Thursday, December 13, 2007

స్వేచ్చకి కళ్ళెం - ప్రవాసాంధ్ర కథ

సినిమా ముగిసింది.
న్యూయార్క్‌ రీగల్‌ థియేటర్‌లో సినిమా చూసిన ముగ్గురిలో, దిగువ వరుసన కూర్చున్న రాజు హాల్‌ లోంచి బైటకి రాగానే చల్లని గాలి అతనిని తాకింది. త్వరత్వరగా రెండడుగులు వేసి దగ్గరగా ఉన్న బౌడీన్‌ కాఫీ హౌస్‌లోకి జొరబడ్డాడు. ఒక క్రోసాంట్‌, ఓట్‌మీల్‌కుకీ, కాఫీతో ఒక మూల సోఫాలో చతికిలపడ్డాడు రాజు.

బైట మంచు కురవడానికి సిద్ధంగా ఉంది. సాయంకాలం దాదాపు ఐదు గంటలయింది. న్యూయార్క్‌ పట్టణంలో మంచు కురుస్తుందని వాతావరణ కేంద్రం తెలియపరచగానే, భయపడి కాబోలు దాక్కోవడానికి సూర్యుడు తొందరగా పారిపోయాడు.
సినిమాహాల్లో ముగ్గురే ప్రేక్షకులు ఉన్నా సినిమా ప్రదర్శించారు. 'థియేటర్‌ యజమానికి ఎంత నష్టమో!' అనుకుంటుంటే తనతో సినిమా చూసిన మిగతా ఇద్దరు ప్రేక్షకులూ చలికి వణుకుతూ రాజు కూర్చున్న బౌడీన్‌ రెస్టారెంట్‌లోకి ప్రవేశించారు. లోపలికి వచ్చిన ఇద్దరూ దాదాపు అరవైఏళ్ల వయస్కులే. ఒకవ్యక్తి బలంగా, గుబురు మీసాలతో ఉంటే, రెండోవ్యక్తి పొడవుగా, రివటలా ఉన్నాడు. ఇద్దరూ కౌంటర్‌ దగ్గర ఆగి తినుబండారాలు కొనుక్కుని, రాజు కూర్చున్న వరుసకి ముందర ఉన్న వరుసలో సర్దుకున్నారు.

''అబ్బ! ఈ వాతావరణం వలనో ఏమో కాని భలే ఆకలిగా ఉంది'' అన్నాడు గుబురు మీసాల వ్యక్తి. ''కమాన్‌ స్మిత్‌. ఈ డైలాగ్‌ పాతదే. నీకు కాస్త ఆకలి ఎక్కువ'' అన్నాడు రివటలా ఉన్న వ్యక్తి.
''ఐ ఎగ్రీ. నువ్వు చెప్పిన దాంట్లో నిజం ఉన్నా, ఈవేళ మరీ ఎక్కువ ఆకలిగా ఉంది జాన్‌'' అంటూ తెచ్చుకున్న టిఫిన్‌ని కొరికాడు స్మిత్‌.
''ఇంతకీ ఫెలీనీ ఇటలీ చేరాడా, లేదా? డైరెక్టర్‌ మనల్ని సస్పెన్స్‌లో ఉంచి సినిమా ముగించాడు'' అనడిగాడు స్మిత్‌.
''ఏదేమైనా, చెప్పవలసిన దానిని డైరెక్టర్‌ చెప్పాడు. విచిత్రమైన సినిమా కదూ?'' అన్నాడు జాన్‌. వెనుక వరుస సోఫాలో కూర్చున్న రాజుకి స్మిత్‌, జాన్‌ల సంభాషణ స్పష్టంగా వినిపిస్తోంది. రాజు కళ్ల ముందర చూసిన సినిమా కదలాడింది.

ఇటలీలో అనాధ అయిన ఫెలీనీ చదువుకోసం స్కాలర్‌షిప్‌ మీద అమెరికా వస్తాడు. చదువు తొందరగా ముగించి, డిగ్రీ చేతికి వచ్చాక నేపిల్స్‌ దగ్గర తను పెరిగినచోటుకి వెళ్లిపోదామన్న బలమైన కోర్కె ఉన్నవాడు. ఇటలీలో అతనిని చేరదీసినవారు కాని, కరుణ చూపించినవారు కానిలేరు. గది అద్దెకి ఇచ్చిన యజమాని, నడిచి వెళ్లేటప్పుడు ఆ వీధిలో నివసించే మనుషులు ముక్తసరిగా పలకరించి చిరునవ్వు ప్రదర్శించేవారు తప్ప ఇంకెవరూ తెలియదు. ఒక్కమాటలో చెప్పాలంటే ఫెలీనీ నిజంగా ఒంటరివాడు. కానీ కాలం అతనికి కొండంత నిబ్బరాన్ని ప్రసాదించింది. చదువులో అందరికన్నా ముందర ఉంటూ తమతో కలవని ఫెలీనీ అంటే అతని తోటి విద్యార్థులకి రవ్వంత కోపం, ఈర్ష్య. ఇటలీలో పెరిగినప్పుడు తిండి సరిగ్గాలేక అలమటించిన ఫెలీనీ శరీరానికి, కారు చవుకగా లభించే అమెరికన్‌ తిండి, మొక్కకి ఎరువులా పనిచేయడంతో అమెరికా చేరిన ఒక్క నెలలోనే దృఢత్వం నిగారింపువచ్చాయి. పెద్దకళ్ళు, బలమైన నాసిక, చెక్కినట్లున్న చెక్కిళ్లతో విప్పారి ఉన్న ఫెలీనీ ఏ విధంగా చూసినా అందగాడు. ఎవ్వరితోనూ కలవకుండా తనపని తాను చేసుకుపోయే ఫెలీనీ తోటి విద్యార్ధినులకి ఒకవింత, ఒక ఆకర్షణ, అందమూ చందమూలేదని ముకుళించుకుని ఉన్న కుర్రాళ్ళ సంగతి సరే, కాని ఈ అందగాడు తెలివైనవాడు, ఎలాంటి వ్యసనాలు లేనివాడు అందరికీ దూరంగా మసలడంతో ఎవరకీ అర్ధమవడు. అతని మీద చర్చ వచ్చినప్పుడు, బహుశా అతను ''స్వలింగ సంపర్కుడేమో'' అన్న అనుమానం కొందరికి వచ్చినా, 'ఛ' అలా కాకూడదు అనుకుంటారు.

రెండు సెమిస్టర్లు గడిచాయి.
మూడవ సెమిస్టర్‌లో ఒక ప్రొఫెసర్‌ ఇరవై నలుగురు ఉన్న క్లాసుని నలుగురు చొప్పున ఆరు గ్రూపులుగా విభజించి గ్రూప్‌ ప్రాజెక్ట్‌లు చేయమని నిర్దేశించినపుడు జార్జియా ఫెలీనీకి పరిచయం అవుతుంది. గ్రీస్‌లో ఉన్న ఒక ప్రముఖ ధనవంతుల పిల్ల జార్జియా. చెంపకి చేరడేసి కళ్ళతో, పండిన చెర్రీ రంగు పెదిమలతో, అవసరమున్నా లేకపోయినా మొహం మీద తారట్లాడే జుత్తుని వెనక్కివిదిలిస్తూ, ఫెలీనీ ఉచ్చరించిన ప్రతీవాక్యానికి స్పందించినట్లు ప్రవర్తించి అతని దృష్టిని ఆకర్షిస్తుంది. జీవితంలో ఎవ్వరూ పట్టించుకోని ఫెలీనీ, జార్జియా తన పట్ల ప్రదర్శిస్తున్న ఆసక్తికి ముగ్ధుడవుతాడు. చిన్న గుడి కట్టుకుని దానిలో గుట్టుగా నివసిస్తున్న ఫెలీనీని ఉక్కిరిబిక్కిరి చేసి అతని గుడిని తుత్తునియలు చేస్తుంది జార్జియా. తన ప్రభావ ప్రవాహంతో వరద నీటిలో కొట్టుకుపోయే చిన్న రాయిలా, తన మోహంలో శ్లేష్మంలో పడిన ఈగలా ప్రవర్తించేలా చేస్తుంది. అతని బలహీనత అర్ధం చేసుకున్న జార్జియా, ''కొన్ని హద్దులు పెళ్ళయ్యాకే దాటాలని నా సిద్ధాంతం'' అంటుంది.

మనం ''పెళ్ళి చేసుకుందాం'' అంటాడు ఫెలీనీ.
''నిజం?'' అంటూ కళ్ళు చికిలించి, ఒంకరలు తిరిగి విలాసంగా నవ్వుతూ తిరిగి ప్రశ్నిస్తుంది జార్జియా. అమె తన గుండెల్లో రగిల్చిన జ్వాల ఫెలీనీ నరనరాల్లో ప్రవహించి ఒంటిని కాల్చి తీయని అనుభవం కోసం శరీరంలో ప్రతీ అణువునూ అవధుల మేరకు కుదపడంతో ఇంకేమీ పాలుపోక, ''నిజం'' అంటాడు ఫెలీనీ.

కావలసింది సాధించడానికి దేనికైనా వెనుదీయని వ్యక్తి జార్జియా. అందగాడైన ఫెలీనీ తన ఉనికిని ఒక సంవత్సరం పాటు పట్టించుకోకపోవడంతో అవమానంగా తలిచిన ఆమె, అతనిని లొంగతీసుకోవాలన్న అభిమతాన్ని నెరవేర్చుకుంది. అందరి బంధువుల సమక్షంలో పెళ్ళి జరగాలన్న జార్జియా ప్రతిపాదనకి ఫెలీనీ అంగీకరిస్తాడు. గ్రీసులో ఏథెన్స్‌ పట్టణంలో అత్యంత వైభవంగా ఫెలీనీని జార్జియా పెళ్ళాడుతుంది.
వివాహమయ్యాక ''ఇక్కడే నీకు మంచి ఉద్యోగం దొరుకుతుంది. ప్రయత్నిద్దాం. మంచి ఉద్యోగం లభించకపోతే మరో మార్గం వెతుకుదాం'' అని అతి చాతుర్యంగా గ్రీసులోనే ఫెలీనీ ఉండేలా చేస్తుంది జార్జియా. దొరికిన ఉద్యోగంలో చేరి జార్జియాతో గ్రీసులో జీవితం మొదలుపెడతాడు ఫెలీనీ.

''ఒకసారి ఇటలీ వెళ్ళి నే నివసించిన ప్రదేశం చూసి వద్దాం'' అన్న ఫెలీనీ ప్రతిపాదనకి జార్జియా ''అలాగే వెళ్దాం'' అంటుంది కాని దాని గురించి ఆలోచించకుండా రోజులు దాటవేస్తుంది.
నాలుగుసార్లు ''ఇటలీవెళ్దాం'' అని ఫెలీనీ అన్నా ఏవో కారణాలు చెప్పి అతడి ఆలోచనని మరుగు పరుస్తుంది.
ఫెలీనీకి జార్జియా అంటే ప్రేమ ఏమాత్రం సడలినట్లు అనిపించకపోయినా, అందగాడైన అతడు ఏదైనా అడ్డదార్లు తొక్కుతాడేమోననే అనుమానంతో అతడి మీద రహస్యంగా నిఘా ఉంచుతుంది జార్జియా.

ఒకరోజు సాయంకాలం ఆఫీసు నుంచి తిరిగి వస్తుంటే ఒక పెద్ద భవనంలో పేలుడు జరగడం, ఆ వెనువెంటనే నలుగురు వ్యక్తులు పారిపోవడం ఫెలీనీ కంట పడుతుంది. విస్తరిస్తున్న జ్వాలలని ఆశ్చర్యంతో గమనిస్తున్న ఫెలీనీ దగ్గరకి పోలీసులు వస్తారు. అతడు తను చూసినదంతా వివరించగా ఫెలీనీని పోలీస్‌ స్టేషన్‌కి తీసుకెళతారు.

మర్నాడు ఉదయం జార్జియా వచ్చి ఫెలీనీ గురించి పోలీసాఫీసర్లకి చెప్పి ఇంటికి తీసుకెళ్తుంటే ''ఇటలీ నుంచి వచ్చి సంఘ విద్రోహ చర్యలకు పాల్పడిన వ్యక్తుల్ని ఆనవాలుపట్టగల వ్యక్తి మీరొక్కరే. వాళ్ళు దొరికేంత వరకు మీరు ఈ దేశం వదిలి వెళ్ళకండి'' అని ఆదేశిస్తారు. నాలుగు రోజుల తరువాత ఫెలీనీ లేనపుడు ఇంటికి వచ్చి ఫెలీనీ పాస్‌ పోర్ట్‌ తీసుకెళ్తారు. అడపాదడపా పోలీసుల నుంచి ఫెలీనీకి పిలుపు వచ్చి పోలీస్‌ స్టేషన్‌కి నిందితులని గుర్తించడానికి వెళ్ళినా, విద్రోహకారుల ఆచూకీ తెలియదు.

రోజులు గడుస్తుంటాయి. ''ఎన్నాళ్ళిలా, ఒకసారి ఇటలీ వెళ్ళివద్దాం'' అని ఫెలీనీ రవ్వంత అసహనంగా ప్రశ్నించినపుడు, ''కాస్త వోపిక పట్టు'' అంటూ ఫెలీనీని ముద్దులతో ముంచెత్తి మురిపించి మరపిస్తుంది. నాలుగైదుసార్లు అలా జరిగాక ''నేను వాకబు చేయించాను, అసలు నిందితులని పట్టుకునేంత వరకు నీ పాస్‌పోర్ట్‌ నీకు అందచేయడం చట్ట విరుద్ధమట. ఆ సంఘటన జరిగినపుడు నువ్వు అక్కడ ఉండడం దురదృష్టకరం, దుండగులు త్వరలో దొరుకుతారు, ఇటలీ వెళ్దాం. అక్కడ ఏముంది? అయినా నీకు ఇక్కడ ఏం తక్కువయింది'' అనడిగింది జార్జియా.

ఫెలీనీ గ్రీస్‌ వచ్చి మూడేళ్ళు దాటిపోయింది. గ్రీస్‌ అందమైన దేశం. అక్కడ అన్ని సదుపాయాలూ సౌకర్యాలూ ఉన్నాయి. ప్రేమించే భార్య, మంచి ఉద్యోగం ఉన్నాయి. దేనికీ కొరత లేదు, అయినప్పటికీ ఫెలీనీలో క్రమంగా అసంతృప్తి, అసహనం వివరించలేనంత తీవ్రతకి చేరాయి.
'తను ఈ దేశంలో బందీ! తను ఎక్కడకీ వెళ్ళలేడు. తన జీవితం ఇలా మగ్గిపోవాల్సిందే!' అనుకుంటాడు. చిన్నప్పుడు ఇటలీలో గడిపిన రోజులు జ్ఞాపకానికి వస్తే, అవి విశిష్టమైనవి కాకపోయినా ఎందుకో అవి చాలా తీపిగా అనిపిస్తాయి ఫెలీనీకి. 'అన్నీ ఉన్నాయి తనకి ఒక్క స్వతంత్రం తప్ప! సముద్రంలో తిరిగే చేపని పట్టుకు వచ్చి చిన్న మంచినీటి చెరువులో పడవేసినట్లుంది తన బతుకు' అని ఫెలీనీ గింజుకుంటాడు.

మనకి ఏదైతేలేదో దాని వెలితి వెయ్యి రెట్లు పెరిగినట్లనిపిస్తుందని ఎవరో అన్నట్లుగా కావలసిన చోటుకి వెళ్ళలేకపోతున్నానన్న బాధ ముందు ఇతర సుఖాలన్నీ చిత్తుగా వోడిపోవడంతో గ్రీస్‌ నుంచి పారిపోవడం ఎలా? అన్న తీవ్రమైన ఆలోచన ఫెలీనీని వేధిస్తుంది.
దేశం నుంచి పారిపోయే మార్గాల గురించి అన్వేషణ మొదలు పెడతాడు. నెల్లాళ్ళ పరిశోధన తరువాత గ్రీస్‌ నుంచి ఏడ్రియాటిక్‌ సముద్రాన్ని చిన్న పడవలో దాటించడానికి ఒక వెయ్యి డాలర్లు ఇస్తే కుదురుతుందని తెలుసుకుని, హుటాహుటిన బ్యాంక్‌ నుంచి డబ్బు తెచ్చి మధ్యవర్తికి అందజేస్తాడు ఫెలీనీ.

రెండు రోజుల తరువాత రాత్రి పది గంటలకి సముద్ర తీరాన ఉన్న మిలాన్‌ కేఫ్‌కి రమ్మన్న కబురందడంతో అతడి ఆనందానికి అవధులు లేకుండా పోతాయి. జార్జియాతో చెబితే ప్రయాణానికి అడ్డుతగులుతుందని ఈ విషయాన్ని గుట్టుగా ఉంచి ఇటలీ చేరాక ఆమెకి తెలియపరచాలానే నిర్ణయానికి వస్తాడు.

''అప్పుడే కాఫీ తాగేసావా?'' అన్న జాన్‌ మాటలు రాజుని వాస్తవంలోకి తెచ్చాయి.
'ఇంతకీ ఫెలీనీ సంగతేమిటి? నువ్వు తిండిధ్యాసలో పడి సమాధానం ఇవ్వలేదు' అనడిగాడు స్మిత్‌.
''ఫెలీనీ లాంటి వ్యక్తులని రెండు పడవలలో సముద్రం దాటిస్తున్నారని, అందులో ఒక పడవ మునిగిపోయిందని సినిమాలో చూపించారు. ఫెలీనీ ఇటలీ చేరాడా? లేదా? అన్నది ముఖ్యం కాదు కాబట్టి అది మనకి చూపించలేదు. కొందరు వ్యక్తులు స్వేచ్ఛ కోసం ఎంతకైనా తెగిస్తారన్నది చెప్పడమే ముఖ్యం. ఫెలీనీ మునిగినా తేలినా ఒక్కటే కదా!'' అన్నాడు జాన్‌.

''నేను ఏ మాత్రం ఏకీభవించను. అన్నీ ఉన్న గ్రీస్‌ వదిలి స్వేచ్ఛ అంటూ ఏమీలేని ఇటలీకి ఫెలీనీ పరుగుపెట్టడం చాలా హాస్యాస్పదం. ఇటలీలో అతడిని సరిగ్గా గుర్తించే వారైనాలేరు. మరి దేనికోసం అతడి తపన, పరుగు. చాలా సిల్లీగా ఉంది'' అన్నాడు స్మిత్‌.
''బలహీనతలకి, సెంటిమెంట్‌లకి బానిసలయ్యే మనుష్యుల్ని మనం చూస్తాం. ఒక రకమైన బలహీనత ఉన్న వ్యక్తి ఇంకో రకమైన బలహీనత ఉన్న మనిషిని ఎద్దేవా చేయకూడదు. అలాంటిదే సెంటిమెంట్‌ కూడ. ఫెలీనీ విషయంలో బలహీనతకాని, సెంటిమెంట్‌కాని ముఖ్యం కాదు. తిండి, సుఖాలు మనిషికి ముఖ్యమే కాదనను. అవి కేవలం శారీరక సంబధమైనవి. స్వేచ్ఛ అలాంటిదికాదు, అది మెదడుకి సంబంధించినది. కొందరు స్వేచ్ఛకి ఫెలీనీలా ప్రాముఖ్యత ఇవ్వకపోవచ్చు. వాళ్ళని ప్రశ్నిస్తే, 'ఆ! అదంత ముఖ్యంకాదు' అంటారు. స్యేచ్ఛకి ఆనకట్ట పడనంత వరకు అలాగే అనుకుంటారు. నాకు తెలిసిన ఒక చిన్న ఉదాహరణ చెబుతాను. నా స్నేహితునికి ప్రతీరోజూ పడుకునే ముందు డైరీ రాసే అలవాటుంది. అతడికి వివాహమయ్యాక డైరీలు చదువుతానంటుంది అతడి భార్య. డైరీలో రాసుకున్న వాటిలో ఏమీ రహస్యాలు లేకపోయినా అవి నా స్వంతం అంటాడు అతడు. నేను నీ భార్యని, నాకు నీ డైరీ చదివే హక్కు ఉంది అంటుంది ఆమె. ఆమెతో ఘర్షణ పడలేక అతడు డైరీ రాయడం మానుకున్నాడు. కానీ తన ఊహల్ని, కోరికల్ని వ్యక్తపరిచే ఆ మార్గం మూత పడడంతో అంతర్లీనంగా అతడి గుండెలో ఆమె మీద కోపం రాజుకుంది, అతడి స్వేచ్ఛ గాయపడింది.

స్వేచ్ఛ! అది శరీరంలో నిబిడీకృతమై నిద్రపోతున్న ఒక వికృతమైన మృగం. ఒక వ్యక్తినేరం చేస్తే, సమాజం అతడిని నాలుగు గోడల మధ్య బంధించి, మనిషికి అన్నిటికంటే ముఖ్యమైన స్వేచ్ఛని లాగేసుకుంటుంది.

ఫెలీనీకి ఇటలీమీద ప్రత్యేకమైన ఆసక్తి ఏమీలేదని మనకి తెలుసు. అతను ఇటలీ వెళ్దామనుకుంటాడు. ఆ కోరికకి పరిస్థితులు అడ్డంపడి వెళ్ళ లేకపోతాడు. అతడిలో నిద్రపోతున్న స్వేచ్ఛా మృగం మేల్కొని కట్టలు తెంచుకుని అదుపు తప్పింది. దాని పరిణామమేమిటి? అని క్రమబద్ధ ఆలోచన అతనికి రాదు. శృంఖ లాలని తెంచుకోవడమే ముఖ్యం'' అని ఆగాడు జాన్‌. స్మిత్‌ విచిత్రంగా చూస్తుంటే జాన్‌ తిరిగి అందుకున్నాడు.
''నీకు చెప్పలేదు ఇంతవరకూ, నేను ఇంగ్లండ్‌కి శాశ్వతంగా వెళ్ళిపోదామని నిశ్చయించుకున్నాను,'' అన్నాడు.
''వాట్‌?'' అని స్మిత్‌ అరిచినంత పని చేశాడు.

''దాదాపు నలబైఏళ్ళ క్రితం ఇక్కడకి వచ్చాను. అన్నివిధాలా జీవితంలో పురోగమించాను. ఒకసారి విడాకులు తీసుకున్నాను. నా రెండో భార్య నాకంటే చాలా చిన్నది, ఉద్యోగం చేస్తోంది, నా మొదటి భార్య తిరిగి పెళ్ళి చేసుకోవడం వల్ల ఆమెకి నే భరణం ఇవ్వనక్కరలేదు. ఆ భార్య ద్వారా జన్మించిన నా కొడుక్కి ఇరవై ఒక్కేళ్లు వచ్చేంతవరకు అయిన ఖర్చు భరించాను. ఇప్పుడు అతను ఉద్యోగం చేసుకుంటున్నాడు ఇతర బాదర బందీలులేవు. లండన్‌ వెళ్ళిపోతాను'' అన్నాడు జాన్‌.

''డోంట్‌ బి ఎ జాక్‌ ఏస్‌, నీ జీవితం అంతా ఇక్కడే గడిచింది. అక్కడ ఉన్న వాళ్లకి నువ్వు ఎప్పుడో మరుగునపడి ఉంటావు. నువ్వు లండన్‌ వెళ్లడానికి నీ రెండోభార్య ఒప్పుకోకపోతే ఆర్థికంగా నష్టపోతావు'' అన్నాడు స్మిత్‌.
''ఐ డోంట్‌ కేర్‌''
''నీ భార్యతో సఖ్యంగా రోజులు సాగడంలేదా? అదే కారణమైతే విడాకులు తీసుకోవచ్చు. నాకైతే నువ్వు లండన్‌ వెళ్ళిపోతాననడం సబబుగా లేదు. ఆ ఆలోచన రావడానికి అసలు కారణాలు ఏమిటి?'' అనడిగాడు స్మిత్‌.

''అమెరికాలో ఇప్పుడు స్వేచ్ఛ లోపించింది. అది భరించలేకపోతున్నాను'' అన్నాడు జాన్‌.
''ఏమిటీ అసందర్భ ప్రేలాపన. ఇతర దేశాల నుంచి అక్కడ అణిచివేతకు గురయిన ప్రజలు ఇక్కడికి స్వేచ్ఛ కోసం వలస వస్తున్నారు. ఏ దేశంలోనూ లేని స్వేచ్ఛ ఈ దేశంలో ఉందన్న సంగతి అందరికీ తెలసిందే కదా?'' అన్నాడు స్మిత్‌. ''అమెరికాను ల్యాండ్‌ ఆఫ్‌ ఆపర్చ్యూనిటీ అంటారు, ఒప్పుకుంటాను. ఈ దేశంలో మనకి నచ్చిన కెరియర్‌ని మనం ఎంచుకోవచ్చు. ఇద్దరూ ఇష్టపడితే, కావాలనుకున్న స్త్రీని వివాహం చేసుకోవచ్చు. భార్యాభర్తల మధ్య తీవ్రమైన విభేదాలు ఉద్భవించి, అవి సర్దుకోలేనంతగా ఉంటే విడాకులు తీసుకోవచ్చు. ఏ బట్టలు కావాలంటే అవి ధరించవచ్చు. అలాంటివి కోకొల్లలు ఉన్నాయి, కాదనను. కానీ కొన్ని పనులు చేయలేం, ఆంక్షలు వచ్చాయి. పత్రికలలో ఎవరి ఊహలు, ఉద్దేశాలు వారు నిర్భయంగా ఇదివరకు రాసేవారు. వాక్స్వాతంత్రం ఉండేది. ఇప్పుడు అలాకాదు. ఉదాహరణకి పత్రికలలో యూదులని విమర్శిస్తూరాయి చూద్దాం. తుక్కురేగిపోతుంది. గతంలో ప్రభుత్వ నడవడిక మీద పౌరులు బాహాటంగా తమ ఆలోచనల్ని వ్యక్తపరిచేవారు. ఇప్పుడు ధోరణిమారింది. ప్రభుత్వాన్ని సమర్థించకపోతే ఆ వ్యక్తిని 'దేశద్రోహి' అనేస్తున్నారు. ప్రభుత్వాన్ని ఎందుకు విమర్శించాలి? యూదుల మీద ఎందుకు రాయాలి? అని నువ్వు అనవచ్చు. ఏదైనా కట్టడిపెడితే మెదడులో నిద్రపోతున్న మృగం మనల్ని అల్లరి పెడుతుంది. అమెరికాలో ఉన్న విశృంఖలమైన స్వేచ్ఛ దేశానికి మంచిది కాదు అంటున్నారు కొందరు. ఎవరు నిశ్చయిస్తారు దీనిని? నాకు నా భావస్వాతంత్రం ముఖ్యం, నా ఉద్దేశంలో దానికి పెద్ద గండిపడింది. అందుకే వెళ్ళిపోతున్నాను. అక్కడకి వెళ్లాక పరిస్థితులు ఇక్కడ కన్నా ఘోరంగా ఉండవచ్చు. నాకు తెలిసిన ఇక్కడి పరిస్థితులు నాకు రుచించడంలేదు. అక్కడ బాగుంటాయిని వెళ్తున్నాను. అక్కడా బాగుండకపోతే ఏం చేయాలో అప్పుడు ఆలోచిస్తాను'' అంటూ ముగించాడు జాన్‌. స్మిత్‌, జాన్‌ సంభాషణ ఇంకోదారి పట్టడంతో రాజు ఆలోచనల్లో పడ్డాడు.

అమెరికాలో వ్యక్తి స్వాతంత్రం ముఖ్యం. కొన్ని సందర్భాలలో దానికంటే దేశం ముఖ్యం అంటోంది ప్రభుత్వం. సిద్ధాంతరీత్యా అది సరి అయిందే అనిపించినా పదవిలో ఉన్న కొందరి వ్యక్తుల వ్యక్తిగత ఉద్దేశాల ఆధారంగానో, ఇంకే ఇతర కారణాల వల్లనో దేశానికి నష్టం అని భావిస్తే ఎందుకు నష్టమో నిజాయితీతో వివరిస్తే, ఏ పౌరుడూ కాదనడు. అలా కానపుడు, 'ఏలాంటి నష్టం?' అని ప్రశ్నించే హక్కు సామాన్య పౌరునికి లేకపోతే ఎలా? ఆ హక్కుని లాగేసుకున్నపుడు అతడు తన స్వేచ్ఛని కోల్పోలేదా? ఆ కోణంలోంచి చూస్తే జాన్‌ ఆవేదన అర్థమవుతుంది.

మన సంగతి ప్రభుత్వమే చూసుకుంటుంది, అనుకుని ఏమీ పట్టించుకోకుండా బతికే వ్యక్తులకి ఏ ఇబ్బందీ ఉండదు. కానీ అందరూ అలా వదిలేస్తే, దేశం కొందరి చేతులలో కీలుబొమ్మ అయిపోతుంది. ఆ కొందరు తమ ఉద్దేశాలకి, ఆనవాయితీలకి మిగతా జానాభాని బానిసలుగా చేయడమే కాకుండా, ఎవరైనా ఎదురు చెబితే అణగతొక్కేయరూ?

అణగతొక్కడమంటే రెండురోజుల క్రితం ఇంటర్నెట్‌లో చదివిన వార్త జ్ఞాపకానికి వచ్చింది రాజుకి. ఒకనటి వివాహానికి ముందు స్త్రీ లైంగిక సంబంధం గురించి చేసిన వ్యాఖ్య మీద దుమారం రేగి, అలజడులు సృష్టించి, విషయం కోర్టుల వరకు వెళ్లింది. ఆ నటికి దేవాలయం కట్టించి, ఆకాశానికి ఎత్తేసిన అభిమానులు ఒక అంశం మీద తమకి తమకి నచ్చని రీతిలో వ్యాఖ్యానించగానే ఆమెమీద చెప్పులు, రాళ్లు విసిరి నిరసన ప్రదర్శించారు. తమకి ఆమోదయోగ్యమైనట్లే ఆమె ప్రవర్తించాలంటే ఆమె వ్యక్తిగత స్వాతంత్రం ఏమైంది?

బెత్తెడు గుడ్డపీలికలు వేసుకున్న సినిమాలు ఉత్సాహంతో చూసి రోడ్లమీద గెంతు లేస్తున్న ప్రజ, ఒక క్రీడాకారిణి వేసుకున్న దుస్తుల మీద ఆంక్షలు పెట్టడానికి ప్రయత్నించడం విడ్డూరం కాక ఇంకేమిటి? రేపు కళ్లకి కాటుక ధరించకు అంటే? 'స్వేచ్ఛ! వింత మృగం' అన్నాడు జాన్‌. తనికి నచ్చింది ఆ వ్యాఖ్య.

కోతి చేతిలో గ్రెనేడ్‌లా కొందరు ఛాందసులు, వ్యక్తిలో ఉన్న స్వేచ్ఛా మృగాన్ని చంపేయడానికి చేస్తున్న ప్రయత్నాలు చూస్తుంటే ఆ మృగం ఎంతకాలం తట్టుకుంటుంది'' అనుకుంటూ వేడెక్కిన తలని చల్లపరచడానికి కురుస్తున్న మంచులోనికి నడిచేడు రాజు.

బలి పీఠం - కొంకణీ కథ

ఫెలిస్యూకార్డోస్‌
కొంకణీ కథ
అనువాదం:అచ్యుతుని రాజ్యశ్రీ
''ఇదిగో, ఇవ్వాళ కూడా అమ్ముడు పోలేదు'' లోపలికి అడుగు పెడ్తూ నుదుటి చెమటను తుడుచుకుంటూ అన్నాడు భార్యతో నారాయణ. ఎనిమిది రోజులు గడిచాయి. బీదరికంతో మగ్గుతున్న అతను హతాశుడైనాడు. అప్పు కోసం బైలుదేరాడు. బంధువులు, స్నేహితులు, పరిచయస్తులు అతనికొక్క పైసా కూడా విదల్చలేదు. పొలం శత్రువుల చేతిలో పడరాదని అతను శతవిధాలా ప్రయత్నాలు చేస్తూ కోర్టు చుట్టూ తిరుగుతున్నాడు. నెత్తిమీద కత్తి ఫ్యాన్‌లా తిరుగుతున్నంత బాధగా ఉందతనికి!

గత ఏడాది వంద రూపాయలకే పొలం అమ్మాల్సిన పరిస్థితి ఏర్పడింది. పాపం తన పొరుగువాడే అంత నమ్మక ద్రోహం చేస్తాడని కలలో కూడా అనుకోలేదతను. తన చర్మాన్ని చీలుస్తున్నంత బాధగా ఉంది నారాయణకి. పిల్లా పాపల కోసం పొలాన్ని తాకట్టు పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడింది. అసలు ఆ పొలం అతనిది కాదు. కానీ తాత తండ్రుల కాలంనించీ తన చెమట, రక్తం ధారపోసి ఆ పొలం దున్నుతున్నాడు. శ్రమ, కష్టాలకి భయపడడు కానీ, అదే తన సర్వస్వం అని పగలూ రాత్రీ మనసు, శరీరం లగ్నం చేసి పని చేస్తాడు. కానీ ఈ ఏడు అతనికి దుర్దశ ప్రాప్తించింది. మే నెలాఖరులో చెత్త, పేడ, గడ్డీగాదం వేసి నేలని తయారుచేశాడు. మట్టిని తవ్వుతుంటే చేతులు బొబ్బలెక్కాయి గూడా! పొలం దున్నాడు. హఠాత్తుగా కాలంగాని కాలంలో కుంభవృష్టి కురవటంతో మొత్తం కష్టం అంతా నీటి పాలైంది. అంతా శూన్యం, కటిక చీకటి.

పైసాపైసా కూడబెట్టి వంద రూపాయలకి జమ అయితే ఎద్దుని కొంటానికి మూట గట్టాడు. కానీ, ఆ డబ్బుతో విత్తులు కొని తిరిగి నాటాడు. కొన్నాళ్లకే ఆ పైరు పచ్చగా తివాచీలా కళకళలాడసాగింది. రాబోయే పంటకి గాలి మేడలు కట్టసాగాడు. ఈ పంట చేతికొస్తుందనే నమ్మకంతో భార్యతో అన్నాడు, ''శేవంతీ! దేవుడు మన మొర ఆలకించాడు. ఈసారి తాకట్టు పెట్టిన నీ కంకణం, కంటె విడిపిస్తా''.

''పంట కోత కాగానే మా పుట్టింటి కెళ్దాం. ఓ నాల్గు రోజులుండి వద్దాం'' సత్యనారాయణస్వామి ప్రసాదం నోట్లో వేస్తూ అన్నదామె.
ఎప్పటిలానే దసరా రోజుల్లో టిఫిన్‌ తిని పొలానికి బైలుదేరాడు నారాయణ. అంతే కాళ్ళు నేలకి అంటుకుపోయాయి. ఒక్క రాత్రిలో మిడతల దండు పైరు మొత్తాన్ని సర్వనాశనం చేయటంతో కన్నీరు కారుస్తుండిపోయాడు. ఇంటికి తిరిగొచ్చి వరండాలో ఏడుస్తూ కుప్పకూలాడు.

శేవంతీ గుండె గుభిల్లుమనడంతో భర్తని అడిగింది. ''ఎందుకా కన్నీరు?''
''ఏం చెప్పేది? మన అదృష్టం కుప్ప కూలింది. మిడతల దండు మన పచ్చని చేలని సర్వనాశనం చేసింది''.
ఆమె గుండె అవిసిపోయింది. పాలిపోయిన మొహంతో, మిగిలిన ఒకే ఒక బం గారు నగని తెచ్చి భర్త చేతిలో పెట్టింది.
అతను దీర్ఘంగా నిట్టూరుస్తూ లేచి సరాసరి కంసాలి శాణూ దగ్గరకెళ్లి సగం రేటుకే అమ్మేశాడు. విత్తులు కొని రెండోసారి నాటాడు. ఈసారి కూడా వరదలకి అతని ఆశలు కుప్ప కూలాయి. ఎలా బాకీ తీర్చాలా అనే చింత పట్టుకుంది. ఇక ఎవరి ముందు ఏడ్వాలతను? దైవమే తనకి వ్యతిరేకం అయితే, ఇక భూమిపై నుండే మనుషులేం చేయగలరు? కానీ భూమికి యజమానిపై దయ మాత్రం రాదు, కలగదు. అప్పు తీర్చకపోతే పొలం చేతిలోంచి జారిపోటం ఖాయం. తాకట్టు పెట్టి అప్పు తీసుకునే ఆశ కూడా లేదు, ఇంక ఇంట్లో ఏం మిగిలింది కనక?

ఎంతో ఆలోచించగా తనకిష్టమైన ఎద్దు ములా అతని దృష్టిలోకి వచ్చింది. ఇక దాన్ని అమ్మటమే తరుణోపాయం. కష్టాల్లో కొట్టుకుపోయే తనలాంటి వాడికి దొరికిన గడ్డి పోచ అది! తన ప్రాణం కంటే మిన్న అయిన ములాని అమ్మటం అంటే తన కాళ్ళని తాను నరుక్కోటమే! అయినా, అది కూడా శుష్కించి, తిండి లేకపోటంతో బక్కచిక్కి ఎముకల పోగులా అయింది.

దాన్ని మాడ్చి చంపటం కన్నా అమ్మటం మేలు. అందుకే రెండుసార్లు మడగావ్‌ బజారుకి తీసికెళ్లాడు. దాన్ని చూస్తూనే జనం పెదవి విరిచారు. ఓ ఐదు రూపాయలు ఎక్కువ ఇచ్చి కొనే ఏకైక వ్యక్తి కసాయివాడు మాత్రమే. అందుకే ఎంతో బాధగా తిరిగివచ్చాడు.
ములాతో వచ్చిన తండ్రిని, ఎద్దుని చూసి నారాయణ ఏడేళ్ల కొడుకు సురేష్‌ పరుగెత్తుకొచ్చి దాని మెడని నిమరసాగాడు. కొద్దిగా గడ్డి వేశాడు. అది అలసిపోయి చతికిలబడింది.

భార్యతో అన్నాడు, ''ఇప్పుడేం చేద్దాం.బాకీ తీర్చడానికి ఒకే ఒక్కరోజు గడు వుంది. కసాయికి అమ్మాలంటేనే నా గుండె బద్దలవుతోంది. అసలు లేనిదానికంటే ఉన్నకాడికి అమ్మటం ఉత్తమం. రేపు అమ్మితీరుతా!''.
తన ఎదలో చురకత్తి దిగబడినట్లు విలవిలలాడిందామె. మౌనమే అంగీకారంగా భావించాడతను.
సురేష్‌ కూడా విలవిల్లాడాడు. ''నాన్నా! ములాని అమ్మొద్దు, ఇక్కడే ఉంచు'' అని ఏడ్వసాగాడు. ఎలా దాని ప్రాణం కాపాడాలా అని ఆలోచించాడు.

బాగా రాత్రయింది. అంతా నిద్ర పోతున్నారు. సురేష్‌ కంటికి కునుకే రావటం లేదు. నెమ్మదిగా లేచి చప్పడు కాకుండా తలుపు తెరిచి ఎద్దు దగ్గరికెళ్లి దాని వీపు నిమరసాగాడు. దాని పలుపుతాడు విప్పి చాలా దూరం పారిపోయేలా తోలి, ఇంటి కొచ్చి పడుకున్నాడు. ''అమ్మయ్య! ములా ప్రాణం కాపాడాను'' అన్న సంతోషం ఆ పసిమనసులో గంతులేసింది.

ఆ మర్నాడు నిద్రలేచిన నారాయణ మొహం, కాళ్లు చేతులు కడుక్కొని చిరిగిన కంబళి తీసుకొని ఎద్దుని లేపాడు. దాని మెడలో పలుపు తాడు లేకపోవటంతో ఆశ్చర్యపోయాడు. దాని శరీరం ఒక్క అంగుళం కూడా కదలనని మొరాయిస్తోంది. నారాయణకి దాన్ని చూస్తూనే కొత్త దిగులు పట్టుకుంది. ఎద్దు కొద్దిగా లేచి, నించోలేక కూప్పకూలి పోతోంది. అతను పరుగెత్తి కసాయిని ఇంటికే తెచ్చాడు. ఆ కఠిన కసాయి దాని వీపుపై నాలుగైదుసార్లు కొరడా ఛెళ్లు మన్పించాడు. అయినా అది కదలలేకపోతోంది. నారాయణని మెడ పట్టుకోమని, తను తోక పట్టుకున్నాడు కసాయి. పళ్లతో క్రూరంగా దాని తోకని కొరకసాగాడు. అది హృదయవిదారకంగా అరుస్తూ కుంటుతూ పడుతూ లేస్తూ నడవసాగింది.

డబ్బు తీసుకునేప్పుడు నారాయణ కళ్లు నీటిచెలమలైనాయి. చేతులు వణకసాగాయి. కానీ ఇంకో మార్గం లేదే!
సురేష్‌ పొద్దున్నే పొయ్యి దగ్గర చేరాడు. తను రాత్రి ఎంచక్కా ములాని పలుపుతాడు వదిలి తోలేశానని ఆనందంగా ఉంది వాడికి! కానీ... పాపం వాడికేం తెల్సు, తన యజమాని దుర్దశకి వగచి, అది ఇంకో ఎద్దుతో కల్సి బండి ఈడుస్తోందని. ఆ బండిలో ఎద్దు మాంసం ఉంది. ఆ మాంసంతో నిండిన బండిని ఈడుస్తూ, భయంతో వణికిపోతూ సగం చచ్చినట్లు అయింది ములా పరిస్థితి. పాపం, ఆ బొయికల పోగు ఎద్దుకి తనే బలిపీఠానికి ఎక్కుబోతున్నట్లు అప్పటికి తెలీదు.

సేవ - తెలుగు కథ

''అబ్బా, ఇంక యీ బాధ భరించలేను దేవుడో త్వరగా తీసుకుపోరా నాయనా. ఇంకెన్నాళ్లు వీళ్లను అవస్థ పెట్టాలి. ఇంకెంతమంది నన్ను చీదరించుకోవాలి. ఎంతపాపం చేశానురా భగవంతుడా, నా కింతటి శిక్ష వేశావు...'' సీతమ్మ బాధతో మూలుగుతూ తనను తాను తిట్టుకుంటోంది.
''ఎందుకమ్మా, అలా బాధపడతావు. ఇప్పుడు నీ మీదెవరు విసుక్కున్నారనీ. నువ్వు మాకు భారమని అన్నానా? సాయంత్రం ఆయనొచ్చాక డాక్టరును తీసుకొస్తాడులే'' అంది నిర్మల తల్లిని ఓదార్చుతూ.

సీతమ్మ మంచం పట్టి సంవత్సరం దాటింది. పక్షవాతం- కుడికాలు, కుడి చెయ్యి పడిపోయాయి. మొహం కూడా కుడివైపుకు ఈడ్చుకుపోయి వికృతంగా వుంటుంది. ఆమె అవసరాలన్నీ ఓ మనిషి సాయంతో మంచం దగ్గిరే తీరాలి.
''దిండు యిలా వేస్తాను. వెనక్కువాలి కూర్చుని కాసిని పాలుతాగు. నిస్త్రాణగా వుంటే మరీ బెంబేలు పడిపోతావు'' అంటూ పాలగ్లాసు స్టూలుమీద పెట్టి మంచం పక్కకు వచ్చింది నిర్మల.

సీతమ్మ మొహంలో కోపం, దైన్యం, విసుగు. నిస్సహాయతతో మరింత దిగులు. అలవాటైన వాళ్లకు తప్ప ఆమె మాటలు పోల్చుకోవటం కష్టం.
''పెద్దాడికి కబురు పంపావా?''
''ఆఁ... ఆయన రెండుసార్లు ఫోన్‌ చేశాడు. అన్నయ్య వస్తానన్నాడట. ఇవాలో రేపో వస్తాడులే''.
''మళ్లీఫోన్‌...''
''అలాగే మళ్లీ ఫోన్‌ చెయ్యమని ఆయనకు చెబుతాను. నువ్వైతే పాలు తాగు''.
''జ... జై...''
''ఆఁ జయక్కూడా కబురు పెట్టారు. సెలవులు కదా, జయా, వాళ్లాయనా కలసి అత్తవారి ఊరెళ్లారట. రాగానే వస్తారు''.
సీతమ్మకు పెద్దకూతురి మాటల మీద నమ్మకం కుదరదు. ఇది తన దగ్గర బుకాయిస్తోంది. లేకపోతే కొడుకూ, చిన్న కూతురూ యింకా ఎందుకు రారు? తనకు ప్రతిరోజు యిదే ఆఖరి రోజన్నట్టుగా వుంటున్నది.

''మీ... ఆయన యింకా ఎందుకు రాలేదు?''
''ఆరే కదా అయింది. వస్తుంటారు''
''డాక్టరు వెళ్లిపోతాడేమో...''
''వెళ్లడమ్మా, ఎనిమిదింటిదాకా వుంటాడు. ఇదిగో, పాలు''
వద్దని తలతిప్పటానికి కూడా శక్తిలేదు. అతి ప్రయత్నం మీద ''పిల్లలు...'' అంది సీతమ్మ.
''వచ్చారమ్మా, హోంవర్కు చేసుకుంటున్నారు''.
సీతమ్మ నిష్ఠూరంగా చూసింది.
పిల్లలు యిటీవల ఆమె గదిలోకి రావటం తగ్గినమాట వాస్తవమే.
''పరీక్షలు దగ్గరకొస్తున్నాయి గదమ్మా... చదువుకోకపోతే ఎలా?'' అంది నిర్మల.
తల్లి వుంటున్న గదిలోకి పిల్లలు రావటం ఆరోగ్యకరం కాదని ఆమెకు తెలుసు. గదిలో వాసన. అనారోగ్యకరమైన వాతావరణం.
ఎంత ఫినైలు వేసి కడిగినా ఆ దుర్గంధం పోదు. డెట్టాలు పెట్టి తల్లిఒళ్లు తుడుస్తుంది. కాని ఆమె శుభ్రమైన మనిషిలా ఎలా వుండగలదు?

''పిల్లల్ని రమ్మను''
నిర్మల యిరకాటంలో పడింది.
''తర్వాత వస్తారు లేమ్మా''
సీతమ్మకు అనుమానంతో పాటు పట్టుదల పెరిగింది.
''రమ్మను.''
పిల్లలు వస్తే ఆమె వూరుకోదు. వాళ్లను దగ్గరకు లాక్కుని, కౌగిలించుకొని, ఒళ్లు తడిమి, ముద్దులు పెట్టుకుంటుంది. పిల్లలు చీదరించుకొంటారు. చొంగ కారే ఆమె నోరు చూసి వాళ్లు అసహ్యించుకొని, విదిలుంచుకొని వెళ్లిపోతారు. సీతమ్మ ఏడుస్తుంది.
'పిల్లలకు నామీద మమకారం లేకుండా చేశావు' అందోసారి.
నిర్మల మనసు చివుక్కుమంది.

కాని తల్లి మీద ఎలా కోపం చూపించగలదు? అందువల్ల రహస్యంగా ఏడ్చి యథా ప్రకారం తన విధుల్ని నిర్వర్తిస్తూనే వుంది. భర్తక్కోపం వస్తుందేమోనని ఈ మాట అతడిక్కూడా చెప్పలేదు.
సీతమ్మకు పెద్దల్లుడి మీద కోపంగా వుంది. అతడు తనను నిర్లక్ష్యం చేస్తున్నాడు. కూతురు కాస్త మెరుగేకాని, అది కూడా భర్తకు వంత పాడుతున్నట్లుగానే వుంటుంది. ఆస్పత్రిలో నర్సులాగా వుంటుందే తప్ప దానికి నిజంగా తన మీద ప్రేమవుందా?
ఎంతైనా, కొడుకు దగ్గర వున్న సుఖం తనకు కూతురింట్లో ఎలా వస్తుంది? కన్న కూతురైనా పరాయి ఆడపడుచే గదా?
''సరే. పాలిప్పుడు వద్దా ఇక్కడే పెడతాను తరువాత తాగు. ఆయనొచ్చేలోగా నేను వంట చేసి వస్తాను'' అంది నిర్మల.
సీతమ్మ నిప్పులు కక్కుతూ కూతుర్ని చూసింది.
తల్లి కోపం నిర్మలకు నవ్వుతెప్పించింది.

''ఇప్పుడే వస్తానమ్మా, బియ్యం, పప్పు కుక్కర్లో పెట్టివస్తాను''అంటూతల్లి చెంపలు నిమిరింది.
తల్లి కోపం ఆమెకు కొత్తేమీకాదు. ఆమె పరిస్థితికీ, ఆమె చిరాకుకూ సంబంధం వుందని గ్రహించి, ఎన్ని మాటలన్నా భరిస్తుంది. కాని ఆ క్షణాన ఎందుకోగాని తల్లికి తనమీద ద్వేషం, అసహ్యం పెరుగుతున్నాయేమోననిపించింది. ఎందుకు తల్లికి తనమీద విసుగు? తనెక్కడ పొరపాటుచేసింది? ఏం లోటు చేసింది? ఆమె ఎందుకిలాగైంది. తన అన్న, చెల్లెళ్ల మీది కోపం తన మీద చూపిస్తున్నదా? వంటింట్లో కెళ్లటానిక్కూడా కాళ్లు రాలేదు. కాంతి తగ్గిన తల్లి గాజు కళ్లలోకి చూస్తు వుండిపోయింది నిర్మల. ఆమెకు కొడుకంటే పంచప్రాణాలు. ఆ సంగతి తనకు తెలుసు. అతడు రాకపోతే ఆమె బాధపడటం సహజం.

తన పెళ్లినాటికి తల్లిదండ్రులు అంత మంచి స్థితిలోలేరు. అందువల్ల పదహరేళ్లకే వచ్చిన మొదటి సంబంధం చూసి పెళ్లి చేశారు. అక్కడితో వాళ్లకు తన బాధ్యత తీరింది. తరువాత తండ్రికి కొంత ఆస్తి కలిసి వచ్చింది. కాని అప్పటికే తనకూ వాళ్లకూ సంబంధం తీరిపోయింది. అంతే గాక, భర్త వుద్యోగరీత్యా వేరే రాష్ట్రాలకు వెళ్లటం వల్ల దూరం మరింత పెరిగింది. ఆ తర్వాత అన్నయ్య బాగా చదువుకున్నాడు. అంటే తల్లిదండ్రులు అతడికీ, చెల్లికీ మంచి చదువు చెప్పించగలిగారు. అన్నయ్య యింజనీరింగు పాసయ్యి, పెద్దింటి సంబంధం చేసుకున్నాడు.
ఆ అమ్మాయి కూడా విద్యావంతురాలు. కాలేజీలో లెక్చరరుగా పనిచేస్తున్నది. సెల్ఫ్‌పిటీ అనేది మనుషులకు కలిగే వుద్రేకాలన్నింటిలోకీ నీచాతినీచమైనదే అయినప్పటికీ, కొన్నిసార్లు ఎంత అణచుకున్నా అణగదు. నిర్మలకు తల్లిని చూస్తుంటే సెల్ఫ్‌పిటీ పొంగిపొర్లింది.

చెల్లెలు కూడా చదువుకొంది. పైగా తెలివైన పిల్ల. బ్యాంకులో వుద్యోగం వచ్చింది. మరో బ్యాంకు ఆఫీసర్ని చేసుకుంది. తన శని త్వరగా విరగడైనందుకు తల్లి ఎంతగా సంతోషించిందో!
అలా, ఆస్తి కలిసి వచ్చినప్పుడుగానీ, ఆ తర్వాత అన్నయ్యకు, చెల్లికీ దండిగా పంచినప్పుడు గానీ తను జ్ఞాపకం రాలేదు. పెళైంది గనక తను పరాయి యింటి పిల్ల.తండ్రి మరణం తర్వాత తలకొరివి పెట్టాల్సిన కొడుకు పంచనే జీవిత శేషం గడపటానికి నిర్ణయించుకున్న తల్లి యిల్లూ, ఆస్తీ అంతా అతడి పరం చేసింది.

అన్నయ్యదీ, చెల్లాయిదీ ఒకటే స్టేటస్‌. గత సంవత్సరం ఈ స్ట్రోక్‌ వచ్చిందాకా అన్నయ్య పిల్లల్నీ, చెల్లాయి పిల్లల్నీ తల్లి చూసుకుంటూ వుండేది. వాళ్ల యిళ్లు కూడా దగ్గర దగ్గరే. ఎప్పుడైనా తను వెళ్లినా చుట్టపు మనిషిగానే.
కాని, స్ట్రోక్‌ వచ్చి, మంచం దిగలేని స్థితి ఏర్పడ్డాక, కొన్నేళ్లు హాస్పటల్లో వుంచుకొని తర్వాత డాక్టర్లు, ''మేం చెయ్యగలిగిందేమీ లేదు. ఇంటికి తీసికెళ్లండి. కేర్‌ తీసుకుంటే మరో ఏడాది, రెండేళ్లు బతక్కపోదు'' అని చెప్పాక తల్లి యింటికి వచ్చింది.

అందరూ వుద్యోగస్తులే. ఎవరు చూడాలి? ఉద్యోగం లేకుండా యింట్లో వున్నది తనొక్కత్తే. అప్పుడు తను జ్ఞాపకం వచ్చింది. ఉద్యోగస్తుల దృష్టిలో, ఇంట్లో వుండే గృహిణికి యిరవై నాలుగ్గంటలూ తీరికే.
''అమ్మను నువ్వే చూసుకోక తప్పదే. మాకైతే వీలుపడదు. మేం ప్రతి ఆదివారం వచ్చి చూసిపోతుంటామనుకో. డబ్బులేమైనా కావాలంటే సర్దుతాంలే'' అన్నాడు అన్నయ్య.

''ఛఛ అమ్మ గురించి మాట్లాడుతూ డబ్బులంటావేం'' అందితాను. పరాయి యింటిపిల్ల(సెల్ఫ్‌పిటీ)
''మాటవరసకన్నానులే ఎంతచేస్తే మాత్రం మనకు వాళ్ల రుణం తీరుతుంది'' అన్నాడు అన్నయ్య.
చెల్లెలు డిట్టో అంది.
తల్లి తనింటి కొచ్చింది.

తన భర్తకు ఆడిట్‌ డిపార్ట్‌మెంటులో పని. ఎప్పుడూళ్లో వుంటాడో, ఎప్పుడు టూరుకుపోతాడో ఆయనకే తెలియదు. నిజానికి, తల్లి తనింటి కొచ్చినరోజున ఆయన యింట్లో లేడు. కాని వచ్చిన తర్వాత విషయం తెలుసుకుని ఒక్క మాటనలేదు.
నీకు వీలైనంత చెయ్యి. మన సుఖం కన్నా ఆమె అవసరం ముఖ్యం. అతడి స్వభావం తెలుసు గనక అది వ్యంగ్యం కాదని ఆమె అర్థం చేసుకోగలిగింది.

ఒకటి రెండు వారాలు అన్నయ్య, చెల్లెలూ వచ్చారు.
తరువాత నెలకోసారి. ఈలోగా వాళ్లు విలాస యాత్రలు చేశారు.
చివరిసారి, చెల్లెలు రెండునెలల క్రితమూ అన్నయ్య మూడునెలల క్రితమూ వచ్చారు.
అందువలన, ఆలనాపాలనా చూసుకునే పెద్ద కూతురి మీద తప్ప, మంచానపడ్డ ఆ తల్లి తనకోపం మరెవరిమీద చూపించగలదు?
ఖర్చులు మించిపోతున్నాయి. వాళ్లనడగాలంటే మొహమాటం. తన కన్నా ఎక్కువ మొహమాటం భర్తకు. రెండు, మూడుసార్లు విసుక్కున్నాడు. చిన్న పోట్లాటలు కూడా జరిగాయి.

కోపంగా తను ''చూడండి నా చాకిరీ తీసెస్తే మనమామెకు పెట్టింది అయిదారు వేలకు మించదు. ఇప్పటికీ ఆమె ఒంటిమీద బంగారం బాగానే వుంది. అన్నయ్యకూ, చెల్లెలికీ ఆమె పెట్టవలసిందంతా పెట్టేసింది. ఈ అవసానదశ కోసమే ఆమె బంగారం దాచుకున్నది. కాకపోతే యిప్పుడే అది అమ్మి మనమెందుకు బజారున పడటం. కొన్నాళ్లాగండి'' అంది.
తన బలహీనతను తెలుసుకున్న మనిషి ముందర బయటపడటం యిష్టం లేక 'నా వుద్దేశం అదికాదు' అన్నాడతడు.
* * *
''అమ్మా, అమ్మా''అంటూ పిల్చింది నిర్మల.
తల్లి మూల్గింది. ఆమె కుంగి పోతున్నదని తెలుసు. రోజురోజుకీ బలహీన పడుతూనే వున్నది. మందు మింగలేకపోతున్నది. ''ఇంకెక్కువ బతకదు'' అన్నాడు డాక్టరు.

కబురు చేయగా, అన్నయ్యా, చెల్లెలూ కుటుంబ సమేతంగా వచ్చారు. వాళ్లు వచ్చిన కొద్ది రోజులూ ఆ మూడు గదుల యిల్లు జనరల్‌ కంపార్టుమెంటులాగైంది.
పిల్లలందర్నీ చూడటంతో సీతమ్మకు ప్రాణం లేచివచ్చింది.
''వచ్చారర్రా, అమ్మయ్య. నాకిప్పుడు నిమ్మళంగా వుంది. అందరూ నా పక్కన వుండగానే ప్రాణాలు విడుస్తాను... రండి...''
మెదడు పనిచెయ్యటం తగ్గిపోయింది. మాటలు ఒకదానికొకటి సంబంధం లేకుండా ఏదో వాగింది.
''...మీరు ముగ్గురూ నాకు సమానమే. ఒకరు ఎక్కువా ఒకరు తక్కువా కాదు. ఎవరికివ్వగలిగినంత వాళ్లకిచ్చాను. ఈ బంగారం- ఇందులో నా కొడుకు నా బం గారు కొండకు సగం. మిగతాది, అమ్మాయిలూ మీరిద్దరూ పంచుకోండి. నేను నా పిల్లలకు న్యాయం చెయ్యలేదని ఎవరూ అనకూడదు'' అని తుది శ్వాస విడిచింది తల్లి.
* * *
కర్మ కాండంతా పూర్తయిన తర్వాత, తన వాటాకు వచ్చిన చిన్న గొలుసును భర్త ముందర పడేసి''ఇది తీసుకొని, మీరు పెట్టిన ఆరేడువేల ఖర్చు జమకట్టుకోండి. నా కన్న తల్లికి నేను సేవ చేశాననే తృప్తే చాలు. అందుకోసం నాకే ప్రతిఫలమూ అక్కర్లేదు'' అంది నిర్మల

మంచు బొమ్మ - తెలుగు కథ

'సమర్థులు అవకాశాల కోసం ఎదురుచూడరు. అవకాశాలని తమంతట తామే సృష్టించుకుంటారు' అని మమ్మల్ని ఉత్తేజపరచడానికి మా మార్కెటింగ్‌ ట్రైనింగ్‌లో చెప్పేవారు.కానీ ఆ మాటల్లో నిజం లేదని నా అభిప్రాయం. ఎంతటివాళ్త్లెనా కానీ అవకాశాలనేవాటిని వాళ్లంతట వాళ్లు సృష్టించుకోలేరు. అసలా మాటకొస్తే అవకాశాలని ఎవరూ సృష్టించరు. వాటంతటవే సమాజంలో సహజసిద్ధంగా ఉంటాయి. వాటిని వెదికి పట్టుకోవడం, గుర్తించగలగడంలోనే వుంటుంది సమర్థత అంతా.

దానికెంతో చొరవ, ఓపిక, ఆసక్తి కావాలి. అవి లేనివాడు 'మార్కెటింగ్‌'లో రాణించలేడు.
ఆ పల్లెటూరి రైల్వే ప్లాట్‌ఫార్మ్‌ మీద డాక్టర్‌ శర్మగారిని చూడగానే నన్ను నేనే అభినందించుకున్నాను.
ముందు రోజు రైలెక్కేదాకా ఏవేవో పనులమీద ఎడతెరిపి లేకుండా తిరుగుతూనే ఉన్నాను. చాలా అలసటగా ఉంది. ఒళ్లంతా నొప్పులుగా ఉంది.
రాత్రంతా కురుస్తున్న వర్షం అప్పుడే తెరిపినిచ్చి గాలి చల్లగా, హాయిగా వీస్తోంది. రైల్లో నా రిజర్వుడు బెర్తుమీద పడుకుంటే చక్కగా నిద్ర పట్టేస్తుంది. అయినాసరే ముందు స్టేషన్‌ దగ్గర వర్షానికి పట్టాలు కొట్టుకుపోయి రైలు ఆగిపోయిందన్న విషయం తెలియగానే కిందకి దిగకుండా ఉండలేకపోయాను.

నాలో ఆ ఆసక్తే లేకపోతే ఈ అవకాశం వచ్చి ఉండేది కాదు కదా అనిపించింది, అక్కడ శర్మగారిని చూడగానే.
శర్మగారు నెల్లూరులో పెద్ద పేరున్న డాక్టర్‌. ఎంత పేరున్న డాక్టరంటే నెల్లూరులాంటి పెద్ద ఊళ్లో కూడా ఉన్న అన్ని మెడికల్‌ షాపుల్లోనూ అమ్మకాలు సగానికిపైగా ఆయన రాసిచ్చిన ప్రిస్కిప్షన్ల మీదే జరుగుతాయనడంలో అతిశయోక్తి లేదు.
అందుకే నాలాంటి ఎందరో మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లు ఆయన ప్రాపకం సంపాదించుకుని తద్వారా తమ కంపెనీ సేల్సు పెంచుకోవడానికి నిరంతరం అర్రులు సాచుతూ వుంటారు.

పేషంట్స్‌ని చూడటం ఆపేసి, మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లతో మాట్లాడే చాలామంది డాక్టర్లకన్నా భిన్నంగా శర్మగారు పేషంట్సుని చూడడం అయిపోయాక లేదా వాళ్లు లేని ఖాళీ సమయాల్లో మాత్రమే మెడికల్‌ రిప్రజెంటేటివ్‌లను కలుస్తారు. అదీ రోజుకి నలుగుర్నో, ఐదుగుర్నో అంతే!
అన్ని రంగాల్లోనూ పోటీ ఉన్నట్లు మా మందుల తయారీ రంగంలోనూ చాలా గట్టి పోటీనే ఉంది. తయారుచేసేది ఒకే మందునైనా, డాక్టర్లు రాసే 'బ్రాండ్‌'లని బట్టే అమ్మకాలు.

రోగిని పరీక్షించి మందులు రాసేటపుడు డాక్టర్లకి మా 'బ్రాండ్‌'ని గుర్తు చెయ్యడానికి మేము పడే పాట్లు అన్నీ ఇన్నీ కావు!
మా కంపెనీ పేరున్న గడియారాలు, లెటర్‌ ప్యాడ్స్‌, పేపర్‌ వెయిట్లు, పెన్నులు, పెన్ను స్టాండులు డాక్టర్ల గదిలో ఉంచడం దగ్గర నుంచీ, డాక్టర్లకి ప్రత్యేకమైన గిఫ్టులివ్వడం, వాళ్ళ కుటుంబ సభ్యులకి 'హాలీడే పేకేజీ'లని అరేంజ్‌ చేయడం వరకూ... ఎన్నో ప్రయత్నాలు చేస్తాం.

మా కంపెనీలు మాకిచ్చే 'ఇన్సెంటివ్‌'లు ఇవన్నీ చేయడానికి మమ్మల్ని ప్రోత్సహిస్తాయి.
'ఒక్కసారి శర్మగార్ని పడగొట్టగలిగితే చాలు... మన టార్గెట్లలో డెబ్భై శాతం వరకూ చూసుకోనక్కర్లేదు' అనుకుంటాం మాలో మేము.
కానీ ఆయన్ని పడగొట్టడం అంత తేలికైన విషయం కాదని నాకు ఆయనతో మాట్లాడాకా తెలిసింది. అదీ ఆయన మాకు కేటాయించే అయిదారు నిమిషాల్లోనూ.

'ఎంతో ప్రయత్నిస్తే తప్ప, ఎన్నోసార్లు కలిస్తే తప్ప... ఆయన మనం చెప్పే మందులు రాయడు' అనేవారు ఆయన గురించి మా సీనియర్లు.
నాలో పంతం పెరిగేది.
గత ఐదారు నెలలుగా ప్రతి నెలలోనూ ఆయన్ని క్రమం తప్పకుండా కలుస్తున్నాను. వెళ్లిన ప్రతిసారీ ఆయన కలిసే ఐదారు మందిలో నేనూ ఖచ్చితంగా ఉండటం కోసం ముందే వెళ్లి ఎంతో సమయం వృథా చేసుకుంటున్నాను.
అసలు ఆయన దగ్గరకొచ్చే పేషంట్ల సంఖ్య చూస్తే నాకు మతిపోయేది. జనాన్ని ఆకట్టుకోవడంలో మాకు తెలియని గొప్ప రహస్యమేదో ఆయనకి తెలుసనిపించేది.

ఆయన్ని ఆకట్టుకోవడానికి నేను చేసే ప్రయత్నాలేమీ పెద్దగా ఫలితాలనివ్వడంలేదు. అయినా నా ప్రయత్నాలని ఆపలేదు. ప్రయత్నం చేయకపోవడం అంటే పోరాడకుండానే ఓటమిని ఒప్పేసుకోవడం నా దృష్టిలో.
''ఇవన్నీ ఎందుకు? మందుల శాంపిల్స్‌ ఇవ్వచ్చుకదా?'' నేను ఆయన టేబుల్‌ మీద పెడుతున్న ఫ్రీ గిఫ్టులని చూస్తూ అన్నాడాయన ఒకసారి.
నోరు తెరిచి ఆయన నన్ను కోరిన మొట్టమొదటి కోరిక...
ఎంతటి వాడికైనా ఒక బలహీనత వుంటుంది. ఆయన 'వీక్నెస్‌' ఏమిటో అర్థమయింది. అప్పట్నుంచీ వెళ్ళినపుడల్లా బహుమతుల బదులుగా మా కంపెనీ శాంపిల్స్‌నే తీసుకువెళ్ళడం మొదలుపెట్టాను. అయినప్పటికీ ఆయన మా కంపెనీ మందుల్ని రోగులకి రాయడం చాలా అరుదుగా జరుగుతోంది.

ఎంతమందో పెద్ద పెద్ద డాక్టర్లని సైతం ఆకట్టుకోగలిగిన నాకు శర్మగారు ఒక కొరకరాని కొయ్యలా కనిపించారు. నాలో పట్టుదల పెరిగిందే కానీ తగ్గలేదు.
ఆయన మా మందులు రాయాలంటే ఏదో ఒక రకంగా ఆయన్ని నేను ఆకట్టుకోవాలి. అది నా ఉద్యోగానికి సంబంధించిన సమస్యలా కాక నా 'అహానికి' సంబంధించిన సమస్యలా అనిపించసాగింది నాకు.
అక్కడ... ఆ రైల్వే ప్లాట్‌ఫార్మ్‌ మీద తోచకుండా తిరుగుతున్న శర్మగారిని చూడగానే నాలోని 'సేల్సుమాన్‌' నిద్ర లేచాడు.
'ఈ అవకాశాన్నెలాగైనా సద్వినియోగపరుచుకోవాలి' అనుకుంటూ వడివడిగా ఆయన వైపు నడిచాను.
రైలు అక్కడ ఆగి అప్పటికి నాలుగు గంటలయింది. తెల్లవారి, వర్షం కాస్త తగ్గుముఖం పట్టడంతో అప్పుడప్పుడే కొంతమంది ప్రయాణికులు కిందకి దిగి ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతున్నారు.
ప్యాసింజరు రైళ్ళు కూడా ఎక్కువగా ఆగని కుగ్రామం అది.

చుట్టూ పచ్చగా పరుచుకున్న చెట్లు, తడిసిన ఎర్రమట్టితో ప్లాట్‌ఫార్మ్‌... చల్లగా వీస్తోన్న గాలి... ఎంతో ఆహ్లాదకరంగా వున్నాయి.
''నమస్తే శర్మగారూ... నెల్లూరుకేనా ప్రయాణం'' అంటూ పలకరించాను ఆయన్ని.
ఆయన నన్ను గుర్తుపట్టి కరచాలనం చేశాడు.
''ఏ బోగీలో వెళ్తున్నారు?'' అంటూ ఆయన్ని సంభాషణలోకి దించాను.
ఏదో సెమినార్‌కి వెళ్ళి తిరిగివస్తున్నాట్ట ఆయన.
''ఇంకా ఎంత సేపుండాలి ఇక్కడ?'' అడిగాడాయన.

అప్పటిదాకా నేను సేకరించిన సమాచారాన్ని ఆయనకి చెప్పాను. పాడైపోయిన ట్రాక్‌ని బాగుచేసి, రైల్వే సిబ్బంది తనిఖీ చేసి రైలు బయలుదేరడానికి హీనపక్షం ఇంకో రెండు మూడు గంటలైనా పడుతుంది.
నేనన్న మాటలకి ఆయన ఏదో ఆలోచిస్తున్నట్లు కనబడ్డాడు.
''వాగు పొంగి రోడ్డు కూడా మనిగిపోయిందట. ఈ ఊరు దాటితే కానీ మనం బస్సు కూడా పట్టుకోలేం. ట్రాక్‌ బాగుపడి రైలు కదిలేదాకా మనం ఇక్కడే గడపాలి. మరో మార్గంలేదు'' అన్నాను, ఆయన ఆలోచనలని అంచనా వేస్తున్నట్లుగా.

ఆయన మౌనంగా వుండిపోయారు.
ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతూ నెమ్మదిగా కబుర్లలో పడ్డాం.
ఆయన హాజరైన సెమినార్‌ విషయాలు అడిగాను. ఆయన చెప్పడం మొదలుపెట్టాడు. ఎదుటివాళ్లని ఆకర్షించాలంటే మంచి వక్తలై వుండాలని చాలామంది అనుకుంటూ వుంటారు. కానీ ఎదుటి వ్యక్తులని ఆకర్షించాలంటే మంచి వక్తగా కన్నా మంచి శ్రోతగా వుండాలి.
తను చెప్పే విషయాలని కళ్ళు పెద్దవి చేసుకుని ఉత్సాహంగా వినే మనుషులంటే ఎవరికి మాత్రం ఆసక్తి ఉండదు?!
ఆయన చెప్పే విషయాల్ని శ్రద్ధగా వినసాగాను.

మంచి శ్రోతలా మధ్య మధ్యలో చిన్న చిన్న ప్రశ్నలు కూడా వేయసాగాను. సంభాషణని కాలక్షేపం కబుర్లలా కాకుండా ఒక 'లక్ష్యం'వైపు మళ్లేలా చేయడం నాకు బాగా అలవాటయిన విద్యే. కావాలని చెబుతున్నట్లు కాకుండా సహజంగా అతికేలా మా కంపెనీ ఉత్పాదనల గురించీ, వాటిని ప్రమోట్‌ చేస్తే ఆయనకి లభించే 'ప్రయోజనాల' గురించీ అన్యాపదేశంగా చెప్పసాగాను.

ఆ కాస్సేపటిలోనూ ఆయనతో మునపటికన్నా ఎక్కువ సాన్నిహిత్యాన్ని, చనువునీ సంపాదించగలిగాను. అందుకు సంతృప్తిగానే వున్నా, నాతో మాట్లాడుతున్న ఆయనలోని ఏదో 'అనీజీనెస్‌' నాలోని 'ప్రొఫెషనల్‌' దృష్టిని తప్పించుకోలేకపోయింది.
ఆయన కళ్ళు దేనికోసమో వెదుకుతున్నట్లున్నాయి. మనసు దేనికోసమో ఆరాటపడుతున్నట్లుగా వుంది.
ఆ ప్లాట్‌ఫార్మ్‌ మీద నాతో కబుర్లు చెబుతూ 'కాలక్షేపం' చేయడంకన్నా ఆయన 'అవసరం' వేరే వుంది. ఆయన చెప్పకపోయినా ఆ విషయాన్ని గ్రహించడానికి నాకు ఎక్కువ సమయం పట్టలేదు. కానీ అదేమిటన్న విషయమే అంతు పట్టడంలేదు.

కాస్సేపటి తర్వాత ఆయనే అన్నాడు అటూ ఇటూ చూస్తూ.
''కనీసం ఇక్కడ ఒక క్యాంటిన్‌ అయినా లేదే?'' అని.
అప్పుడు నాకు అర్థమయింది. ఆయన అవసరం ఏమిటో?!
విచ్చుకున్న పువ్వులా నా ముఖంలో నవ్వు మెరిసింది.
''క్యాంటినా! మామూలుగా అయితే ఇక్కడ ప్యాసింజరు రైళ్లు కూడా ఆగవు'' అన్నాను అదే నవ్వుతో.
''అయితే మాత్రం? నాలుగు గంటల నుంచీ రైలు అలా ఆగే వుంది. రైల్వే వాళ్లయినా ఏమీ ఏర్పాటు చేయలేదు'' అన్నాడాయన ఒకింత అసహనంగా.

ఆయనతో మాట్లాడుతున్న ఉత్సాహంలో నేను గుర్తించలేదు కానీ... నాలోనూ అదే బాధ. కడుపులో కరకరమంటున్నట్లు సన్నగా నొప్పి... ఆకలి.
నిన్న సాయంత్రమెపుడో హడావిడిగా తిన్న తిండే. మళ్ళీ ఏ ఆహారమూ తీసుకోలేదు.
మామూలుగా అయితే ఈపాటికి ఎప్పుడో నెల్లూరు చేరుకుని బ్రేక్‌ఫాస్ట్‌ చేసి ఎవరి పనుల్లో వాళ్లు పడాల్సిన వాళ్లం. ఈ వర్షం వల్ల ఇలా ఆగిపోవాల్సి వచ్చింది.
''మీరు వెళ్లి మీ బోగీలో కూర్చోండి సార్‌... నేను వెళ్లి బయట ఏమైనా దొరుకుతుందేమో చూసి వస్తాను'' అంటూ స్టేషన్‌ మాస్టర్‌ రూమ్‌వైపు వెళ్ళాను.

అప్పటికి రైలులోంచి చాలామంది దిగి ఏమీ తోచక ప్లాట్‌ఫార్మ్‌ మీద తిరుగుతున్నారు. అందరినీ మమ్మల్ని వేధిస్తున్న సమస్యే వేధిస్తున్నట్లు ఉంది. 'తినడానికేమైనా దొరుకుతుందా?' అని పక్కవాళ్లని చాలామంది అడగడం కనిపిస్తోంది.
'ఏమైనా దొరికితే బాగుండును' అని నేను కూడా అనుకున్నాను. నా కోసం కాదు... శర్మగారికోసం! ఆయన చాలా ఆకలిమీద వున్నట్లు కనబడుతున్నాడు. పరిస్థితి చూస్తే రైలింకా ఇక్కడ ఇంకో రెండు మూడు గంటలు ఆగిపోయేలా వుంది. ఈలోగా ఆయన ఆకలి మరింత పెరుగుతుంది. ఇలాంటి పరిస్థితిలో... ఈ మారుమూల రైల్వే స్టేషన్లో ఆయన ఆకలి తీరే మార్గం నేను చూపించగలిగితే ఆయన నన్ను జన్మలో మర్చిపోలేడు.

ఆయన దృష్టిలో నాకు పడిన మంచి మార్కులు వృథాగా పోవు!
'మనిషి తల్చుకుంటే సాధించలేనిదంటూ లేదు. అలాంటిది ఈ పల్లెటూళ్ళో ఇంత తిండి సంపాదించలేనా?' అనుకున్నాను. స్టేషన్‌ చిన్నదైనా పనికేమాత్రం తక్కువ లేదన్నట్లు గణగణా మోగుతున్న ఫోన్లతో బిజీగా వుంది స్టేషన్‌ మాస్టర్‌ రూము.

అక్కడ చాలామంది జనం గుమిగూడి వున్నారు.
అందర్నీ మెల్లగా తప్పించుకుని వెళ్ళి స్టేషన్‌ మాస్టరుని అడిగాను. ''దగ్గర్లో తినడానికేమైనా దొరుకుతాయా?''
''ఒక కిలోమీటరు దూరం నడిచి వెళితే ఊరు వస్తుంది. అక్కడ కొట్లలో ఏమైనా దొరకచ్చు'' అన్నాడాయన పాపం అంత బిజీలో కూడా.
ఒక్క క్షణం ఆలోచించి బయటికి నడిచాను.
మట్టిదారి... వానకి తడిసి బురద బురదగా వుంది. జాగ్రత్తగా చూసుకుంటూ నడుస్తున్నాను. నా వెనుకే మరికొంతమంది రావడం చూసి చిన్నగా నవ్వుకున్నాను.

ఆ స్టేషన్‌ మాస్టరు అన్న 'కొట్టు' పదానికి అర్థమేమిటో చూశాక నాకింకా నవ్వొచ్చింది. అక్కడ ఒక అరుగుమీద ప్లాస్టిక్‌ సంచుల్లో పోసి మరమరాలు, బఠాణీలు, సెనగపప్పు అమ్ముతున్నారు.
అవి తీసుకెళ్లి శర్మగారికివ్వాలంటే ఏమిటోలా అనిపించింది. నేను ఆలోచిస్తుండగానే నా వెనుక వచ్చినవాళ్లు అక్కడ దొరికే వాటిని ఎగబడి కొనుక్కోసాగారు.

కాస్సేపు చూస్తే అవి కూడా అయిపోతాయేమోనని భయపడుతూ ముందుకు కదలబోతుంటే నా దృష్టినాకర్షిస్తూ కనబడింది కొంతదూరంలో ఉన్న పూరిపాక. ఆ పాక వెనుకనుంచి సన్నగా పొగ లేస్తోంది, లోపల పొయ్యి వెలుగుతోందన్న దానికి గుర్తుగా.
కొంచెం పరికించి చూస్తే ఆ పాక ముందు కూర్చుని సత్తుపళ్ళాలలో ఏదో తింటున్న ఒకరిద్దరు మనుషులు కనబడ్డారు.
బురదలో నెమ్మదిగా అడుగులు వేసుకుంటూ ఆ పాకవైపు నడిచి అక్కడేముందా అని చూశాను.
మంచినీటికోసం వెదికే మనిషి నీటి చెలమల దగ్గరే ఆగిపోతే చెరువులనీ నదులనీ కనిపెట్టలేడు!
ఆనందంతో నాకు గంతులు వెయ్యాలనిపించింది. అది ఆ పల్లెటూళ్లో ఉన్న ఒక 'హోటల్‌'.
లోపలికి వెళ్లిన నాకు అప్పుడే వాయిదింపిన ఇడ్లీరేకుల మీద ఉన్న వేడివేడి ఇడ్లీలు ఆకర్షిస్తూ కనబడ్డాయి.
నెల్లూరు బ్రాహ్మలకి ఇడ్లీలు చూస్తే ప్రాణం లేచొస్తుంది. నాలుగు రూపాయలు ఎక్కివిచ్చి అరడజను ఇడ్లీలని సెనగపప్పు చెట్నీతో అరిటాకులో పొట్లం కట్టించాను.

అప్పటిదాకా కడుపులో గిరగిరా తిరుగుతున్న ఆకలి నేనున్నానంటూ గుర్తుచేసింది నాకు. అయినా నేను పెద్దగా పట్టించుకోలేదు. ఆలస్యం చేస్తే అక్కడ శర్మగారు ఏ మరమరాలతోనో బఠానీలతోనో కడుపు నింపేసుకోవచ్చు.
అక్కడింక తినడానికేమీ దొరకదని రూఢీగా తెలిసిపోయాక, మంచి ఆకలిమీదున్న ఆయనకి వేడివేడి ఇడ్లీలని అందించగల అవకాశాన్ని 'మిస్‌' చేసుకోవడం నాకెంతమాత్రం ఇష్టం లేదు.

ఆ రొచ్చులో కూడా వడివడిగా అడుగులు వేసుకుంటూ స్టేషన్‌వైపు నడుస్తున్నాను.
దార్లో నలుగురైదుగురు ప్రయాణీకులు ఎదురై ''ఏవండీ... ఏమైనా దొరుకుతున్నాయా ఊళ్లో తినడానికి?'' అనడిగారు ఆదుర్దాగా.
''ఏంలేవండీ... మరమరాలు, సెనగపప్పు తప్ప'' అన్నాను. నా చేతిలో ఉన్న పొట్లాన్ని సాధ్యమైనంతవరకూ దాచేస్తూ.
నాకింకెవరికీ ఆ హోటల్‌ గురించి చెప్పడం ఇష్టంలేదు. అక్కడ ఎవ్వరికీ దొరకని దాన్ని నేను శర్మగారికి అందచేయాలి... 'యునీక్‌'గా! ఆయనని ఆ విధంగా నా వలలో వేసుకోవాలి. అదీ నా పథకం.

స్టేషన్‌ చేరుకుని గబగబా శర్మగారి బోగీ దగ్గరకి చేరుకున్నాను. లోపలికెక్కి ఆయన సీటు దగ్గరకి నడిచాను.
''ఏమైనా దొరికాయా?'' నన్ను చూడగానే ఆత్రంగా అడిగాడాయన. నేను విజయగర్వంతో నవ్వేను.
''దొరికాయి'' అంటూ పొట్లం విప్పి ఆయన చేతిలో పెట్టాను. అరిటాకుమీద నీటి బిందువులు ముత్యాల్లా మెరుస్తున్నాయి. ఆకుల మధ్యలో వెన్నముద్దల్లా తెల్లని ఇడ్లీలు!

చూడగానే ఆయన కళ్లు మెరిశాయి.
ఆత్రంగా ఆ పొట్లాన్ని అందుకున్నాడు. అందుకున్న వెంటనే ఎదుటి బెర్తుమీద కూర్చున్న యువతికి పొట్లాన్ని ఇస్తూ అన్నారు.
''ఇవి పెట్టమ్మా పిల్లలకి... కొంచెం శాంతిస్తారు'' అని. నేను షాక్‌ తిన్నట్లు చూశాను ఆయన వంక.
''తెల్లవారుజాము నుంచీ ఆ పిల్లలు ఒకటే గొడవ ఆకలంటూ. కూడా తెచ్చుకున్న పాలేమో విరిగిపోయాయట. స్టేషన్లో ఏమైనా దొరుకుతుందేమోనని కిందికి దిగితే నువ్వు కనబడ్డావు...''
ఒక్కసారిగా నన్ను కమ్మిన ఏదో మైకం వీడిపోయి స్పృహలో కొచ్చినట్లుగా అనిపించసాగింది నాకు.

కడుపులో కరకరమంటూ ఆకలి...
అక్కడ నాతోసహా సగంమంది అదే స్థితిలో ఉన్నారు. కానీ నేను వీళ్లందరి ఆకలినీ కాకుండా కేవలం 'శర్మగారి ఆకలి'నే ఎందుకు గుర్తించగలిగానో తల్చుకుంటే సిగ్గుగా ఉంది.
నా మీద నాకే అసహ్యంగా ఉంది.
''ఎక్కడ దొరికాయండీ ఇడ్లీలు?'' ఎవరో అడుగుతున్నారు.
''ఏమోనండీ... మా వాడు తెచ్చాడు. అసలు ఆ హోటల్‌ వాడినే ఇక్కడికొచ్చెయ్యమంటే సరిపోయేది. అందరి ఆకలీ తీరిపోయేది'' అంటున్నారు శర్మగారు నవ్వుతూ.

ఆ పిల్లల ఆకలి తీరిందన్న సంతృప్తివల్లో ఏమో... ఇప్పుడాయనలో ఇందాకటి 'అనీజీనెస్‌' లేదు.
వాళ్ల మాటలేమీ నాకు వినపడడంలేదు.
విభ్రమకి గురయిన వాడిలా అలాగే వుండిపోయాను.
ఎంతటి విభ్రమ అంటే... మాటల మధ్య శర్మగారు నన్ను 'మావాడు' అంటూ సంబోధించడం కూడా గుర్తించలేనంత.
* * *
ఇప్పుడు శర్మగారు మా కంపెనీ ముందులని రోగులకి విరివిగా రాస్తున్నారు. కంపెనీకి నా తరఫున అమ్మకాలు విశేషంగా పెరిగాయి. ఈ క్రమంలో నాకు శర్మగారి గురించి అంతకుముందు తెలియని విషయాలు కొత్తగా తెలుస్తున్నాయి.
ఆయన దగ్గరకి వచ్చే రోగులని చూడడానికి 'ఇంతా' అని ఫీజు వుండదు. డబ్బులివ్వని వాళ్లని ఊరికే చూస్తాడు. అవసరంలేకుండా ఒక్క మందు కూడా రాయడు. మేము ఇచ్చే 'శాంపిల్స్‌'ని అవసరమైన బీదవాళ్లకి ఉచితంగా ఇస్తాడు.
ఆయన దగ్గరకి వచ్చే జనం రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నారు. వినియోగదారుడ్ని ఆకట్టుకోవడానికి మా మార్కెటింగ్‌ పుస్తకాల్లో చెప్పని కొత్త కొత్త రహస్యాలేవో నాకు ఇంకా శర్మగారి నుంచి తెలుస్తూనే ఉన్నాయి!
తార్కిక దృష్టి
ఆకునూరి మురళీకృష్ణ,
అసిస్టెంట్‌ మేనేజర్‌, ఆంధ్రాబ్యాంక్‌
జోనల్‌ ఆఫీస్‌, ఆర్‌.ఆర్‌.పేట, ఏలూరు.
పుట్టింది తూర్పు గోదావరి రాజమండ్రిలో, ఉద్యోగం పశ్చిమ గోదావరిలోని ఏలూరులో. ఆంధ్రాబ్యాంక్‌లో అసిస్టెంట్‌ మేనేజర్‌గా వుంటూనే ఉభయగోదావరులను ఒరుసుకుని సాగుతున్న జీవితాన్ని క్షుణ్ణంగా అధ్యయనం చేశారు. అరవై కథలు అచ్చయ్యాయి. కొన్ని టీవీ ఎపిసోడ్లకు కథ, సంభాషణలు సమకూర్చారు. మామూలు జీవితాన్ని కొత్త కోణంలో చూపించడం, తార్కిక దృష్టితో విశ్లేషించడం ఇష్టం.

నాన్నగారి జ్ఞాపకం - తమిళ కథ

 
ఉదా పార్తిబన్‌
అనువాదం:చల్లా భాగ్యలక్ష్మి
కురిసి కురిసి అప్పుడే వెలిసిన ఆకాశం కిటికీలోంచి చూస్తుంటే స్వచ్ఛమైన స్ఫటికంలా అనిపించింది. లాన్‌లో గడ్డిమీద నిలిచిన నీటి బిందువులు... తేమ నిండిన గాలి... దాన్నిండా యూక్లిప్టస్‌ ఆకుల వాసన...నాన్నకు ఇవన్నీ చాలా ఇష్టం. ఆయన ఇంట్లో ఉన్నారంటే చాలు. 'గోల్ఫ్‌' మైదానం వరకు వాకింగ్‌కు వెళ్తారు. నేనూ ఆయన్ని అనుసరించిన సందర్భాలు ఎన్నో. అలా వెళ్తున్నప్పుడు అప్పుడప్పుడు పడే తుంపర్లు నాన్నలో ఏదో తెలియని ఉత్సాహాన్ని నింపుతాయి. ఆయన కళ్లు ఆనందంతో విప్పారుతుంటాయి. ఆ సమయంలో ఆయన్ని చూశానంటే వెంటనే చేయి పట్టేసుకునేవాడ్ని.

పాతికేళ్ల కుర్రాడు తన తండ్రి చేయి పట్టుకుని నడవడం అరుదైన సన్నివేశమే. అయితే నాకు మాత్రం అది చాలా సంతోషాన్నిస్తుంది.
నాన్నని నేనెప్పుడూ ఓ తండ్రిగా చూడలేదు. నా అంతరంగిక స్నేహితుడిగానే భావించాను. నాన్నకు కోప్పడ్డం చేతగాదు. ''ఇన్నేళ్లు కాపురం చేసినా ఆయన ముఖం చిట్లించడం నేనెప్పుడూ చూడలేదురా'' అని గర్వపడుతుంది అమ్మ. ఎప్పుడూ ఆయన పెదాలపై చిరునవ్వు పలుకరిస్తుంటుంది. 'నీకు కోపమే రాదా నాన్నా' అంటే దానిక్కూడా నవ్వుతూ 'ఎందుకు కోప్పడాలి? జీవితంలో ఓడిపోయినవారే చిర్రుబుర్రులాడుతారు. నా జీవితంలో పరాజయాలే లేవు. మనసుకు నచ్చిన ఉద్యోగం... సరిపోయినంత జీతం, భార్య గుణవతి, కొడుకు బుద్ధిమంతుడు... ఇంకేం కావాలి నాకు?' అని ఎదురు ప్రశ్నించేవారు.

ఇంట్లోనే కాదు... బయటా అంతే. నవ్వుతూ నలుగురితోనూ సన్నిహితంగా ఉండడమే ఆయన నైజం. ఎంతోమంది కష్టనష్టాల పట్టికను నాన్నతో వల్లె వేస్తుంటారు. ఆయన సర్ది చెప్పే వైనానికే సగం సమస్య తీరినట్టు వారి ముఖాలు వెలిగిపోతుంటాయి. మాట సాయం కాదు... ఏ సాయం కావాలన్నా నాన్న అందరికన్నా ముందే ఉంటారు. వ్యక్తుల మీదే కాదు. ఇతర ప్రాణులన్నా ఆయనకు దయ ఎక్కువ. ఇదిగో... మా ఇంటి చుట్టూ ఉన్న చెట్టూ చేమలన్నీ నాన్న పెంచినవే. నారింజ రంగులో కులుకుతున్న జెరేనియం, పసుపు రంగు లిల్లీ, శ్వేత గులాబీలు, ఎర్ర డెలియా... ఎన్నెన్ని రకాలనీ.

మేమేం పాపం చేశామనో నాన్న ఇంత త్వరగా మమ్మల్ని వదిలి వెళ్లారు. ఆ రోజు కూడా వర్షం కురిసింది. నాన్నకు ఇష్టం కదా అని అమ్మ మిర్చిబజ్జీ వేస్తుంటే వచ్చిందా వ్యాన్‌... నాన్న ఫ్యాక్టరీ హాస్పిటల్‌లో ఉన్నారన్న వార్తను మోసుకుంటూ.
ఏమైందో ఏమిటోనని అందరం ఒకటే పరుగు... గుండెపోటు వచ్చిందట. ఆయన్ని ఓ రెండు నిమిషాలు చూడ్డానికి మాత్రమే మమ్మల్ని అనుమతించారు. పెద్ద మట్టిపురుగులాంటి ప్లాస్టిక్‌ పైపుతో నాన్న కనిపించారు. అలాంటి పరిస్థితిలోనూ చెక్కు చెదరని చిరునవ్వు. అమ్మ ఏడుపును ఆపుకోలేకపోతోంది. పెద్ద పెట్టున కేక పెట్టి మరీ గుండెలు బాదుకుంది. నాన్న కళ్లతోనే ధైర్యం చెప్పారు. ''నాకేం కాదు... బాధపడొద్దు'' అని.

కానీ మరో అరగంటలో భయపడినంతా అయింది. అందరి మంచీ కోరుకునే నాన్న గుండె చప్పుడు ఆగిపోయింది. అమ్మ స్పృహ కోల్పోయింది. నా కాళ్లు భూమిలోకి చొచ్చుకుపోయాయి. ఎవరో అమ్మ ముఖంపై నీళ్లు చల్లారు. నన్ను కూడా ఎవరో పొదివి పట్టుకున్నారు.
నాన్న మనుషుల్లో ఎప్పుడూ హెచ్చుతగ్గులు చూసినవాడు కాదు. బడ్డీకొట్టు నడిపే వారినుంచి గొప్ప అధికారుల వరకూ అందరితోనూ ఒకేలాగే ప్రవర్తించేవారు. ఇతరుల అభిమానాన్ని ఆయన ఎంతగా చూరగొన్నారో అక్కడ తెలిసింది. అక్కడున్న ప్రతి ఒక్కరూ గుండెలవిసేలా రోదించారు. ఫ్యాక్టరీ ఫ్యాక్టరీ అంతా కదిలొచ్చింది. మరుసటిరోజు అంత్యక్రియలు చేసేదాకా నాన్నతోనే ఉంది. ఏడ్చి గగ్గోలు పెట్టిన మాకు ధైర్యం చెప్పింది. ఎవరు ఏం చెప్పి ఏం లాభం? మా ప్రపంచమే కూలిపోయింది. శూన్యమైపోయింది. ఏ వైపు తిరిగినా నాన్న జ్ఞాపకాలే.

వారం తిరిగిందో లేదో కంపెనీ ఛైర్మన్‌ నన్ను రమ్మని కబురు పెట్టారు. వెళ్లాను.
నాన్న అంత్యక్రియలకు ముందు ఆయన్ని ఒకటి రెండుసార్లు చూశాను.
''రా నాన్నా... కూర్చో'' అన్నారు.
కాస్త భయపడుతూ కుర్చీ అంచున కూర్చున్నాను. నాన్నకు రావల్సిన మొత్తాన్ని చెక్కు రాసి సంతకం పెడుతూ ఆడిగారు ''ఏం చదువుకున్నావ్‌?'' అని.

''ఎం.ఎ. సార్‌...''
''ఇది కేంద్రప్రభుత్వ సంస్థ. ఇక్కడి ఉద్యోగులు చనిపోతే సాధారణంగా వాళ్ల వారసులకు ఉద్యోగాలివ్వం. కానీ... మీ నాన్న గురించి, ఆయన పని తీరు గురించీ మాకు బాగా తెలుసు. ఆయన కావాలనుకుంటే దొడ్డిదారిలో ఎంతో సంపాయించేవాడు. కానీ అలా చేయలేదు. డబ్బు కోసం వృత్తికి ద్రోహం చేయలేదు. అందుకే ఆయన కుటుంబానికి, నాకు వీలైనంత సాయం చేయాలనుకుంటున్నాను. నీకు ఉద్యోగం ఇవ్వాలనుకుంటున్నా... ఏమంటావ్‌?''

ఆ వాక్కు దారి కానరాక చీకటిలో చిక్కుబడిపోయి ఉన్న వ్యక్తికి సూర్యోదయం. నాన్న నిజాయితీ చూపించిన వెలుగు. ''ఇదే క్వార్టర్స్‌లో ఉండవచ్చు'' అన్న ఛైర్మన్‌ మాటలు ఇంకా వినబడుతున్నాయి. మరుసటి వారమే ఉద్యోగంలో చేరాను. అసిస్టెంట్‌ మేనేజర్‌ ఉద్యోగం. నాకో గది. ఎగ్జిక్యూటివ్‌ టేబిల్‌, కుర్చీ, ఫోను, కంప్యూటర్‌, పిలిచీ పిలవగానే వచ్చే ప్యూన్‌... నా వేషం చటుక్కున మారినట్టుంది.

ఆరోజు...
ప్యూన్‌ తెచ్చిచ్చిన ఫైల్‌మీద సంతకం చేశాను. దాన్ని తీసుకుని సగం దూరం వెళ్లిన అతడు తిరిగొచ్చాడు. ''సార్‌... ఈ లెక్కనోసారి కూడండి. తప్పుగా సంతకం చేశారు'' అన్నాడు. అతను చెప్పింది నిజమే. సరిచేసి సంతకం పెట్టాను. అతడు బయటికెళ్లి నా మీద చాడీలు చెప్పడం వినిపిస్తూనే ఉంది. వెంటనే అతణ్ణి పిలిచి చెడామడా తిట్టాను. అతడు తల వంచుకుని వెళ్లిపోయాడు.

మరుక్షణం ఫోన్‌ మోగింది. అకౌంట్‌ సెక్షన్‌ నుంచి... ''చూడు తమ్ముడూ... నువ్వరిచిన అరుపులు నేనూ విన్నాను. కీప్‌ ఇట్‌ అప్‌'' అన్నారు అటు వైపునుంచి.

నాలో ఏదో తెలియని అతిశయం పొంగింది. క్యాంటీన్‌ కెళ్తే అక్కడ కూడా అందరూ ''వెరీ గుడ్‌'' అన్నారు.
''ఆ ప్యూన్‌కి యూనిట్‌లో మంచి పేరుంది. అతణ్ణి తిట్టడానికి పెద్ద ఆఫీసర్లే భయపడతారు. మీరు చాలా ధైర్యస్థుల్లా ఉన్నారే'' అన్నారు మరికొందరు.

ఇంతలో ప్యూన్‌ కొంతమందిని వెంటేసుకుని వచ్చాడు. ''ఏంటీ? ఉద్యోగంలో చేరీ చేరకముందే పెత్తనం చెలాయిస్తున్నావు. కేవలం ప్యూన్‌ ఉద్యోగం అన్నావటగా... ప్యూన్లంటే నీకంత చులకనా?'' అన్నారు అతనితో వచ్చినవాళ్లు. అంతటితో ఆగలేదు... ''మెమో ఇస్తానని బెదిరించావటగా... మీ నాన్న బుద్ధులు నీకు రవ్వంత కూడా రాలేదే?'' అన్నారు.
అంతకుముందు ఎన్ని అన్నా చివరి మాటలు నా చెవిలో మారుమోగాయి. బైక్‌మీద ఎంత స్పీడ్‌గా వెళ్లానో నాకే అర్థం కాలేదు. ఇంటికెళ్లి మంచం మీద వాలిపోయాను.

మనసులో ఏవో జ్ఞాపకాల దొంతరలు. 'మీ నాన్న బుద్ధులు నీకు రవ్వంత కూడా రాలేదు' అన్న మాటలు ఇంకా వినిపిస్తున్నాయి.
'నాన్న లేరని బాధపడితే చాలా? ఆయన మహోన్నత గుణ గణాలను తలచుకుని మురిసిపోతే సరిపోతుందా? నాన్నని ఆదర్శంగా తీసుకుని ప్రవర్తిస్తే కదా. ఎలాంటి పరిస్థితుల్లోనూ కోపమన్నది ఎరుగని ఆయన గుణం, అందరినీ సమానంగా చూసే తత్వం అబ్బితే ఎంత బావుణ్ణు. ఇవన్నీ నాలో ఉంటే ఆయన ఇంకా బతికున్నట్టేగా. అప్పుడే కదా ఆయన ఆత్మకు శాంతి కలిగేది...' అని నన్ను నేను బుజ్జగించుకున్నాను.

చెదరిన మనసు కాస్త కుదుట పడింది. రేపు ఉదయాన్నే ప్యూన్‌ను పిలిచి మాట్లాడాలి అనుకున్నాను. అంతలో గుర్తొచ్చింది.... బైక్‌ వల్ల గాయపడ్డ కుక్కపిల్ల. వీధి పక్కన పడి ఉన్న ఆ బుజ్జికుక్కను ఆప్యాయంగా దగ్గరికి తీసుకున్నా. ఇంటికి తెచ్చి పాలన్నం, బిస్కెట్‌ తినిపించా. అది కృతజ్ఞతాపూర్వకంగా తోకాడించింది.
నాలో ఏదో తెలియని ఆనందం. అంతలో అక్కడున్న మొక్కలన్నీ గాలికి తలలూపాయి. అరే... వీటికి నీళ్లు తోడి ఎన్ని రోజులయిందో కదా అనుకుని అన్నింటినీ తడిపాను. వంగిపోయి కనిపించిన ఓ గులాబి మొక్క నిటారుగా నిలబడి నవ్వినట్టనిపించింది. మనసు పరవశించింది.
వెంటనే నాన్న గుర్తుకొచ్చారు.

ఆట ఆగింది - తెలుగు కథ

ఆనాటి అంకంలో తన పాత్ర ముగించుకుంటున్న సూర్యుడు మెల్లగా పడమటి తెర చాటుకు జారుకుంటున్నాడు. సూర్యుడితో వీడ్కోలు పూర్వకంగా కరచాలనం చేసినట్టు గోదావరి అలలు కొన్ని నిమిషాలపాటు ఎర్రబారాయి. ఒడ్డున గౌతమీ నందనవనం పార్కులో బిలబిలమంటూ జనం. పార్కు రెయిలింగ్‌కు చేరువలో ఓ బెంచీ మీద కూర్చున్నాడు సుజయ్‌కుమార్‌! చత్వారం వచ్చిన ఒంటి కంటినే చికిలించి ఓ పక్క ఎరుపెక్కిన గోదావరి కెరటాలనూ, మరోపక్క నీలాకాశాన్నీ, ఇంకోవైపు గోదావరి లంకల్లోని రెల్లు పొదలనూ, పచ్చటి చెట్లనూ, మరోవైపు పార్కులోని రకరకాల పూలనూ చూస్తుంటే అతడికి ఫోకస్‌ లైట్లతో క్షణకాలంలోనే అనేక రంగులను పులుముకునే రికార్డింగ్‌ డ్యాన్స్‌ స్టేజి గుర్తుకు వచ్చింది. ఆ రంగుల్లో ధగధగమని మెరిసిపోయిన తన గతం గుర్తుకు వచ్చింది. పార్కులో మారుమోగుతున్న పిల్లల కేరింతలు- ఒకప్పుడు తన నాట్యవిలాసానికి మురిసి జనం కొట్టిన చప్పట్లలా వినిపించాయి.

పైన ఆకాశంలో అప్పుడే నెలవంక పొడిచింది. ఈ నెలవంకలాగే జూనియర్‌ ఎన్టీఆర్‌ అలియాస్‌ సుజయ్‌కుమార్‌, అలియాస్‌ అప్పారావు ముఖంమీద చిరునవ్వు వెలిగింది. వరద గోదావరి అలల్లా ఛాతీ ఉప్పొంగింది. కీళ్ళనొప్పి కలుక్కుమనిపిస్తున్నా- పాదాలను అప్రయత్నంగా లయబద్ధంగా అటూ ఇటూ కదిలించాడు. ఎన్టీఆర్‌ అభిమానుల అభివందనాలు అందుకున్న ఆ పాదాలను ఓసారి గర్వంగా చూసుకున్నాడు. లక్షలాదిమందిని మురిపించిన తన ముఖాన్ని అరచేతులతో నిమురుకున్నాడు. నలభై ఏళ్ళు దాటిన ఆ ముఖం ఇప్పుడు గాలి పోయిన బెలూన్లా ముడతలు పడితేనేం- ఒకనాడు జనం జేజేలు అందుకుంది. ఆ కాళ్ళలో ఇప్పుడు పటుత్వం తగ్గి తడబడుతుంటేనేం- ఒకనాడవి మెరుపుల్లా చిందేస్తే ఈలలూ, వన్స్‌మోర్‌లూ కుంభవృష్టిలా కురిసేవి. 'మరి కొద్దిసేపట్లో ప్రారంభం కానున్న డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌ కార్యక్రమాన్ని జయప్రదం చేయా'లంటూ పార్కుకు కొంచెం దూరంలో గోదావరి గట్టునే ఏర్పాటు చేసిన నవరాత్రి షామియానా నుంచి మైకులో అనౌన్స్‌మెంట్‌ వినిపిస్తోంది. తననెవరో క్రూరంగా వెక్కిరించినట్టనిపించింది సుజయ్‌కుమార్‌కి. విరక్తిగా నవ్వుకున్నాడు. పక్కబెంచీమీద కూర్చున్న ఓ తండ్రి బిడ్డను అపురూపంగా పొదివి పట్టుకుని ఏదో చూపెడుతున్నాడు. సుజయ్‌కుమార్‌ అలియాస్‌ అప్పారావుకు తన తండ్రి సింహాద్రి గుర్తొచ్చాడు. పుష్కరాల రేవు పక్కనున్న రైలు వంతెనపై గూడ్స్‌ రైలు వెళుతోంది. ఒకదాని వెనుక ఒకటిగా తరలిపోతున్న దాని బోగీల్లానే సుజయ్‌కుమార్‌లో గత జ్ఞాపకాలు కదిలాయి.
* * *
హైస్కూలులో చదివే నాటినుంచే అప్పారావు సినిమాలంటే పడి చచ్చేవాడు. అతడి తండ్రి సింహాద్రి రిక్షా తొక్కేవాడు. తన ఎముకలు నుగ్గయినా తన ఒక్కగానొక్క కొడుకు బతుకును పేదరికపు డేగ నీడనుంచి తప్పించాలని తపించేవాడు. బాగా చదివిస్తే మంచి ఉద్యోగం వస్తుందనీ, తాను నరాలు తెగేలా రిక్షా లాగిన ఎగుడు దిగుడు రాజమండ్రి వీధుల్లోనే కొడుకు మోటార్‌ సైకిల్‌పై దూసుకుపోతున్నట్టు కలలు కనేవాడు. బీడీ కాల్చడమంటే సింహాద్రికి ఎంతో ఇష్టం. అయినా ఎన్నడూ కట్టబీడీలు ఒకేసారి కొనుక్కునేవాడు కాదు. రోజుకు అయిదు బీడీలే కొనేవాడు. ఒక్కో బీడీని నాలుగు దమ్ములు లాగి ఆర్పేసి చెవిలో పెట్టుకునేవాడు. అలా దాన్నే రెండుసార్లు కాల్చేవాడు. తోటి వారిలో కొడుకు వెలితి పడకూడదని రోజుకి రూపాయో, రెండో చేతిలో పెట్టేవాడు. ప్రతి పండక్కీ కొత్త బట్టలు కుట్టించేవాడు. తానూ, రోగిష్టి భార్యా తిన్నా, తినకపోయినా అప్పారావుకు వీలైనంతలో ఏ లోటూ రానిచ్చేవాడు కాడు. తండ్రి తన గురించి కలలు కంటుంటే, అప్పారావును సినిమాలు కలల ప్రపంచంలోకి నెట్టేవి. తెరపై హీరోల సాహసకృత్యాలు మంత్రముగ్ధుడిని చేసేవి. తండ్రి ఇచ్చే డబ్బుల్లో ఎక్కువ భాగం బడి ఎగ్గొట్టి మ్యాట్నీ సినిమాలు చూసేందుకే ఖర్చు పెట్టేవాడు. లేత వయసులోనే అప్పారావు మనసును సినీహీరోలు ఆవహించారు. ఎన్నటికైనా తానూ వెండితెరపై వెలిగిపోగలనని నమ్మేవాడు. క్లాసులోని బ్లాక్‌బోర్డు కూడా అతడికి థియేటర్‌లోని తెరలాగే తోచి తాను చూసిన సినిమా దృశ్యాలే కనిపించేవి. పాఠ్యపుస్తకాలు తెరిచినా ప్రతి పేజీలో పాఠాలకు బదులు తన అభిమాన హీరోల బొమ్మలే దర్శనమిచ్చేవి. అద్దంలో చూసుకున్నప్పుడల్లా తన ముఖంలో ఎన్టీఆర్‌నే చిన్నబుచ్చే కళ కనిపించేది. ఎవరూ పట్టించుకోని నల్లరాయే దేవుడి విగ్రహంలా చెక్కబడ్డాక గుళ్లో పూజలు అందుకున్నట్టు- ఈ ముఖం ఎప్పటికైనా వెండితెరపై వెలిగి కోట్లమందితో జేజేలు అందుకోవడం తథ్యమనుకునే వాడు.

ఓరోజు మ్యాట్నీ విడిచే సమయంలో మినర్వా టాకీస్‌ దగ్గర రోడ్డుపక్క రిక్షా కిరాయి కోసం ఎదురు చూస్తున్నాడు సింహాద్రి. ఆనందంతో వెలిగే ముఖంతో థియేటర్‌ గేటునుంచి బయటికి వస్తున్న కొడుకును చూసి రిక్షా పూటీ గోతిలో పడ్డప్పటిలా దిమ్మెరపోయాడు. కిరాయి మాట విడిచి నడుచుకుంటూ కొడుకు దగ్గరకెళ్ళాడు.

''ఏరా బాబా! బడికెళ్ళలేదా?''
హీరో చేసిన ఫైటింగ్‌లను, పాటల్లో వేసిన స్టెప్‌లను నెమరేసుకుంటూ తన్మయత్వంలో ఉన్న అప్పారావు తండ్రిని చూసి గతుక్కుమన్నాడు. హీరోతో డ్యూయట్‌ పాడుతున్న హీరోయిన్‌ను మధ్యలోనే ఎత్తుకుపోయిన మాంత్రికుడిలా కనిపించాడు తండ్రి. అయినా చటుక్కున అబద్ధమాడేశాడు.

''మధ్యాహ్నం నుంచి స్కూలుకు సెలవిచ్చారయ్యా''
'పోనీలే, బడి లేనప్పుడు కుర్రాడు ఆ మాత్రం సరదా పడితే కొంపలేమీ అంటుకుపోవు' అనుకున్న సింహాద్రి కొడుకు తలను నిమిరాడు. 'బిడ్డ అంతదూరం నడిచేమి వెళతాడు' అనుకుని రిక్షాలో ఎక్కించుకుని ఇంటికి బయల్దేరాడు.
* * *
పార్కు నడవాపై తప్పటడుగులతో పరుగులు తీస్తున్న పిల్లవాడు దబ్బున తూలిపడ్డాడు. మోకాళ్ళు కొట్టుకుపోవడంతో ఏడుపు లంకించుకున్నాడు. వాళ్ళమ్మ కూర్చున్న చోటినుంచి ఒక్కుదుటన లేచి వచ్చి కొడుకును చంకకెత్తుకుని అనునయించసాగింది. అంతవరకు ఆడుతూ పాడుతూ గడిచిన తన బాల్యం తండ్రి చనిపోయినప్పుడు ఒక్కసారే ఊబిలో కూరుకుపోయినట్టనిపించిన స్మృతి సుజయ్‌కుమార్‌లో మెదిలింది.

కొడుకు పదో తరగతి తప్పినప్పుడు సింహాద్రికి తన కష్టమూ, కలలూ గోదావరి వరదలో కొట్టుకుపోయినట్టనిపించింది. కొన్నాళ్ళకే లారీ రూపంలో అతడిని చావు కబళించింది. అతడి రిక్షా కూడా నుగ్గునుగ్గయిపోయింది. తల్లి రెక్కల కింద వెచ్చగా ఉన్న కోడిపిల్ల అకస్మాత్తుగా గద్ద గోళ్ళలో చిక్కుకున్నట్టు- అప్పారావుకు బతుకు ఎంత కర్కశమైందో తెలిసివచ్చింది. తననూ, రోగిష్టి తల్లినీ పోషించుకోవలసిన భారం భూతంలా కనిపించింది. తండ్రి ఆలనాపాలనలో పదిహేనేళ్ళు ఏపుగా, బొద్దుగా పెరిగిన శరీరాన్ని కష్టపెట్టక తప్పలేదు. కొన్నాళ్ళు హోటల్‌లో క్లీనర్‌గా చేశాడు. తర్వాత భవన నిర్మాణల్లో కూలీగా బరువులు మోశాడు. స్కూటర్‌ మెకానిక్‌ దగ్గర హెల్పర్‌గా చేరాడు. చీకటిలోనూ వెన్నాడే నీడలా- ఏం చేస్తున్నా అప్పారావును సినిమా కలలు విడిచి పెట్టలేదు. సినీ సింహాసనంపై రారాజులా వెలిగిపోవలసిన తాను 'చిత్తం ప్రభూ' అంటూ ఎవరి ఆజ్ఞలకో తలొగ్గాల్సిన బంటులా బతకాల్సి రావడం అతడి మనసును క్షోభ పెట్టేది. ఎంగిలి ప్లేట్లు కడిగీ కడిగీ చేతులు పాసిపోయినా, ఆయిల్‌ మరకలతో ఒళ్ళు జిడ్డుగా మారినా అప్పారావు తన ముఖాన్ని చూసుకుని ఊరడిల్లేవాడు. చాలామంది ప్రముఖ హీరోలు తొలినాళ్ళలో పడ్డ కష్టాలను గుర్తు తెచ్చుకుని ధైర్యం తెచ్చుకునేవాడు. 'ఈ ముఖం ఎన్నటికైనా నవరసాలకు వేదికవుతుంది. జనం నీరాజనాలందుకుంటుంది' అనుకుంటూ కలలను బతికించుకునేవాడు.
* * *
అప్పారావు 20వ ఏట తల్లి చనిపోయింది. అనాథనయ్యానన్న భావన ముల్లులా బాధించినా తనను బంధించి ఉంచిన సంకెల ఏదో తెగిపోయినట్టనిపించింది. తన కలను నిజం చేసుకునే దిశగా బతుకు మలుపు తిరగనుందనిపించింది. గుడిసెను అమ్మి ఆ సొమ్ముతో మద్రాసు వెళ్ళిపోవాలనుకున్నాడు. ఆ సమయంలోనే తారసపడ్డాడు రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూపు ఆర్గనైజర్‌ రామస్వామి.

పుష్టిగా, నదురుగా ఉన్న అప్పారావును చూసి ''రేయ్‌! అబ్బాయ్‌! ఇప్పుడు మా ట్రూపులో జూనియర్‌ ఎన్టీఆర్‌గా వేస్తున్నవాడు రమణారెడ్డికి ఎక్కువా, అల్లురామలింగయ్యకు తక్కువా అన్నట్టున్నాడు. ఎన్టీఆర్‌ పాటలకు సరిగ్గా సరిపోతావు, మా ట్రూపులో చేరతావా?'' అనడిగాడు.
గోదావరి ఈ ఒడ్డునుంచి ఆ ఒడ్డుకు ఈదగల గజ ఈతగాడిని పిల్లకాలవలో ఈత పోటీలకు పిలిచినట్టు అవమానపడ్డాడు అప్పారావు.

''నేను రికార్డింగ్‌ డ్యాన్స్‌లు చేయను. సినిమాల్లో హీరోనే అవుతాను'' అన్నాడు ఉక్రోషంగా.
తన జీవితంలోకెల్లా గొప్ప జోక్‌ విన్నట్టు పగలబడి నవ్వాడు రామస్వామి. నవ్వీ నవ్వీ అడిగాడు.
''రేయ్‌! అబ్బీ! నన్ను చూస్తే నీకెవరు గుర్తుకు వస్తున్నారు- ఎన్టీవోడా, రేలంగోడా?''
అప్పారావు రామస్వామిని గుచ్చి చూసి ''రేలంగోడే'' అన్నాడు కచ్చిగా.
''అవునా! కొన్నేళ్ళ క్రితం నేనూ నీకన్న సొగసుగాడినే. ఎన్టీవోడినే సినిమాల్లోంచి సాగనంపేయగల మొనగాడిననుకుని మద్రాసు మెయిలెక్కాను. ఇదిగో ఇప్పుడిలా రేలంగోడి వాలకంతో రికార్డింగ్‌ డ్యాన్స్‌ ట్రూపు నడుపుకుంటున్నాను''

''అయితే ఇప్పుడేమంటావ్‌?''
''హీరో అయిపోవాలని నాలా మద్రాసెళ్ళిన వాళ్ళు మెరీనా బీచ్‌లో ఇసుక రేణువులంతమంది. వాళ్ళంతా ఇప్పుడేమయ్యారో నీకు తెలీదు. నాకు తెలుసు. నా బతుకే అందుకు సాక్ష్యం'' అంటూ రామస్వామి అప్పారావుకు రోడ్‌ కం రైలు బ్రిడ్జి అంత పొడవున హితోపదేశం చేశాడు. హీరోలవుతామని కలలు కన్న వారి జీవితాలు ఎలా కేరాఫ్‌ ప్లాట్‌ఫారాలుగా మారాయో కళ్ళకు కట్టించాడు. హీరో కావడం కన్న రికార్డింగ్‌ డ్యాన్స్‌ హీరో కావడం సులువని బోధించాడు. డూప్‌ హీరో అయినా జనం జేజేలు అందుకోవచ్చన్నాడు. జూనియర్‌ వాణిశ్రీలు, జూనియర్‌ జయప్రదలతో ఒకే ప్రదర్శనలో బోలెడు డ్యూయట్‌లు పాడుకోవచ్చన్నాడు. రామస్వామి తన కలలకు పట్టిన చెద పురుగులా కనిపించినా- స్వానుభవంతో అతడు చెపుతున్న మాటలు అప్పారావును హడలెత్తించాయి. దాంతో వెండి తెర కలలకు అయిష్టంగానే తెర దించుకున్నాడు. రామస్వామి ట్రూపులో చేరి, ముఖానికి రంగేసుకుని స్టేజి ఎక్కాడు. సుజయ్‌కుమార్‌ జూనియర్‌ ఎన్టీఆర్‌గా అవతరించాడు.
* * *
పార్కులో జనం రద్దీ పెరిగింది. రోడ్‌ కం రైలు బ్రిడ్జిపై దీపాలు అక్కడొకటీ అక్కడొకటీ బిక్కుబిక్కుమంటున్నట్టు వెలుగుతున్నాయి. దరిద్రుల హృదయాల్లోనూ మిణుకుమిణుకుమనే ఆశల్లా- చీకటి కమ్మిన గోదావరిలోనూ అలలు ఏదో కాంతిని పులుముకుని మందకొడిగా మెరుస్తున్నాయి. సాయంత్రం నాలుగు గంటల నుంచీ అదే బెంచీ మీద కూర్చుని ఉన్నా సుజయ్‌కుమార్‌ను గుర్తుపట్టి పలకరించినవారే లేరు. నవమి, చవితి, దసరా పందిళ్లలో, అమ్మవారి జాతరల్లో, ఎమ్యూజ్‌మెంట్‌ పార్కుల్లో ఎందరు తన నాట్య విన్యాసాన్ని కళ్ళప్పగించి చూసేవారు! వారిలో కొందరు తనను తమ సమక్షానికి దిగి వచ్చిన ఎన్టీఆర్‌లాగే భావించి కౌగలించుకునేవారు. కరచాలనాల కోసం ఎగబడేవారు. అవధులు మీరిన అభిమానంతో పూలదండలతో ముంచెత్తేవారు. వేసిన పాటనే మళ్ళీ మళ్ళీ వేయించుకునేవారు. స్టేజిమీద రూపాయల వర్షం కురిపించేవారు. ఏడాదంతా తీరిక లేకుండా ఎక్కడో ఓ చోట ప్రదర్శనలుండేవి. ఆనాడు తనకు రెండు చేతులా సంపాదనే. కార్లలో తిరిగేవాడు. రోజుకు కొన్ని వందలు, వేలు ఖర్చు చేసేవాడు. 'చిలక కొట్టుడు కొడితే చిన్నదానా', 'ఆరేసుకోబోయి పారేసుకున్నాను' అంటూ చిందులు వేసినా, 'జన్మమెత్తితిరా అనుభవించితిరా', 'విధి ఒక విషవలయం' అంటూ విషాదాన్ని అభినయించినా చప్పట్లు మార్మోగేవి. మద్రాసెళ్ళి హీరో కాలేకపోయానన్న బాధకు ఆస్కారం లేకుండా సుజయ్‌కుమార్‌ రికార్డింగ్‌ డ్యాన్సర్‌గానే జనం జేజేలు పుష్కలంగా అందుకున్నాడు. తన సరసన జూనియర్‌ వాణిశ్రీగా నటించే మంగను పెళ్ళి చేసుకున్నాడు. ఇద్దరు పిల్లల్ని కన్నాడు. రెండు చేతులా సంపాదిస్తూ నాలుగు చేతులతో ఖర్చు పెడుతున్న తనను మంగ హెచ్చరిస్తూనే ఉండేది. దీపముండగానే ఇల్లు చక్కబెట్టుకోకపోతే తరువాత చీకట్లో తడుములాడుకోవలసి వస్తుందని మొత్తుకునేది. ఎదిగేకొద్దీ పెరిగే పిల్లల అవసరాల కోసమైనా డబ్బు పొదుపును అలవాటు చేసుకోవాలని నిత్యం సతాయించేది. అయినా జనం చప్పట్ల నిషాలో తనకా మాటలు మనసుకు పట్టలేదు. జాంపేటలో తన తండ్రి నుంచి వచ్చిన పాకను డాబాగా మార్చడం మినహా ఏమీ కూడ బెట్టలేదు. ఇసుక తిన్నెపై కురిసిన వానజల్లుగా- ప్రదర్శనల ద్వారా వచ్చే ఆదాయమంతా విందు విలాసాలకు, మిత్రులకు ఖర్చయిపోయేది. సుజయ్‌కుమార్‌కు జ్ఞానోదయం కాకముందే రికార్డింగ్‌ డ్యాన్స్‌లపై ప్రభుత్వం నిషేధం విధించింది. జాతర ముగిశాక అమ్మవారి ఆలయంలా అప్పారావును సుజయ్‌కుమార్‌గా మార్చిన కళ వెలవెలబోయింది. చప్పట్లూ, వన్స్‌మోర్‌లూ గత వైభవంగా మారాయి. మండు వేసవిలో ధవళేశ్వరం బ్యారేజి దిగువన గోదావరిలా బతుకు ఎండిపోయింది.
* * *
పచ్చిక మైదానంలో నిశ్చింతగా మేస్తుండగా పులి దాడి చేయడంతో చెల్లాచెదురైన లేళ్ళలా- అంతవరకూ రికార్డింగ్‌ డ్యాన్స్‌ను నమ్ముకున్న వారంతా ప్రభుత్వ నిషేధంతో పొట్ట చేత పట్టుకుని తలో బతుకుతెరువూ వెతుక్కోవలసి వచ్చింది. జూనియర్‌ ఏయన్నార్‌ బజ్జీల బండి పెట్టుకున్నాడు. జూనియర్‌ చిరంజీవి ఆటో నడుపుకుంటున్నాడు. జూనియర్‌ కృష్ణ హోటల్‌లో క్లీనర్‌గా చేరాడు. ఓ జూనియర్‌ హీరోయిన్‌ కేటరింగ్‌ కంపెనీలో వంటకత్తెగా చేరింది. మరో జూనియర్‌ హీరోయిన్‌ ఓ చోటా రాజకీయ నాయకుడి ప్రాపకాన్ని నమ్ముకుంది. స్జేజిపై మయూరిలా నర్తించిన సుజయ్‌కుమార్‌ భార్య మంగ కుట్టుమెషీన్‌ తొక్కాల్సి వచ్చింది. వాస్తవాన్ని జీర్ణించుకోలేని సుజయ్‌కుమార్‌ ఏ పనికీ మళ్ళలేకపోయాడు. జూనియర్‌ ఎన్టీఆర్‌గా వెలిగిన వైభవానికి తెరపడ్డా అలవాటు పడ్డ తాగుడును విడిచి పెట్టలేకపోయాడు. భర్త మీదున్న ప్రేమతో కొన్నాళ్ళు సహించిన మంగ ఇల్లు గడవడమే గండం కావడంతో చివరికి తెగేసి చెప్పింది.

''రూపాయి సంపాదించకపోగా ఆ తాగుడు మానవు. చెవినిల్లు కట్టుకుని పోరినా నాడు వినకపోతివి. ఇప్పుడేమో ఇలా మిగలాల్సి వచ్చింది. నువ్వు తేకపోతే మానె, నీ తాగుడికి నన్ను డబ్బులడగొద్దు. చిల్లిగవ్వ ఇవ్వను''
కుటుంబ పోషణకు భార్య చేస్తున్న ఒంటరి పోరాటం సుజయ్‌కుమార్‌కి తెలుసు. కానీ రాజ్యం కోల్పోయినా రాజసం పోని వాడిలా గతాన్నే తలుచు కుని ఆ జ్ఞాపకాలనే నెమరేసుకుంటూ మత్తులో మునిగిపోవడానికి అలవాటు పడిపోయాడు. భార్య అన్నమాటకు కట్టుబడి డబ్బులు ఇవ్వకపోవడంతో రోడ్డున పడ్డాడు. పరిచయమున్న ప్రతివాడి ముందూ చేతులు సాచి అడగసాగాడు. ఎవరు ఎంతిచ్చినా చీప్‌ లిక్కర్‌కే జమయ్యేది.

రికార్డింగ్‌ డ్యాన్స్‌లను ఎందుకు రద్దు చేయాల్సి వచ్చిందో సుజయ్‌కుమార్‌కి అర్థం కాలేదు. కొత్తగా వస్తున్న సినిమాల్లో హీరో హీరోయిన్లు డ్యూయట్ల పేరుతో బట్టల్ని అడ్డంగా పెట్టుకున్న బ్లూ ఫిలిమ్‌లనే చూపిస్తున్నారు. అలాంటి సినిమాలకు ప్రభుత్వం సబ్సిడీలు కూడా ఇస్తోంది. ప్రజలను పాలించేవారే అలాంటి సినిమాల షూటింగ్‌లను ప్రారంభిస్తూ, పాటల క్యాసెట్లను విడుదల చేస్తూ విజయవంతం కావాలని ఆశీర్వదిస్తున్నారు. అందాల పోటీల విజేతలకు కిరీటాలు తొడుగుతున్నారు. క్లబ్‌లలో, పబ్‌లలో అర్ధనగ్న, నగ్న నృత్య విన్యాసాలు జరిగిపోతూనే ఉన్నాయి. రీమిక్స్‌ల పేరిట అంగాంగ విన్యాసాల సీడీలు వస్తూనే ఉన్నాయి. డ్యాన్స్‌ హంగామాల పేరిట కామ వికారాన్ని ప్రేరేపించే కార్యక్రమాలు జరిగిపోతూనే ఉన్నాయి. టీవీలో 24 గంటలూ దేవతా వస్త్రాలతో సాగే విన్యాసాలను చూపే ఫ్యాషన్‌ ఛానళ్ళూ, బూతుతో మిడ్‌నైట్‌ మషాళాలూ, కామ వికారాన్ని ప్రేరేపించే సవాలక్ష ప్రకటనలూ, ముక్కుపచ్చలారని చిన్నారులకు వెకిలి దుస్తులు వేసి అశ్లీలపు సినిమా కుప్పిగంతులు వేయించే డ్యాన్స్‌ బేబి డ్యాన్స్‌లూ ప్రసారమవుతూనే ఉన్నాయి. ఇంటర్నెట్‌ కేఫ్‌లలో పోర్నో సైట్లకు కుర్రకారు ఎగబడుతూనే ఉన్నారు. మరి రికార్డింగ్‌ డ్యాన్స్‌లతో లోకానికి ముంచుకొచ్చిన ముప్పేమిటి? తెరపై చూపేదానికి స్టేజిపై అనుకరణను నిషేధించినంత మాత్రాన జనంలో వికారాలు రద్దయిపోతాయా? సినిమాల కన్న సినీ రికార్డింగ్‌ డ్యాన్స్‌లు చెడిపోయాయా? సుజయ్‌కుమార్‌ను వేధించిన ఈ ప్రశ్నలకు జవాబు లభించలేదు.

రికార్డింగ్‌ డ్యాన్స్‌లు రద్దయినా రాజకీయాల పుణ్యమాని సుజయ్‌కుమార్‌కు అప్పుడప్పుడూ పని తగిలేది. ఎన్నికల ప్రచార సమయాల్లో తెలుగుదేశం వారు ఎన్టీఆర్‌ వేషం కట్టమని పిలిచేవారు. రోజుకింతని ఇచ్చేవారు. ఎన్టీఆర్‌ తెర వేషాలనే కాక ఆయన నిజజీవితంలోని పాత్రనూ అనుకరించే అవకాశం వచ్చినందుకు సంతోషించాలో, తెలుగు వారికి ఆరాధ్య కళాకారుడైన ఆయన స్థాపించిన పార్టీ పాలనలోనే తమ 'కళ'పై నిషేధం తప్పనందుకు ఏడవాలో అర్థమయ్యేది కాదు సుజయ్‌కుమార్‌కి. ఏమైనా- మోడైన ముఖానికి మళ్ళీ రంగు వేసుకునే అవకాశం వచ్చినందుకు తాయిలం దొరికిన పసిపిల్లాడిలా సంబరపడేవాడు. తనలోని కళాకారుడు బతికే ఉన్నాడని చాటుకోవాలని తపించేవాడు. ఎన్టీఆర్‌లా ధోవతి, లాల్చీ, ఉత్తరీయం ధరించి, ఆయన రాజకీయ ప్రసంగాలకు అభినయంచేస్తూ మైమరచి పోయేవాడు. అలా ఓ ఎన్నికల ప్రచారంలో ట్రాక్టర్‌పై ఎన్టీఆర్‌ వేషంలో లీనమైపోయి అభినయిస్తుండగా కిందకు జారిపడడంతో కుడి కంటికి గాయమై చూపు పోయింది. ఎన్నికలప్పుడు పిలుపులూ ఆగిపోయాయి. ఇప్పుడు వయసు మీద పడడంతో రెండో కంటికి చత్వారం వచ్చింది. తాగి తాగి నరాలు పట్టు తప్పాయి. స్టేజిపై చిరుతపులిలా గెంతినవాడు చేతి కర్ర ఊతంతో అడుగులో అడుగేసుకుంటూ అతి కష్టమ్మీద నడవాల్సి వస్తోంది.
* * *
ఉదయం వంట పూర్తిచేసి కుట్టు మెషీన్‌ ఎక్కింది మంగ. నాలుక పీకేస్తుండగా జంకుతూనే పది రూపాయలడిగాడు సుజయ్‌కుమార్‌. నడివేసవిలో అకస్మాత్తుగా గోదావరికి వరద వచ్చినట్టు కోపంతో విరుచుకు పడింది మంగ.

''తాగుడికేగా''ఎన్నిసార్లు చెప్పినా నీకు బుద్ధిరాదా? నీలాంటి వాడి కడుపున పుట్టబట్టే పిల్లలు చదువుకోవలసిన వయసులో షెడ్డుల్లో గొడ్డు చాకిరీ చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని పెట్టేది తినలేవా? ఈ పాడు బతుకు బతికేకన్న గోదాట్లో దూకి చావొచ్చుగా. ఒకేసారి ఏడ్చి ఊరుకుంటాం'' అంటూ తిట్టి తిట్టి బావురుమంది. సుజయ్‌కుమార్‌కి 'జన్మమెత్తితిరా...' పాట గుర్తుకు వచ్చింది. మంగ మీద జాలేసింది. తనపై తనకు రోత పుట్టింది. మంగ ఒళ్ళో తల పెట్టుకుని ఏడవాలనిపించింది. అయినా ధైర్యం చేయలేకపోయాడు. మారుమాటాడకుండా రోడ్డెక్కాడు. ఏడుస్తూనే ఉన్న మంగ 'తిండి తిని వెళ్ల'మని అనలేకపోయింది.

కర్రతో రోడ్డును కొలుచుకుంటూ వీధుల్లో తిరిగాడు.
'ఈ వీధుల్లోనే తాను కార్లలో తిరిగాడు. ఈ వీధుల్లోనే తాను ఎదురైతే 'ఎన్టీఆర్‌గారూ! బాగున్నారా?' అన్న పలకరింపులు తెరిపి లేకుండా వినిపించేవి. తనను చూసి ఎన్టీఆర్‌ అభిమానులు ఆయనను చూసినట్టే సంబరపడేవారు. తానెన్నడూ డూప్‌ హీరోనని చిన్నబుచ్చుకోలేదు. తనకు చేతనైన కళతో జనాన్ని సంతోషపెట్టాడు. అవే వీధులు! ఆ వీధుల్లో ఆనాటికన్న పెరిగిన రద్దీ. అయితేనేం... ఇప్పుడు తన వంక ఓరకంట చూసేవారే లేరు. తిండి లేక కడుపూ, మందు లేక మనసూ రగులుతుండగా ఊరంతా తిరిగి తిరిగి సాయంత్రానికి గోదావరి గట్టుకు చేరాడు. గౌతమీ నందనవనం పార్కులోకొచ్చి కూర్చున్నాడు. చీకటి పడకముందు నుంచీ అలాగే బెంచీమీద కూర్చుని గతాన్ని నెమరేసుకున్నాడు.

రికార్డింగ్‌ డ్యాన్స్‌ 64 కళల్లోనూ గొప్ప కళ అనీ, తాను గొప్ప కళాకారుడిననీ ఎప్పుడూ అనుకోలేదు. హీరో హీరోయిన్లు లెక్కలేనన్ని టేక్‌ల తరువాత రక్తి కట్టించిన పాటలని తాము ఏకబిగిన స్టేజిపై అభినయించి ప్రేక్షకుల్ని రంజింప చేస్తున్నామనుకున్నప్పుడు మాత్రం ఒకింత గొప్పగా అనిపించేది. తమ అభినయంలో తాము పనిగట్టుకుని సృష్టించే అసభ్యత ఏముందో, తెరపై చూపే దానివల్ల కలగని ముప్పు తమవల్ల ఎలా కలుగుతుందో సుజయ్‌కుమార్‌కు అంతుబట్టలేదు.

'తెరపై హీరో హీరోయిన్లు చూపగల అన్ని శృంగార భంగిమలనూ స్టేజిపై అభినయించడం తమకు సాధ్యమూ కాదు. కెమేరాలను ఎక్కడెక్కడో ఫోకస్‌ చేసి క్లోజప్‌లో హీరోయిన్‌ అందాలను చూపి సొమ్ము చేసుకోవడంలో తాము సినిమా వాళ్లతో పోటీపడనూ లేరు. రికార్డింగ్‌ డ్యాన్స్‌లపై నిషేధం అంటే తమ నోటి దగ్గర కూటిని ఎత్తుకుపోయిన రాకాసి గద్ద తప్ప మరేమీ కాదు. లోకానికి నీతి లేదు. తనకు ఒక కన్నే పోయింది. లోకానికి రెండు కళ్ళూ ఎన్నడో పోయాయి. రికార్డింగ్‌ డ్యాన్స్‌ కళాకారులు కలలో కూడా పోటీ పడలేని బూతు సంస్కృతి విశ్వరూపంలో పేట్రేగిపోతున్నా దానికి కనిపించలేదు. పైగా అలాంటి బూతు సంస్కృతిని సృష్టించే వారికి శాలువాలు కప్పి సన్మానాలు చేస్తుంది. అవార్డులూ, బిరుదులూ కట్టబెడుతుంది. గోదావరిలో ఊరి మురుగంతా కలిస్తే లేని ముప్పు, ఓ పిలగాడు ఉచ్చ పోస్తే విరుచుకు పడుతుందా? రికార్డింగ్‌ డ్యాన్స్‌లను నిషేధించినవారు ఆ తరువాత ఎంత గొప్ప సంస్కృతిని పెంచి పోషించారు?'

తమ బతుకుల్లో చిచ్చు పెట్టిన లోకంపై కక్షతో పళ్ళు నూరుకున్నాడు సుజయ్‌కుమార్‌. మంగా, పిల్లలూ గుర్తొచ్చారు. కళ్లలో నీళ్ళు తిరిగాయి.
'చిల్లుల నావపై కుండపోత వానలా వాళ్ళ బతుకులకు తాను బరువే. మంగ అన్నది నిజమే. తాను చచ్చిపోతే వాళ్ళ బతుకులు తేలిక పడతాయి'
ఎనిమిదిన్నర దాటడంతో పార్కులో జనం పల్చబడ్డారు. గోదావరిలో వేలాడుతున్న జాలరులు వలలో చిక్కిన చేపలను నావల్లోని గంపల్లో వేస్తున్నారు. కాసేపు గిలగిలలాడాక వాటిలో చలనం నిలిచిపోతోంది. పార్కు వాచ్‌మెన్‌ వచ్చాడు.

''ఏమయ్యా! ఇల్లు గుర్తుకు రావడం లేదా? లేలే, గేటు వేసేస్తా'' అన్నాడు.
పక్కనున్న కర్ర పట్టుకుని లేచాడు సుజయ్‌కుమార్‌. గంటసేపు నడిచి కోటిపల్లి బస్టాండ్‌ సెంటర్‌లోని ఎన్టీఆర్‌ కాంస్య విగ్రహాన్ని చేరాడు. పట్టు తప్పిన కాళ్లతో తడబడుతూనే ఇనుప నిచ్చెన మీదుగా విగ్రహం ఉన్న దిమ్మనెక్కాడు. మసక చూపుతోనే ఆ మహా నటుడిని తనివి తీరా చూసుకున్నాడు. విగ్రహం ముఖం చుట్టూ రెండు చేతులూ వేసి నిమిరాడు. తరువాత తన ముఖాన్ని ఆప్యాయంగా నిమురుకున్నాడు. కాళ్లను మురిపెంగా తడుముకున్నాడు. వెర్రి గర్వంతో ఛాతీ విరుచుకున్నాడు. దూరంగా నవరాత్రి పందిరి నుంచి 'డ్యాన్స్‌ బేబీ డ్యాన్స్‌' చూస్తున్న ప్రేక్షకుల ఈలలూ, చప్పట్లూ గాలిలో తేలి వస్తున్నాయి. సుజయ్‌కుమార్‌ బిగ్గరగా నవ్వాడు. భర్త మరణాన్ని రద్దు చేయమని చేతులు జోడించి ప్రార్థిస్తున్న సతీ సావిత్రిని చూసి యముని వేషంలోని ఎన్టీఆర్‌ లా పగలబడి నవ్వాడు. నవ్వీ నవ్వీ కళ్లలో నీళ్ళు తిరుగుతుండగా దిమ్మ మీంచి ఎగిరి కింద విగ్రహం చుట్టూ ఉన్న ఫెన్సింగ్‌ మీదికి దూకాడు. శూలంలాంటి ఊచలు గుండెల్లో దిగబడగా జూనియర్‌ ఎన్టీఆర్‌ అలియాస్‌ సుజయ్‌కుమార్‌ అలియాస్‌ అప్పారావు ఊపిరికి తెరపడింది.

మనవడు ఒరియా కథ

డా|| ప్రశాంతకుమార్‌ ప్రదాన్‌
అనువాదం: మహీధర రామశాస్త్రి
''ఒరేయ్‌! గంట నుంచి చూస్తున్నాను, అక్కడ మీరంతా ఏం చేస్తున్నట్టు? దొంగ పీనుగులంతా ఒక్కటయ్యారు. తల తిప్పితే చాలు గోతులు తవ్వేస్తారు! మిమ్మల్ని బొత్తిగా నమ్మడానికి లేకుండా పోయింది. అక్కడలాగే తగలడండి! బడుద్దాయిల్లారా... ఒక్కొక్కడొక్కొక్క సైతాను నాకు...!''
సదానంద త్రిపాఠి అరుగుమీద నిలబడి అరుస్తున్నాడు. అయిదడుగుల ఎత్తరుగులు, కిరీటంలా రెండు చూరులున్న పాతకాలం నాటి ఇల్లు అది. ఒకనాడు ఆ ఇంటి ముందు ఏనుగులాంటి మదించిన ఎడ్లు గడ్డి మేస్తుండేవి. ట్రాక్టర్లొచ్చాక ఇప్పుడు ఎడ్లని మేపాల్సిన పని లేకుండా పోయింది. ఇంటి ఎదురుగా ఉన్న కొబ్బరి తోట త్రిపాఠిదే. మధువాభాయి తోటలో పని చేస్తున్నాడు. మధువాభాయి ఆయన పాలేరు. త్రిపాఠి కేకలేస్తున్నది అతణ్ణే.

సదానంద త్రిపాఠి పక్క ఊళ్ళోని ఓ హైస్కూల్లో పనిచేసి, ఎనిమిది సంవత్సరాల క్రితం రిటైరయి, ప్రస్తుతం పింఛను పుచ్చుకుంటున్నారు. ఆ రోజుల్లో ఆయన బి.ఎ, బి.ఇడి, పాట్నా యూనివర్సిటీ నుంచి డిస్టింక్షన్‌లో పాసయ్యారు. అదీ ఇంగ్లిషులో ఆనర్సు చేశారు. పాఠాలు చెప్పడంలో ఆయన దిట్ట. ఇంగ్లిషు, సంస్కృతం, ఒరియా భాషల్లో ఆయనను మించినవాడు లేడు. ఆయన అనువాదాలు, వ్యాకరణ గ్రంథం హైస్కూలు పిల్లలకు పాఠ్య పుస్తకాలయ్యాయి. ఆయన పుస్తకాలు చదవని విద్యార్థులుండరు. అయితే ఆయన చదువులు ఆయన తలమీది పిలక ముడినీ, నుదుటి నామాలనూ ఏమాత్రం మార్చలేకపోయాయి. మనిషి మంచి స్ఫురద్రూపి. వయసు మీదపడి ఇప్పుడు కొంచెం తగ్గినా, యవ్వనంలో మంచి వస్తాదు. త్రికాల సంధ్య వారుస్తాడు. చిన్న మేస్టార్లు త్రిపాఠి¸ గారంటే భయపడతారు. అందర్నీ పరుగులు పెట్టిస్తూ పనులు చేయించడంలో నిష్ణాతుడాయన. వెనకాల ఎన్ని సణుక్కున్నా ఆయన ఎదురుగా మాత్రం ఎవరూ నోరు విప్పరు.
ఇన్ని సుగుణాలున్న త్రిపాఠిలో కొన్ని అవలక్షణాలు కూడా ఉన్నాయి. ఆయనను రోగంలా పట్టి పీడిస్తున్న లక్షణాలు- కుల పట్టింపులు, అంటరానితనం.

'ఈ శూద్రులు ఎప్పటికీ ఏమీ నేర్చుకోలేరు. ఏబీసీడీలు నేర్చుకుందుకు సంవత్సరాలు పడుతుంది. స్కూలుకి ఇవాళ వస్తే రేపు రారు. వీళ్ల నైజం బురదలో పడి దొర్లడం... అంగారః శతధౌ తీన...' అన్నది ఆయన ప్రగాఢ విశ్వాసం.
ఆయనకు పదిహేనెకరాల పంట భూమి ఉంది. దాన్ని కౌలుకి ఇచ్చేశారు. ఒక ఎకరం కొబ్బరితోటను మాత్రం సొంతంగా చేసుకుంటున్నారు. అందులో రెండు వందల కొబ్బరి చెట్లున్నాయి. తోటలో పని చెయ్యడానికి పక్క పాలెంలోని మధువాభాయి ఉన్నాడు. తోటలో కంద, అల్లం, పెండలం అంతరపంటలు వేస్తుంటారు.

రిటైరైపోయాక త్రిపాఠి తోటపనీ గట్రా రెండు సంవత్సరాలపాటు చూసుకున్నాడు. అయితే అందులోని కష్టం త్వరలోనే తెలిసి వచ్చి, పాఠాలు చెప్పినంత సులువు కాదు, వ్యవసాయం చెయ్యడం అన్న సత్యాన్ని తెలసుకున్నారాయన. భూములన్నింటినీ మళ్లీ కౌలుకి ఇచ్చేశారు. ముఖ్యంగా ఆయన సుపుత్రుడు అమెరికా వదలి రానని కరాఖండిగా చెప్పేశాక త్రిపాఠికి అన్నింటి మీదా విరక్తి వచ్చేసింది. ఆయన భార్య ఏకంగా మంచం పట్టేసింది. త్రిపాఠి¸కి ముందునుంచీ సందేహంగానే ఉండేది. కొడుకు ఐ.ఐ.టిలో సీటు రాగానే ఢిల్లీ వెళ్లాడు. ఆ తర్వాత రూర్కీ వెళ్లాడు. అటునుంచి అటు స్టేట్స్‌కి వెళ్లిపోయాడు. కొడుకును చూసుకుని త్రిపాఠి ఎంతో మురిసిపోయేవాడు.

ఆయన కింద పనిచేసే అసిస్టెంటు రవుతు కొడుక్కి ఆర్‌.ఇ.సిలో సీటు వచ్చింది. రవుతు ఆనందాన్ని చూసి ఓర్వలేకపోయేవాడు త్రిపాఠి. చుట్టుపక్కల గ్రామాల్లో ఎవరికైనా డాక్టరు, లెక్చరరు, చివరకు ప్యూను ఉద్యోగం వచ్చినా ఆయన సహించలేకపోయేవాడు.

ఛీఫ్‌ సెక్రటరీ తమ అమ్మాయిని యిస్తామంటూ సంబంధం కుదుర్చుకోవడానికి వచ్చారు.
'మా అబ్బాయి వస్తాడు. చూసుకుంటాడు. కొంచెం ఆగండి' అంటూ అభ్యర్థించాడు త్రిపాఠి¸. కానీ ఆయన ఆశలన్నీ అడియాశలైపోయాయి. ఆయన అహంకారమంతా బుగ్గిపాలయిపోయింది. బోలెడు డబ్బు ఖర్చు పెట్టుకుని ఆయన స్వయంగా శాన్‌ఫ్రాన్సిస్కో వెళ్లాడు. కానీ కొడుకు మారిపోయి కనిపించాడక్కడ. 'ఇండియాలో ఏముంది? ఒట్టి కరప్షను తప్ప, ఎవడేనా కాస్తంత ఎదుగుతున్నట్టు కనిపిస్తే వాణ్ణి ఎలా పడగొట్టాలా అన్న చింతన! రాంగ్‌ పాలసీలు! నేనిక్కడ రీసెర్చి చేస్తున్నాను. పెంటగన్‌ గూఢచార సంస్థలో నేనొక విశిష్ట సభ్యుడిగా ఉన్నాను. అమెరికా పౌరసత్వం తీసేసుకున్నాను. నో మోర్‌ ఏనిండియన్‌!' అంటూ తండ్రికి ఎదురు తిరిగాడు తనయుడు. కొడుకు రానని అలా తెగేసి చెప్పాక త్రిపాఠి¸ మొహం మాడ్చుకుని వెనక్కి వచ్చేశాడు. భర్తను చూసి పరిస్థితిని అర్థం చేసుకున్న ఆయన సతీమణి స్పృహ తప్పి పడిపోయింది. చుట్టాలు పక్కాలు వచ్చి పరామర్శించి వెళ్లారు. దాంతో మేస్టారికి నడుము విరిగినంత పనయింది. ఆ రోజు నుంచి ఆయన బయట తిరగడం మానుకున్నాడు.

పైగా కొడుకు, ''మీ ఇద్దరూ ఇక్కడకు వచ్చేయండి,నాకూ బాగుంటుంది''అన్నాడు.
కానీ మేస్టారుకి గ్రామంలోని చేపల చెరువునీ, కొబ్బరి తోటనీ, పంట పొలాలనూ వదలడం ఇష్టం లేదు. అనాదిగా ఇతరుల మీద వెలిగిస్తోన్న పెత్తందారీతనాన్నీ ఆయన వదులుకోలేకపోయాడు. అమెరికాలో ఉన్న నాలుగు రోజులూ ఆయనకు ఊపిరాడింది కాదు. అక్కడి ఆధునికతను చూసి ఆయన బెదిరిపోయాడో, గ్రామంలో తమకున్న పెద్దరికం కట్టిపడేసిందో, లేక ఆయన తెల్లరంగు అమెరికా తెల్లదనం ముందు తెల్ల మొహం వేసిందో మరి, ఆయన కొడుకుతో తర్కంలోకి దిగలేదు. ఒక క్షణంలో గాంధీజీలా ఆమరణ నిరాహార దీక్ష చేస్తూ కొడుకు ముందు కూర్చుందామనిపించినా ఆ ప్రయత్నాన్ని విరమించుకున్నాడు. కొడుకు రైటో, తాను రైటో తేల్చుకోలేని సందిగ్ధంలో పడ్డాడాయన.
''ఒరేయ్‌! నువ్వు కొడుకుతో ఆటలాడుతున్నావా లేక గడ్డి పోగేస్తున్నావా? చాల్లే చూపించిన ప్రేమ... వీళ్లని మనం ఎంత ముద్దు చేస్తామో అంతగా పెద్దయ్యాక మననెత్తికెక్కుతారు''

మధువా భార్య సాబి అక్కడే కొడుక్కి ఏదో తినిపిస్తుంది. కుర్రాడు తల్లిలా నల్లగా ఉన్నాడు. త్రిపాఠి ఎందుకనో పట్టిపట్టి చూశాడు. గతంలో వాణ్ణి ఆయన ఎన్నిసార్లు చూసి ఉన్నాడు. కానీ ఈ రోజెందుకో చాలా ఆదరంగా చూశాడు. కుర్రాడి మొహంలో లావణ్యం కనబడింది. ఆ చిన్నవాడికి మూడు నాలుగేళ్లుంటాయి. ఖిన్న వదనంతో త్రిపాఠి ఇంట్లోకి వెళ్లాడు. కుర్రవాడి కేకలు ఇంట్లోకి వినబడుతున్నాయి. తన గుమ్మం ముందు ఆడుతూ పాడుతూ గెంతుతున్నాడు వాడు. పరాగ్గా ఉంటే యింట్లోకి వచ్చేసినా వచ్చేస్తాడు. వచ్చేస్తే ఇల్లంతా మైలపడిపోతుంది! లోపల్నుంచి అరిచాడు మేస్టారు.

''ఓ సాబీ! నీ కొడుకుని కాస్తంత అదమాయించు. మా లోపలకు జొరబడకుండా చూడు!'' అని వీధి తలుపులు బిగించాడాయన. గ్రామంలో అన్ని జాతులవారూ ఉన్నారు. కరణాలు, మస్తాన్లు, పండాలు, అవధాన్లు, ఖండాయతులు, మహంతీలు, గొల్లలు వగైరాలు. రెండు రజకుల ఇళ్ళు, తాళ్లు పేనుకుని బతికే వాళ్లు, సాలెలు, కొండరా (మాదిగలు) వగైరాలు కూడా ఉన్నారు. కరణాల ఇళ్ళన్నీ అద్దెకివ్వబడ్డాయి. వాళ్లంతా శాశ్వతంగా కటక్‌, భువనేశ్వర్‌లకు మకాం మార్చేయడమే దానికి కారణం. కరెంటు డిపార్టుమెంటువాళ్లూ, గ్రామీణ బ్యాంకు మేనేజర్లూ, పోస్టుమేస్టర్ల లాంటివాళ్లు కరణాల ఇళ్లలో అద్దెకుంటున్నారు. కుప్ప నూర్పిళ్ల రోజుల్లో పిల్లల్ని వెంట బెట్టుకుని మహంతీలు గ్రామంలోకి వస్తారు. వారి రాకతో గ్రామానికి ఒక కొత్త కళ వస్తుంది. అయితే ఈ రోజుల్లో గ్రామాల్లో కూడా ఫ్యాషన్‌కి లోటేంలేదు. గ్రామంలోని దిబ్బ రొట్టె అమ్మాయిలందరూ దోసకాయలు తింటూ డైటింగు చేస్తున్నారు. అలంకరణ సామాగ్రి గ్రామీణ దుకాణాల్లో కూడా దొరుకుతోంది. మెహందీలు, ముల్తానీ మట్టి వగైరాలు. పట్టణవాసం అమ్మాయిలకు ఈ పల్లెటూరి అమ్మాయిలు ఏ రకంగానూ తీసిపోవడం లేదు.

మహంతీ పేటలో చాలామంది త్రిపాఠి గారి శిష్యులున్నారు. వాళ్లంతా పెద్దవాళ్త్లెనా స్కూటర్లు, కార్లమీద వెడుతూ కూడా మేస్టారు ఎదురయితే బండిదిగి నమస్కరించి వెడుతుంటారు. వారిని చూపించి, సరైన చదువులు లేని స్వజాతి యువకుల్ని మందలిస్తుంటారు మేస్టారు.
''బుద్ధి తెచ్చుకోండి, రాజ మహారాజాల కాలంలో ఈ పదవులన్నింటినీ మనం నిర్వహించే వాళ్లం. మీరంతా ఇప్పుడు బడుద్ధాయిల్లా తయారయ్యారు కాబట్టి ఈ మహంతీలు ఇంతగా ఎదిగిపోయేరు.''

మేస్టారు ఎదురయితే పిల్లలు మొహాలు చాటేసుకుని తిరగడం మొదలు పెట్టారు. అయినా ఉద్యోగాలు ఏమయినా చెట్లకు కాస్తున్నాయా?బీఏ, ఎంఏలు పాసయినా చివరకు ప్రయివేటు కంపెనీల్లో సెక్యూరిటీ గార్డు ఉద్యోగం కూడా దొరకడం లేదు.
త్రిపాఠి¸ గ్రామ పౌరోహిత్యం పని మానుకున్నాడు. ఒకవేళ వెళ్లినా, పిల్చిన యజమానిని కాల్చుకుని తినేశాడన్నమాటే! ఇలాగనీ అలాగనీ నానారకాల విధివిధానాలతో విసిగించడమే కాక, 'అసింటా... యిసింటా' అంటూ అవమానపరుస్తాడు. నాలుగయిదు గంటల పాటు పెద్ద కంఠంతో సంస్కృత శ్లోకాలు చదువుతూ ప్రాతఃకాల సుఖశాంతుల్ని హరాయించేస్తాడు. వచ్చేముందే దక్షిణ డబ్బులు గురించి కరారు చేసుకుని మరీ వస్తాడు. అనార్యులను వేదమంత్రాలతో పవిత్రులను చేసినందుకు గాను కనీసం వందరూపాయలైనా ఇవ్వకుంటే ఆయన చిర్రెత్తిపోతాడు.
త్రిపాఠి¸కి మరొక రోగం కూడా ఉంది. గౌరవర్ణం, నలుపు రంగు శరీరం వాళ్లను ఆయన ఏవగించుకుంటారు. దానికాయన చెప్పే కారణాలు వింటే ఎవరికైనా ఒళ్లు మండుకొస్తుంది.

త్రిపాఠి¸ మంచంమీద పడుకుని భార్యకేసి చూశాడు. ఆమె కళ్లు మూసుకుని పడుకొని ఉంది. కొంతసేపు తర్వాత కళ్లు తెరిచి పైకి చూస్తూ, ''కానీండి... మనకెవరూ లేరనుకుందాం. ఈ లోకంలో పిల్లలు లేని వాళ్లెంతమంది లేరు! వాళ్లంతా చచ్చిపోతున్నారా? మీరేం బాధపడకండి... బతికినన్నాళ్లు బతుకుతాం. చచ్చిపోయేముందు ఆస్తిని ఏ పాఠశాలకో రాసి చద్దాం. శాశ్వతంగా పేరయినా నిలబడుతుంది'' అంది. అనేసి మళ్లీ ఆమె కళ్లు మూసుకుంది. ఆమె పెదవులు, కనురెప్పలు వణికాయి. కన్నీరు కిందకు జారింది.

సదానందబాబు ఇప్పుడు బొత్తిగా బయటకు రావడంలేదు. గ్రామ సంతర్పణలకు గానీ, బ్రాహ్మణార్థాలకు గానీ, బజారుకేసి గానీ, ఎక్కడకూ రావడం లేదు. నెలకోసారి పెన్షనుకోసం ట్రెజరీకి వెళ్లివస్తాడు. అంతే. ఆయన భార్య చుట్టుపక్కల ఇళ్లకు కూడా వెళ్లడం లేదు. ఆమెకు జీవితంలో ఇదే మొదటి దెబ్బ చివరిదెబ్బ అయింది. ఒక్కసారిగా పది సంవత్సరాల వయసు మీద పడినట్టయింది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆమె ఒంటి చేతిమీద మొత్తం ఇంటిని నడిపించిన మనిషి! త్రిపాఠి¸ చేత పచ్చిమిరపకాయ తొడిమను కూడా తెంపనివ్వని మనిషి! ఇప్పుడేమో లేచి కూర్చోలేకుండా అయిపోయింది. భర్త ఎంతగా నచ్చజెప్పినా ఆమె మాతృ హృదయం సమాధాన పడలేకపోతోంది.

త్రిపాఠి¸ దగ్గరి బంధువు ఆ పక్కనే ఉంటున్నాడు కానీ, భూమి తగాదాల విషయంలో పేచీలు పడి ఒకరి గుమ్మాలొకరు తొక్కడం మానుకున్నారు. త్రిపాఠి¸ అత్తగారి వైపు బంధువర్గం అంతా దూరంగా రూర్కెలాలో ఉంటున్నారు. బావమరదుల పిల్లలు అప్పుడప్పుడు వస్తుంటారు. కానీ వాళ్లూ ఎన్నాళ్లని రాగలరు? ఎవరి సమస్యలు వాళ్లకుంటాయి. చుట్టుపక్కల ఇళ్లవాళ్లు... ఆడవాళ్లు అప్పుడప్పుడు వచ్చి చూసిపోతున్నా ఇంటిపనిని వాళ్లమీద వదిలేయలేరు కదా? రెండువందల రూపాయలు నెల జీతం మీద ఓ వంట మనిషిని పెట్టుకున్నారు. మూడో నాటినుంచి ఇంట్లోని వస్తువులు ఒక్కొక్కటే మాయం కావడం మొదలెట్టాయి. సంతనుంచి ఎవరిచేతనైనా కూరలు గట్రా తెప్పించుకుంటే పదీ ఇరవై కొట్టేస్తున్నారు. పని చెప్పేటప్పుడు ఖుసామత్తు జమాఖర్చుల దగ్గర కసరత్తు తప్పడం లేదు. ఇలా కాదని ఓ రోజు మధువాని సంతకు పంపించారు. చక్కగా సంత చేసుకుని రావడమే కాదు, జమా ఖర్చులు కూడా సరిగా అప్పగించాడు. ఆనాటినుంచి ఇవాళ్టి వరకూ సంతపని మధువాయే చూస్తున్నాడు.

శీతాకాలంలో వేకువనే లేచి త్రిపాఠీ స్నానం చేసి తిరిగి వస్తున్నాడు. చిన్న చెరువు దగ్గర ఓ స్త్రీ వంగొని యేదో చేస్తూ కనబడింది. దొంగ అనుకొని అటువైపు పరుగు పెట్టాడు. తీరా చూస్తే సాబి అక్కడ పని చేస్తూ కనబడింది. ఆమె ఆయన్ను చూసి నిలబడి నమస్కరించింది. సాబీని ఇంత దగ్గరగా ఆయన ఎన్నడూ చూడలేదు. గతంలో తను అజ్ఞానాహంకారాలతో వాళ్లని లెక్క చేసేవాడు కాదు. అపరిశుభ్రంగా ఉంటారని చిన్నచూపు చూస్తూ వచ్చాడు. కానీ సాబీని చూశాక ఆయనకు కనువిప్పు కలిగింది. ఈసారి పట్టి పట్టి చూశాడాయన. అందమైన మొహం... తీర్చి కట్టిన చీర పొందిగ్గా ఉంది. ఆమె కొడుకు ఆ పక్కనే నీరెండలో కూర్చుని ఉన్నాడు. వాడి చేతిలో పలక... పలకమీద 'అ' నుంచి 'హ' వరకూ అక్షరాలు గుండ్రంగా ఉన్నాయి. ఆయనకు ఏమయిందో మరి, వడివడిగా అడుగులు వేసుకుంటూ వెళ్ళిపోయాడు.

ఆ సాయంకాలం త్రిపాఠి పెరట్లోకి ఓ ఆవు దూరింది. ఆ పెరట్లోకి ఎవరికీ ప్రవేశం లేదు. మధువా, సాబీల సంగతి చెప్పనవసరం లేదు. వాళ్ల నీడ కూడా పడనంత దూరాన ఉండాల్సిందేను. బొప్పాయి చెట్లను తినేస్తోంది ఆవు... అదీ ఆయన బాధ. దాన్ని బయటకు తోలగల బలం లేదాయనకు. మధువాని పిల్చారు. మధువా లేకపోవడంతో సాబి వచ్చింది కానీ... పెరట్లోకి ప్రవేశించడానికి ఆమె జంకుతోంది. త్రిపాఠి అరిచాడు-

''ఏయ్‌... ఆవు చెట్లు తినేస్తుంటే అలా చూస్తూ నిలబడతావేంటి? దాన్ని కొట్టు... కొట్టు...''
సాబి మొదటిసారిగా ఆయన అభ్యంతర ప్రాంగణంలోకి అడుగు పెట్టింది. కర్రతో ఆవును అవతలకు తోలేసి, ఆవుతోపాటు తనూ తొందరగా బయటకు పోయింది, వెనక్కి తిరిగి చూడకుండా.

నాలుగయిదు రోజుల తర్వాత- మధువా కొబ్బరి కాయలు దింపుతున్నాడు. కొబ్బరి చెట్లు- ఒకటా రెండా- అన్నింటినీ ఎక్కుతూ దిగుతూ శ్రమిస్తున్నాడు. అతణ్ణి చూసి కొబ్బరి చెట్టు కింద నిలబడ్డ కొడుకు పకపకా నవ్వుతున్నాడు. సాబి కాయలన్నింటినీ ఒక చోటకు చేరుస్తోంది. అప్పడాల కుర్రాడు ఆ దారినపోతూ కనబడగానే సాబి కొడుకు ''అప్పలం... అప్పలం'' అంటూ మారాం చేశాడు. సాబి ఎంత ప్రయత్నించినా వాడు ఊరుకోవడం లేదు. హఠాత్తుగా త్రిపాఠీ అప్పడాల అబ్బాయిని పిలిచి రెండప్పడాలు కుర్రవాడికి ఇప్పించాడు. ఆ సమయానికి ముసలావిడ నెమ్మదిగా నడుచుకుంటూ అక్కడకు వచ్చింది. కుర్రాడు అప్పడాలు తినేసి ఆనందంగా గెంతుతూ కనిపించాడు. ముసలావిడ రెప్పార్పకుండా సాబి కొడుకుని చూస్తుండి పోయింది. ఆమె కళ్లు ఆనందంతో మెరిశాయి. చెమ్మగిల్లిన కళ్లను తుడుచుకుంటుండగా త్రిపాఠిగారామెను ఇంట్లోకి నడిపించుకుంటూ తీసుకుపోయారు.

ఇప్పుడు వంటపని కూడా త్రిపాఠి¸యే చూసుకుంటున్నాడు. ఇంట్లో గ్యాసు పొయ్యి ఉంది. అన్నం, కూర, బంగాళాదుంప వేపుడు, వంకాయ పచ్చడితో ఇద్దరూ భోజనాలు కానిస్తున్నారు.

ఆ రోజు మధ్యాహ్నం రెండు గంటలకు ఒక పార్సిలు, రిజిష్టరు ఉత్తరం వచ్చాయి త్రిపాఠి పేరుమీద.
అయిదువేల డాలర్లకు ఒక డి.డి., కంప్యూటరులో కంపోజ్‌ చేసిన ఒక చిన్న ఉత్తరం, ఓ పెద్ద సైజు ఫొటో వచ్చాయి. కొడుక్కి కొడుకు పుట్టేడుట- వాడి పేరు క్లయివు. ఫొటోలో పిల్లాడు ఎంత బాగున్నాడో! మొదటిసారిగా త్రిపాఠి కళ్ల నీళ్ళు పెట్టుకున్నాడు. ముసలావిడ చూస్తే బాధ పెరుగుతుందని మొహాన్ని పక్కకు తిప్పుకుని ఎడంచేత్తో ఫొటోను ఆమెకు అందించాడు.

''తీసుకో! నీ మనవణ్ణి చూసుకో...''
ఫొటోని గమ్మున లాక్కుని చూసింది ముసలావిడ. ఫొటోను చూస్తూ యేడుపూ నవ్వూ కలగలుపు స్వరంతో యేమిటేమిటో అంది. ఆవిడ మాటలు ఎవరికీ అర్థం కాలేదు. త్రిపాఠి లేఖను చదివాడు.
''మీరిక్కడకు రండి. నేను ఎన్నటికీ రాలేను. వీడు... క్లయివ్‌...''
ఈడియట్‌, రాస్కెల్‌- అన్న పదాలు ఆయన నోటెంట వెలువడ్డాయి. 'వదిలేయ్‌' అని తనకు తాను నచ్చజెప్పుకున్నాడు.
''వాడిని నిందించి లాభం లేదు. ఎందరో అమెరికాకి పోతున్నారు. తిరిగి రావడం లేదు. అయినా వాళ్ళ వాళ్ళందరూ బతకడం లేదూ?! కానీ... ఆ భగవంతుడు వాణ్ణీ, వాడి పిల్లల్నీ చల్లగా చూస్తే అంతే చాలు'' చేతులు పైకెత్తి గొణుక్కున్నాడాయన.

తర్వాత భార్యతో అన్నాడు,
''ఇదిగో... నీ కొడుకు నీకు కావలసినంత డబ్బు పంపించాడు. నౌకర్లను పెట్టుకో... వంట మనిషిని పెట్టుకో... పెద్ద పెద్ద డాక్టర్లచేత వైద్యం చేయించుకో... డబ్బు గురించి ఆలోచించకు... నీకింకా బాధేవిటి?''
''మీరేం వెక్కిరించ నక్కరలేదు...'' ముసలావిడ ఏడుస్తూ అంది.
త్రిపాఠీ ఆ ఫొటోని తన డైరీలో దాచుకున్నాడు. తర్వాత ఆ వృద్ధ దంపతులు ఆ ఫొటోని ఒకరికి తెలియకుండా ఒకరు ఎన్నిసార్లు ముద్దు పెట్టుకున్నారో లెక్కలేదు.

ఆరోజు తోటలో మధువా కానీ సాబి కానీ కనిపించలేదు త్రీపాఠీకి. ఏదో పని ఉందని ప్రధాన్‌ ఇంట్లో చెప్పి వెళ్లిపోయారు. కొబ్బరికాయ లెక్కింపు పని ప్రధాన్‌ని చేసి పెట్టమని మధువా కోరాడు. కాయ లెక్కించనవసరం లేదని అలాగే పంపేయమనీ ప్రధాన్‌కి చెప్పాడు త్రిపాఠీ. మధువాని కలవడం కోసం అతడి ఇంటికేసి బయల్దేరాడు.

మేఘం కమ్ముకొస్తోంది. తొందరగా కాయను ట్రాక్టరుకి ఎక్కించాలి. ప్రధాన్‌కి ముగ్గురు కొడుకులు. అంతా శ్రమపడి పని చేస్తారు. పెద్ద మనవడు డాక్టర్‌ చేసి గత సంవత్సరం కెనడా వెళ్లాడు. అతడు కెనడా వెళ్లిన రోజునుంచీ, త్రిపాఠి గారబ్బాయి అమెరికా వెళ్లిన సంగతి మాములు విషయంగా మారిపోయింది. త్రిపాఠి గొప్ప బోడిగొప్పగా మారింది. విషయం విన్న త్రిపాఠి ప్రధాన్‌కి ఓ సలహా ఇచ్చారు.

''కుర్రవాడికి పెళ్లిచేసి పంపు. ఒకవేళ నా కొడుకులా కనక చేస్తే...''
''ఫరవాలేదులెండి బాబాయిగారు! నాకా బాధలేదు. వాడక్కడే ఉండదలిస్తే ఉండనీయండి. మన బాధ్యత మనం తీర్చేం. మిగతా విషయాలు వాళ్లు చూసుకోవాలి. నాకింకా ఇద్దరు కొడుకులున్నారు. వాళ్లని చూసుకుంటూ బతికేస్తాను.''

త్రిపాఠి మౌనం దాల్చాడు.
''ఔను! ఇతగాడికి ముగ్గురు మగపిల్లలు. నాకు వాడొక్కడే. చచ్చేలోగానైనా వాణ్ణి కళ్లతో చూసుకొగలుగుతానో లేదో'' అనుకున్నాడు.
చాలా రోజుల తర్వాత ఇవాళ బయట ఊళ్లో తిరుగుతున్నాడు త్రిపాఠి¸. ఎవరేనా కనిపిస్తే మధువాకి కబురు పెట్టాలనుకున్నాడాయన. కానీ ఎవరూ కంటబడలేదు. ఓ మూలనుంచి మేఘం కమ్ముకొస్తోంది. మధువా తండ్రి సరబడు వస్తూ కనిపించాడు. సరబడు భుజంమీద మనవణ్ణి కూర్చోబెట్టుకుని వస్తున్నాడు. తాతా మనవడు మహా సంతోషంగా కబుర్లు చెప్పుకుంటూ వస్తున్నారు. మనవడు తాత జుత్తు పీకుతూ ఆడుతున్నాడు. దగ్గరవగానే సరబడు కాస్త జంకుతూ సమస్కరించాడు.

''నేను తవరి దగ్గరకే బయల్దేరానండి. మధువా పెద్ద బేమ్మాలు కబురెడితే ఎల్లాడండి.'' మనవడు త్రిపాఠీని గుర్తుపట్టి- ''అప్పలం తాతా! అప్పలం....ఇయ్యి!'' అంటూ మీదకంటా వచ్చేశాడు. త్రిపాఠి కొయ్య బారిపోయాడు.
సరబడు తాటి పరక తీసుకుని మనవడి వీపుమీద అంటించాడు. కుర్రాడు లబోదిబోమంటూ నేలమీద పడ్డాడు. త్రిపాఠి తల దించుకుని వెనక్కి తిరిగి చూడకుండా ఇంటి దారిపట్టాడు. వెనక నుంచి కుర్రాడి ఏడుపు వినబడుతూనే ఉంది.

ఆ రోజుంతా త్రిపాఠి అదోమాదిరిగా ఉన్నాడు. ఆయన మనసు పాడయిపోయింది. భార్యతో కబుర్లు చెప్పాలనుకున్నాడు. అంతలో మనసు మార్చుకుని బయట అరుగు మీదకొచ్చి కూర్చున్నాడు. అన్నం ఉడికి ఉడికి గంజి వచ్చి పొయ్యిలో పడింది. ఒళ్లంతా జ్వరం తగిలి నట్టయింది. ఎంత ప్రయత్నించినా మనసు కుదుట పడ్డంలేదు. లోలోపల కుంగిపోతున్నారాయన.

సాయంత్రానికి జ్వరం వచ్చేసింది. గ్లాసెడు హార్లిక్స్‌ కలిపి భార్యకు ఇచ్చి తనూ తాగాడు. కళ్లు మూసుకుని మంచం మీద పడుకున్నాడు. ఓ రాత్రివేళకు జ్వరం పెరిగింది. రాత్రంతా నిద్దట్లో పలవరించాడు. భార్య కంగారుపడి పక్కింటి వాళ్ల ను లేపి సాయం తెచ్చుకుందామనుకుంది. పలవరింతల్లో త్రిపాఠి ఆకాశం నుంచి పాతాళానికీ, భూమి నుంచి అంతరిక్షంలోకి- ఏవేవో- ఎన్నెన్నో- కలలు కన్నాడు.

ఒక కల- ఆయన వాయుగుండంలో గిరగిరా తిరుగుతూ ఆకాశంలోకి ఎగురుతున్నాడు. భూగోళం తలకిందుగా కనిపించసాగింది. చల్లని గాలి ఆయన శరీరమంతా వ్యాపించింది. తెల్లవాళ్లు-నల్లవాళ్లు- జంధ్యాలు వేసుకున్నవాళ్లు- వేసుకోని వాళ్లు- శైవులు- కిరస్తానీలు- అంతా కలగా పులగం అయిపోయారు. అంతలో ఆయనకు మనవడు క్లయివు చిన్ని మొహం కనిపించింది. ఆ మొహం లాంటి అనేక బాలల మొహాలు గిరగిరా తిరుగుతూ కిలకిలా నవ్వుతున్నాయి. వాటి మధ్య ఒక బిందువు కనబడింది. ఆ బిందువు క్రమంగా పెద్దదయింది. తర్వాత అది ఏకముఖంగా కనిపించసాగింది. మధువా కొడుకు నల్లని మొహం పెద్దదవుతుంటే తన మనవడు క్లయివు మొహం గాలిలో విలీనమై మాయమయిపోయింది.
త్రిపాఠి లేచి కూర్చున్నాడు. చెమటతో శరీరం తడిసిపోయింది. జ్వరం తగ్గుముఖం పట్టింది. ఆయన లేచి తిరగకుండానే భార్య జ్వరం వచ్చి మంచం ఎక్కింది.

ఆరోజు సాబి వచ్చి పనిలో పడింది. త్రిపాఠి జ్వరం తగ్గినా శరీరం దుర్బలంగా ఉంది. భార్యను మరుగుదొడ్డికి తీసుకొని వెళ్లాల్సి ఉంది. ఆయనకు బొత్తిగా ఓపిక లేదు. దగ్గరగా ఎవరూ లేరాయె. సాబీని చూశారు. కానీ ముందూ వెనకా ఆలోచిస్తుండిిపోయారు, ఆమెను సాయానికి పిలవాలా వద్దా అని. భార్య తొందర చేయడంతో విధిలేక సాబి సాయం కోరారు. ఆయనకీ తల తిరుగుతోంది. సాబి త్రిపాఠి భార్య రెక్క పట్టుకుని తీసికెళ్లింది. ఆమె రాకకై ఎదురు చూస్తూ నిలబడ్డ త్రిపాఠి¸కి కళ్లు తిరగసాగాయి. ఒక్కసారిగా నీరసం కమ్మి స్పృహ తప్పి పడిపోయారాయన.

ఆయన కళ్లు తెరచి చూసేసరికి వీధి వసారాలో మంచంమీద పడుకుని ఉన్నాడు. పక్కనే భార్య కూర్చొని ఉంది. సాబి అరికాళ్లు మర్దిస్తోంది. ఆయన తుళ్లిపడి కాళ్లను దగ్గరగా లాక్కున్నాడు. సాబి తొట్రు పాటుతో లేచి నిలబడి అంది.
''తవర్రు పడిపోనారండి. నానేం చెయ్యనండి... అరిచి కేకలెట్టినానుండి... ఒవురూ రానేదండి... నాకేం చెయ్యాలో తోచలేదండి... అమ్మగారు సెప్మట్టి ఇద్దరూ సాయం వట్టి తెచ్చి పండబెట్టినాముండి. అమ్మగోరు డాట్రుగారినట్టుకు రావాడానికై ఎల్లినారుండి.''

అన్నదమ్ముడి వరస చుట్టం, భార్యతో సహా వచ్చి చూసి అన్నాడు-
''ఏంటన్నయ్యా ఇది? మమ్మల్ని పిలవచ్చుగదా? ఎందుకిలా చేశావు?'' అని సాబిని చూసి తిరిగి, ''నువ్వెందుకిలా దిగజారిపోయావు? నేనింకా పాత కక్షలు కడుపులో పెట్టుకుని కూర్చున్నాననుకున్నావా? ఈసారన్నా యేదేనా కావస్తే నాకు కబురు పెట్టు. తెలిసిందా?'' అన్నాడు.

అతని భార్య క్యారియరుతో భోజనం తెచ్చి టేబిలు మీద పెట్టింది.
''మేం వస్తాం. మా రవిని పంపుతాను... సాయంగా ఉంచుకోండి. మీ దగ్గరుంటే కాస్తంత మనిషిగా తయారవుతాడు'' అందావిడ.
కళ్లు మూసుకుని త్రిపాఠీ అంతా వింటూ ఆలోచనలో పడ్డాడు- 'వీడు తన జ్ఞాతి సోదరుడు. పదిహేను సంవత్సరాల క్రితం తనమీద ఒక తప్పుడు కేసు బనాయించినవాడు. చుట్టుపక్కల వారినెవరినీ తన ఇంటికి రాకుండా కట్టడి చేసినవాడు. వీధికి పెద్దయి కూర్చున్నాడు. వీడి రెండో కొడుకు రవి తుంటరి... తండ్రినే లెక్క చెయ్యడు. నాకు సేవ చేస్తాడా? ఏ రాత్రో నా పీక పిసికి పారిపోకుండా ఉంటే చాలు!'

మధువా డాక్టరుగారిని వెంట బెట్టుకుని వచ్చి త్రిపాఠి ఎదురుగా చేతులు కట్టుకుని నిలబడ్డాడు ఆదుర్దాగా.
'ఎనిమిది సంవత్సరాలుగా వీడు తన దగ్గర పనిచేస్తున్నాడు. దొంగతనం అన్నది ఎరగడు. తనెప్పుడూ ఒక రూపాయి అధికంగా ఇచ్చి ఎరగడు. సరికదా, కనీసం నవ్వుతూ వాడితో ఆప్యాయంగా రెండు మాటలు మాట్లాడి ఎరుగడు. ఈ అమాయకుణ్ణి ఆమడ దూరాన నిలబెట్టి తన కామందుగిరీ చూపిస్తూ అవమానపరచాడు- అయినా వాడు ఒక్కనాడు కూడా నోరెత్త లేదు. తన హద్దుల్లో తానుంటూ గౌరవంగా మసలుకున్నాడు.'

అలా ఆలోచించుకుంటున్న త్రిపాఠి¸కి కడుపులో తిప్పినట్టయింది. రెండు వాంతులయ్యాయి. డాక్టరు ఇంజక్షను ఇస్తూ సాబిని ఎగాదిగా చూశాడు. త్రిపాఠి¸కి ఒళ్లు మండింది డాక్టరు వాలకానికి!
నాలుగు రోజుల తర్వాత ఉదయాన్నే ముందు వసారాలో గోడకు జేరబడి కూర్చున్నాడు త్రిపాఠి. దీర్ఘాలోచనలో పడ్డాడాయన. ఏదో వెలితిగా అనిపిస్తోంది. ఉన్నట్టుండి గుమ్మం ముందు వినబడిన సవ్వడికి కళ్ళు తెరచి చూశాడు.

ఆహా... మధువా కొడుకు వచ్చేశాడన్నమాట... ఆయన మొహం సంతోషంతో విప్పారింది. నెమ్మదిగా గుమ్మందాకా వచ్చాడు. ఎదురుగా కొబ్బరి చెట్టు కింద బల్ల మంచం మీద పలకా బలపం పట్టుకుని కూర్చున్నాడు మధువా కొడుకు. త్రిపాఠీకి రోమాంచితమయి శరీరం పులకరించింది. ఆయన్ని చూసిన గుంటడు భయం భయంగా బిక్కమొహం వేశాడు.

త్రిపాఠి రొంటినున్న చాక్లెట్టు తీసి వాడికి చూపించాడు. గుంటడు చూసినా, యేమనుకున్నాడో యేమో... ఎదురు రాలేదు... పారిపోనూ లేదు. త్రిపాఠి¸ చెంగున వాడిని దొరకబుచ్చుకున్నాడు. పరిష్వంగ సుఖంతో త్రిపాఠి¸ ఛాతి పొంగింది. మానసికంగా సేదదీరారాయన. గుంటడు గింజుకున్నా, చాక్లెట్టు తీసుకుని నోట్లో పెట్టుకున్నాడు.
త్రిపాఠి అటూ ఇటూ చూసి, మధువా కొడుకుని తనివితీరా ముద్దు పెట్టుకున్నాడు. మరుక్షణం కుర్రాణ్ణి వాడి మానాన వాణ్ణి వదిలేసి, కంగారుగా లోపలకు వెళ్ళిపోయాడు!

స్వామి బువ్వ - తెలుగు కథ

స్వామి బువ్వ
రూ.3000 ప్రోత్సాహక బహుమతి పొందిన తెలుగు కథ
-మంచికంటి వెంకటేశ్వర రెడ్డి
రాత్రి పదిగంటలు దాటింది బయట కీచురాళ్ళు రొద చేస్తున్నాయి. డిమ్‌లైట్‌ వెలుతురులో లోపలంతా చేదు తిన్నట్టుగా అనిపించసాగింది.
''అనూ ప్లీజ్‌... చిన్న చిన్న విషయాలకే అలా అయిపోతే ఎలా చెప్పు'' అంటూ అటువైపు తిరిగి పడుకున్న తనను పట్టి వెనక్కు లాగాను.
''ఊ...'' అంటూ గట్టిగా తనవైపు లాక్కుని నా పట్టు నుండి విదిలించుకుంది.
''ఇలాగైతే ఎలా! వాడికి ఇంజనీరింగ్‌లో ర్యాంక్‌ రాలేదని అంతగా దిగాలు పడిపోతే ఎలా చెప్పు. వాడి టాలెంట్‌ వాడిది. పైగా వాణ్ణి మనం మంచి కాలేజీలో కూడా చదివియ్యలేదు కదా! దానికి డిసస్పాయింట్‌ అయిపోయి ఆ కోపం చిన్నోడి మీద చూపించడం ఏమన్నా బాగుందా చెప్పు.

పిల్లలన్న తరువాత ఆడుకోకుండా ఎలా ఉంటారు? పొద్దస్తమానం చదువూ అంటుంటే వాళ్ళేం జేస్తున్నారు? పిచ్చిబట్టి పోతున్నారు. చదివేది ఏమిటో, ఎందుకో అర్థంకాక అయోమయంలో పడిపోతున్నారు. దాంతో టీవీకి అతుక్కుపోతు న్నారు. ఆ దరిద్రం చూసి బలైపోయేకంటే ఆటలాడుకోవడం మేలుకదా! స్కూల్లో ఆటలూ పాటలూ ఉండనే ఉండవు కదా!'' మాట్లాడుతూనే మళ్ళీ ఒకసారి చెయ్యి పట్టి లాగాను.

ఊహూ... చలనం లేదు. శ్వాస బలంగా తీస్తోంది. అంటే నిద్రలోకి జారుకుందన్న మాట.
ఇవాళ కూడా మామూలేనన్న మాట. ఎన్ని దీర్ఘ రాత్రులు ఇద్దరి మధ్యా ఒంటరిగా గడిచిపోయుంటాయో! అలవాటు పడేదాకా ఎంత బాధగా ఉండేది. పెళ్ళయిన చాలా కాలానికి కానీ అలవాటు పడలేకపోయాను. నాకే కాదేమో, ప్రతి మధ్య తరగతి కుటుంబంలోనూ ఉండే సంఘర్షణే ఇదనుకుంటాను.

ఫోమ్‌ బెడ్‌మీద నిద్ర పట్టక అటూ ఇటూ పొర్లాను. ఇంక ఈ రాత్రిని తగలెయ్యడం చాలా కష్టం అనుకుంటూ గట్టిగా కళ్ళు మూసుకున్నాను. ఊహూ లాభంలేదు. పైన తిరిగే సీలింగ్‌ ఫ్యాన్‌ను చూస్తుంటే సుళ్ళు తిరిగే ఆలోచనలోన్నుండి పిల్లలిద్దరూ కళ్ళ ముందు కదిలారు.
ఎటు పోతున్నాయసలు చదువులు. జ్ఞానం శూన్యం. ప్రయోగశీలత, ప్రయోజన తత్వం శూన్యం. జీవితానికి అన్వయం, సమన్వయం లేని చదువులై పోయాయి. ఇప్పుడు పిల్లల చదువులొక పెద్ద సమస్య. ప్రతి ఇంట్లోనూ ఇలాంటి గొడవలే పిల్లల గురించీ, వాళ్ళ చదువుల గురించీ.

ఇంత వయస్సులో అప్పటి చదువులు ఎంతానందంగా సాగేవి. కరక్కాయ సంచీనిండా పుస్తకాలు, సత్తు గిన్నెల కారియర్‌లో అన్నం తీసుకుని, జారిపోయే చెడ్డీని ఎగలాక్కుంటూ రేగల గుంట చెరువుకి అడ్డంపడి పోవడం, చెరువు నిండితే మాగాణి గనేలమీద నడుస్తూ నడుస్తూ మధ్యలో పందేలు వేసుకోవడం, జారి బురదలో పడి వొళ్ళంతా బురదైతే ఆ నీళ్ళతోనే కడుక్కుని అదే డ్రస్సుతో బడికి పోవడం ఎంత హాయిగా చదువుకున్న రోజులు. ప్రతి దాంట్లోనూ పోటీయే కదా! ఎంత ఆరోగ్యకరమైన పోటీ అది. ఆటల్లో, పాటల్లో, డ్రాయింగ్‌లో, వ్యాసరచన, వక్తృత్వం అన్నీటితో పాటు చదువు ఎంత మొద్దోడైనా క్రియాశీలంగా సృజనాత్మకతతో చదివిన చదువులు.

హోంవర్క్‌ చెయ్యకపోతే లెక్కల మాష్టారు కర్ర విరిగేదాకా కొడతాడని నక్కపాలెం మర్రిచెట్టు దగ్గర మధ్యాహ్నందాకా ఆటలాడుకుని తెచ్చుకున్న అన్నం తిని సాయంత్రం బడి పిల్లలతో కలిసి ఇంటికి పోవడం. అమ్మో... ఆ రోజైతే నిజంగా ఇంక ఈ భూమ్మీద నూకలు చెల్లిపోయినియ్యనుకున్నా. చెరువు వర్షానికి నిండిపోయింది. దారెక్కడో సరిగ్గా కానరావడం లేదు. వర్షంలోనే అందరమూ పాలిథీన్‌ గొంగళ్ళు తగిలించుకొని పుస్తకాలు తడవకుండా ఒకర్ని పట్టుకొని ఒకరం మెల్లగా నడుస్తుంటే కళ్ళకు అడ్డం పడిన గొంగళితో కొంచెం పక్కకు పోయేసరికి ఎంత పెద్ద గొయ్యో! ఇంకేముంది పీకల్దాకా నీళ్ళు. అయిపోయాననుకున్నా. ముని వేళ్ళమీద పైకి లేవకపోతే నోరు దాటి వొచ్చే నీళ్ళు.

అప్పుడు శీనుగాడు చూసి చెయ్యందియ్యక పోతే ఇవాళ ఈ ఫోమ్‌ బెడ్‌మీద మెత్తగా పడుకుని ఉండేవాణ్ణి కాదేమో!
ఏటి కాలువలో కొత్త నీళ్ళు వొచ్చినప్పుడు ఏ కాస్త సందు దొరికినా ఆ కాలవలో పడి ఈతలు కొట్టడమే. ఇళ్ళ దగ్గర్నుండి కర్ర తీసుకొని ఎవరో ఒకరు వొచ్చేదాకా అలా మునకల్లోనే మునిగిపోయేవాళ్లం. చిన్న పంతులు చెప్పిన పద్యాలు ఇప్పటికీ నాలుకమీద నాట్యం చేస్తూనే ఉన్నాయి. 'ఎవ్వనిచే జనించు జగమెవ్వని లోపల నుండులీనమై ఎవ్వడియందు డిందు పరమేశ్వరు డెవ్వడు, మూల కారణం బెవ్వడు అనాది మధ్యలయుడెవ్వడు' అర్ధరాత్రి నిద్రలో లేపి అడిగినా 'అక్కరకు రాని చుట్టము మ్రొక్కిన వరమీని వేల్పు...' ఎన్నెన్ని పద్యాలు దాశరథి శతకం, సుమతీ శతకం, వేమన శతకం ఎన్నెన్ని పద్యాలు, ఎన్నెన్ని పాటలు నేర్చుకునే వాళ్లం.

సంవత్సరం చివర్లో ప్రతి సంవత్సరం క్రమం తప్పకుండా జరిగే యానివర్సిరీకి పోటీల్లో పాల్గోని పిల్లలుండేవాళ్లా? ఎవరికి తగ్గ పోటీలో వాళ్ళు కల్చరల్లో లేనివాళ్ళు ఆటల్లో అది కూడా లేని వాళ్ళు ఎన్‌సీసీలోనో, క్రాఫ్ట్‌లోనో, ఎన్‌ఎసెస్‌లోనో ఏదోక దానిలో ఉండాల్సిందే! అదేకదా. ఇవాళ జీవితపు సమస్యల్ని నిర్భయంగా ఎదుర్కొనేలా చేస్తుంది. ఆ సృజనాత్మకత ఇవాళ చదువుల్లో లోపించడం వల్లనేకదా ఈ విద్యార్థుల దశనుంచే ఆత్మహత్యల వైపుగా ఆలోచించడం. ఎక్కడ చూసినా రికార్డింగ్‌ డ్యాన్సులు మినహా మరో కార్యక్రమం కనపడుతుందా! స్కూళ్ళ నుండి కాలేజీల దాకా ఇళ్ళనుండి బజార్ల దాకా ఒకటే గంతులు... మెల్లమెల్లగా కళ్లు మూతలుపడి నిదుర మబ్బులోకి జారిపోసాగేను. నిద్రలో కూడా ఎన్నెన్నో తీయతీయని జ్ఞాపకాలు.. ఎన్నెన్నో పీడ కలలు... కలగలిసి కలత నిద్రలోనే ఈరోజు తెల్లవారి పోయిందే!

'ఎక్కడికి రా మళ్ళీ స్టడీ అవర్‌ కి టైమ్‌ అవుతుంటే బుద్ధుందా లేదా నీకు?' తల్లి అరుపులు నిద్రలోకి దూరి వస్తున్నాయి.
''అమ్మా ఇప్పుడే వస్తానమ్మా రవి దగ్గరకు పోయి నోట్స్‌ తెచ్చుకోవాలి.'' కొడుకు బతిమాలుతున్నాడు.
''ఇప్పుడు స్టడీకి పోతా ఇంకేం నోట్సు. నీ వేషాలు నాకు తెలుసులే మర్యాదగా వొచ్చి రెడీకా'' కేక వేసింది.

సన్నగా ప్రారంభమైన ఏడుపు వెక్కిళ్ల మధ్య... వాడు. ప్చ్‌ వీళ్ళిద్దరి మధ్య సమన్వయం ఎట్లా చెయ్యాలో అర్థం కావడమే లేదే! నిద్ర కళ్ళతో మెలకువలోనే ఆలోచనల సుడి గుండాల్లో... తనకై తను తెలుసు కోలేదు. చెబితే వినదు. తాను పట్టిన కుందేలుకి మూడే కాళ్ళు. మనిషి ఎంత మంచిదో కానీ ఏం చేస్తాం... పరిస్థితులు కూడా ఆమెని నిస్సహాయురాలుగా చేస్తున్నాయి. చుట్టూ పోటీ ప్రపంచాన్ని చూసి ప్రతి తల్లీ ఇలాగే ఘర్షణ పడుతూ ఉంటుందేమో!

దడదడమని ప్లేట్లు శబ్దం... యుద్ధం మొదలైనట్టుంది. సూచన ప్రాయంగా శబ్దాలే వొచ్చాయి ఇంకా లేవకపోతే... అమ్మో అనుకుని దుప్పటి ముసుగు తీసి పెరట్లోకి వొచ్చాను.
పాత్రల్లో మిగిలిపోయిన కూరలు, నీళ్ళల్లో అన్నం చూసి కడుపు మండిపోయింది. ''ఏయ్‌ ఎన్నిసార్లు చెప్పినా అర్థం కాదా నీకు కేకేశాను''.

''ఏందంట'' అంటూ పెరట్లోకి వొచ్చింది.
''ఏందిది... ఈ కూరలేంది, ఈ అన్నమేంది! ఎందుకు ఇంతింత వొండుకుని పార బొయ్యడం. చాలినంతే వొండుకోవొచ్చు కదా! అ...బ్బ... ఎన్నిసార్లు చెప్పాలే నీకు, అన్నం విలువ తెలుసా నీకు...''

''అయితే నేను దుబారా చేస్తున్నాననే కదా మీ ఉద్దేశం. పొద్దున్నే నిదర మంచం దిగి వొచ్చారు ఒడ్డించడానికి. నాకు తెలియదు. మీరే ఒండుకోండి. వొడ్డించుకోండి. నేను పనికిమాలినదాన్నే. కాదన్లేదుగా. మీరే చేసుకోండి పొండి'' ఉదయాన్నే అలకపాన్పు ఎక్కేసింది.
''అదికాదే.. మిగిలిందనుకో కనీసం ఎవరికైన పెట్టనన్నా పెట్టొచ్చు కదా...?''
''ఇదుగో మీ ఇష్టం వొచ్చినట్టు మాట్లాడితే ఊరుకునేది లేదు. ప్రతిదాంట్లో తల దూరుస్తారు. ప్రతిదీ నాదేనని అందుకుంటారు'' తుంపరలా మొదలైన ఏడుపు...

''అబ్బ... ఆపవే తల్లీ మొదలు పెట్టావు. మాటకు ముందు ఎందుకు వొస్తది ఏడుపు. ఏమాట మాట్లాడినా తప్పేనా!
'ఛీ వెధవ జన్మ'. ప్చ్‌ పొద్దున్నే అనవసరంగా కదిలించుకున్నాను. ఎప్పటికప్పుడు సర్దుకు పోవాలనే అనుకుంటాను. తను చేసే పనులు చూసి తట్టుకోలేక మాట్లాడాల్సి వొస్తంది.

డబ్బులో గారాబంగా పెరిగి వొచ్చిన వాళ్ళతో వొచ్చిన తంటానే ఇది. ఆకలి తెలిసిన వాళ్ళకి అన్నం విలువ తెలుస్తుంది. అసలు ఆకలంటే తెలుసా నీకు హూ... అది తెలియని వాళ్ళకి ఎంత చెప్పినా తలకెక్కదేమో...
కళ్ళముందు నట్టింట్లో కూర్చుని అన్నం తినే నాన్న మెదిలాడు. కుడికాలు మడుచుకుని ఎడం కాలు నిలబెట్టి పై పాదంపై నంజుడు కోసం పచ్చడి పెట్టుకొని, తినే ప్రతి ముద్దనీ ఆప్యాయంగా నోట్లో పెట్టుకుంటూ కిందపడ్డ ప్రతి మెతుకునీ ఏరి పళ్ళెంలో వేసుకుంటుంటే 'ఎందుకు నాన్నా మట్టిలో పడింది కూడా మళ్ళీ అన్నంలో వేస్తావూ' అన్నాను.

''మెతుకు పోతే దొరుకుద్దంటయ్య. వందెకరాల ఆసామి రామానాయుడే కింద మెతుకు పడితే ఊరుకోడంట'' అనేవాడు. కష్టం విలువా, ఆకలి విలువా ఆనాడు ఎంతగా తెలిసిందో.
ఎప్పుడో పెద్ద పండక్కో ఏరువాక పౌర్ణానికో దొరికేది వొరి అన్నం. అప్పుడది స్వామి బువ్వ. ఎంత ఆనందంగా మల్లెపూలలా తెల్లగా కళ్ళ ముందు కదులుతుంటే దాన్లోకి ముద్దపప్పు, పేరి నెయ్యి, చింతకాయ పచ్చడి ఆ... హా హా ఆ రుచే వేరు కదా! ఎప్పుడూ ములుకుల్లా గుచ్చుకునే వొరిగ అన్నం, జొన్న సంకటీ తిని బతికిన వాళ్ళం కదా!

నోరు పూసి ఎర్రగా రక్తకొల్లులాగా ఉండప్పుడు వొరిగ అన్నం తింటుంటే అమ్మో పుండుమీద కారం చల్లినట్టే భగభగా మండిపోయేది. ఆ వరిగ అన్నం తింటూ లబలబలాడిపోయేను. కళ్ళల్లో కారుతున్న నీళ్ళు చూసిన అమ్మ ''ఎందుకురా అట్ట లబలబ లాడతావు. ఈతాకు నోట్లో యేసుకోని నముల కూడదా'' అనింది.

''ఒరే ఇయ్యాల మా ఇంట్లో అన్నం అయిపోయిందిరా! మాయిటిపూట పెందలాడే వొండుతానందరా మమ్మ! ఒరే ఒరే గరువు చేలల్లో వొరవ దగ్గిర చాలా ఉండయ్యిరా... అందే చెట్లు. పోయి బురగంజి కొట్టుకోని తిందాంరా'' అంటూ సీతారాముడొచ్చాడు.
చాలీచాలకుండా రుద్దుడు కారపు పచ్చడితో కుండ అడుగున మిగిలిన మాడు చెక్కలతో కలిపి అర్ధాకలితో తిన్న తిండి కడుపులో సొద పెడుతుంది. అప్పుడు దేవుళ్లాగా వొచ్చిన వాడితోటి కలిసి కొడవళ్ళు గొడ్డలీ తీసుకొని బయలుదేరాం.

మిట్ట మధ్యాహ్నం ఎండ నెత్తిమీద చుర్రుమంటోంది. ఇసకలో కాలు పెడితే చుర్రమంటోంది. కాలు పెట్టి తీసే లోపలే బొబ్బలెక్కిపోయినయ్‌.
''ఒరే ఇట్టకాదు గానీ కొడవలి ఇటియ్యి అని తాటాకులు కొట్టి, వాటిని బూట్లులాగా కట్టుకుని బురగంజి (మోము) కొట్టుకోని ఆత్రంగా తింటుంటే కాళ్లకెక్కిన బొబ్బలు ఎటుపోయాయో'' తిన్నంత తిని మిగిలింది ఇంటికి తెచ్చాం.

రూపాయి రూపాయి చేర్చి ఇటుకిటుకా పేర్చి కట్టిన ఇంటికి చేసిన అప్పు తీర్చడానికి అమ్మానాన్న ఎంత సచ్చి దగ్గరయిపోయేవాళ్ళు. వొంటిమీద రవిక విప్పి ఉతుక్కుని పిండి మళ్ళీ తొడుక్కుంటుంటే అమ్మను చూసి శీనుగాడు 'మీ అమ్మకి ఇంకో రైక లేదా! మా అమ్మకైతే ఎన్నిరైకలుండయ్యో' అని ఎగతాళి చేశాడు.

''ఇంకో రైక కొనుక్కోకూడదా వెంకటరత్నం'' అనింది రత్తమత్త.
''చేసిన అప్పులు తీరితే రైకా కొనుక్కోవొచ్చు. కోకా కొనుక్కోవొచ్చు. ఇంటి ముందుకు వొకరొచ్చి అడిగితే ఏం మర్యాదా'' అని నవ్వుతూ చెప్పింది.
''ఇంక లాభంలేదు, ఎన్నిసార్లు తిరగ కప్పిచ్చినా వానొస్తే నీళ్ళన్నీ ఇంట్లోనే ఉంటుండయ్యి. ఇంక ఆ రోజంతా జాగార మే! ఎట్టోకట్ట ఇయ్యేడన్నా ఇల్లేసుకోవాల'' అంటూ చెప్పినప్పుడు నాన్న కళ్ళల్లో చూడాల వెలుతురు. ఇప్పటికీ కళ్ళల్లో మెదులుతూనే ఉంది. ఆ మాటనుకున్న తరువాత ఎన్నో సంవత్సరాలకు ఈడేరిన కలకోసం ఎన్ని రాత్రులు, ఎన్ని పగళ్ళు జాగారం చేశారో!

పగలంతా ఎండలో వొళ్ళు అలసిపోయేలా పనిచేసి వొచ్చిన వాళ్లంతా హాయిగా తిండితిని మంచాలెక్కుతుంటే, ఆ వెన్నెల రాత్రుల్లో మళ్ళీ పొలానికి వెళ్ళేవాళ్ళు అమ్మా నాన్న. రాత్రంతా పొగకట్టెలను పీకిన అమ్మా నాన్నలు తెల్లారేసరికి తోటకూర కాడల్లా వేలాడుతూ వొచ్చేవాళ్ళు. అప్పుడైనా ఇంటి దగ్గర ఉంటారా అంటే ప్చ్‌... బొబ్బలెక్కిన అరి చేతులకు కొబ్బరినూనె పూసుకుని వొరిచేనుకి గెమాక్సిన్‌ కొట్టడానికి నాన్న, గరువుకుపోయి మొయ్యలేక మొయ్యలేక అంతపెద్ద మోపు చొప్పదంట్లు తెచ్చే అమ్మ.

జీవితాంతం అస్తులరిగిపోయేటట్లు మనం పనిచేస్తా ఉండాల్సిందే అనే అమ్మ, మనం బతికినంత కాలం వొళ్ళరగ దీసుకొని పని చెయ్యడానికి కాకపోతే దేనికి పుట్టినట్టు... అందుకే ఎప్పటికీ కష్టం జెయ్యడమే మన పని అనే నాన్న...

సెలయేటి గలగలలు... పక్కమీదా...! ఊహూ... కలలోనా... ఎక్కడో నీళ్ళ శబ్దం...
బాత్‌రూమ్‌లో నుండే... బెడ్‌రూమ్‌ వెనకవైపు నుండే కదా! ''ఎవ్వర్రా నీళ్ళొదిలేసింది. కట్టెయ్యండి పంపు'' పెద్దగా ఒక్క అరుపు.
''ఎందుకు అంత గొంతేసుకుని అరుస్తారు. వీధిలో వాళ్ళందరికీ తెలియాలా మన భాగోతం'' అనూ గొంతు చించుకు అరుస్తుంది.
''నీ నోట్లో నోరు పెట్టడం నా వల్ల కాదమ్మా అన్నపూర్ణమ్మ! నీళ్లు ఇవాళ కుళాయిలో ఇట్ట తిప్పితే అట్ట వొస్తున్నాయ్యి''
బొడ్డు బాయి మీద చేంతాడుకి ఇంతింత తపేళాలు కట్టుకొని వెనక భూమిలో పాతిన రాళ్ళకి కాళ్ళు మోటించి, బొడ్డుకేసి నీళ్ళు లాగుతుంటే, వొరేయ్‌ ఈడు ఎద్దుకాల్లో ముల్లంత లేడురా! యెనక కాళ్ళు జూడు ఎంతెత్తున లేస్తుండయ్యో జారి బాయిలో పడతాడేమో అని వెంకటేశ్వర్లు మామంటే, వాడా! నీ తల్లోగుండా దూరిపోతాడు. నరంలాగా సాగీసాగీ తోడతాడు బాయిలో నీళ్ళన్ని. వాడి సంగతి నీకు తెలవదులాగుందే'' నాగమ్మవ్వ భరోసా ఇచ్చేది.

బడినుంచి వొచ్చి కుడితి తొట్టికి, నీళ్ళ తొట్టికి నీళ్ళు లాగి పోసేసరికి కడుపులో పేగులు నోట్లో కొచ్చేవి. అప్పుడు నీళ్ళంటే పాతాళలోకంలో నుంచి బతిమిలాడితే పైకి వొచ్చే జల. ఇయ్యాల ఉండయ్యిలే అని లబలబ పారబొయ్యడంతో అయిపోలేదు. మనలాంటి వాళ్ళు చాలామంది ఉంటారింకా ఒక్క బిందె నీళ్ళకోసం అరసకలాడేవాళ్ళు.

ఏదైనా అంతే చేస్తుంటది. అవసరం ఉన్నంత వొరికే వాడుకోవాల. మునక్కాయలు తెస్తానా! వాటిని చూస్తా చూస్తానే ఎండ బెడతావుకదా! కాకరకాయలు తెస్తే పండ బెడతావు. టమోటాలైతే కుళ్ళబెడతావు. ఊరకపారబోస్తే ఏమి వొచ్చుద్ది. బూజు పట్టిచ్చి, కుళ్ళబెట్టి బయట పారబోస్తుంటే ఎంత బాధగా ఉంటది. ఎన్నిసార్లు చిలక్కి చెప్పినట్టు చెప్పాను.

ఉహూ తన మాట తనదే! ఏదైనా తనకి అనిపిస్తేనే చేసిద్దంట అంతేగానీ ఎంత మంచి మాటైనా, ఎవురు జెప్పినా ఎక్కదు కాక ఎక్కదు. ఎన్నిసార్లని తగాదా పెట్టుకోవాల? ఎంత నచ్చజెప్పటానికి ప్రయత్నిస్తే ఆ రోజంత పెద్ద రభస.

అయినా నా నోరు ఊరుకుంటుందా! అంటే, ఎలా ఊరుకుంటుంది. తగాదా అయితే అయిందని చెప్పడం. తగాదా పెట్టుకోవడం... మామూలే! ఎప్పటికైనా తెలుసుకుంటుందనే మినుకు మినుకు మనే ఆశ. అబ్బే కుక్కతోక వంకరే. ఎప్పట్నుండి చూస్తున్నాను. పుట్టుకతో వొచ్చిన బుద్ధులు పుడకలతో కానీ పోవు.

సెలవు రోజుల్లో ఎర్రటి ఎండలో రూపాయి సంపాయించడానికి ఎంతగా అల్లలాడిపోయేవాణ్ణో తెలుసంటే!
కింద కాళ్ళు కాలీ, పైన మాడుకాలీ పండు మిరపకాయలు కోస్తుంటే చేతుల్లో మంట, కాళ్ళల్లో మంట, వొళ్ళంతా మంట, కళ్ళంతా మంట
ఒరేయ్‌ వీడి టిపినీలో ఎప్పుడూ గోంగూర పచ్చడీ, మిరప్పచ్చడీ, చింతకాయ పచ్చడీ. ఎప్పుడూ పచ్చళ్ళేనంట్రా ఈడు తినేది. మధ్యాహ్నం హైస్కూల్‌ దగ్గర అన్నం తినేటప్పుడు వాళ్ళు ఎగతాళి చేస్తుంటే, పచ్చళ్ళు కాకుండా ఈళ్ళంతా ఏం తింటారబ్బా అని వాళ్ళ టిపినీల్లోకి ఆశ్చర్యంగా చేసేవాణ్ణి. అమ్మ ఎప్పుడన్నా పప్పుశారు కాసేది. లేదా ఎవురింటి దగ్గరన్నా ఉలవలు వొండిన తరువాత వొంచిన నీళ్ళు తెచ్చి ఉలవశారు చేసేది.
''నిదరమంచం దిగేది లేదా ఏంది! అన్నీ చెయ్యడానికి నేనొక దాన్ని దొరికేగా! మీకేం బాధా లేసిందాకా'' ఇంట్లో నుండి రుసరుసలు మొదలయ్యాయి.

''లేస్తానమ్మ లేస్తాను'' ఊరక కూర్చోని తినే బతుకులా మావి. వొళ్ళు విరుచుకుంటూ వంటింట్లోకి పోయాను.
''ఏందా సూటిపోటి మాటలు! నీకు ఎన్నిసార్లు చెప్పి ఉంటాను. ఏదైనా విషయముంటే నేరుగా నా ముఖాన్నే కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పు. అంతేగానీ సూటిపోటిగా మాట్లాడొద్దు'' అంటే నావైపు చురచురా చూసింది.
''నాకు అంతకంటే మాట్లాడ్డం రాదు. నేనేం మీలాగా బియ్యేలూ, ఎమ్మేలూ పాస్‌ కాలేదు. ఇంతకీ హాస్పిటల్‌కి కేరేజ్‌ సంగతేందో చెప్పలేదు'' మళ్ళీ మాట తీరు మామూలే...

తీసికెళ్ళాలి. ఎవరున్నారక్కడ వాళ్ళకి పెట్టడానికి అమ్మెనక వాళ్ళు, అబ్బెనక వాళ్ళు అనుకుంటూ బాత్‌రూమ్‌లో దూరి తలుపేసుకున్నాను.
నాన్నకి తగ్గుతుందో లేదో! ఇక్కడికొచ్చి ఉండండి అంటే నాన్న వినరు. ఎన్నిసార్లు బతిమాలినా బామాలినా మాట వింటేకదా! కన్న తల్లిదండ్రులు దగ్గర లేకపోవడం ఎంత బాధాకరం. ఎక్కడెక్కడో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళం. ఊళ్ళో పోయి ఉండడం సాధ్యమయ్యే పనేనా!
ఇద్దరిదీ ఒకేమాట ''ఆ టౌన్లోకొచ్చి మేముండలేమయ్యా! అయినా ఇప్పుడేం పోయిందీ... మా రెక్కలాడినంత కాలం నువ్వేం మా గురించి దిగులు పెట్టుకోవొద్దులే'' నాన్న మాటలు ఎంత ఆత్మాభిమానం నిండి ఉంటాయో!

నాన్న ఆరోజు నేను రమ్మన్నప్పుడే వొస్తే ఇలా జరిగుండేదా! ఈ వయిసులో ఏం జరిగినా తట్టుకోవడం ఎంత బాధ. 'నాన్నా... ఎందుకు నాన్నా మమ్మల్ని పరాయి వాళ్ళుగా చూస్తారు' ఆ రోజు ఎదురుగా కూర్చుని బాధపడుతూ అన్నాను.
''ఇందులో పరాయి వాళ్ళని చెయ్యడం ఏముందరా! పుట్టి బుద్దెరిగిన్నప్పట్నుండీ రెండు కాళ్ళు ఒకచోట పెట్టినోళ్ళం కాదు. ఇయ్యాల నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావని మేమొచ్చి నీ దగ్గర కూకోని తింటం మా వల్ల కాదయ్యా! తిరగ్గలిగినంత కాలం చెయ్యాల్సిందే! తిరగలేనప్పుడు అప్పుడు చూసుకుందాం'' ఖచ్చితంగా మీ దగ్గరకు రాము అని చెప్పకుండా ఎలా తప్పుకుంటున్నారో!

బహుశా అప్పుడు జరిగిన దానివల్లేమన్నా రావడానికి జంకుతున్నారేమో!
పెళ్ళయిన తరువాత ఊళ్ళో ఉన్నది కొద్దిరోజులే. అయినా అనూకీ అమ్మకీ అస్సలు పొత్తు కుదిరేది కాదు. తను చేసిన ప్రతి పనీ మళ్ళీ అమ్మ చేసుకునేది. కసుపు చిమ్మడం దగ్గర్నుండి, అంట్లు తోమడం దగ్గర్నుండీ ప్రతి పని అమ్మకి స్వయంగా తన చేతులతో చేసుకుంటేనే గానీ తృప్తిగా ఉండేది కాదు.

ఇంటికొచ్చిన నాతోఅనూ మాట పలుకూ లేకుండా కోపంగా ఉంది. ''ఏందిరా ఏమైంది? ఎందుకలా కోపంగా ఉన్నావు'' అనునయంగా అడిగాను. కళ్ళ వెంట బొటబొటా కన్నీళ్ళు కారినయ్యి ''ఏంది యాడవకుండా చెప్పు. విషయం చెబితే కదా తెలిసేది''
''లంకంత కొంపలో ఉండొచ్చి, ఈ ఒక్క గదిలో ఉండటం ఎంత బాధగా ఉంటుంది. అయినా ఉంటన్నానా! నాకసలు ఏ పనీ చేతగాదనా... ఏంది మీ అమ్మ ఉద్దేశం. ప్రతి పనీ నేను చెయ్యడం మళ్ళీ వెంటపడి ఆమె చెయ్యడం. ఏమనుకోవాలి? ఏం చెప్పకుండా నన్ను అవమానించటం కాదా! చూసేవాళ్ళు ఏమనుకుంటారు. నేనింక ఒక్కక్షణం కూడా ఉండలేను. సింగరాయకొండలో ఇల్లు తీసుకోండి అక్కడికి పోయి ఉందాము'' చాలా బాధగా చెప్పింది.

''ఇంత తొందరపడితే ఎట్లా చెప్పు. ఏదో పెద్ద వాళ్ళు వాళ్ళ చాదస్తం వాళ్ళకుంటంది. మనమే సర్దుకుపోవాలి. ఏం జరిగినా మనము సర్దుకుపోవాలి'' బతిమలాడి చెప్పేసరికి అప్పటికి అసహనంగానే ఆ వ్యవహారం అంతటితో సద్దు మణిగింది.
పాపం ఎవ్వర్నీ ఒక్క మాట పరుషంగా మాట్లాడలేని నాన్న ఆ రోజు ఎంతగా బిక్క చచ్చిపోయి ఉంటాడో!
''ఏందసలు మీ ఉద్దేశం. నేనసలు ఏమీ తెలియని మొద్దుదాన్నను కుంటున్నారా! అదట్ట చెయ్యి, ఇదిట్ట చెయ్యి. యెంట పడతారేంది! ఒక్కరోజు చెబితే సరిపోదా! రోజూ... రోజూ చెప్పాల్సిందేనా!''

ఎంత గాయపడి ఉంటాడో! పిల్లల్నీ, పశువుల్నీ కూడా దయతో దగ్గరికి తీసే నాన్న అక్కడి పనులు కొత్తకదా. చదువుకున్నోళ్ళు తెలుసో తెలియదోనని దగ్గిరుండి చూయించడం తప్పయిపోయింది.

కొన్ని రోజులకే కదా, వేరే కాపురం పెట్టాల్సి వొచ్చింది. ఆ సంఘటనతో అప్పుడు చాలా నలిగిపోయారు వాళ్ళు.
''అప్పటికి మేము కాపరం చెయ్యనియ్యకపోతేనేగా యేరే కాపురం పెట్టారు వాళ్ళు'' అమ్మ ఎంతమంది దగ్గరో వాపోయిందంట.
''ఊళ్ళో రకరకాలుగా అనుకుంటన్నార్రా'' నాన్న అన్నప్పుడు వాళ్ళు ఎంతగా గాయపడి ఉంటారోనని బాధేసింది.
ఇక్కడికి వొచ్చి ఉండాలంటే ఆ గాయాలన్నీ కెలుతుతుంటాయేమో ''తొందరగా తెమిలి చావరా! ఎంత సేపటికీ సగచేస్తానే ఉంటావ్‌. స్టడీ అవర్‌కి ఎప్పుడూ ఆలస్యమే. చెప్పలేక చస్తున్నా. రోజూ చేసే పనికి కూడా వెంటపడి ఎవరు చెబుతారు''
అమ్మో మళ్ళీ మొదలైంది. ''ఒరేయ్‌ తొందరగా కానిచ్చి వెళ్ళరా'' బాత్‌రూమ్‌ నుండే అరిచాను.

ఎందుకో ఈ రోజు చాలా అసహనంగా ఉంది. ఈ రోజే కదూ డాక్టర్‌ ఏ విషయం చెబుతానంది. ఎక్స్‌రే తీసి ఉంటారు. సెట్‌ కాకపోతే ఆపరేషన్‌ తప్పదన్నారు. క్యారేజీ తీసుకొని హాస్పిటల్లో అడుగుపెట్టాను.
అమ్మో ఆపరేషనంటే ఎలా చెయ్యాలి. అసలే అప్పుల్లో ఉన్నాను. పైగా వాడికి ఇంజనీరింగ్‌ సీటుకి కట్టాలంటుంది. గుండె లబలబ లాడుతుండగా హాస్పిటల్‌లో అడుగుపెట్టాను.

క్యారేజీ అక్కడ పెట్టి స్టూలుమీద కూర్చుంటుంటే నాన్న కళ్ళల్లో నీళ్ళు. కాలుమీద చేత్తో నిమురుతుంటే బేలగా నా వైపు చూశాడు.
''ఊరుకో నాన్నా ఊరుకో! ఎన్నెన్ని రాత్రుళ్ళు పగళ్ళు మా కోసం నీ రక్త మాంసాల్ని చెమటగా మార్చావు. ఈ నాటికీ సుఖమంటే ఏమిటో తెలియకుండా, ఇప్పటికీ మానుండి ఒక్క రూపాయి ఆశించకుండా బతుకులు వెళ్ళదీస్తున్నారు. నెత్తిమీద పెట్టుకోని చూసుకోవాల్సిన మహానుభావులు మీరు. ఇంత అసహాయస్థితిలో ఎప్పుడూ చూడలేదు నాన్నా మిమ్మల్ని.

మీరు చేసిన దాంట్లో ఎన్నో వొంతు చేస్తే మా రుణం తీరిపోతుంది నాన్నా. మీ పట్టుదలా పంతాలతో అక్కడే ఉంటారు. ఎన్ని బాధలైనా పడతారు. అదే మా దగ్గరకొచ్చి ఉంటే ఇలా జరిగేదా! మీరెందుకొస్తారు? మీరు అభిమానం కలిగిన వాళ్ళు. ఎన్నటికీ ఎవ్వరి మీదా ఆధారపడకూడదనే మీ పట్టుదల. ఎవ్వరితో చీ...చా.. అనిపించుకోవడం మీవల్ల కాదు. మీ ఆత్మాభిమానం ముందు పోల్చుకుంటే మావెంత నికృష్టమైన జన్మలో కదా నాన్నా''.

అమ్మ మనసులో ఏముందో! బయటికి చెప్పుకోలేదు ఏ విషయం. బేల తనంతో కనిపిస్తుంది. మనుషులు ఎంత మొరటుగా కనిపిస్తారు. మీ మనసులు ఎందుకమ్మ అంత సున్నితంగా, సుకుమారంగా, వెన్నపూసకన్నా మృదువుగా లాలనగా... ఎలా తయారు చేసుకున్నారమ్మా.
మీ గురించి లోతుగా ఆలోచించినప్పుడల్లా ఎన్నిసార్లు సిగ్గుతో చితికిపోయామో! పిండి బొమ్మలం... తాకితే రాలిపడే మట్టి బొమ్మలం. పైకి కనిపించే డాబుసరేనమ్మ మాది. లోపలంతా వొఠ్ఠి డొల్లే. మీ చుట్టూ మమ్మల్ని ఎన్నిసార్లు దిగుతుడిస్తే మాకు అంటుకున్న మకిల పోతుందమ్మా. మీ పాదాలు కడిగి ఆ నీళ్ళు చల్లుకున్నా మాకు బుద్దొస్తుందా! నా కళ్ళల్లో కూడా నీళ్ళు తిరుగుతున్నాయి''.

ఎంతసేపలా ఒకరికొకరం మాట్లాడు కోకుండా స్థాణువుల్లా కూర్చున్నామో!
డాక్టర్‌ రావడంతో స్టూలు మీదనుండి పైకి లేచాను. అమ్మ కూడా పైకి లేచి చేతులు కట్టుకుని నిలబడింది.
నాన్న చేతులు మంచానికి ఆనించి పైకి లేవబోతుంటే ''వొద్దు వొద్దు పడుకో'' అంటూ డాక్టర్‌ వారించాడు.
''ఊ ...ఎలా ఉంది చెప్పండి'' అంటూ కేస్‌ షీట్‌ తీసి పరిశీలిస్తూ నిన్న తీసిన ఎక్సరే ఏదమ్మా అనడంతో నర్స్‌ ఎక్సరే తీసి చేతికి ఇచ్చింది.
ఎక్సరేని అటు ఇటు తిప్పి చూస్తూ పెదవి విరవ సాగాడు.

నా గుండెల్లో రైళ్లు పరిగెడుతూ ఉన్నాయి. ఏం చెబుతాడో, ఎలా చెయ్యాలో అన్న ఉత్కంఠతో నరాలు చిట్లిపోయేటట్లు ఉన్నాయి.
''ప్చ్‌... లాభంలేదయ్యా'' తేల్చి చెప్పాడు డాక్టర్‌.
''డాక్టర్‌ అయితే ...''
''ఊ...చెయ్యాల్సిందే ! వయసు బాగా పెద్దది కదా! అందుకే సెట్‌ కాలేదు. ఆపరేషన్‌ చేసేసి లోపల రాడ్స్‌ సెట్‌ చేయ్యాలి. నొప్పి బాగా ఉంది కదా'' నాన్న వైపు తిరిగి ప్రశ్నించాడు.

''ఊ... ఉందయ్యా ఇదిగో ఇక్కడయ్యా... జిమ జిమ లాగుద్ది'' కాలు దగ్గర నొక్కి చూయించాడు.
''ఉంటుంది... టాబ్లెట్స్‌ రాస్తున్నాను. అవి మింగు తగ్గి పోతుంది'' అంటూ ముందుకు కదిలాడు.
''డాక్టర్‌...''అంటూ ఆయన వెనుకే వెళుతూ సందేహించసాగేను.

''ఆ ఏందయ్యా నీ డౌటేంది? ఖర్చు బాగా అవుతుంది. రాడ్సదీ వెయ్యాలి కదా! నిదానంగా సెట్‌ అవుతుంది''
హూ...పెద్ద నిట్టూర్పు. లోలోపల రెండు విరుద్ద బలాలు కలబడి ఒక దానితో ఒకటి ఢీ కొంటున్న భావన. అంతా సజావుగా జరిగిపోతుందని అనుకుంటే వ్యవహారం తలకిందులయిందే.

నాన్న మొహం చూడటానికే చెల్లటంలేదు. ఇపుడు నిజంగా అగ్ని పరీక్షే కదా!
మౌనంగా ఉన్న నన్ను చూసి ''ఎందుకులేయ్యా! ఈ ఖర్చుకి నువ్వు నిగ్గలేవు గానీ పుత్తూరుకి తీసుకుపోరా. నాలుగు కట్లతో అదే కట్టుకుంటది'' దిగాలుగా అన్నాడు.

''సర్లే ఏదోకటి చేద్దాం'' అంటూ బయటికి నడిచాను. ఏమనుకున్నాడో నాన్న ఆపరేషన్‌ అనడంతో మొహం మాడిపోయిందనుకున్నాడో! లోపల ఏమి అనుకున్నా బైటకి కనబడరుకదా! మహాత్ము లంటే వీళ్లేకదా!

మొహం వేలాడేసుకుని ఇంటికి పోయేసరికి అనూ ఎదురొచ్చి నా వంక పరీక్షగా చూసింది.
''ఏమయ్యిందంట తోటకూరకాడలా అయిపోయారు'' ఏక్కాణంగా అడిగింది. లోపల అనుకునే మాటలు తొందర తొందరగా బైటపడితే బాగుణ్ణు. గొంతు దాటి బయటకు రావడానికి ఎందుకంత మొరాయిస్తాయో! మనసు బాధగా మూలుగుతున్నపుడు అంతేనేమో!
ఎంతకీ తెగించి మాటల్ని కూడా బలుక్కుంటూ ''ఆప...రే..ష..న్‌... చెయ్యా... లన్నా....రు''అన్నాను.
''ఆపరేషనా...''మాట ఒక్కసారిగా వెలువడి తన ఆశ్చర్యాన్నంతా తెలియజేసింది.
''ఆ...'' అన్నాను ముక్తసరిగా.

''అందుకు మీరేమన్నారు?'' ఒక్క రవ్వ...ఒక్క రవ్వ... నిప్పు రాజుకుంటోందని అర్థమౌతోంది.
''ఆ... ఏమంటాను? ఎదురుగా నిలబడలేక పక్కకు తప్పుకున్నాను''.
''మీరేమంటారో నాకు తెలియదా! అదేమంటే మీ వాళ్లు నీకు ఎక్కువైతే నా వాళ్లు నాకు ఎక్కువ కాదా అంటావు. సంపాయించడం చేతగాకపోయినా ఉన్నదాన్ని నిలుపుకుంటే... బాగుండేది. అదీ చేతగాకపోయా! ఎన్నిసార్లు కొట్టుకున్నా విన్నావా! వొద్దు వొద్దు అనేకొద్దీ వెధవ పనులన్నీ చేస్తివి. చిలక్కి చెప్పినట్లు చెబుతానే ఉండాను. ఏదన్నా వొచ్చిందంటే అప్పటికప్పుడు యాణ్ణుండి పరిగెత్తుతావు అంటూనే ఉండాను. ఇంటేగా నువ్వు. ఇప్పుడు కూర్చొని భజన జెయ్యి''.

''వాడికి ఇంజనీరింగ్‌ సీటుకి కడతావో! మీ నాన్న ఆపరేషన్‌కే తెస్తావో! అవతల అప్పులు అప్పుల్లాగే మిగిలిపోయి ఉండయ్యి''
హూ... అయింది. నిప్పు రాజేసుకోని మంటగా మండటం ఆరంభమయ్యింది. ఇంక మంట మండుతూనే ఉంటుంది. ఇది ఇప్పట్లో ఆరే మంట కాదు. భగభగ మండుతూ... తను దహించుకుపోతూ నన్ను కూడా దహించి వేస్తుంది. మా ఇద్దరితో ఆగితే సరే... అది పిల్లల్ని కూడా దహించి వేస్తుందే. వాళ్లూ సమిధలే. ఏం జేస్తాం మనం చేసిన తప్పులకి వాళ్లు కూడా బలే. మౌనంగానే ఉండటం తన అహాన్ని ఇంకా రెచ్చ గొట్టినట్టయ్యింది.

''నాకు తెలుసు. వాడు ఎట్టపోయినా నీకు సంతోషమే. ఎటొచ్చీ కాటికి కాళ్లు చాపినవాడే నీకు ముఖ్యం. పో... పోయి ఆ పనే చెయ్యి. వాళ్ళూ నేనూ కట్ట గట్టుకోని ఏ బాయిలోనో దూకితే సరిపోతుంది.''
మెల్లగా మాట్లాడకుండా, తన మాటలు వింటూ ఇంట్లోకి నడిచాను. ఎటూ పాలుపోని పరిస్థితి అయింది. పోనీ ఇద్దరికీ అప్పు తెద్దామంటే తరవాత వొడ్డీ గంపెడై కూర్చుంటది. పైగా వాడేమో చేరితే మంచి కాలేజీలోనే చేరతాను అంటాడు. అయినా ఎనభైవేలు ర్యాంకు తెచ్చుకున్నాడు. ఇంజనీరింగ్‌లో చేరడం అవసరమా? వేలకు వేలు పోసి చేర్పిస్తాం. అయిపోయిన తరవాత రేపటి పోటీలో రాణించగలుగుతాడా? వెయ్యికీ రెండు వేలకీ పనిజేసే ఇంజనీర్లని ఎంతమందిని చూడడం లేదు. అప్పుడు కూడా మళ్లీ మా కోసం ఎదురు చూడాల్సిందే కదా! ఏ హైదరాబాదులోనో ఉంటే రెండు మూడు వేలు సరిపోతయ్యా.

ఏ డిగ్రీనో చేసి తరవాత ఏదోక కోర్సు చేసుకుంటే చాలదా వీడి టాలెంట్‌కి. అందరితో పాటు పొలోమని పోవడమే. నలుగురూ నడిచేదే రాజబాట అయి కూర్చుంది.
నా వెనకే ఇంట్లోకి తనూ వొచ్చింది.
''ఏందంట మౌనమే అర్ధాంగీకారమా!''
''ఏందే నీ గోల'' విసుక్కున్నాను.
''విసుక్కోవడం కాదండీ. ఆపరేషన్‌ చేయించటానికే నిర్ణయించుకున్నారా అని'' కాస్త శాంతంగానే అడిగింది.

''అది కాదే వాణ్ణి... డిగ్రీ...'' నోట్లో నుండి మాట పూర్తిగా కూడా రాలేదు.
భగ్గున మంట మండి సెగ మొఖానికి తాకింది.
''ఆగండంతటితోటి. ఇయ్యాలో రేపో సావబోయే వాళ్లకి వేలకు వేలు తగలెయ్యకపోతే పుత్తూరు తీసుకపోయి సావకూడదా! ఆపరేషన్లు చేయించుకున్నోళ్లు ఎంతమంది సెట్టుకాక అల్లాడిపోతన్నారు. వొళ్ళంతా నుజ్జు నుజ్జయి సస్తారనుకున్న మనుషులు కూడా ఆ కట్లకి లేసిరాలేదా! డిగ్రీ అంట డిగ్రీ. అందర్లాగా పుట్టలా నా బిడ్డ. వాణ్ణి డిగ్రీలో చేర్చు. నేను ఏ గుండంలోనో దూకి సావకపోతే అప్పుడు జూడు'' ముక్కు చీదుకుంటూ వెక్కిళ్లు పెడుతూ తిట్లూ, శాపనార్థాలతో మంచమెక్కేసింది.
మంటలు వొళ్లంతా మంటలు, ఇంటి నిండా మంటలే. బయటిగ్గూడా వ్యాపించకముందే ఏదోకటి చెయ్యాలి. ఏం చెయ్యాలి? ఉన్న విషయం చెబితే అర్థం చేసుకోదు.

ఇంక ఊరుకోబెట్టడం బ్రహ్మ రుద్రాదుల వల్ల కూడా అయ్యే పనికాదు. నాన్న కూడా అదే ఆలోచనలో ఉన్నాడు కాబట్టి పుత్తూరుకి తీసుకెళ్ళటమే బెటరేమో...!
లోపలా బయటా అంతా చీకటి చీకటిగా ఉంది. చిత్తడి చిత్తడిగా ఉంది. తల బద్దలై పోతోంది. ఇంత వాడినై ఉండి కూడా దిక్కులేని వాళ్ల లాగా పుత్తూరుకు తీసుకుపోవడం నిజంగా ఎంత బాధాకరం. వాళ్లన్నప్పటికీ నా మనసులోకి కూడా ఆ భావన రావడం... ప్చ్‌... ఇప్ప టికీ నా మీద ఆధారపడకుండా వాళ్లే కష్టపడుతున్నారు. ఇప్పుడు ఆపరేషన్‌ చేయించాల్సి వొచ్చేసరికి ఎంత స్వార్థంతో ఆలోచిస్తున్నాను.

ఇటు చూస్తే వీడి చదువు. డిగ్రీలో చేరిస్తే పోయిద్దనుకున్నాను. కానీ, ఇప్పుడు డిగ్రీని ఎవడు లెక్క చేస్తున్నాడు. వాడికి రేపెవురన్నా పిల్ల నియ్యాలన్నా ఎట్ట చూస్తారు. అవసరమున్నా, లేకున్నా, ఇష్టమైనా కాకపోయినా ఇంజనీరింగ్‌ చదవాల్సిందే. ఊరంతా వొక దారైతే ఉలిపి కట్టెది ఒక దారైతే ఎట్టా. ఊహూ కుదరదు. వాస్తవంగా ఆలోచించి ఏటికి ఎదురీద్దామంటే బయట సమాజం ఊరుకుంటుందా! నలుగురూ వింత జంతువుని చూసినట్టే చూస్తారేమో! ఇంట్లో ఆఫీసులో తెలిసిన వాళ్లు... తెలియని వాళ్ళు... అమ్మో తల్చుకుంటేనే భయమేస్తుంది.

కడుపులో ఆకలి రగిలిపోతోంది. పోయి తిందామంటే ఎందుకో ఇబ్బందిగా అనిపిస్తోంది. అనూ పిలుస్తుందేమోనని ఎదురు చూసినా, లాభం లేదు. ఎక్కడో మినుకు మినుకు మంటున్న ఆశ... ఊహూ... లాభం లేదు. తనెంత మొండిదో తెలిసీ ఎదురు చూడడం అనవసరం.
కళ్ళు మూతలు పడుతున్నాయి. కడుపులో ఎలుకలు పరుగెత్తుతుంటే నిద్రెలా పడుతుంది. నిద్ర... మెలకువ... మెలకువలోనే కలత నిద్ర.
ఎప్పుడో అర్ధరాత్రి మెలకువొచ్చి చూస్తే పక్కన అనూ లేదు. ఓహో కోపం తగ్గలేదు. తన మొండితనం తనదే. అయినా తన ఒక్కదానికే కొడుకా! నాక్కాదా... పక్కకు తిరిగి పడుకున్నా. పొట్ట వీపుని తగులుతున్నట్టుగా ఉంది. ఆకలితో పడుకుంటే సుఖంగా నిద్ర పడుతుందా! నిద్రలో ఒకటే కలవరింతలు. కలత నిద్రతోనే తెల్లవారింది.

అనూ గదిలోకొచ్చి తొంగి చూసి పోయింది. పలకరించనైనా లేదు. వొళ్ళంతా పచ్చి పుండులా ఉంది. కళ్ళు మంటలు పుడుతున్నాయి. తెల్లవారినా లేవాలనిపించలేదు. లేస్తే ఏం చెయ్యాలి. మళ్లీ ఊగిసలాట మొదలయ్యింది. ధైర్యం చాలటం లేదు.మళ్ళీ కళ్ళు మూసుకున్నా.

''నాన్నా అమ్మ పిలుస్తోంది'' చిన్నా పిలుస్తున్నాడు.
ఓహో ఇప్పటికి గుర్తొచ్చినట్టుంది. సరే కానియ్‌ లేవకపోతే మళ్ళీ ఏం ముంచుకొస్తుందో! ఎందుకొచ్చిన గొడవ అనుకుని లేచి కార్యక్రమాలన్నీ ముగించుకొని టేబుల్‌ దగ్గర కూర్చున్నా.
మౌనంగా టిఫిన్‌ తెచ్చి పెట్టింది. ఎప్పుడూ కేకలూ అరుపులతో ఉండే ఇల్లు శ్మశాన నిశ్శబ్దాన్ని సంతరించుకుని ఉంది.
టిఫిన్‌ తింటూ అనూ వైపు చూశాను. కళ్ళు చింతనిప్పుల్లా ఎర్రగా ఉన్నాయి. పాపం తనుకూడా నిద్ర పోయినట్టు లేదు.
తల్లి ప్రేమకదా! ఎంత బాధ పడుతోందో! నిలబడి అలాగే నా వైపు మాట్లాడకుండా చూస్తూనే ఉంది. నేనూ మౌనంగానే టిఫిన్‌ ముగించి బయటకు వొస్తుంటే,

''ఇంతకూ ఏం నిర్ణయించారు'' కొంచెం గొంతు పెద్దదిగా చేసి అడిగింది.
వెనక్కు తిరిగాను. ''ఏముంది పుత్తూరే తీసుకు పోదామనుకుంటున్నాను''. ఇంకోమాట మాట్లాడలేదు. కానీ అప్పటికప్పుడే ఆమె కళ్ళల్లో కనిపించిన విశ్రాంతి చూస్తే ఆమె ఇప్పటికి స్థిమిత పడిందని చెప్పకనే చెబుతోంది.
ఆమెకేనా స్థిమితం. ఆమెకేనా సంతృప్తి. ఈ నిర్ణయం తీసుకున్న తరువాత నాకు మాత్రం లేదా స్థిమితం. నా కొడుకు ఇంజనీరింగ్‌ చదవాలని నాకు మాత్రం లేదూ. నలుగురిలో పరువు నిలబెట్టుకోవాలనే ఆరాటం ఎవురికి మాత్రం ఉండదు. ఆ సంతోషంతోనే ముందుకి సాగిపోయాను.

about the writer
కల్లోల జీవనగాథ
మంచికంటి వెంకటేశ్వరరెడ్డి
కొత్తపట్నం, ప్రకాశం- 523 286.
పుట్టింది సింగరాయ కొండ దగ్గర పల్లెటూరు కలికివాయలో. ఇంట్లో అమ్మా, నాన్నా, అమ్మమ్మా; బయట బంధువులూ, స్నేహితులూ... వాళ్ల మాటలూ, కల్లోలమవుతున్న వారి జీవితాలు కథలుగా మలుస్తున్నారు. కొత్తపట్నంలో ఉపాధ్యాయ వృత్తి, సాహిత్యాధ్యయనం నిత్య ప్రవృత్తి. మూడు కవితా సంకలనాలు, ఒక కథా సంపుటి ప్రచురించారు.