు దాడికి దిగారయ్యా! పోలీసులు కూడా వేధించారు... ఇదంతా మనమంతా కలిసి ఆడిన నాటకమట... మా పిల్లను చెల్లగొట్టడానికి వేసిన పథకం అన్నారయ్యా! వెంటనే నీవెళ్ళి వారికి జవాబు చెప్పండి'' అన్నది కళ్ళు తుడుచుకుంటూ ఆవిడ.

మేమిద్దరం ధైర్యంగానే మా వాళ్ళకి ఎదుటపడ్డాం.

''ఛీ! సిగ్గు లేదురా నీకు, అలా చెప్పాపెట్టకుండా పారిపోటానికి. ఇంతకాలం కనిపించకుండా పోయింది.. దీంతో కులికి రావటానికా! ఇంతకీ ఎక్కడ తగలడ్డారని'' గయ్యిమన్నది అమ్మ.

''తిరుపతి వెళ్ళాం...అక్కడే ఉన్నాం...''

''అంటే ఆ దేవుడి సాక్షిగా అంతా చక్కపెట్టేసుకొచ్చారన్నమాట...'' మామయ్య నోరు నొక్కుకున్నాడు.

''ఈ అవిటిదాన్ని కట్టుకోడానికి అంతదూరం పోయావన్నమాట...'' అన్నాడు క్రోధంతో నాన్న.

''మాట మాటకీ 'అవిటి' 'అవిటి' అనే మీ నోళ్ళని శాశ్వతంగా మూయించటానికి మీరన్నట్లు 'ఆ వెంకన్న సాక్షిగా' తిరుపతినే ఆశ్రయించాం'' ధైర్యంగా అన్నాను.

''దీన్ని కట్టుకుని మాకు శాశ్వతంగా శోకం మిగల్చటానికా...''

''కాదు మీ వంకర మనసులను సరిచేసేందుకు''

''ఏమిటి నువ్వనేది?'' కోపంగా అన్నాడు నాన్న.

''ఔను ఒక వ్యక్తి ఎదుటి వ్యక్తిని ఆకర్షించటానికి కేవలం ఆ మనిషి మనసు చాలునన్నది సత్యం... కాని, అది గ్రహించని మీరంతా అవిటితనం అడ్డంకిగా తలిచారు. లలితపై నా ప్రేమను మీరు అంగీకరించకపోవటానికి కారణం ఆమె వైకల్యం. ఈ విషయం గురించే నేనాలోచిస్తున్న సమయంలో పేపర్లో పడ్డ వ్యాసం నన్ను ఆకర్షించింది. తిరుపతిలో బర్డ్స్‌ ఆసుపత్రిలో ఎటువంటి అంగవైకల్యం ఉన్నా సరిచేసి వారి జీవితంలో వెలుగులు నింపుతారని తెలుసుకుని లలితను నాతో తీసుకువెళ్లాను. ఆమె మామూలు మనిషయింది...'' భావోద్వేగంగా అన్నాను.

లలిత మామూలుగా కావటం వారందరికి చాలా చిత్రంగా అనిపిస్తుంది.

''మీరనుకున్నట్లుగా లలిత తన స్వార్థం కోసం నాతో రాలేదు. మూడు ముళ్లు వేసి తీసుకురావటానికి నేనూ ప్రయత్నించలేదు. మీ ముందుకు వైకల్యంలేని లలితను తీసుకురావాలన్నది నా ఆశయం... ఇప్పుడు మీరే చెప్పండి? ఎటువంటి లోపం లేని పిల్లనయితే తప్పకుండా మేమంతా అంగీకరించివుండేవాళ్లం అన్నారుకదా. మరి మీరీరోజు ఆశీర్వదిస్తారా! అందుకే మీ ఎదుటికి వచ్చాం...'' సాభిప్రాయంగా చూశాను.

మా సామీప్యంలో వారి మౌనం ఎంతసేపు రాజ్యమేలిందో చెప్పలేను.

కొంతసేపటి క్రితందాకా ద్వేషభావంతో అట్టుడికిపోయిన వారి వైఖరిలో క్రమంగా ఏదో మార్పు.

మేం వెనుదిరగబోయేసరికి అమ్మా నాన్నలు మా ముందుకు వచ్చారు.

''మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాం... మీ ఇద్దరివీ ఒకేరకం భావాలు... అవి కలిశాయి... ఇది తెలిసినా మీ ఇద్దరి మధ్య వైకల్యం అనే అడ్డుగోడను సృష్టించి వేరుపరచాలని చూశాం... అయితే ఆ అడ్డుగోడను సైతం కూల్చేసి మీరు మా ముందుకు రావటం ఎంతో సంతోషంగా ఉంది...'' అన్నారు నాన్న.

''వంకరనేది శరీరానికి కాదు, మనసుకి ఉండకూడదన్న సంగతి మాకు తెలిపి మా కళ్లు తెరిపించావు బాబూ!'' అంది అమ్మ...

''కేవలం శరీరాలు ఒకటవటం కాదు. మనసులు ఒకటి కావాలి అన్న విషయం గ్రహించేలా చేశావు బాబూ!'' మామయ్య కూడా బాధపడ్డాడు.

వాళ్లందరి మొహాల్లో సుప్రసన్నత దేదీప్యమానంగా వెలుగొందింది.

ఆ వెలుగులే పెళ్లి పందిరిలో విరాజిల్లాయి.

భూదేవంత పీట... ఆకాశమంత పం దిరి వేయకున్నా- శుభాక్షతలు జల్లి వారి ఆశీర్వచనాలు మాపై కురిపించటంతో మా మనసులెంతగానో ప్రఫుల్లమయినాయి.

ఇది జరిగిన తరువాత ఒకరోజు- మిగతా కార్యక్రమాలు అన్నీ రద్దుచేసుకొని సరదాగా గడపాలని నిశ్చయించుకున్నాను.

అయితే లలిత- ''చూడు నువ్వు నాలో వైకల్యం తొలగేలా చేసి నన్నో మనిషిగా చేశావు... నేను అదే స్ఫూర్తితో ప్రస్తుతం అంగవైకల్యంతో బాధపడుతూ సమాజంలో చిన్నచూపుకు గురవుతున్న ఎందరో అభాగ్యులను తలెత్తుకునేలా చేయాలనే ఈ కొత్త కార్యక్రమం చేపట్టాను... ఇదిగో ఈ గుడిసెలో చిన్నారిని రేపే తిరుపతి బర్డ్స్‌ ఆసుపత్రిలో జాయిన్‌ చేయటానికి తీసుకెళుతున్నాను. నువ్వు నాకు పెట్టిన భిక్షను నేను మరింత మందికి పంచి వారిలో ఆనందాన్ని చూడాలని కోరుకుంటున్నాను'' చాలా కృతనిశ్చయంగా అన్నదా మాట.

ప్రస్తుతం లలిత సేవాకార్యక్రమం కొత్తరూపు దిద్దుకుని వెలుగులు నింపి పలువురి ప్రశంసలకి పాత్రమైంది.

'దీపానికి కిరణం ఆభరణం'అన్నాడోకవి.

దీపమంటి లలితకు కిరణంలాటి గొప్ప మనసు ఓ దివ్యమైన ఆభరణం.

ఆ ఆభరణం ఇప్పుడు నా సొంతమైందన్న ఆనందం నాలో అనిర్వచనీయమైన అనుభూతిని కలిగిస్తోంది.

అదే అనుభూతితో ఆమె వెంట నా అడుగులు పడుతున్నాయ్‌..